Sunday, 20 August 2017

శివమెత్తిన గంగ...

శివమెత్తిన గంగ...

విష్ణువర్ధనుని పట్టపురాణి అయిన శాంతల దేవి తనకు కుమారుడు కలగలేదనే కారణంతో ఈ పర్వతం మీదే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ ప్రాంతాన్ని ఆవిడ పేరుతోనే పిలుస్తారు. హొయసాల ప్రభువైన విష్ణువర్ధనుడు శివగంగ దేవాలయ పునరుద్ధరణకు కృషి చేశాడు. తరువాత ఏలుబడిలోకి వచ్చిన కెంపెగౌడ రెండు గాలిగోపురాలను నిర్మించాడు.

బెంగళూరుకు 34 మైళ్ల దూరంలో, తుముకూరు దగ్గర దక్షిణానికి రోడ్డు చిన్నదిగా చీలి, శివగంగ గ్రామం చేరుతుంది. దాబస్‌పేట్‌ రైల్వే స్టేషను నుంచి శివగంగ నాలుగు మైళ్ల దూరంలో ఉంది. ఈ పర్వతం... ఉత్తర దిక్కు నుండి శివలింగాకారంలో, తూర్పు దిక్కు నుంచి వృషభాకృతిలో, దక్షిణం నుంచి మహాసర్పంగా, పశ్చిమం నుంచి మహాగణపతి ఆకారంలో దర్శనమిస్తుంది. ఈ పర్వతం మీద అనేక నీటి బుగ్గలు, తటాకాలు, పెద్ద దేవాలయాలతో కూడిన గుహలు ఉన్నాయి. పురాణాలలో ఈ పర్వతాన్ని కకుద్గిరి అని పిలిచారు. కకుత్‌ అంటే ఎద్దు మూపురం అని అర్థం. ఈ శిఖరంపైన పరిశుద్ధమైన గంగాజలంతో నిండిన నీటిబుగ్గలున్న కారణంగా, ఈ పర్వతానికి శివగంగ అనే పేరు సార్థకమైనదని చెబుతారు. ఇక్కడి స్వామి గంగాధరేశ్వరుడు.

శివగంగ గ్రామం నుంచి పర్వత ప్రాంతం చేరుతుండగా మానవ నిర్మితాలైన నున్నటి మెట్లు కనిపిస్తాయి. మార్గంలో పెద్ద రాతితో మలచబడిన గణపతి విగ్రహం, నంది మంటపం, పాదెకల్‌ వీరభద్ర విగ్రహాలు, సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం కనిపిస్తాయి. ఇక్కడ రెండు పెద్ద గుహలలో శివాలయం, అమ్మవారి ఆలయాలు దర్శన మిస్తాయి. రెండు ద్వారాలకు పైన ఉన్న రెండు గోపురాలలో తూర్పు గోపురం హొయసాల కాలం నాటిది, ఉత్తర గోపురం విజయనగర కాలంనాటిది.

 లోపలకు వెళ్తే గిరిజా కల్యాణ మంటపం, ఏక స్తంభాధారంగా ఉన్న నవరంగం కనిపిస్తాయి. నవరంగ దక్షిణ భాగం నుంచి గుహకు చేరుకోవాలి. గంగాధరేశ్వరుని ముఖ్య ఉత్సవమూర్తికి గంగాపార్వతీ మూర్తులు ఇరుపక్కల కనువిందు చేస్తాయి. ఆలయంలో శాసనాలతో నిండిన అనేక గంటలు ఉన్నాయి.  ఏటా జనవరిలో సంక్రాంతి రోజున, గంగాధరేశ్వరుడు, హొన్నమ్మదేవిల కల్యాణోత్సవం  జరుగుతుంది. కొండ శిఖరం మీద నుంచి జాలువారే గంగాజలంతో కల్యాణోత్సవంలో దేవతామూర్తులను అభిషేకిస్తారు.

గంగాధరేశ్వర శివలింగం దివ్యమైనది. ఈ లింగం మీద పూత పూయబడిన నెయ్యి మరుక్షణం వెన్నగా మారిపోతుంది. ఓషధీ శక్తుల కారణంగానే ఈ విధంగా జరుగుతోందని, ఈ వెన్న వల్ల అనేక రుగ్మతలు తగ్గుతాయని చెబుతారు. ఆలయ గుహకు ఉత్తరంగా మరొక చిన్న గుహాలయంలో హొన్నదేవి కొలువుతీరి ఉంది. కొద్దిగా ముందుకు వెళితే ఐదడుగుల ఎత్తులో అమ్మవారి విగ్రహం సాక్షాత్కరిస్తుంది. సాక్షాత్తు శంకరాచార్యులు ఈ విగ్రహాన్ని ప్రతిష్టించారని చెబుతారు. శ్రీచక్ర ప్రభావంతో హొన్నదేవి మహాత్మ్యం వృద్ధి చెందుతోంది.

