Showing posts with label జమ్మూ కాశ్మీరు. Show all posts
Showing posts with label జమ్మూ కాశ్మీరు. Show all posts

Sunday, 30 September 2018

Ladakh - లడఖ్ - లద్దాఖ్‌








Ladakh - లడఖ్ - లద్దాఖ్‌



‘‘లద్దాఖ్‌... ప్రపంచంలోకెల్లా  ఎత్తైన నివాసిత ప్రాంతం మాత్రమే కాదు, రంగులు మారే సరస్సూ, పాలపుంత ఆకాశమూ, అయస్కాంత కొండా, రెండు మూపురాల ఒంటెలూ... ఇలా ఎన్నో సహజ వింతలకీ అందాలకీ సాహస యాత్రలకీ నిలయం. అంతేకాదు, భారతీయ ఆధ్యాత్మికతకి ప్రతీకగా నిలిచే హిమాలయ పర్వతాలకీ, ప్రాచీన నాగరికతకి కారణమైన సింధునదికీ ఆలవాలం...’’ అంటూ అక్కడి విశేషాలను చెప్పుకొస్తున్నారు హైదరాబాద్‌కు చెందిన వి. మల్లికార్జున్‌.

సింధునదిని దర్శనం చేసుకోవాలనీ అక్కడి ప్రదేశాలను చూడాలనీ 17 మంది బృందంతో కలిసి బయలుదేరాం. ముందుగా సింధునదిలో పవిత్ర స్నానం చేయాలనే కోరికతో జమ్మూకాశ్మీర్‌ రాష్ట్రంలో ఉన్న లద్దాఖ్‌లోని లేహ్‌ పట్టణానికి వెళ్లాలనుకున్నాం. దిల్లీ నుంచి లేహ్‌కు విమానంలో చేరుకున్నాం. అక్కడ దిగగానే ఎత్తైన హిమగిరులు దర్శనమిచ్చాయి. అయితే అవన్నీ మంచుతో కాకుండా మట్టి, రాళ్లతో నిండి ఉన్నాయి. చలికాలంలో మాత్రం మంచుతో కప్పబడి ఉంటాయట. కనుచూపుమేరలో పచ్చదనం కనిపించదు. అందుకే లద్దాఖ్‌ ప్రాంతంలోని కొండల్ని ఎడారి హిమాలయాలని అంటారు.

రాత్రి ఎనిమిది వరకూ వెలుగే!
లేహ్‌ సముద్ర మట్టానికి 11,500 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇక్కడ గాలిలో ఆక్సిజన్‌ తక్కువ. నైట్రోజన్‌ ఎక్కువ. దానివల్ల మనకు శ్వాస తీసుకోవడంలో కొంత ఇబ్బంది కలుగుతుంది. దీనికోసం ఎక్కువసార్లు నీళ్లూ, ఫ్రూట్‌జ్యూసులూ తాగాలి. నోరు పొడారిపోకుండా లాలాజలం ఊరేలా లవంగం, పిప్పరమెంట్లు లాంటివి చప్పరించడం చేస్తే శ్వాస సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. ఆ వాతావరణానికి అలవాటు పడ్డానికి సాయంత్రం వరకూ గదిలోనే ఉన్నాం. లేహ్‌లో సూర్యోదయం ఉదయం ఐదుగంటలకే. చీకటిపడేది మాత్రం రాత్రి ఎనిమిది తరవాతే. అక్కడ జనసాంద్రత చాలా తక్కువ. వీరి జీవనోపాధి కేవలం పర్యటకం మాత్రమే. ఇక్కడ అత్యధిక శాతం టిబెటన్‌ బౌద్ధులే. సాయంత్రం సింధు దర్శన్‌ యాత్రా సమితి ఆధ్వర్యంలో జరిగిన ప్రారంభోత్సవ వేడుకకి వెళ్లాం. అక్కడ సింధు నదీ ప్రాశస్త్యం గురించీ, దేశభక్తిని పెంపొందించేందుకూ ప్రత్యేకంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను చూశాం. సుదూర హిమాలయాల్లో నివసిస్తున్న ప్రజలు దేశంలోని మిగిలిన అన్ని ప్రాంతాలతో కలిసి సమైక్యంగా ఉండాలన్న ఉద్దేశంతోనూ అందరూ శాంతియుతంగా జీవించాలని ఆకాంక్షిస్తూ భారత ప్రభుత్వం గత 22 సంవత్సరాల నుంచీ ఈ సింధు దర్శన్‌ యాత్రను చేపట్టింది. అందులో భాగంగా ఇక్కడ ఏటా జూన్‌లో ఈ వేడుకను నిర్వహిస్తారు. దీనికోసం అన్ని రాష్ట్రాలనుంచీ యాత్రికులు వస్తుంటారు.

సింధునది మానస సరోవరంలో పుట్టి, దాదాపు 2400 కి.మీ. పొడవుతో టిబెట్‌, లద్దాఖ్‌, పాకిస్తాన్‌లలో ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తుంది. లద్దాఖ్‌లో దాదాపు 250 కి.మీ. ప్రవహిస్తుంది. ప్రారంభోత్సవ కార్యక్రమాలయ్యాక  నదీస్నానానికి బయలుదేరాం. మానససరోవరంలో పుట్టి అక్కడి నుంచి ఎన్నో మలుపులు తిరుగుతూ ప్రవహిస్తోన్న ఆ నదిని చూడగానే ఎక్కడలేని ఆనందం కలిగింది. అందులో స్నానం చేసి పూజాది కార్యక్రమాలు నిర్వహించాక, చుట్టుపక్కల ప్రదేశాలు చూడ్డానికి బయలుదేరాం.

నదీ సంగమం!
లేహ్‌ నుంచి కార్గిల్‌ వెళ్లే దారిలో సముద్రమట్టానికి దాదాపు 12,000 అడుగుల ఎత్తులో ఉన్న పత్తర్‌ సాహిబ్‌ గురుద్వారా దగ్గరకు వెళ్లాం. ఇక్కడ సిక్కు మత సంస్థాపకులైన గురునానక్‌ ఓ పెద్ద శిల దగ్గర ధ్యానం చేసి, జ్ఞానోదయం పొందారని ప్రతీతి. అందుకు చిహ్నంగా అక్కడ ఓ పెద్ద గురుద్వారా నిర్మించారు. ఇక్కడ ఎంతో పవిత్రంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజూ లంగర్‌(సంతర్పణ) ఉంటుంది. దీనికి సమీపంలో కనుచూపుమేరలో అన్నీ ఎడారి హిమాలయాలే. తరవాత సింధునది జంస్కర్‌ నది కలిసే సంగమ ప్రదేశానికి వెళ్లాం. ఇక్కడ సింధు నది నీలం రంగులోనూ జంస్కర్‌ నది మట్టి రంగులోనూ కనిపిస్తుంది. అక్కడినుంచి సింధునది పాకిస్తాన్‌ వైపు ప్రవహిస్తుంది. ఈ సంగమం ప్రపంచంలోనే అతి ఎత్తైనదిగా చెబుతారు. ఇక్కడి జంస్కర్‌ నదిలో రివర్‌ ర్యాఫ్టింగ్‌ చేస్తే ప్రపంచంలో అతి ఎత్తైన ప్రదేశంలో చేసినట్లేనట. మేం కూడా ర్యాఫ్టింగ్‌ చేశాం. ఒకవైపు ఎత్తైన హిమగిరులూ మరోవైపు ఎక్కడో లోయలో ఉన్నట్లున్న నదిలో పడవ ప్రయాణం అద్భుతంగా అనిపించింది.  ఈ జంస్కర్‌లోయలోనే మొరిరి అనే సరోవరం దగ్గరున్న కర్జోక్‌ ప్రాంతం పచ్చదనంతో కళకళలాడుతుంటుంది. ప్రపంచంలోకెల్లా ఎత్తైన వ్యవసాయ క్షేత్రం ఇదేనట. ఇక్కడికి సమీపంలోనే భారతీయ సైన్యం నిర్మించిన  ప్రపంచంలోకెల్లా ఎత్తైన వంతెన ఉంది.

అయస్కాంత పర్వతం!
తరవాత అయస్కాంత పర్వతం దగ్గరకు వెళ్లాం. ఇది లేహ్‌ నుంచి 30 కి.మీ. దూరంలో ఉంది. ఇది సముద్ర మట్టానికి 14,000 అడుగుల ఎత్తులో ఉంటుంది. దీని ప్రభావం రెండు ఫర్లాంగుల వరకూ ఉంటుంది. అందుకే అక్కడ ఓ పసుపుపచ్చ గీత గీశారు. అక్కడ వాహనాన్ని నిలిపినట్లైతే అది నెమ్మదిగా పర్వతం వైపు కదులుతున్న దృశ్యం మనల్ని చకితుల్ని చేస్తుంది. ఈ ప్రాంతాన్ని నో ఫ్లై జోన్‌గా ప్రకటించారు. తరవాత హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌ అనే కట్టడం దగ్గరకు వెళ్లాం. దేశ రక్షణకోసం వరసగా మనదేశం చేసిన యుద్ధాల్లో వీరుల పోరాటాలూ వాళ్ల విజయ ఘట్టాలూ అమరులైన సైనిక సోదరుల చిత్రపటాలూ అన్నీ అక్కడ ప్రదర్శనకి ఉంచారు. వాళ్లు వాడిన రకరకాల ఆయుధాలు కూడా అక్కడ ఉన్నాయి. చల్లని మంచులో సైనికులు ఎలా నివసిస్తారు, సైనికుడు తనతో ఎన్ని వస్తువులను తీసుకెళతాడు... వంటి అనేక విశేషాలను అక్కడ తెలుసుకోవచ్చు. మనలాంటివాళ్లకి ఏ బరువులూ లేకుండా మంచుపర్వతం ఎక్కడమే గగనంగా ఉంటే, సైనికులు మాత్రం అంతంత బరువులతో ఆ పర్వతాన్ని ఎక్కడం అనేది ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇప్పటివరకూ పరమవీరచక్ర, మహావీరచక్ర పతకాలు పొందిన సైనిక సోదరుల చిత్రపటాలూ కార్గిల్‌ యుద్ధంలో మరణించిన మేజర్‌ పద్మపాణి ఆచార్య చిత్రాలూ అక్కడ ఉన్నాయి. ఇక్కడ అమరవీరుల స్తూపం నిత్యం జ్వలిస్తూ కనిపిస్తుంది. ప్రతిరోజూ సాయంత్రం సైనిక సంగీత ప్రదర్శన, సౌండ్‌ అండ్‌ లైట్‌ షో ఉంటాయి.