ఈ మందిరానికి పడమరగా గల పాతాళగంగ నీరు కొబ్బరినీళ్లలా మధురంగా ఉంటాయి. కొండ మీద చక్రతీర్థం, శంకరాచార్య తీర్థం, శంకర గుహ, శంకర పాద చిహ్నాలు, శంకరాచార్య విగ్రహం ఉన్నాయి. అగస్త్యేశ్వరునికి ప్రత్యేకం మందిరం ఉంది. మఠ సమీపంలోని సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దివ్యశక్తి ఉన్నట్లుగా చెబుతారు. సుబ్రమ్మణ్యేశ్వరునికి క్షీరాభిషేకం చేస్తుండగా, పాలు సర్పాకృతిలో దర్శనమిచ్చాయట. అంతేకాదు, ఈ స్వామిని కొలిచిన వారికి సంతానం కలుగుతుందని కూడా స్థానికులు చెబుతారు. వాలుగా ఉన్న ఒక కొండ శిఖరం మీద చెక్కిన నంది లేదా బసవన్న మూర్తి అద్భుత శిల్ప నైపుణ్యానికి ప్రతీక.

వెళ్ళే మార్గం... 
బెంగళూరు నుంచి దోబస్‌పేట వరకు బస్సులు అందుబాటులో ఉన్నాయి. దోబాస్‌పేట నుంచి శివగంగ ఎనిమిది కిలోమీటర్ల దూరం. ఇక్కడ నుంచి బస్సులు, టాక్సీలు నిత్యం అందుబాటులో ఉంటాయి. దోబస్‌పేట్‌ రైలు స్టేషన్‌ అతి సమీపంగా ఉంది.
బెంగళూరు వరకు విమానంలో వచ్చి, అక్కడ నుంచి టాక్సీ లేదా మినీ బస్సుల ద్వారా పర్వతశిఖరం చేరుకోవచ్చు.

♦ ఇక్కడ వినాయకుని దేవాలయం, అగస్త్య తీర్థానికి సమీపంలో 108 శివలింగాలు ఉన్నాయి. శిఖరం మీద ఉన్న నంది విగ్రహాన్ని దర్శించుకోవడానికి వెళ్లేవారు తమ వెంట తప్పనిసరిగా మంచినీళ్లు ఉంచుకోవాలి. పైన చాలా వేడిగా ఉంటుంది.

♦ కొండ మీద గంగాధరేశ్వరుడు, స్వర్ణాంబ, శాంతేశ్వర, ఓంకారేశ్వర, రేవన సిద్ధేశ్వర, కుంభేశ్వర, సోమేశ్వర, ముద్దు వీరేశ్వర అనే అష్ట శివలింగాలు ఉన్నాయి.

♦ నంది వృషభ, మకర  వృషభ, మహిష బసవ, గారే బసవ, దొడ్డ బసవ, కొడుగళ్లు అనే బసవ అష్ట వృషభాలు, అగస్త్య తీర్థం, శంకర తీర్థం, కణ్వతీర్థం, కదంబ తీర్థం, మైథల తీర్థం, పాతాళగంగ, ఒలకల్లు తీర్థం, కపిల తీర్థం అనే అష్టతీర్థాలు ఉన్నాయి.
– డా. వైజయంతి

హంపి

హంపి బాలకృష్ణాలయం అద్భుత శిల్పచాతుర్యం
హంపి పేరు వినగానే మనకు విరూపాక్షాలయమే గుర్తొస్తుంది. అయితే, హంపీలో విరూపాక్షాలయంతో బాటు బాలకృష్ణుడి గుడి కూడా ఉంది. ఈ ఆలయాన్ని అలనాటి విజయనగర సామ్రాజ్యాధీశుడు శ్రీకృష్ణదేవరాయలు యుద్ధంలో సాధించిన విజయానికి ప్రతీకగా స్వయంగా దగ్గరుండి మరీ ఎంతో శ్రద్ధాభక్తులతో కట్టించాడని ప్రతీతి.

ముద్దుగారే యశోదా ముంగిట ముత్యము వీడు అన్నట్లుగా ముద్దులొలికే మోముతో ఉంటాడు బాలకృష్ణుడు. దురదృష్టం ఏమిటంటే ఈ నగుమోమును మనం ఇప్పుడు ఈ గుడిలో సందర్శించుకోలేం. 15వ శతాబ్దానికి చెందిన సువిశాలమైన, సుందరమైన ఈ ఆలయాన్ని ప్రపంచ వారసత్వ, చారిత్రక సంపదగా యూనెస్కో గుర్తించింది. కృష్ణాష్టమి సందర్భంగా ఈ ఆలయంలో ప్రతి ఏటా అత్యంత వైభవంగా వేడుకలు, ఉత్సవాలు జరుగుతాయి.

ఎల్తైన ప్రాకారాలు, ఆ ప్రాకారాలపై అత్యద్భుతంగా చెక్కిన పౌరాణిక శిల్పాలు ఈ ఆలయ ప్రత్యేకత. ఈ ఆలయం అంతరాళం, గర్భగృహం, అర్ధమంటపం లేదా ప్రదక్షిణ మంటపం, ముక్తిమంటపం లేదా రంగమంటపం అని నాలుగైదు విభాగాలుగా ఉంటుంది. ఆలయానికి తూర్పుదిశగా ఉన్న మంటపానికే  రంగమంటపమని పేరు. అత్యున్నతమైన ప్రాకారాలున్న ఈ రంగమంటపంలోనే అమ్మవారు కొలువుదీరి ఉంటారు. దక్షిణదిక్కుగా అందమైన అరటి తోట. ఆ తర్వాత ఓ రాతి ఉద్యానం. వీటన్నింటినీ కలుపుతూ ఒక కొలను.

అయితే, ఆ కొలనులో నీరుండక పోవడం వల్ల అది వాడకంలో లేదు. పశ్చిమానికి వెళితే దీర్ఘచతురస్రాకారపు భవంతి. ఒకప్పుడు అది అతి పెద్ద ధాన్యపు గాదె, దానిని ఆనుకుని సువిశాలమైన వంటశాల ఉండేది. చిత్రమేమిటంటే, ఆ భవంతి మహమ్మదీయ కట్టడాన్ని తలపిస్తుంది. దాని వెనకాలకు వెళితే ఇరుకుగా ఉండే మెట్లు. ఆ మెట్లెక్కితే ఆలయం పై భాగానికి చేరుకోవచ్చు. అక్కడ నిలబడి చూస్తే, అందమైన చిత్రాన్ని చూడవచ్చు.

ఇక సభామంటపంలోనికి అడుగిడితే... అక్కడి లోపలి నాలుగు గోడలపైనా బాలకృష్ణుడు, హనుమంతుడు, కాళీయమర్ధనం చేస్తున్న కృష్ణుడు, శ్రీ మహావిష్ణువు దశావతారాల చిత్రాలు సజీవమా అన్నట్లు కనిపిస్తుంటాయి. అంతరాలయం పై కప్పుపైన సింహతలాటాలు, వాద్యగాళ్ల శిల్పాలు కనువిందు చేస్తుంటాయి.
బాలకృష్ణాలయంలో బాలకృష్ణుడి విగ్రహం ఉండదు. ఒకప్పుడు ఉండేది కానీ, మహమ్మదీయుల దండయాత్రలలో నాశనం అవుతుందన్న ఉద్దేశంతో చిన్నికృష్ణుడి విగ్రహాన్ని తీసి వేరేచోట భద్రం చేయగా, ఇప్పుడది చెన్నైలోని నేషనల్‌ మ్యూజియంలో ఉంది. కృష్ణుడి విగ్రహం లేదు కదా, ఇంకేముందక్కడ చూడటానికి? అనే సందేహం రావచ్చు... అయితే, ఆలయంలోని శిల్పసంపదను, ఆలయం నిర్మాణాన్ని తప్పకుండా చూసి తీరవలసిందే. ఉత్సవ విగ్రహాలకే పూజలు నిర్వహిస్తున్నారు.
బాలకృష్ణాలయంలోకి అడుగు పెట్టడానికి ఏ విధమైన రుసుమూ వసూలు చేయరు. అంతేకాదు, ఆలయంలోపల కానీ, వెలుపల కానీ మనం ఎన్ని ఫొటోలైనా తీసుకోవచ్చు. మనల్ని ఎవరూ అభ్యంతర  పెట్టరు.

ఎలా వెళ్లాలంటే..?
బెంగళూరు నుంచి హోస్పేటకు ఆర్టీసీ బస్సులున్నాయి. రైళ్లున్నాయి. హోస్పేట నుంచి 12 కిలోమీటర్ల దూరంలోని హంపీ చేరుకోవడానికి ప్రైవేటు ఆటోలు, ట్యాక్సీలు, ఇతర ప్రైవేటు వాహనాలు ఉన్నాయి.

హంపీలో చూడదగ్గ ఇతర ప్రదేశాలు
విరూపాక్ష దేవాలయం, విరూపాక్ష గుహలు, కడలేకలులో ఏకశిలతో నిర్మించిన భారీ గణేశుని విగ్రహం, శశిలేకలులో ఉదరానికి మొలతాడులా సర్పాన్ని చుట్టుకుని ఉన్న ఎనిమిదడుగుల గణేశుని విగ్రహం, హజార రామాలయం, పట్టాభిరామాలయం, కమల్‌ మహల్, హంపీబజార్‌... ఒకనాడు విజయనగర రాజుల కాలంలో రత్నాలు, అమూల్యాభరణాలను రాశులు పోసి విక్రయించిన వీధి ఇది. ఇప్పుడు ఈ వీధిలో కృత్రిమమైన నగలు, రంగురాళ్లు అమ్ముతున్నారు. అచ్యుతరాయాలయం: పూర్తిగా విజయనగర కళారీతిలో నిర్మించిన ఈ ఆలయంలో విష్ణ్వాంశ స్వరూపుడైన తిరువేంగళనాథుని విగ్రహాన్ని సందర్శించుకోవచ్చు. ఇంకా 900 ఏళ్ల క్రితం నాటి చంద్రమౌళీశ్వరాలయం తప్పక సందర్శనీయమైనది. గగన్‌ మహల్, ఆర్కియాలజికల్‌ మ్యూజియం కూడా చూడదగ్గ ప్రదేశాలు.
– డి.వి.ఆర్‌. భాస్కర్‌

Saturday, 19 August 2017

నాంపల్లిగుట్ట శ్రీలక్ష్మీనర్సింహస్వామి

దండాలన్నా నాంపల్లి నర్సన్నా 

ఐదు తలల సర్పాకారం... 
తలపై శ్రీకృష్ణుడి నృత్యరూపం.. 
52 అడుగుల ఎల్తైన గుట్ట.. 
చుట్టూ పచ్చని పంటలు.. 
కనుచూపు మేర కనువిందుచేసే అందాలు...  
మనసును ఉల్లాసంగా ఉంచే ప్రకృతి దృశ్యాలు...
ఎన్నిసార్లు చూసినా తనివి తీరని అద్భుత శిల్పాలు 
నాంపల్లిగుట్ట శ్రీలక్ష్మీనర్సింహస్వామి ఆలయం సొంతం. 