ఉప్పునీటి సరస్సు!
అక్కణ్నుంచి ప్రపంచంలోనే ఎత్తైన పాంగోంగ్‌ ఉప్పునీటి సరస్సు చూడ్డానికి వెళ్లాం. ఇది లేహ్‌ నుంచి 130 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎడారి పర్వతాలగుండా ఘాట్‌రోడ్డులో సుమారు 5 గంటలు ప్రయాణం చేస్తే వస్తుందీ సరోవరం. సముద్రమట్టానికి 14 వేల అడుగుల ఎత్తులో ఉన్న ఈ సరస్సులో 60 శాతం చైనా స్వాధీనంలోనూ, 40 శాతం భారత్‌ అధీనంలోనూ ఉంది. ఇక్కడికి వెళ్లాలంటే అనుమతి పత్రం తప్పనిసరి. ఎంతో కష్టపడి ఎత్తైన కొండలను దాటుకుంటూ వెళ్లాం. కానీ అక్కడి సరస్సును చూడగానే ఆ కష్టాన్ని మరచిపోయాం. అంత అద్భుతంగా ఉందది. ఆకాశంలో సూర్యగమనాన్ని బట్టి రోజంతా రంగులు మారుతూ సందర్శకుల్ని చకితుల్ని చేస్తుందీ సరస్సు. ఉదయం వేళలో ముదురు నీలిరంగులో ఉండే నీళ్లు మధ్యాహ్నానికి ఆకుపచ్చరంగులోనూ సాయంత్రానికి పసుపూ ఎరుపూ కలగలిసినట్లుగా ఉంటాయి. ఇక్కడ సినిమా షూటింగులు జరుగుతుంటాయి. త్రీ ఇడియట్స్‌ సినిమాలోని చివరి సన్నివేశం ఇక్కడ తీసినదే. తిరుగు ప్రయాణంలో అదే సినిమాలో చూపించిన రంచోడ్‌దాస్‌ పాఠశాల కనిపించింది. నది ఒడ్డునే క్యాంపింగ్‌ సౌకర్యం ఉంది. రాత్రివేళలో ఆకాశంలోని చుక్కలన్నీ ఎంతో దగ్గరగా కనిపిస్తూ నక్షత్రలోకంలో ఉన్నామా అనిపిస్తుందనీ, ఆకాశంలో ఎలాంటి మబ్బులూ లేనివేళలో పాలపుంత కనిపిస్తుందనీ అక్కడివాళ్లు చెప్పారు.

ఎత్తైన రోడ్డుమార్గంలో...
హిమాలయాల్లోని మరో అద్భుత ప్రదేశమైన ఖార్డుంగ్‌ లాకి వెళ్లాం. ఇది ప్రపంచంలోనే ఎత్తైన రోడ్డుమార్గం. సముద్ర మట్టానికి 18,500 అడుగుల ఎత్తులో ఉన్న ఈ రోడ్డు మానస సరోవరానికన్నా మూడువేల అడుగుల ఎత్తులో ఉంది. లేహ్‌ నుంచి 39 కి.మీ. దూరంలో ఈ ప్రాంతానికి వెళుతుంటే మేఘాలు మనల్ని తాకుతున్నట్లే అనిపిస్తుంది. ఆ ప్రాంతంలోని కొండల్నీ ఆకాశాన్నీ చూస్తుంటే అంతరిక్షంలోనో మరో గ్రహంమీదో ఉన్న అనుభూతి కలుగుతుంది. ఇది భూమండలమేనా అన్న అనుమానమూ వస్తుంది. ఎత్తైన ఆ కొండలమీద నుంచి కిందకి చూస్తే అదో పాతాళలోకంలా కనిపిస్తుంది. ఆ ప్రాంతానికి చేరుకోగానే మంచుతో కప్పబడిన హిమాలయాలు కనువిందు చేస్తాయి. అక్కడ దిగి అందరం చిన్న పిల్లల్లా మంచులో ఆడుకున్నాం. అక్కడి నుంచి మరికాస్త ముందుకు వెళితే నుబ్రా వ్యాలీ వస్తుంది. లేహ్‌కు విరుద్ధంగా పచ్చని చెట్లతో కళకళలాడుతూ కనిపిస్తుంది. బాక్ట్రియన్‌ ఒంటెలుగా పిలిచే రెండు మూపురాల ఒంటెలు ఉన్నాయక్కడ. ఇవేకాదు, లేహ్‌లో మరెన్నో బౌద్ధారామాలూ, లేహ్‌ ప్యాలెస్‌... వంటి చారిత్రక స్థలాలు ఉన్నాయి. అవన్నీ చూసి సంతృప్తితో వెనుతిరిగాం.

Thursday, 28 June 2018

అమర్‌నాథ్‌ యాత్ర





28-06-2018

భక్తిగా... జాగ్రత్తగా

అమర్‌నాథ్‌ యాత్ర ఈ రోజు మొదలవుతోంది. భక్తులు ఎంత పవిత్రమైనదిగా భావిస్తారో అంతకు మించిన క్లిష్టతతో కూడుకున్న ప్రయాణం ఇది. అందుకే ఈ యాత్రకు బయలుదేరినవారు తగిన జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. హిమాలయాల్లో సముద్రమట్టానికి సుమారు 3,900 మీటర్ల ఎత్తున, చుట్టూ ఆవరించిన మంచు పర్వతాల మధ్య నెలకొన్న గుహాలయం ఇది. దాదాపు నలభై మీటర్ల ఎత్తులో ఉండే గుహలో హిమరూపంలో పరమశివుడు దర్శనమిస్తాడు. ఏడాదిలో కొంతకాలం తప్ప మిగిలిన మాసాల్లో ఈ ప్రాంతమంతా దట్టమైన మంచుతో కప్పి ఉంటుంది. ఆ ప్రాంతంలో మే నుంచి ప్రారంభమయ్యే వేసవి కాలంలో మాత్రమే అక్కడికి చేరుకోగలరు. ఈ రోజు (జూన్‌ 28వ తేదీ) నుంచి ఆగస్టు 26వ తేదీ వరకు ఈ యాత్ర కొనసాగుతుంది. అయితే వాతావరణం అనుకూలిస్తే తప్ప ఈ యాత్రకు అనుమతించరు. అమర్‌నాథ్‌ యాత్ర చేస్తున్నవారు తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయాలివి.

ఇవి మరచిపోవద్దు
గుర్తింపు వివరాలు: యాత్రకు మీరు అనుమతి పొందినట్టు ధ్రువీకరించే రిజిస్ట్రేషన్‌ కార్డు తీసుకువెళ్ళడం మరచిపోవద్దు. ఈ కార్డు లేకపోతే యాత్రకు అనుమతించరు. అలాగే మీ ఐడి ప్రూఫ్‌ కూడా తీసుకువెళ్ళండి. మీ పేరు, చిరునామా, యాత్రలో మీతోపాటు పాల్గొంటున్న వారి వివరాలు, మీ కుటుంబ సభ్యుల ఫోన్‌ నెంబర్లు కాగితం లేదా చిన్న పుస్తకంలో రాసి మీతో పాటు ఉంచుకోండి. అత్యవసర పరిస్థితుల్లో మీరు చిక్కుకున్నప్పుడు వాటి అవసరం ఉండొచ్చు.

ఆరోగ్య ధ్రువపత్రాలు:13 ఏళ్ల లోపు బాలబాలికలనూ, 75 ఏళ్లు దాటిన వారినీ ఈ యాత్రకు అనుమతించరు. యాత్రకు వెళ్లే భక్తులు పూర్తి స్థాయి రక్త పరీక్షలు, మూత్ర పరీక్ష, ఛాతీ ఎక్స్‌రే గుండె సంబంధిత ECG, 2D-ECHO తదితర పరీక్షలను వయసును బట్టి చేయించుకోవాల్సి ఉంటుంది. ఆరోగ్య ధ్రువీకరణ పత్రం తీసుకోవాల్సి ఉంటుంది. దాని కాపీలను యాత్ర సమయంలో దగ్గర ఉంచుకోవాలి.

బీమా ఉండాల్సిందే: ఇది ప్రమాదకరమైన యాత్ర. కాబట్టి బీమా తీసుకోండి. సుమారు మూడు లక్షల రూపాయల వరకూ గ్రూప్‌ ఇన్స్యూరెన్స్‌ను అమర్‌నాథ్‌ యాత్ర బోర్డు అందిస్తోంది.

తగినంత నగదు: దారిలో ఆహారం, అవసరమైన పరికరాలు కొనుక్కోవడానికీ, బస చేయడానికీ అవసరమైన నగదు తీసుకువెళ్ళండి.

మార్గంలో మన కోసం...
ఆహారం:బిస్కట్లు, మిల్క్‌ పౌడర్‌, చక్కెర, డైరఫ్రూట్స్‌, గ్లూకోజ్‌, ఇతర తినుబండారాలూ మీతో పాటు తీసుకువెళ్ళండి. సీసాతో నీళ్ళు, గ్లాసు, స్పూన్లు, ఒక ప్లేట్‌ మీ కిట్‌లో ఉండాలి. తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోండి. మార్గమధ్యంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సరుకుల దుకాణాలు, ప్రభుత్వం, ప్రైవేటు వ్యక్తులు నిర్వహించే రెస్టారెంట్లు, టీ దుకాణాలు ఉంటాయి. కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా ఉచితంగా ఆహారాన్నీ, దారిపొడుగునా మంచి నీటినీ అందిస్తున్నాయి. ఖాళీ కడుపుతో ప్రయాణం చెయ్యకండి. దానివల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి.

హెలీ సేవలు: యాత్రికుల కోసం వివిధ సంస్థలు హెలికాఫ్టర్‌ సేవలు అందిస్తున్నాయి. నీల్‌గ్రాత్‌ (బల్తాల్‌) నుంచి పంచ్‌తరణి వరకూ ఒక వైపు ప్రయాణానికి రూ. 1,600, పహల్గామ్‌ నుంచి పంచ్‌తరణి వరకూ ఒకవైపు ప్రయాణానికి రూ. 2,751 ఛార్జీలుగా నిర్ణయించారు.