ఆ గుట్టపై శ్రీలక్ష్మీనర్సింహస్వామి ఆలయం ఎంతో విశిష్టత కలిగిన పుణ్యక్షేత్రం. పురాతనమైన ఈ ఆలయాన్ని దర్శించుకున్న భక్తులు ఆనందానుభూతులలో ఓలలాడతారు. 

నాంపల్లిని పూర్వం నామపల్లిగా పిలిచేవారు. ఆరువందల ఏళ్ల కిందట ఈ గుట్టపై శ్రీలక్ష్మీనర్సింహస్వామి వెలసినట్లు చెబుతారు. శ్రీలక్ష్మీ నర్సింహస్వామి ఆలయంలో చోళుల కాలంలోనే స్వామివారికి పూజాదికాలు జరిగినట్లు ఆధారాలున్నాయి. సహజ సిద్ధంగా ఓ వైపు మూలవాగు.. మరోవైపు మానేరు వాగులు ప్రవహిస్తుంటాయి. ఈ ఆలయానికి ఉన్న మరో విశిష్టత లోపల ఉన్న అంజనేయస్వామి రాతి శిల. ఈ హనుమంతుడికి మండల దీక్షలు చేస్తే కోరిన కోర్కెలు తీరుతాయని నమ్మకం. సిరిసిల్ల రాజన్న జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి క్షేత్రం దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది. ఆ ఆలయానికి దర్శనానికి వచ్చే భక్తులు నాంపల్లిగుట్టకు కూడా వెళ్లి మొక్కులు తీర్చుకుంటారు. కొత్తగా పెళ్లయిన జంటలు సంతానం కలగాలని మొక్కుకుని, కోరిక నెరవేరాక ఇక్కడ వనభోజనాలు చేస్తారు. రాజరాజనరేంద్రుడు, ఆయన సతీమణి కూడా స్వామివారిని సేవించి, సంతానాన్ని పొందినట్లు చారిత్రక కథనాలున్నాయి.

గుట్టపై గుహలు
నాంపల్లిగుట్టపై సహజసిద్ధమైన బండరాళ్ల మధ్య గుహలు, రెండు కోనేరులున్నాయి. ఇక ఆలయం పక్కనే ఉన్న చిన్న గుహలో శివలింగంతో పాటు ఇతర దేవతామూర్తుల విగ్రహాలకూ పూజలు జరుగుతాయి. క్రీ.శ 10 శతాబ్దంలో నవనాథ సిద్ధులు(తొమ్మిది మంది) ఈ గుట్టపై తపస్సు చేసి సిద్ధి పొందారని ప్రతీతి. నిత్యం నవనాథులు ఈ గుహ నుంచి భూగర్భ సొరంగ మార్గంలో వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయానికి వెళ్లి పూజలు చేసే వారని చెబుతారు.

కాళీయ మర్దనం.. ప్రత్యేకత
నాంపల్లిగుట్ట ఆసాంతం సింహం నిద్రిస్తున్న తీరులో ఉంటుంది. గుట్ట ఎంత మహిమాన్వితంగా కనిపిస్తుందో ప్రకృతి అందాలతో అంతగా పర్యాటకులను ఆకట్టుకుంటుంది. సహజ సిద్ధమైన అందాలతో పాటు కాళీయమర్దనం మరో ప్రత్యేకత. ఐదుతలల సర్పాకారంలో నిర్మించిన నాగదేవత ఆలయం. నాగపాము తలపై శ్రీకృష్ణుడు పిల్లన గ్రోవితో నృత్యం చేస్తున్న దృశ్యాలు కనువిందు చేస్తాయి. ఎటు నుంచి చూసినా గుట్టపై చెట్లపొదల్లో చుట్టుకుని పడుకున్న కొండంత పాములా కనిపిస్తుంది. పామునోటిలోనికి  వెళ్తుండగా.. శ్రీలక్ష్మీనర్సింహస్వామి లీలలను తెలిపే రకరకాల శిల్పాలు కనువిందు చేస్తాయి. గుట్టపైకి వచ్చిన వారు వీటిని మైమరచి చూస్తూ... నర్సింహుడి ఉగ్రరూపాన్ని, నాగదేవతను దర్శించుకుంటారు. నూనెతో, పాలతో స్వయంగా అభిషేకాలు నిర్వహించుకుంటారు.

వేడుకలు.. ఉత్సవాలు
ప్రతి శ్రావణమాసంలో సందర్శకులు ఎక్కువగా వస్తుంటారు. ఇక్కడ శ్రీపార్వతీ రాజరాజేశ్వరస్వామి కల్యాణం, శ్రీలక్ష్మీనర్సింహస్వామి కల్యాణం, శివరాత్రి వేడుకలు, శ్రీరామనవమి, గోదారంగనాథుల కల్యాణ వేడుకలు జరుగుతాయి. వేములవాడకు అతి సమీపంలో ఉన్న నాంపల్లిగుట్ట అభివృద్ధికి  తెలంగాణ పర్యాటక శాఖ రూ.29 కోట్లతో గుట్ట దగ్గర ధ్యానమందిరం, ప్లానెటోరియం, గుట్టపైకి రోప్‌వే, కాటేజీలు, లైట్‌ అండ్‌ సౌండ్స్‌ వంటి ఆధునిక వసతులను సమకూర్చేందుకు ప్రతిపాదించారు. గుట్టపైకి ఘాట్‌ రోడ్డు సౌకర్యం ఉంది.