నో ప్రీపెయిడ్‌: జమ్మూ-కాశ్మీర్‌లో, యాత్ర జరిగే ప్రాంతంలో ఇతర రాష్ట్రాల ప్రీపెయిడ్‌ సిమ్‌ కార్డులు పని చెయ్యవు. భక్తులు తమ బృందంలో ఒక్కరికైనా పోస్ట్‌ పెయిడ్‌ ఫోన్‌ ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థ అయిన BSNL వారి కనెక్షన్‌ ఉన్న ఫోన్‌ను వెంట ఉంచుకోవడం ఉత్తమం. లేదంటే బల్టాల్‌, నున్వాన్‌ బేస్‌ క్యాంప్‌ల వద్ద ప్రీయాక్టివేటెడ్‌ సిమ్‌ కార్డుల్ని కొనుక్కోవచ్చు.

ఛార్జీలు తెలుసుకోండి:ఏ సేవకు ఎంత మొత్తంలో చెల్లించాలో అమర్‌నాథ్‌ బోర్డు నిర్ణయిస్తుంది. ఆ వివరాలతో బోర్డులు ఉంటాయి. ఆ మేరకు మాత్రమే చెల్లించండి.

ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్‌: వేసలైన్‌, కోల్డ్‌ క్రీమ్‌, మోశ్చరైజర్‌, లిప్‌ బామ్‌, సర్జికల్‌ కాటన్‌, నొప్పి నివారణ మాత్రలు, స్ర్పేలు, చిన్న చిన్న గాయాలు, ఆరోగ్య ఇబ్బందులకు అత్యవసరంగా ఉపయోగపడే మందులతో ఫస్ట్‌ఎయిడ్‌ బాక్స్‌ మీతో ఉంటే మంచిది. కర్పూరం కూడా తీసుకువెళ్ళండి. శ్వాసకోశ సమస్యలు ఎదురైనప్పుడు దాన్ని వాసన చూస్తే ఉపశమనం కలుగుతుంది.

ఇతర పరికరాలు: దారి మిట్టపల్లాలుగా ఉంటుంది. సుమారు మూడు కిలోమీటర్లకు పైగా మంచు మీద నడవాల్సి ఉంటుంది. కనుక ఊత కోసం పొడవైన కర్ర లేదా వాకింగ్‌ స్టిక్‌ తీసుకు వెళ్ళండి. టార్చిలైట్‌ కూడా దగ్గర ఉంచుకోండి.

చలిని గెలుద్దాం
దుస్తులు: అమర్‌నాథ్‌ మంచు ప్రదేశం. చలి ఎముకలు కొరికేస్తూ ఉంటుంది. ఆ చలిని తట్టుకోవడం చాలా కష్టం. అందుకే శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచడంతోపాటు వెచ్చదనాన్ని అందించే దుస్తులు ఈ యాత్రకు తప్పనిసరి. కాబట్టి ఊలుతో చేసిన స్వెట్టర్లు, ఫ్యాంట్లు, మంకీ క్యాప్‌లు, చేతి తొడుగులు ధరించండి. బయటి నుంచి గాలి శరీరాన్ని తాకకుండా జాగ్రత్త పడండి. రైన్‌ కోట్‌, స్లీపింగ్‌ బ్యాగ్‌, చలిని బాగా తట్టుకోగలిగే రగ్గులు, గొడుగు తీసుకువెళ్ళండి. సాధారణమైన చెప్పులు, షూస్‌ వేసుకోకండి. మంచులో నడవాల్సి ఉంటుంది కనుక వాటర్‌ ప్రూఫ్‌ బూట్లు ధరించండి. స్లిప్పర్లతో, కాళ్ళకు ఎలాంటి ఆచ్ఛాదనా లేకుండా నడవకండి. చెవుల్లోకి చలి గాలి వెళ్ళకుండా దూది పెట్టుకుంటే మేలు.

ఇవి వద్దు: మహిళలు చీరలు ధరించకపోవడం మంచిది. అలవాటు ఉంటే ఫ్యాంట్లు బెస్ట్‌. లేదంటే సల్వార్‌ సూట్లు వేసుకోవచ్చు. ధోవతీల్లాంటివి ధరించకండి.

బస: యాత్ర జరిగే సమయంలో జమ్మూ-కాశ్మీర్‌ పర్యాటకాభివృద్ధి సంస్థ దారి పొడుగునా గుడారాలు ఏర్పాటు చేస్తుంది. వీటిలో వివిధ సౌకర్యాలుంటాయి. ప్రైవేటు వసతి కూడా అందుబాటులో ఉంటుంది. బేస్‌ క్యాంపుల వద్ద వీటిని బుక్‌ చేసుకొవచ్చు. ప్రభుత్వం నిర్దేశించిన ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.

అవగాహనతో ప్రయాణం
సమయాలు తెలుసుకోండి: డోమెల్‌, చందన్‌వారీల వద్ద ప్రవేశ ద్వారాలు సాధారణంగా ఉదయం 5 గంటల నుంచి 11 గంటల వరకూ తెరుస్తారు. ఆ సమయానికల్లా గేట్‌ దగ్గరకు యాత్రికులు చేరుకోవాలి. గేట్లు మూసిన తరువాత యాత్రికులు ప్రయాణానికి అనుమతించరు. మధ్యాహ్నం 3 గంటలు దాటిన తరువాత పంచ్‌తరణి క్యాంప్‌ నుంచి గుహాలయం వైపు ప్రయాణించకండి. సాయంత్రం 6 గంటల తరువాత దర్శనానికి అనుమతించరు.

సొంత ప్రయోగాలు వద్దు: దగ్గర దారి అని ఎవరో చెప్పారనో, మీ బుద్ధికి తోచిందనో తెలియని మార్గాల్లో ప్రయాణం చేయకండి. హెచ్చరిక సంకేతాలు ఉన్న ప్రదేశాల్లో ఎక్కువ సేపు నిలిచి ఉండకండి. అలాగే రాత్రిపూట గుహల దగ్గర ఉండడం శ్రేయస్కరం కాదు. ఆక్సిజన్‌ బాగా తక్కువగా ఉండడం వల్ల శ్వాస సంబంధిత ఇబ్బందులు తీవ్రంగా ఉంటాయి. కాబట్టి చీకటి పడకముందే వెనక్కి బయలుదేరడం మంచిది.

హడావిడి పనికిరాదు: తొందరగా వెళ్తామన్న ఆలోచనతో ఇతరుల్ని ఓవర్‌టెక్‌ చెయ్యడం, ట్రాఫిక్‌ నియమాలు ఉల్లంఘించడం లాంటివి చేయకండి. మీరు ప్రయాణించేది ప్రమాదకరమైన మార్గం. రెప్పపాటు పొరపాటు జరిగినా ప్రాణాపాయం పొంచి ఉంటుంది. ప్రశాంతమైన మనసుతో ప్రయాణం సాగించండి.

వారి సేవలే పొందండి: అమరనాథ్‌ ఆలయ బోర్డు గుర్రాలు, డోలీల నిర్వాహకులకు లైసెన్స్‌ కార్డులు ఇస్తుంది. అధికారికంగా నమోదైన వ్యక్తుల సేవలు మాత్రమే వినియోగించుకోండి. వారు మీతో పాటే వచ్చేలా చూసుకోండి. వారిని వదిలి దూరంగా వెళ్ళకండి. వారి పేరు, వివరాలు ఉన్న కార్డులు తీసుకోండి.

ఆదేశాలు పాటించండి: యాత్ర అధికారులు ఎప్పటికప్పుడు సూచనలూ, సలహాలూ ఇస్తూ ఉంటారు. వాటిని జాగ్రత్తగా వినండి. అర్థం కాకపోతే సమీపంలో ఉన్న వారిని అడిగి తెలుసుకోండి. యాత్ర సమయంలో అమరనాథ్‌ ఆలయ బోర్డు సిబ్బంది, పోలీసులు, పర్యాటక, ఆరోగ్య శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వాలంటీర్లు అందుబాటులో ఉంటారు. మీకు ఎలాంటి సందేహాలున్నా వాళ్ళను అడిగి తెలుసుకోండి.

పర్యావరణహితంగా: డిస్పోజబుల్‌ ప్లాస్టిక్‌ కప్పులూ, ప్లేట్లను వినియోగించకండి. పాలిథిన్‌ వాడకం జమ్మూ-కాశ్మీర్‌లో నిషేధం. చెత్తను నిర్దేశించిన ప్రదేశాల్లో మాత్రమే పడేయండి.

Wednesday, 27 June 2018

వైష్ణోదేవి






కోరిన వరాలిచ్చే వైష్ణోదేవి

ముగ్గురమ్మలు మూర్తీభవించిన దేవిగా, తనను దర్శించే భక్తులకు ధర్మార్ధ కామ మోక్షాలు ప్రసాదించే జగజ్జననిగా జమ్మూ-కాశ్మీరు రాష్ట్రంలో కొలువైవుంది వైష్ణోదేవి. ఈ చల్లని తల్లి దర్శనార్ధం భక్తులు ఎక్కడెక్కడినుంచో సంవత్సరం పొడుగునా అశేష సంఖ్యలో వస్తారనేదే దేవి మహిమకి నిదర్శనం. ఆ దేవిని దర్శించినవరెవరూ తమ న్యాయమైన కోరికలు తీరకుండా రిక్త హస్తాలతో వెను తిరగరని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

సముద్రమట్టానికి 5200 అడుగుల ఎత్తులో త్రికూట పర్వత గుహలో వెలసిన వైష్ణోదేవి, భక్తులు అడిగే న్యాయమైన కోర్కెలు తీర్చే చల్లని తల్లి. ఈ ఆలయం ఎన్ని ఏళ్ళు క్రితందో ఆధారాలు లేవు. భూగర్భ శాస్త్రవేత్తల పరిశోధనలో ఈ ఆలయం వున్న గుహ ఒక మిలియన్ సంవత్సరాల పూర్వంనుంచి వున్నదని కనుగొన్నారు. ప్రప్రధమంగా పాండవులకాలంలోనే శక్తి పూజలు ప్రారంభం అయినాయనీ, వారే ఈ ప్రాంతంలో దేవీ ఆలయాలు నిర్మించారని ఇంకొక కధనం.

ఉత్తరాదివారి కొంగు బంగారమై విలసిల్లే ఈ దేవి ప్రాశస్త్యం దక్షిణాదిలో అంత ఎక్కువగా కనబడదు. అందుకే ఇక్కడివారు ఈ దేవిని లక్ష్మీ స్వరూపమని కొందరు, పార్వతీ స్వరూపమని కొందరు చెబుతారు. నిజానికి మహాలక్ష్మీ, మహాకాళీ, మహా సరస్వతి .... ఈ ముగ్గురి తేజోమయ స్వరూపమే ఈ తల్లి. ఆ కధ ఏమిటంటే...