ఎలా చేరుకోవాలి..!
నాంపల్లిగుట్టకు చేరాలంటే రోడ్డు మార్గం ఒక్కటే ఉంది. హైదరాబాద్‌ మీదుగా రావాలంటే సిద్దిపేట, సిరిసిల్ల గుండా 152 కిలోమీటర్లు ప్రయాణించి వేములవాడ చేరుకోవాలి. అక్కడి నుంచి మూడుకిలోమీటర్ల దూరంలో నాంపల్లిగుట్ట దర్శనమిస్తుంది. కరీంనగర్‌కు 32 కిలోమీటర్ల దూరంలో వేములవాడ మార్గంలో ఉంది. జగిత్యాల మీదుగావచ్చే వారు 55 కిలోమీటర్లు ప్రయాణించాలి. ఆర్టీసీ బస్సు సౌకర్యం, ప్రైవేటు వాహనాలు అందుబాటులో ఉంటాయి. గుట్టపైకి వాహనాలు వెళతాయి. మెట్ల గుండా ఆలయానికి చేరుకోవాలి.



Tags: Sri Lakshmi Narasimha Swamy Temple, శ్రీ లక్ష్మీ నర్సింహ స్వామి ఆలయం

Sunday, 13 August 2017

దక్షిణాది బద్రి... లింబాద్రి



దక్షిణాది బద్రి... లింబాద్రి


నిజామాబాద్‌ జిల్లాలోని లింబాద్రి గుట్ట తెలంగాణ రాష్ట్రంలోనే ప్రముఖ దేవాలయం. పచ్చని కొండల నడుమ ప్రకృతి రమణీయత మధ్యన అలరారే ఈ క్షేత్రంలోని స్వయంభూ శ్రీ లక్ష్మీనృసింహస్వామి వారిని సందర్శించుకోవడానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తారు. ఏటా కార్తీక మాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. కార్తీక పౌర్ణమి రోజున జరిగే రథోత్సవానికి మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుండి కూడా భక్తులు వస్తారు.

భీమ్‌గల్‌ మండల కేంద్రానికి ఐదు కిలోమీటర్ల దూరంలో లింబాద్రి గుట్ట ఉంది. రెండంతస్తుల గుట్ట ఇది. మొదటి అంతస్తుపైకి మెట్ల మార్గం, రహదారి మార్గం ఉన్నాయి. మొదటి అంతస్తులో శ్రీవారి మాడ వీధులు, కమలా పుష్కరిణి, కళ్యాణ మంటపం, రథం గుడి, అయోధ్య ఆంజనేయ స్వామి ఆలయం ఉంటాయి. రెండవ అంతస్తులో లోతైన రాతి గుహలో కొలువుదీరిన స్వామి వారి మూల విరాట్టు ఉంది. ఈ స్వామిని దర్శించుకోవడానికి ఇరుకైన గుహ మార్గం గుండా వెళ్లాలి. ఈ గుహ మార్గం ప్రవేశ ద్వారం వద్ద జోడు లింగాలు ఉంటాయి. గుహమార్గం ద్వారా వంగుని 250 మీటర్లు వెళితే రాతి గుహలతో ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన గర్భాలయంలో శ్రీ లక్ష్మీనృసింహ స్వామి వారి మూల విరాట్టు, పక్కనే నరనారాయణుల (కృష్ణార్జునుల) విగ్రహాలు కనువిందు చేస్తాయి.

శాంత నరసింహుడు 

సాధారణంగా ఏ నరసింహ క్షేత్రంలో చూసినా స్వామి వారి విగ్రహం ఉగ్ర రూపంతో ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం తొడపైన లక్ష్మీదేవిని కూర్చోబెట్టుకుని శాంత రూపంలో దర్శనమిస్తాడు.

స్వయంభూ నరసింహ క్షేత్రం 

శ్రీ లక్ష్మీ నరసింహుడి స్వయంభూ క్షేత్రాలలో ఇదొకటి. బ్రహ్మదేవుడు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ సమయంలో పార్వతి పాదాలను చూడడంతో కోపోద్రిక్తుడైన ముక్కంటి తన గోటితో బ్రహ్మ ఐదవ తలను తొలగించాడని పురాణం చెబుతుంది. దీంతో బ్రహ్మ ఇక్కడే తపమాచరించి శ్రీహరిని నరసింహుడిగా సాక్షాత్కరించాడని పురాణాలు పేర్కొంటున్నాయి. దీంతో లక్ష్మీసమేతుడుగా స్వామి వారు ఇక్కడే వెలియడం అరుదైన విషయమని చెబుతారు.

దక్షిణ బద్రీనాథ్‌గా ప్రసిద్ధి 

పవిత్ర బద్రీనాథ్‌ క్షేత్రం తర్వాత గర్భాలయంలో స్వామి వారి మూలవిరాట్టు పక్కన నరనారాయణుల విగ్రహాలు ఇక్కడ మాత్రమే∙ఉన్నాయి. దీంతో ఈ క్షేత్రానికి దక్షిణ బద్రీనాథ్‌గా విశిష్టత వచ్చింది.

జోడులింగాలు 

పరమశివుడు తనకు సంప్రాప్తించిన బ్రహ్మహత్యా దోష నివారణకై తపమాచరించి దోష విముక్తుడై శ్రీవారి ఆజ్ఞచే ఈ క్షేత్రంలోనే జోడు లింగాల రూపాన వెలిసాడట. ఇందుకు ప్రతీకగా గర్భాలయ మార్గ ప్రవేశ ద్వారం వద్ద భక్తులకు జోడు లింగాలు దర్శనమిస్తాయి. యముడు ఈ క్షేత్రంలో బిల్వవృక్ష రూపంలో తపమాచరించి శాంతి పొందినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఇంద్రుడు ఈ క్షేత్రంలో స్వామిని కమలాలతో పూజించి శాప విముక్తుడైనాడట.

అయోధ్య హనుమాన్‌ 

శ్రీరాముని ఆజ్ఞతో కవి పుంగవుడైన హనుమంతుడు ఇక్కడకు వచ్చి తపమాచరించి నరసింహుని రూపంలో ఉన్న శ్రీరాముని దర్శించాడట. అందుకే కొండ దిగువ ప్రాంతంలో క్షేత్ర పాలకుడైన అయోధ్య హనుమాన్‌ ఆలయం కనిపిస్తుంది.

కమలా పుష్కరిణి 

ఇక్కడి పుష్కరిణికి కమలా పుష్కరిణిగా పేరు. సతీ విక్రయ దోషనివారణకై సత్య హరిశ్చంద్రుడు నరసింహుని సేవించి తరించాడట. నరనారాయణులు సన్నిధానంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్నారట. ధర్మరాజు ఈ క్షేత్రాన్ని దర్శించి కృతార్థుడైనట్లు, ప్రహ్లాదుడు తపమాచరించినట్లు పురాణకథనం.

నామధేయులు 

ఈ ప్రాంతంతో పాటు జిల్లా, పక్క జిల్లా అయిన రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్‌ జిల్లాలో అడుగడుగునా లింబాద్రి, లింబన్న, లింబయ్య, నర్సింహులు, నర్సయ్య, నర్సయ్య, నర్సింగ్‌ తదితర పేర్లు గల వ్యక్తులు తారసపడతారు. మండలంలో అడుగుడుగునా ఈ పేర్లు గల వాళ్లు కనబడతారు.

ఎలా వెళ్లాలి 

హైదారాబాద్‌ నుండి నేరుగా ఆర్మూర్‌ వరకు బస్సులో రావచ్చు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రం నుండి ఆర్మూర్‌ వరకు 25 కి.మీ. అక్కడి నుండి భీమ్‌గల్‌ మండల కేంద్రానికి 25 కిలోమీటర్లు. భీమ్‌గల్‌ నుండి 5 కిలో మీటర్ల దూరంలోని లింబాద్రి గుట్టకు బస్సులు, ఆటోలు, ఇతర వాహనాల ద్వారా చేరుకోవచ్చు. బ్రహ్మోత్సవాల సమయంలో మాత్రమే దేవాలయం బస సౌకర్యం కల్పిస్తుంది.
– K రవి గౌడ్, సాక్షి, భీమ్‌గల్, నిజామాబాద్‌ జిల్లా

Sunday, 6 August 2017

శ్రీరంగపట్నం


భూలోక వైకుంఠం... శ్రీరంగపట్నం

కర్ణాటక రాష్ట్రంలోని మైసూరుకు అతి సమీపంలో మాండ్యా జిల్లాలో ఉన్న ఈ ఆలయానికి చారిత్రకంగా, ధార్మికంగా, సాంస్కృతికంగా కూడా ఎంతో పేరున్నది. మైసూరు రాజులు శ్రీరంగపట్టణాన్నే రాజధానిగా చేసుకుని పరిపాలన చేశారు. రంగరాయను ఓడించి వడయార్‌ రాజు 1614లో శ్రీరంగపట్టణాన్ని వశపరచుకున్నాడు. మైసూర్‌ పులి టిప్పుసుల్తాన్‌కి శ్రీరంగనాథుడంటే ఎనలేని భక్తి. టిప్పుసుల్తాన్‌ తండ్రి హైదరాలీ మైసూరును పాలించిన కాలంలో ఆయన రంగనాథుని ప్రార్థించిన తర్వాతనే యుద్ధభూమిలోకి అడుగు పెట్టేవాడట. శ్రీరంగపట్టణం చుట్టూతా కావేరీ నది ఆవరించి ఉంటుంది.

అందువల్ల ఇది ఒక ద్వీపంలా కనిపిస్తుంది. ఎల్తైన ఆలయ గోపురం, రెండు సువిశాలమైన ప్రాకారాలు, ఆలయ మంటపం, ఉన్నతమైన ముఖమంటపంతో అలరారుతుంటుంది. ఆలయ ముఖద్వారం పైకప్పు చిన్న చిన్న శిఖరాలన్నీ కలిసి గుచ్చిన పుష్పమాలాలంకృతమై ఉంటుంది. గర్భగుడిలోకి అడుగుపెట్టగానే ఏడుతలల ఆదిశేషువుపై శయనించి ఉన్న శ్రీ మహావిష్ణువు, ఆయన పాదాలు వత్తుతున్న లక్ష్మీదేవి దర్శనమిస్తారు. ఆలయంలో నరసింహస్వామి, గోపాలకృష్ణుడు, శ్రీనివాసుడు, హనుమంతుడు, గరుడుడు, పన్నిద్దరు ఆళ్వారుల సన్నిధులు కూడా కనిపిస్తాయి.