పూర్వం జగన్మాత అసురుల బాధలు ఎక్కువగా వుండి వారితో పోరాడే సమయంలో భూలోకంలో ధర్మాన్ని రక్షించి, ప్రజలని కాపాడేందుకు మహాలక్ష్మీ, మహాకాళి, మహా సరస్వతులు తమ తేజస్సునుండి ఒక దివ్య శక్తిని ఆవిర్భవింపచేయాలనుకున్నారు. వారి సంకల్పమాత్రంచేత అక్కడో అందమైన యువతి ప్రత్యక్షమైంది. వారు ఆ యువతిని భూలోకంలో ధర్మ సంరక్షణార్ధం రత్నాకరసాగర్ అనే ఆయనకి పుత్రికగా విష్ణు అంశతో జన్మించి ధర్మహిత కార్యాలు చేయమని, ఆధ్యాత్మికంగా ఉన్నతస్ధాయికి చేరుకున్న తర్వాత శ్రీ మహా విష్ణువులో ఐక్యం చెందుతావని చెబుతారు. ఆ మహాశక్తుల ఆదేశానుసారం రత్మాకరసాగర్ ఇంట జన్మించిన ఆ బాలికకు వైష్ణవి అని నామకరణంచేయబడ్డది.

వైష్ణవి చిన్నతనంనుంచే జ్ఞాన సముపార్జనలో లీనమైంది. ఏ గురువులూ ఆమె జ్ఞాన తృష్ణను తీర్చలేకపోయారు. జ్ఞానసముపార్జనలో ఉన్నతస్ధాయి చేరుకోవాలనే తపనతో వైష్ణవి అంతర్ముఖి అయిచేసిన అన్వేషణలో ధ్యానం విలువ తెలుసుకుంది. తపస్సుతోనే తన జీవన ధ్యేయాన్ని సాధించగలననుకుని, ఇల్లు వదిలి అడవుల్లోకెళ్ళి తపస్సు చేయసాగింది.

అదే సమయంలో 14 సంవత్సరాలు అరణ్యవాసంలోవున్న శ్రీరామచంద్రుడు అక్కడికి వచ్చాడు. వైష్ణవి శ్రీరామచంద్రుణ్ణి ఆ శ్రీమహావిష్ణువుగా గుర్తించి, తనని ఆయనలో లీనం చేసుకోమనికోరింది. శ్రీరామచంద్రుడు దానికి తగిన సమయంకాదని, తన అరణ్యవాసం తర్వాత తిరిగి వైష్ణవి దగ్గరకొస్తానని, ఆ సమయంలో ఆమె తనని గుర్తిస్తే తప్పక తనలో ఐక్యం చేసుకుంటానని తెలిపాడు. ఆ ప్రకారమే శ్రీరామచంద్రుడు అరణ్యవాసం, రావణవధానంతరం అయోధ్యకి తిరిగి వెళ్తూ ఆమెదగ్గరకు ఒక వృధ్ధుడి రూపంలో వచ్చాడు. కానీ ఆ సమయంలో వైష్ణవి ఆయనని గుర్తించలేకపోతుంది. అందుకని భగవంతునిలో ఐక్యమయ్యే ఆవిడ కోరిక తీరలేదు.

బాధపడుతున్న వైష్ణవిని శ్రీరామచంద్రుడు ఓదార్చి, ఆమె తనలో ఐక్యమవటానికి తగిన సమయమింకారాలేదని, కలియుగంలో తాను కల్కి అవతారం ధరిస్తానని, అప్పుడు ఆమె కోరిక నెరవేరుతుందని ధైర్యం చెప్పాడు. త్రికూట పర్వత సానువుల్లో ఆశ్రమం నెలకొల్పుకుని తపస్సు కొనసాగిస్తూ, ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరాలు అవరోహించమని, ప్రజల మనోభీష్టాలు నెరవేర్చి, పేద, బాధిత ప్రజల కష్టాలు తీర్చమని ఆదేశించాడు.

శ్రీరామచంద్రుని ఆజ్ఞానుసారం వైష్ణవి త్రికూట పర్వతసానువుల్లో ఆశ్రమాన్ని నెలకొల్పుకుని తన తపస్సు కొనసాగించింది. అనతికాలంలోనే ఆవిడ శక్తిని గ్రహించిన ప్రజలు ఆవిడ ఆశీస్సులకోసం రాసాగారు.

కొంతకాలం తర్వాత గోరఖ్ నాధ్ అనే తాంత్రికుడు వైష్ణవి గురించి, ఆమె దీక్ష గురించి తెలుసుకుని, శ్రీరామచంద్రుడు ఆదేశించిన ప్రకారం ఆమె ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరాలను అధిరోహించిందో లేదో తెలుసుకోవాలనే కుతూహలంతో, వివరాలు తెలుసుకురావటానికి అత్యంత సమర్ధుడైన తన శిష్యుడు భైరవనాధుణ్ణి పంపాడు. భైరవనాధుడు చాటుగా వైష్ణనిని గమనించాడు. తపస్విని అయినా వైష్ణవి ఎల్లప్పుడు ధనుర్బాణాలు ధరించి వుండటం, ఆవిడకి రక్షగా లంగూర్లు, ఒక భయంకర సింహం వుండటం గమనించాడు. భైరవనాధుడు వైష్ణవి అందానికి ముగ్ధుడై తనని వివాహం చేసుకోమని ఆమెని విసిగించసాగాడు.

వైష్ణవికి అత్యంత భక్తుడైన శ్రీధర్ ఒకసారి ఊరందరికీ భోజనాలు పెట్టాలని అందరినీ ఆహ్వానిస్తూ, గోరఖ్ నాధ్ ని, భైరవనాధ్ తో సహా మిగతా ఆయన శిష్యులనందరినీ భోజనానికి ఆహ్వానించాడు. భోజనసమయంలో భైరవుడు వైష్ణవిపట్ల అమర్యాదగా ప్రవర్తించాడు. వైష్ణవి మందలించినా వినడు. వివాదం పెద్దదిచేసి భైరవుణ్ణి శిక్షించటం ఇష్టంలేని వైష్ణవి వాయురూపంలో పర్వతాలలోకి వెళ్తుంది తన తపస్సును కొనసాగించటానికి.

భైరవుడు ఆమెని వదలకుండా వెంటాడుతాడు. బాణగంగ, చరణపాదుక, అధక్వారీ అని ప్రస్తుతం పిలువబడుతున్న ప్రదేశాల్లో ఆగుతూ త్రికూట పర్వతంలోని ఈ పవిత్రగుహ దగ్గరకు వెళ్తుంది వైష్ణవి. అప్పటికీ విడువకుండా వెంటాడుతున్న భైరవుడి తలని ఆ గుహ బయట ఒక్క వేటుతో నరుకుతుంది. తెగిన భైరవుడి తల కొంచెం దూరంలో ఒక పర్వత శిఖరంమీదపడింది.

అప్పుడు తన తప్పుతెలుసుకున్న భైరవుడు వైష్ణవీదేవిని క్షమించమని ప్రార్ధిస్తాడు. మాత దయతలచి, తన భక్తులంతా తన దర్శనం తర్వాత భైరవుణ్ణి దర్శిస్తారని, అప్పుడే వారి యాత్ర సంపూర్ణమవుతుందని వరమిస్తుంది.

తదనంతరం వైష్ణవి తన ధ్యేయం నెరవేర్చుకోవటానికి, అంటే అత్యున్నత తపస్సుతో శ్రీ మహావిష్ణువులో లీనమయ్యే అర్హత సంపాదించుకోవటానికి, అలాగే తనని సృష్టించిన త్రిమాతలు, మరియు శ్రీరామచంద్రుని ఆజ్ఞప్రకారం ప్రజల కోర్కెలు తీర్చటానికి త్రికూట పర్వతంపైన గుహలో, 3 తలలతో 5.5 అడుగుల ఎత్తయిన రాతిరూపం ధరించింది. వైష్ణోదేవిలో గుహాలయంలో మనకి కనిపించే మూడు రాతి రూపాలు (పిండీలంటారు అక్కడివారు) ఆ మాత తలలే. వాటినే మహాకాళీ, వైష్ణోదేవి, మహా సరస్వతిగా చెప్తారు అక్కడి పండితులు.

వైష్ణోదేవి ఆలయం చేరటానికి 14 కి.మీ. దూరం కొండలెక్కాలి. దోవ పొడుగుతా తినుబండారాలు, త్రాగు నీరు, శౌచాలయాలు వగైరా యాత్రీకులకి కావలసిన అన్ని రకాల సదుపాయాలు వున్నాయి. దోవలో అవసరమైతే కొంతసేపు ఆగి విశ్రాంతికూడా తీసుకోవచ్చు. 24 గంటలూ యాత్రీకుల సందడితో వుండే దోవ పైన చాలా మటుకు రేకులతో కప్పబడి పైనుంచీ పడే రాళ్ళనుంచేకాక, ఎండా వానలనుంచీ కూడా యాత్రీకులని రక్షిస్తుంటాయి. ఎత్తైన కొండలమీద నుంచి కనిపించే అందమైన ప్రకృతి దృశ్యాలు నడిచేవారికి అలసట తెలియనీయవు. కొండ ఎక్కలేనివారికోసం గుఱ్ఱాలు, డోలీలు వున్నాయి. గుఱ్ఱం కొంచెం నడుం గట్టితనాన్ని పరీక్షించినా, డోలీలో ఎలాంటివారైనా తేలికగా వెళ్ళవచ్చు. కుర్చీ లో మనం కూర్చుంటే దానికి వున్న కఱ్ఱల సహాయంతో నలుగురు మనుష్యులు మనల్ని మోసుకెళ్తారు. అదే డోలీ. తోవ పొడుగూతా భక్తులు జై మాతాకీ అంటూ లయ బధ్ధంగా చేసే నినాదాలు యాత్రీకులలో ఎనలేని ఉత్సాహాన్ని కలిగిస్తాయి.

ఆగేవాలే బోలో జైమాతాకీ| పీఛేవాలే బోలో జైమాతాకీ||
పాల్కీవాలే బోలో జైమాతాకీ| ఘోడేవాలే బోలో జైమాతాకీ||

అంటూ అందరినీ కలుపుకుంటూ చేసే నినాదాలతో మనమూ శృతి కలపకుండా వుండలేము.
అర్ధరాత్రి అయినా జనసంచారం, విద్యుద్దీపాలు వుంటాయి. నిర్భయంగా కొండ ఎక్కవచ్చు. అయితే రాత్రిళ్ళు డోలీలుండవు. ఆలయం అన్నివేళలా తెరిచివుంటుంది (రాత్రంతా కూడా).

దేవీ దర్శనానికి ఇదివరకు చిన్న గుహ మార్గంలో పాకుతూ వెళ్ళవలసి వచ్చేదిట. ప్రస్తుతం మార్గం సుగమంచేశారు. ఎక్కడా వంగకుండా నడుస్తూనే వెళ్ళిరావచ్చు.

ఇక్కడ దర్శనానికి చాలా చక్కని ఏర్పాట్లు చెయ్యబడ్డాయి. దర్శనానికి బయల్దేరే ముందే కింద ముఖ్యద్వారంగుండా వెళ్ళటానికి కూపన్ తీసుకోవాలి. పరఛీ అంటారు దీనిని. ఎక్కువ సమయం పట్టదు దీనికి. గ్రూప్ కి ఒకళ్ళు వెళ్ళి కూడా తీసుకోవచ్చు. ఇది తీసుకున్న ఆరు గంటలలోపు ముఖ్యద్వారంగుండా లోపలకి వెళ్ళాలి. లేకపోతే ఇంకొకటి తీసుకోవాల్సి వుంటుంది. అది వుంటేనే ముఖ్యద్వారంగుండా లోపలకి (కొండ ఎక్కటానికి) వెళ్ళనిస్తారు. మనం పైకి వెళ్ళాక పరఛీ చూపించి బేచ్ నెంబరు తీసుకోవాలి. దర్శనానికి వచ్చేవారిని ఇలా బేచ్ నెంబర్లు ఇచ్చి క్రమబధ్ధీకరిస్తారు. ఆ నెంబరు ప్రకారం దర్శనానికి వెళ్ళాలి. జరుగుతున్న బేచ్ నెంబరు బోర్డుమీదు చూపిస్తుంటారు. ఖాళీ వుంటే తర్వాత బేచ్ వాళ్ళనికూడా వెళ్ళనిస్తారు. దానితో తొక్కిడి వుండదు 5, 6 చోట్ల సెక్యూరిటీ చెక్ వుంటుంది. డోలీలు ఆలయానికి ఒక కి.మీ. దూరం దాకా వెళ్తాయి. గుఱ్ఱాలు ఇంకా కొంచెం దూరంగా ఆగుతాయి. అక్కడనుండి నడక తప్పదు. అయితే ఎలాంటివారైనా నెమ్మదిగా అన్నీ చూసుకుంటూ వెళ్తే శ్రమ తెలియదు. అనేక చోట్ల వచ్చే సెక్యూరిటీ చెక్ లతో మనం అంత దూరం వెళ్ళామని కూడా తెలియదు. కెమేరా, సెల్, తోలు బెల్టులు వగైరాలు అన్నీ అక్కడ లాకర్లలో పెట్టి వెళ్ళాల్సిందే.

ఆలయానికి చేరుకోవటానికి హెలికాప్టరుకూడా వున్నది. ఈ సర్వీసు కాట్రానుంచి వుంటుంది. ముందుగా ఆన్ లైన్ లో కూడా బుక్ చేసుకోవచ్చు. అయితే ఆ సర్వీసులు వాతావరణాన్నిబట్టి వుంటాయి. మేము వెళ్ళినప్పుడు పొగమంచు ఎక్కువగా వున్నకారణంగా నెల రోజులనుంచి హెలికాప్టర్లు నడపలేదు.

ఇక్కడ కొన్ని జాగ్రత్తలు చెబుతాను. డోలీలో వెళ్ళాలనుకుంటే కిందే కౌంటర్ లో రానూ పోనూ కావాలో, కేవలం దింపటానికే కావాలో చెప్పి బుక్ చేసుకోండి. ఇవ్వాల్సిన డబ్బు, డోలీ తీసుకొచ్చేవాళ్ళల్లో ఒకరిద్దరి పేర్లతో సహా అన్ని వివరాలూ రాసి ఇస్తారు. ఇది గవర్నమెంటు వాళ్ళ కౌంటర్. అక్కడ అది ఒక్కటే వుంది అని అన్నారు. విడిగా డోలీ గానీ, గుఱ్ఱంగానీ మాట్లాడుకుంటే వాళ్ళకి లైసెన్సు టోకెన్లుంటాయి. మీ యాత్ర పూర్తయ్యేదాకా అవి అడిగి తీసుకుని మీ దగ్గర పెట్టుకోండి. ఎవరికీ పూర్తి డబ్బు ముందు ఇవ్వద్దు. మాట్లాడుకున్న డబ్బుకాకుండా మళ్ళీ మీదగ్గర నాస్తా, చాయ్ అంటూ వసూలు చేస్తారు.

డోలీ మాట్లాడుకునేటప్పుడే పాదగయ (అమ్మవారి పాదాలుంటాయి), అమ్మవారి ఆలయానికి ఇంకా కొంచెం పైకి వెళ్తే భైరవ ఆలయం వుంటుంది..అది చూస్తేగానీ యాత్ర సంపూర్తి కాదంటారు. ఇవ్వన్నీ చూపించాలి అని చెప్పండి. మాకు తెలియక అవి చూడలేదు. మధ్యలో డోలీ వాళ్ళనడిగితే దోవ సరిగాలేదని పైన కొండ చూపించి అదే భైరవాలయం దణ్ణం పెట్టమన్నారు (పెళ్ళిలో అరుంధతీ నక్షత్రంలాగా).

దోవ ఒకటే వుంటుంది. ఎలా వెళ్ళాలి అని కంగారు పడకండి. మీకు కావాల్సిన వివరాల బోర్డులుంటాయి. సీనియర్ సిటిజన్స్ కోసం 6 కి.మీ. కొండ ఎక్కిన తర్వాత ఆలయం వారి ఆధ్వర్యంలో బేటరీతో నడిచే కార్లున్నాయి (ఆటోలు). అక్కడదాకా గుఱ్ఱాలు, డోలీలలో వెళ్ళవచ్చు.

గర్భగుడిలో పూజారులెవ్వరూ డబ్బులు తీసుకోరు. మీరు అమ్మవారికిచ్చే కానుకలు హాయిగా హుండీలో వెయ్యండి. అమ్మవార్లు ముగ్గురుంటారు.. కాళీ, వైష్ణవీ, సరస్వతి...లింగ రూపంలో...మధ్యలో దేవి వైష్ణవి. ఈ సంగతి అక్కడవున్న పూజారి అందరికీ చెబుతూనే వుంటారు. అమ్మవార్ల పైన కిరీటాలుంటాయి. అంతేగానీ అక్కడ అమ్మవార్ల రూపం వుండదు.

దర్శనమయ్యాక అక్కడే కేంటీన్లు వుంటాయి.. పూరీ కూరా, రజ్మా రైస్ వగైరా ధరలు తక్కువే. భోజనం చేసి మరీ తిరుగు ప్రయాణం మొదలు పెట్టవచ్చు. పైన వుండటానికి కూడా వసతి వున్నది.

మార్గం
జమ్మూ రాష్ట్రంలోని కట్రాదాకా రైలు, రోడ్డు, వాయు మార్గాలున్నాయి. అక్కడనుండి యాత్ర మొదలయ్యే మైన్ గేట్ దాకా ఆటోలో వెళ్ళవచ్చు. దోవలో బస్ స్టాండులో ఆటో ఆపి పరఛీ తీసుకుని, అక్కడేవున్న డోలీ కౌంటర్ లో డోలీ మాట్లాడుకుని మైన్ గేట్ దాకా ఆటోలో వెళ్తే అక్కడనుంచి మాత్రమే డోలీ వగైరా యాత్ర మొదలవుతుంది.

ఆంధ్రభూమి

Wednesday, 6 June 2018

అమర్‌నాథ్‌ యాత్ర






అమర్‌నాథ్‌ యాత్ర
(పహల్ గాం మీదుగా)
కర్రా నాగలక్ష్మి

శ్రీనగరు పట్టణానికి సుమారు 88 కిలో మీటర్లదూరంలో ఉన్న ప్రముఖ వేసవి విడిది పహల్ గాం. పహల్ గావ్ అనంతనాగ్ జిల్లాలో ఉంది. ఈ ఊరుకి అమర్‌నాథ్‌ యాత్రలో ప్రముఖ స్థానం ఉంది. అమర్‌నాథ్‌ యాత్రలో ముఖ్యపాత్ర ఉన్న 'ఛడీముబారక్ ' యీ దారిగుండా అమర్‌నాథ్‌ గుహకు తీసుకు వెళతారు. యాత్ర పూర్తయాకా తిరిగి యిదే మార్గం ద్వారా తీసుకొని వస్తారు.

శివ పురాణం ప్రకారం పరమ శివుడు పార్వతీ దేవికి అమరకథ చెప్పేందుకు అమర గుహకు వెళుతూ శివుని వాహనమైన నందిని యిక్కడ విడిచి పెట్టడం వల్ల యీ వూరుని ' బైల్ గావ్ ' గా పిలువ సాగేరు. కాలాంతరాన యిది పహల్ గావ్ గా మారింది.

పహల్ గావ్ వెళ్లే దారంతా కొండ ప్రాంతం, మంచి పంటనేల. కొండ క్రింద ప్రాంతాలలో మామిడి, బత్తాయి మొదలయిన పండ్ల తోటలు పర్వతాల యెత్తుపెరుగు తున్న కొద్ది యాపిల్, ఛెర్రి పండ్ల తోల మధ్యనుంచి ప్రయాణం అహ్లాదకరంగా ఉంటుంది. టాక్సీలో వెళ్లేవారు యీ తోటల దగ్గర ఆగి తోట యజమాని అనుమతితో తోటలు చూడొచ్చు. ఛెర్రీ లు ఆగష్టులో పండి కోతకొస్తాయి. యాపిల్స్ అక్టోబరులో కోత కొస్తాయి. ఇంకా పైకి వెళ్తున్న కొద్దీ అక్రోటు, బాదం తోటలు చూడొచ్చు. దేవదారు, కోనిఫర్ తోటలు రోడ్డుకి యిరువైపులా ఉండి మనకి స్వాగతం పలుకుతున్నాయా ? అనే భ్రమ కలిగిస్తాయి. కొండపైన జారుతున్న జలపాతాలు, పేరు తెలియని అడవి పక్షులు మన ప్రయాణపు బడలికను తెలియకుండా చేస్తాయి.