కావేరీ నీరు వైకుంఠంలోని విరజానదితో సరితూగగలిగేంత పవిత్రమైనవని విశ్వాసం. గంగ కూడా కావేరీలో స్నానం చేసి తన పాపాలను పోగొట్టుకుంటుందని పురాణ కథనాలున్నాయి. అంతేకాదు, కావేరీ నది కోరికమేరకే శ్రీరంగనాథుడు ఇక్కడ కొలువయ్యాడని, బ్రహ్మ, రుద్రుడు కూడా దివినుంచి భువికి దిగివచ్చి రంగనాథుని పూజిస్తారని ప్రతీతి. 11వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించిన విష్ణువర్థనుడనే రాజు ఎంతో ధనాన్ని వెచ్చించి ఆలయ అభివృద్ధికి పాటుపడ్డాడు. ఆయన భార్య అలమేలమ్మ ప్రతి మంగళ, శుక్రవారాలలో దేవేరులకు అమూల్యమైన ఆభరణాలు తయారు చేయించి అలంకరింపజేసేది. ఆ తర్వాత వచ్చిన విజయనగర రాజులు, అనంతర కాలంలో మైసూరు మహారాజులు ఆలయానికి మరింత శోభను చేకూర్చారు. అంగరంగవైభవంగా ఉత్సవాలు నిర్వహించారు.


సేవలు, ఉత్సవాలు: 

మకర సంక్రాంతినాడు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ముక్కోటి ఏకాదశినాడు స్వామివారి ఉత్తరద్వార దర్శన భాగ్యం కల్పిస్తారు. ఈరోజున స్వామివారిని వెన్నతో అలంకరిస్తారు. సాయంత్రం కిరీటాలంకరణ చేస్తారు. ఆ తర్వాత రథసప్తమికి కూడా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. మాఘ పూర్ణిమనాడు స్వామివారికి కావేరీనదిలో పుణ్యస్నానం చేయిస్తారు. ఈ పర్వదినాన వేలాది భక్తులు స్వామిని సేవించుకుంటారు. వైశాఖ శుద్ధ సప్తమినాడు శ్రీరంగ జయంతి ఉత్సవాలు జరుపుతారు. ఆ తర్వాత వచ్చే పున్నమినాడు బంగారు గరుడ వాహనంపై స్వామివారిని ఊరేగిస్తారు. ఆశ్వయుజ మాసంలో నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తారు.

ఇక్కడ ఇంకా ఏమేమి చూడవచ్చు?టిప్పుసుల్తాన్‌ కోట, శ్రీరంగనాథిట్టులోని బర్డ్‌ శాంక్చువరీ, నిమిషాంబ ఆలయం, దొడ్డ ఘోశాయ్‌ ఘాట్, కరిఘట్ట కొండలు, సంగమ, గుంబాజ్, జామా మసీద్‌ వంటివాటిని సందర్శించవచ్చు.

ఎలా వెళ్లాలి?దేశంలోని అన్ని ప్రధాన నగరాలనుంచి శ్రీరంగపట్నానికి నేరుగా రైళ్లు, బస్సులు ఉన్నాయి. విమానాశ్రయం మాత్రం మైసూరులో ఉంది. అక్కడినుంచి శ్రీరంగపట్నం కేవలం పదహారు కిలోమీటర్లే. విశాఖపట్నంలోని గాజువాక నుంచి శ్రీరంగపట్నానికి నేరుగా రైలుంది.
– డి.వి.ఆర్‌. భాస్కర్‌


జంబుకేశ్వర క్షేత్రం










ప్రకృతి సౌందర్యానికి రమణీయతకు
జంబుకేశ్వర క్షేత్రం


శివుడి పంచభూతలింగ క్షేత్రాలలో జలతత్వానికి ప్రతీక జంబుకేశ్వర క్షేత్రం. తమిళనాడులోని తిరుచ్చిలో ఉన్న ఈ జంబుకేశ్వరం సహజ ప్రకృతి సౌందర్యంతో శోభిల్లే రమణీయ ప్రదేశం. కావేరిని తమిళంలో పొన్ని అని కూడా పిలుస్తారు. పొన్ని అంటే బంగారం అని అర్థం. ఇక్కడ కావేరీ నదిలో స్నానం చేయడం, జంబుకేశ్వరుడిని పూజించడం విశిష్ట ఫలదాయకమని క్షేత్రమహాత్మ్యం చెబుతోంది. జంబుకేశ్వర స్వామివారు భక్తవత్సలుడిగా పేరు పొందిన బోళాశంకరుడు.

చిత్తశుద్ధితో ప్రార్థిస్తే చాలు, కష్టనష్టాలన్నింటినీ చిటికలో తొలగించి, సకల సంపదలూ ప్రసాదిస్తాడని భక్తులు ప్రస్తుతిస్తుంటారు. పవిత్రమైన ఈ శ్రావణమాసంలో శైవ క్షేత్రాలను సందర్శించడం, అభిషేకాలు, అర్చనలు చేయడం ప్రశస్తమని పురాణాలు చెబుతున్నాయి. చోళరాజులు నిర్మించిన ఈ ఆలయ నిర్వహణ బాధ్యతలను అనంతర కాలంలో పల్లవులు, పాండ్యులు, విజయనగర రాజులు చేపట్టినట్లు చారిత్రక కథనాలను బట్టి తెలుస్తోంది. జంబుకేశ్వర క్షేత్రానికి తిరువానైకవర్‌ అనే పేరు కూడా ఉంది.