కనుచూపు మేర వరకు పచ్చని పచ్చిక బయలు, గలగల ప్రవహించే సెలయేళ్లు, అలా పచ్చికలో దేవదారు వృక్షాల కిందన నడుస్తూ కోనిఫర్ పూలను యేరుకుంటూ యెంతదూరం నడిచినా తనివి తీరదు. పర్యాటకుల సౌకర్యార్థం రోడ్లు వెడల్పు చెయ్యడం, హోటల్స్ అధిక సంఖ్యలో నిర్మించడం వల్ల 2014లో మేం వెళ్లినప్పుడు పచ్చిక బయళ్ల స్థానంలో ధూళి దుమ్ము, హోటల్స్ కనిపించి నిరుత్సాహాన్ని కలిగించేయి.

అయితే యిక యాత్ర లోకి వస్తే, జమ్ములో రిజిస్ట్రేషన్ చేసుకొని బస్సులో శ్రీనగరు మీదుగా పహల్గాం చేరుతాం. మేం మద్యాహ్నపు మూడింటికి పహల్గాం చేరేం మాతో బాటు బస్సులో వచ్చిన వారు ఆ రాత్రి అక్కడ బస చెయ్యాలనుకున్నారు. పర్వతాలలో ప్రయాణాలు యెక్కువగా వాతావరణం మీద ఆధారపడి ఉంటుంది. ఆ రోజు యెక్కడా మబ్బులు లేవు, మరో నిముషంలో మబ్బులు కమ్మేయొచ్చు. అందుకే మేం పహల్గాంకి సుమారు పదహారు కిలో మీటర్ల దూరంలో ఉన్న'చందన వాడి' లో రాత్రి బస చెయ్యదలచుకున్నాం.

సుమారు అర కిలో మీటరు నడిచేక చిన్న బస్సులు యాత్రీకులను అక్కడకి 16 కిలో మీటర్ల దూరంలో ఉన్న ' చందన వాడి ' వరకు తీసుకు వెళుతున్నాయి, మేం కూడా వాటిలో ప్రయాణించి చందన వాడి చేరుకున్నాం. అక్కడ లంగరు నడుపుతున్న వారే యాత్రీకులకోసం రాత్రి బసకోసం ఉచిత టెంటులు నడుపుతున్నారు. అక్కడకు చేరగానే అడిగి మరీ మాకు కావలసిన ఆహారపదార్ధాలు యిచ్చేరు. బస్సు ప్రయాణానికి అలసిపోయిన మా శరీరాలను టెంటులో పడకల మీద చేర్చి సేదతీరసాగేం. అంతలోనే లంగరు నిర్వాహకులు టెంటులోకి వచ్చి ముందుగా పేరు నమోదు చేయించుకొని రజ్జాయిలు తీసుకోమని పిలిచేరు. చుట్టూరా చక్కని ప్రకృతి చుట్టూరా కొండలు కనుచూపు మేర వరకు పచ్చిక మైదానాలు చాలా అందంగా ఉండడంతో అలా కాసేపు పచ్చిక మీద నడచి వచ్చేం. అప్పటికి బాగా ఎండకాస్తూ ఉండడం వల్ల బాగా చెమట పట్టసాగింది యింత వేడిలో రజ్జాయిలు అవుసరమా? అని అనిపించి మేం వెళ్లలేదు. వాళ్లే వచ్చి రెండేసి రజ్జాయిలు యిచ్చి, సాయంత్రం ఆరింటికి లంగరు మూసేస్తారు కాబట్టి భోజనం ఆరులోపలే చెయ్యాలని, అలా తినలేని వారు భోజనం తీసుకొని తరవాత తినొచ్చునని చెప్పేరు. అయిదున్నర అయేసరికి సూర్యుడు అస్తమించడంతో మొదలయిన చలి అంతకంతకూ పెరగసాగింది. ఆరు తరువాత గుర్రాల వాళ్లు టెంటుకి వచ్చి బేరాలు చెయ్యసాగేరు. నడక మావల్లకాదు కాబట్టి మేం గుర్రాలను శేష నాగ్ వరకు మాట్టాడుకున్నాం. సుమారు పదమూడు పద్నాలుగు కిలో మీటర్ల దూరం ఒకే రోజులో ప్రయాణం అంటే కష్టం అన్న గుర్రపు యజమానిని వొప్పించి పొద్దున్న ఆరు లోపల బయలుదేరుదాం అని చెప్పేం. మా భోజనాలు చేసుకొని యేడుకల్లా నిద్రకివుపకరించేం.

యాత్ర మరునాడు మొదలు పెట్టబోతున్నాం అనే హుషారులో తొందరగా నిద్రపోయేం. శివుడు పార్వతితో అమర్‌నాథ్‌కి వెళుతూ ఈ ప్రదేశంలో తలపైనున్న చంద్రుణ్ణి విడిచిపెట్టాడని పౌరాణిక కథ.

పొద్దన్న అయిదున్నర కల్లా మేం మాట్లాడుకున్న గుర్రాలవారు వచ్చి మమ్మల్ని లేపేరు. అప్పటికే లేచిన లంగరు వాళ్లు టీ ఫలహారాల తయారీలో ఉన్నారు.

బాత్రూములేమీ లేవు బయట పళ్లు తోముకొని స్నానం వాయిదా వేసి టీ ఫలహారాలు కానిచ్చి ప్రయాణం మొదలు పెట్టేం.

సుమారు మూడు కిలో మీటర్ల యెగుడూ దిగుడూ దారిలో చందనవాడి నుంచి 2500 అడుగుల యెత్తు యెక్కి ' పిసు శిఖరం ' దాటాలి. చాలా కష్టంగా ఉంటుంది. వంకలు తిరిగిన యెగుడు దిగుడు కొండదారి మీద ప్రయాణం చాలా కష్టంగా ఉంటుంది. తరచు కురుసే వర్షాలకు జారిపడిన కొండరాళ్లను దాటుకుంటూ ప్రయాణంచాలి. ఈ పిసు శిఖరాన శివుడు తన శరీరంపైన ఉన్న విషజీవులను విడిచి పెట్టేడు.

సూర్యుడు మబ్బులలోనే ఉండిపోవడంతో మా ప్రయాణం మరింత అహ్లాదకరంగా మారింది. అక్కడనుంచి ' ఝాజీబల్ ' వరకు ఉన్న 5 కిలోమీటర్లూ దారి సాఫీగా యే యెగుడు దిగుబడులు లేక సాగింది. ఝాజీబల్ నుంచి నాగకోటి వరకు ఉన్న 2 కిలో మీటర్ల దారి కష్టమైనదని కావడంతో గుర్రాలమీంచి దిగి నడవాలి. దారి జారుడుగా ఉండడం వల్ల గుర్రాలు కూడా నిభాయించుకోలేవు. అందుకు ప్రతీ వారు యీ రెండు కిలో మీటర్లు నడిచే పూర్తి చెయ్యాలి. నాగకోటి లేక నాగర్ కోటిగా పిలువబడే యీ ప్రదేశంలో శివుడు తన శరీరం పైన ఉన్న నాగులను విడిచిపెట్టడు. నాగర్ కోటి నుంచి మరో కిలో మీటరు ప్రయాణం తరువాత రెండు కొండల మధ్యనుంచి నీలి రంగు సెలయేరు వస్తున్నట్లుగా శేషనాగు సరస్సు కనిపిస్తుంది.

శేషనాగ్ సరస్సు దగ్గర ఉన్న యేడు కొండలు శేషుడి పడగలని, శివుడు యిక్కడ శేషుడి విడిచి పెట్టేడని పురాణ కథ. శేషనాగ్ సరస్సుని చూస్తూ ఆ ప్రాంతం లో గల ప్రకృతికి పులకరించిపోతూ మరో రెండు కిలో మీటర్లు ప్రయాణించి శేషనాగ్ చేరేం. అప్పటికి చీకట్లు ముసురుతున్నాయి. మా గుర్రాలబ్బాయి దింపిన టెంటులో ₹600 ఒక మంచానికి యిచ్చి రెండు మంచాలు తీసుకున్నాం. సన్నగా వాన ప్రారంభించింది, అరకిలో మీటరు దూరంలో ఉన్న లంగరుకు వెళ్లి రాత్రి భోజనం చేసుకొనే సరికి వాన పెరిగింది. మేం మంచాల మీద రజ్జాయిల కింద పడుక్కున్నాం. వాన అంతకంతకూ పెరిగి కుంభవృష్టిగా కురవ సాగింది. మాతో పాటు టెంటులో ఉన్న మిగతా ముప్పై మందికి ఆరోజు యాత్ర లేదని తెలియడంతో తిండికి తప్ప మిగతా సమయం రజ్జాయిలోనే గడిపేము. మధ్య మధ్య లో వూసు పోడానికి కుశల ప్రశ్నలు, తరవాత భజనలు చేస్తూ గడిపేం. రాత్రి వాన నీరు టెంటులోకి ప్రవేశించేయి. మూడువందలుయిచ్చి కింద పడుక్కున్నవారి పడకలు తడిసిపోయేయి. కిందన నీరు మీదా టెంటు కారడం వల్ల తడి, చలి వల్ల రాత్రి యెవ్వరికీ నిద్ర లేదు.

మరునాడు కూడా వర్షం పడుతూనే ఉంది. అయితే ఉధృతం తగ్గింది. టెంటులో ఉండడానికి అద్దె రెండురెట్లు పెంచేరు టెంటు యజమానులు.

మూడో రోజు వాన తగ్గింది కాని దారి బురద అవడం వల్ల గుర్రాలని వెళ్లనివ్వలేదు. నడిచి వెళ్లేవారు టెంటులోంచి వెళ్లిపోయేరు. మేంనాలుగో రోజున ప్రయాణం తిరిగి ప్రారంభించేం. ఆరోజు మేం సుమారు 12 కిలోమీటర్లు ప్రయాణించి గుహ చేరుకొని దర్శనానంతరం సుమారు 18 కిలోమీటర్లు ప్రయాణించి బాల్టాల్ చేరాలన్నది మా ఆశ, అందుకని మేం ఉదయం 5 గంటలకి ప్రయాణం మొదలు పెట్టేం.

శేషనాగ్ నుంచి మా ప్రయాణం మహాగణ శిఖరం లేక గణేష శిఖరం అని పిలువబడే శిఖరం వైపు సాగింది. మొత్తం యాత్రలో యిదే కష్టమైన ప్రయాణం, యిక్కడ పరమశివుడు గణేషుడిని విడిచి పెట్టేడు.

ఈ ప్రాంతం లో మంచుకరిగి ప్రవహించే నీటితో బురదగా ఉంటుంది. ఇక్కడ నడవడం గుర్రాలకి, మనుషులకు కూడా చాలా కష్టంగా ఉంటుంది. కొన్ని చోట్ల గడ్డకట్టిన మంచుమీద కూడా ప్రయాణం సాగుతూ ఉంటుంది, గడ్డకట్టిన సెలయేళ్లు కావడం వల్ల కొన్ని చోట్ల పలుచని పొరలా గట్టిపడి కాలు పడగానే మంచు విరిగి మనిషి నీళ్లల్లో పడిపోయే ప్రమాదం ఉంటుంది అందుకే గుర్రాలవారు నడిచే చోట నడవాలి లేకపోతే మంచునీటిలో పడిపోవడం ఖాయం. గడ్డ కట్టిన మంచుమీద నడక తరువాత గణేషశిఖరానికి ప్రయాణం మొదలవుతుంది. యిక్కడ నుంచి నడక చాలా కష్టంగా మారుతుంది. ఒకటి యెత్తు యెక్కువగా ఉండడం, రెండు గాలిలో ఆక్సిజన్ శాతం చాలా తక్కువగా ఉండడం. ఇలాంటి సమయాలలో ముద్దకర్పూరం వాసన చూడమని పర్వతారోహకులు సలహా యిస్తారు. నడిచేవారు ట్వంటి- ట్వంటి ఫార్ములాని అనుసరిస్తారు, అంటే యిరవై అడుగులు నడిచిన తరువాత యిరవై దీర్ఘశ్వాసలు తీసుకోడాన్ని పర్వతారోహకులు ట్వంటి - ట్వంటి అని అంటారు. ఈ పర్వత శిఖరం 'పిసు శిఖరం' అంత యెత్తులేక పోయినా అప్పటికే శరీరం అలసిపోయి పోయి ఉండడం, గాలిలో ప్రాణవాయువు లోపించడం, కొండ ప్రాంతాలలో ఆకలి మందగించడం వల్ల సరైన ఆహారం తీసుకోక పోవడం వల్ల యెక్కడం కష్టమౌతుంది. గణేషశిఖరం దాటేక మాప్రయాణం బాబల్ శిఖరం వైపు సాగింది. శేషనాగ్ నుంచి బాబల్ శిఖరానికి సుమారు మూడు కిలో మీటర్లు ఉంటుంది. బాబల్ శిఖరాన్ని చేరుకోడానికి సుమారు మూడు గంటలు పడుతుంది. అప్పటికి మనం సుమారు 13800 అడుగుల యెత్తుకి చేరుకుంటాం.

బాబల్ శిఖరం మీంచి అమర్‌నాథ్‌ గుహ కనిపిస్తుంది కాని దారిలో మరో శిఖరాన్ని మనం యెక్కాలి. బాబల్ శిఖరం దగ్గర రెండు మూడు లంగరులు, బి.ఎస్.ఎఫ్ వారి మెడికల్ కేంపు ఉన్నాయి. గుర్రం దిగితే యెక్కడం వో పెద్ద ప్రశ్న గా ఉండడంతో ఆకలిగా ఉన్నా మేం దిగలేదు. కాని లంగరు వారు మా గుర్రాల దగ్గరకు వేడివేడి పాయసం, గోరు వెచ్చని నీరు అందించడంతో మా ప్రాణాలు లేచి వచ్చి మిగతా ప్రయాణం సుఖంగా చెయ్యగలగేం. గుప్పెడు టాఫీలు యిచ్చి నీరసంగా ఉన్నప్పుడు నోట్లో వేసుకోమని సలహా యిచ్చేరు. అక్కడనుంచి సుమారు 1.5 కిలోమీటర్లు ప్రయాణానంతరం 'మహాగణ శిఖరం' చేరుతాం. సుమారు 14500 అడుగులయెత్తుకి చేరుతాం. శివుడు యిక్కడ మిగతా గణాలను విడిచి పెట్టి పార్వతితో గుహ వైపు సాగిపోయేడు.

మహాగణశిఖరం నుంచి 1.5 కిలోమీటర్లు గడ్డకట్టిన అమరుగంగ నదిపైన ప్రయాణించి పౌష్ పత్రి చేరుకుంటాం. పోష్ పత్రి నుంచి సుమారు మూడు కిలో మీటర్ల యెగుడు దిగుడు దారిలో మెలికలు తిరిగిన దారిలో ప్రయాణించి పంచతరణి చేరుతాం. దీనిని సంగం అని కూడా అంటారు. యిక్కడ శివుడు తన ఢమురుకాన్ని విడిచి పెట్టినట్టుగా చెప్తారు. యిక్కడ నుండి సుమారు మూడు కిలోమీటర్లు కొంచం మట్టి కొండలమీద, గడ్డ కట్టిన మంచుమీద నడవాలి. పంచతరణి దగ్గర బాల్టాల్ నుంచి వచ్చే యాత్రీకులు కూడా కలుస్తారు. ఇక్కడ నుంచి యాత్రీకులు కాలినడకన వెళ్లాలి, గుర్రాలని ముందుకి అనుమతించరు.

ఆ మంచులో చలిలో నడుస్తూ గుహ చేరుకొని బాబా అమర్‌నాథ్‌ని దర్శించుకున్నాం.

తిరిగి వచ్చేటప్పుడు బాల్టాల్ మీదుగా సోనెమార్గ్ చేరుకొని అక్కడనుంచి శ్రీనగరు అక్కడ నుంచి టాక్సీలో జమ్ము చేరుకున్నాం.

అప్పట్లో బాత్రూములు ఉండేవి కావు కాని యిప్పడు టెంట్లలో నే అన్ని సదుపాయాలూ యేర్పాటు చేస్తున్నారు.

2002లో హెలీకాఫ్టర్ పంచతరణి వరకు ఉండేది. ప్రస్తుతం బాబల్ శిఖరం వరకు మాత్రమే నడుపుతున్నారు.



Saturday, 2 December 2017

లడక్‌ సరస్సు





మనోహరం లడక్‌ సరస్సుల విహారం!

‘సుర్రో సుర్రన్నాడే ’ అంటూ శక్తి సినిమాలో ఇలియానా మెలికలు తిరుగుతూ అందాలొలికించిన ప్రదేశం గుర్తుందా, ‘సత్‌రంగీ రే...’ అంటూ మణిరత్నం దిల్‌ సేలో చిత్రీకరించిన పాటా, త్రీ ఇడియట్స్‌ క్లైమాక్స్‌ సీనూ... ఇలా అనేక సినిమాల్లో కనువిందు చేస్తోన్న లడక్‌ సరోవర అందాలను ప్రత్యక్షంగా చూసి వచ్చాం’ అంటూ ఆ అనుభవాలను చెప్పుకొస్తున్నారు సికింద్రాబాద్‌కు చెందిన డాక్టర్‌ కె.సీతారత్న.

భిన్న ప్రాంతాలూ అక్కడ మాత్రమే జీవించే విభిన్న రకాల జంతువులూ పక్షులూ వృక్షజాతులూ ఆటవిక తెగలూ... ఇలా జీవ వైవిధ్యానికి మరో పేరు భారతదేశమైతే; అరుదైన, కనుమరుగవుతున్న జీవజాతులతో కూడిన బయోరిజర్వ్‌లూ అద్దాల్లా మెరిసే నీలి రంగు సరోవరాలకూ మారుపేరే లడక్‌. ఎత్తైన ఆ మంచుకొండల్లోని ముదురు నీలిరంగుల్లో ప్రకాశించే సరస్సుల సోయగం వర్ణించనలవి కాదు. అందుకే అచ్చంగా ఆ సరస్సుల్ని సందర్శించాలనుకుని ప్రణాళిక చేసుకున్నాం. జూలై 30వ తేదీన ముందుగా లేహ్‌కు చేరుకున్నాం. అక్కడి నుంచి ఇన్నోవాలో Pangong Tso Lake(పాంగోంగ్‌ త్సొ సరస్సు)కి బయలుదేరాం. ఇది 40 శాతం భారత భూభాగంలోనూ 60 శాతం టిబెట్‌(చైనా) లోనూ ఉంది. భారత్‌-చైనా సరిహద్దు నియంత్రణ రేఖ మీద ఉన్నందున నిరంతరం సైన్యం కాపలా ఉంటుంది. విదేశీయులు ఈ ప్రాంతాన్ని సందర్శించాలంటే లైన్‌ పర్మిట్‌ ఉండాలి. మారిన రాజకీయ పరిస్థితుల వల్ల దేశీయులు కూడా ఇన్నర్‌లైన్‌ పర్మిట్‌ తీసుకోవాలి. అందుకే Leh[లేహ్‌(లే)]లోనే పర్మిట్‌తో బాటు వాటి జిరాక్స్‌ ప్రతులూ, ఆధార్‌, మా ఫొటోలూ అన్నీ తీసుకున్నాం. వాటిని చెక్‌ పోస్టుల దగ్గర ఇవ్వాల్సి ఉంటుంది.

కత్తి మీద సవాల్‌!
Leh(లేహ్‌) నుంచి బయలుదేరి, 45 కిలోమీటర్ల దూరంలోని Karu (‘కార్‌’) అనే ప్రాంతానికి చేరుకుని, అక్కడి నుంచి 17,800 అడుగుల ఎత్తులోని Chang La Pass (చాంగ్‌ లా పాస్‌)కి చేరుకున్నాం. ఇది ఎత్తైన కొండదారుల్లో రెండోది. అక్కడ ఉన్న ఓ చిన్న హోటల్లో టీ తాగి, చుట్టుపక్కల దృశ్యాలను ఫొటోలు తీసుకుని మళ్లీ బయలుదేరాం. నెమ్మదిగా ప్రవహిస్తున్న సింధునదినీ దాని మధ్యలో వూదారంగు పూలతో నిండిన మట్టి దిబ్బల్నీ చూస్తూ మా ప్రయాణం సాగింది. అక్కడి నుంచి మరో 58 కి.మీ. ప్రయాణించాక తంక్‌సే అనే ప్రాంతం వచ్చింది. ఇది దాటాక రోడ్డు పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. ఈ ప్రాంతాన్ని Pagal Nala(పాగల్‌నాలా) అంటారు. అక్కడక్కడా హిమనదాల నుంచి కిందకి ప్రవహించి వచ్చిన నీరు మూడు నాలుగు అడుగుల లోతు వరకూ ఉంది. ఆ ప్రవాహాలని దాటడం కత్తి మీద సవాలే. టైర్లు రాళ్ల మధ్య ఇరుక్కుని ముందుకీ వెనక్కీ కదలని పరిస్థితి. ఎలాగో కష్టపడి 32 కి.మీ. ప్రయాణించాక స్పాంగుర్‌ త్సొ సరస్సు వచ్చింది. ఇది దాటాక మేం బస చేసే పాంగోంగ్‌ త్సొ రిసార్టుకు చేరుకున్నాం.