పేరెలా వచ్చింది
జంబూ అంటే తెల్లనేరేడు అని అర్థం. ఇక్కడ తెల్లనేరేడు చెట్లు అధికంగా ఉండటం వల్ల దీనికి జంబుకేశ్వరం అనే పేరు వచ్చింది. పూర్వం శంభుడనే రుషి ఉండేవాడు. ఆయన మహా శివభక్తుడు. శివుని ప్రత్యక్షంగా దర్శించుకుని పూజించాలని శివుని గురించి తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమై, ‘‘నేను ఇక్కడ లింగరూపంలో కొలువుదీరతాను. నువ్వు ఇదే ప్రదేశంలో జంబూవృక్షరూపంలో ఉండి నన్ను సేవించుకుంటూ ఉందువుగానీ’’ అని వరమిచ్చాడు. ఇలా ఆ ముని ఇప్పటికీ జంబూవృక్షరూపంలో ఆలయ ప్రాంగణంలో ఉండి శివుణ్ణి, శివభక్తులను దర్శించుకుంటూనే ఉన్నాడు. ఇక్కడ స్వామివారు జలరూపంలో ఉండరు. సానవట్టం నుంచి స్వామిని అభిషేకిస్తున్నట్లుగా నీరు ఊరుతూనే ఉంటుంది. పానవట్టం చుట్టూ అర్చకులు వస్త్రాన్ని కప్పుతారు. మళ్లీ అందులోకి నీరు ఊరుతుంటుంది. ఈ వస్త్రాన్నే పిండి, అర్చకులు భక్తులకు తీర్థంగా సమర్పిస్తుంటారు.

అత్యంత ప్రాచీన ఆలయాలలో ఒకటిగా పేరొందిన ఈ ఆలయం ఎత్తయిన గోపురాలతో, విశాలమైన ప్రాకారాలతో, వివిధమైన ఉపాలయాలతో, మండపాలతో, తీర్థాలతో సందర్శకులను ఎంతగానో అలరిస్తుంది. నాలుగవ ప్రాకారం 32 అడుగుల ఎత్తు, వేలాది అడుగుల చుట్టుకొలతతో చూడముచ్చట గొలుపుతుంటుంది. అత్యద్భుతమైన ఈ ప్రాకారాన్ని స్వయంగా శివుడే తన భక్తుడికోసం వృద్ధశిల్పి రూపంలో వచ్చి, దేవతలను కట్టడ నిర్మాణ నిపుణులుగా మార్చి నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు స్థలపురాణం చెబుతోంది.

ఆదిశంకరుడు ప్రతిష్ఠించిన శ్రీ యంత్రం
సాక్షాత్తూ శంకరుని అవతారంగా ప్రస్తుతించే జగద్గురు ఆదిశంకరులవారు జంబుకేశ్వరుని సన్నిధిలో అత్యంత శక్తిమంతమైన, మహిమాన్వితమైన శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించి, క్షేత్రానికి ఆకర్షణ శక్తిని పెంపొందించినట్లు, అఖిలాండేశ్వరిగా, జగన్మాతగా పేరు గాంచిన ఇక్కడి అమ్మవారికి శ్రీచక్రాంకితమైన రెండు కర్ణాభరణాలను సమర్పించుకున్నట్లు ఐతిహ్యం. అమ్మవారి మందిరంలో గర్భాలయానికి ఎదురుగా అమ్మవారి ముద్దులపట్టి, విఘ్నాలకు రాజయిన వినాయకుని మూర్తిని కూడా శంకరులే ప్రతిష్ఠించారని స్థలపురాణం చెబుతోంది.

నిత్యకల్యాణ దంపతులు
ఇక్కడ స్వామి, అమ్మవార్లకు నిత్యం మూడుకాలాలలో పూజలు, అభిషేకాలు, అర్చనలు, హారతులు, నివేదనలు జరుగుతుంటాయి. శివునికి సంబంధించిన పర్వదినాలలో ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు. స్వామి, అమ్మవార్లకు నిత్యం కల్యాణోత్సవాలను జరుపుతారు. ఈ ఆలయం ఆవరణలోని పలు ముఖ్య ఆలయాలేగాక చుట్టుపక్కల వినాయక, సుబ్రహ్మణ్య, ఇతర శివదేవ పరివార ఆలయాలు, స్వామి భక్తులైన నందరార్, తిరునావుక్కరుసు, మానిక వాసగర్, సంబంధార్‌ తదితర నాయనారుల ఉపాలయాలు కూడా సందర్శనీయమైనవి. తిరుచ్చి సమీపంలోనే కలియుగ వైకుంఠమైన శ్రీరంగం ఉంది.

ఎలా వెళ్లాలంటే..?
చెన్నై నుంచి జంబుకేశ్వరానికి నేరుగా రైళ్లు, బస్సులు ఉన్నాయి.

డి.వి.ఆర్‌.భాస్కర్‌

బృహదీశ్వరాలయం B

అణువణువూ అద్భుతం బృహదీశ్వరాలయం ‘‘గుడులూ గోపురాలకు పేరొందిన తమిళనాడు రాష్ట్రాన్ని సందర్శించాలనుకునే వాళ్లకు ముందుగా గుర్తొచ్చేది తంజావూరు...