ఈ ప్రయాణంలో వాతావరణం ఎప్పుడెలా మారిపోతుందో తెలీదు. రోడ్డు అస్సలు బాగుండదు. టెలిఫోనూ సెల్‌ఫోను సంకేతాలు చేరని ఎత్తైన ప్రాంతం. అక్కడ వీచే ఈదురు గాలుల తాకిడికి చెవులు చిల్లులు పడతాయేమో అనిపిస్తుంది. వాతావరణంలో ఆక్సిజన్‌ శాతం చాలా తక్కువ. మౌంటెయిన్‌ సిక్‌నెస్‌కు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆక్సిజన్‌ సిలిండర్లను ఉపయోగించే విధానాన్ని తెలుసుకుని, వాటిని ఉపయోగించడానికి మానసికంగా సిద్ధపడినవారే ఈ ప్రాంతాన్ని పర్యటించాలి. చలికాలంలో అయితే పాంగోంగ్‌ సరస్సు గడ్డ కట్టి ఉంటుంది. మే నుంచి మంచు కరగడం ప్రారంభమవుతుంది. అందుకే అప్పటి నుంచి సెప్టెంబరు వరకూ దీన్ని ఎక్కువమంది సందర్శిస్తుంటారు. భూమ్మీద ఉన్న ఎత్తైన ఉప్పునీటి సరస్సు ఇదే.

కరెంటు ఉండదు!
సాయంత్రం నాలుగు గంటలకు సరస్సు దగ్గరకు చేరుకున్నాం. అది చూశాక అప్పటివరకూ పడ్డ కష్టమంతా హుష్‌కాకిలా ఎగిరిపోయింది. 14,270 అడుగుల ఎత్తులో నెమలిపింఛం వర్ణంలోని నీటితో మెరిసిపోతుందా ఉప్పునీటి సరస్సు. అప్పటికే అక్కడ చాలామంది సందర్శకులు ఉన్నారు. క్రమంగా సూర్యాస్తమయం కావడంతో పసుపూ బంగారు వర్ణాలు సంతరించుకున్న నీలాకాశ అందాలు సరస్సుల్లో ప్రతిఫలిస్తున్నాయి. అలా చాలాసేపు ఆ సరస్సు దగ్గరే ఉండి, మారుతున్న ఆకాశంలోని రంగుల్నీ హిమశిఖర సౌందర్యాన్నీ చూస్తూ గడిపేశాం. ఎనిమిది గంటలకు చీకట్లు కమ్ముకు రావడంతో రిసార్టుకి వచ్చేశాం. రిసార్టుల్లోగానీ గ్రామాల్లోగానీ కరెంటు ఉండదు. రాత్రి ఏడు గంటల నుంచి పది గంటల వరకూ రిసార్టుల వాళ్లే జనరేటర్ల ద్వారా చిన్న చిన్న బల్బులు వెలిగేలా చూస్తారు. రాత్రి పది గంటలకు ఆ జనరేటర్‌ కూడా బంద్‌ అవుతుంది. రాత్రివేళ ఉపయోగించుకోవడానికి హై పవర్‌ టార్చిలైటు వెంట ఉండాల్సిందే. మౌంటెయిన్‌ సిక్‌నెస్‌ కారణంగా ఆ రాత్రంతా నిద్రలేదు. ట్యాబ్లెట్లు వేసుకుని, రెండు గంటలపాటు ఆక్సిజన్‌ తీసుకోవాల్సి వచ్చింది.

మర్నాడు ఉదయం రిసార్టు కుర్రాడు ఇచ్చిన వేడినీళ్లతో కాలకృత్యాలు ముగించుకుని అల్పాహారం తీసుకుని, ఉదయ కాంతిలో సరస్సు అందాలను మరోసారి తనివితీరా చూసి, తిరుగుప్రయాణమయ్యాం. లేహ్‌ ప్రాంతానికి చేరుకునేసరికి సాయంత్రం ఐదు గంటలయింది. త్సొ మోరిరి, త్సొ కర్‌ ప్రాంతాలకు వెళ్లడానికి ఇన్నోవాను ఏర్పాటుచేసుకున్నాం. మధ్యలో పెట్రోల్‌ దొరకదు కాబట్టి మొత్తం 400 కి.మీ. దూరానికి సరిపడా పోయించుకుని బయలుదేరాం. ఈ సరస్సులకు వెళ్లడానికీ లేహ్‌ పట్టణంలోనే రిస్ట్రిక్టెడ్‌ ఏరియా అనుమతి తీసుకుని బయలుదేరాలి.

ఆరు గంటలకే లేహ్‌ నుంచి బయలుదేరి, ఉప్పి మీదుగా చుమ్‌థాంగ్‌ చేరుకున్నాం. అక్కడ మధ్యాహ్న భోజనం చేసి, కాసేపు విశ్రమించాం. అక్కడ ఓ బౌద్ధ ఆరామం, వేడినీటి బుగ్గలూ ఉన్నాయి. వాటిని సందర్శించి ప్రయాణం కొనసాగించాం. దారిపొడవునా సింధునది మా వెంటే వస్తోంది. అక్కడక్కడా అది గట్లు తెంచుకుని దారికి అడ్డం పడటంతో వాహనాలు కూడా ఆగిపోయాయి. నదీప్రవాహం రోడ్లమీద మూడు అడుగుల ఎత్తు చేరడంతో అసలు అది నదా లేక రోడ్డా అనేది కూడా తెలిసేది కాదు. రక్షణ దళాలు రోడ్లను మరమ్మత్తులు చేస్తున్నా ప్రవాహాన్ని నియంత్రించడం వాళ్ల వల్ల కావడం లేదు. మొత్తమ్మీద ఆర్మీ వాహనాల సాయంతో బయటపడ్డాం.

పష్మీనా గొర్రెలతో...
చుమ్‌థాంగ్‌ నుంచి 60 కి.మీ. ప్రయాణించాక త్సొ మోరిరి సరస్సుకి చేరుకున్నాం. కొంతదూరం ప్రయాణించగానే పష్మీనా జాతికి చెందిన తెల్లని గొర్రెల్ని మేపుతున్న స్థానిక తెగల స్త్రీ పురుషులు కనిపించారు. టిబెట్‌ నుంచి వలస వచ్చిన చాంగ్‌పాస్‌ అనే సంచార తెగ ఇక్కడ నివసిస్తోంది. వీళ్లు వ్యవసాయం కూడా చేస్తారు. ప్రభుత్వ సహకారంతో ఈ పష్మీనా గొర్రెల్ని పెంచి వాటి నుంచి తీసిన బొచ్చుని విక్రయిస్తారు. ఇది ఖరీదైన ఉన్నిగా పేరొందింది. దీంతో చేసే శాలువాలూ దుప్పట్లూ పలుచగా ఉంటాయి. కానీ చలి నుంచి బాగా కాపాడతాయి.

సాయంత్రం ఐదు గంటలకు అక్కడకు చేరుకున్నాం. టెంటులో లగేజీ పెట్టేసి, రిసార్టు వారిచ్చిన కాఫీ తాగి కెమెరాలతో సరస్సు దగ్గరకు చేరుకున్నాం. ఇది మంచినీటి సరస్సు. సముద్రమట్టానికి 15,075 అడుగుల ఎత్తులో ఉంది. దీని చుట్టూ హిమాలయ శ్రేణులు 18 నుంచి 20 వేల అడుగుల ఎత్తులో కనిపిస్తాయి. ఆ మధ్యలో ఉన్న లోయనే రప్‌షు అంటారు. దాని చుట్టూ తిరుగుతూ హిమాలయాల్లో మాత్రమే కనిపించే సూర్యాస్తమయ అందాలను చూస్తూ గడిపేశాం. ఇక్కడ వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం కూడా ఉంది. టిబెట్‌కు చెందిన అడవి గాడిదలైన కియాంగ్‌లు ఈ ప్రాంతానికే పరిమితం. ఎరుపురంగు నక్కలూ, బార్‌ హెడ్‌ బాతులూ కూడా ఇక్కడ కనిపిస్తాయి.

సరస్సు వద్ద పెద్ద ఆర్మీ క్యాంపు ఉంది. అక్కడ ఉన్న గ్రామం పేరు కొర్జొక్‌. పర్యటక రిసార్టులకు ఈ సైనిక క్యాంపు నుంచే రాత్రి ఏడు గంటల నుంచి పది గంటల వరకూ కరెంటు సరఫరా ఇస్తారు. మిగిలిన సమయాల్లో కరెంటు ఉండదు. ఫోను సిగ్నల్స్‌ ఉండవు. ఇవన్నీ లద్దాఖ్‌లో అత్యంత మారుమూల ప్రదేశాలు. రాత్రయ్యేసరికి మెల్లగా తలనొప్పి పెరిగింది. కళ్లు తిరగడం కూడా ప్రారంభమయ్యేసరికి సిలెండర్‌ ద్వారా ఆక్సిజన్‌ను రెండు గంటలపాటు పీల్చాల్సి వచ్చింది.

మర్నాడు ఉదయాన్నే లేచి సరస్సు దగ్గరకు వెళ్లాం. అప్పుడు కనిపించిందో దృశ్యం. దాదాపు మూడు వందలకు పైగా ఉన్న బార్‌హెడెడ్‌ బాతుల గుంపు మేం ఉన్న వైపునకు ఒడ్డుకి రాసాగింది. మేం వాటికి కనిపించకుండా మట్టి దిబ్బల వెనక నిలబడి ఫొటోలు తీసుకున్నాం. ఒక గుంపు తరవాత మరో గుంపు వచ్చింది. అవన్నీ కూడా వలస పక్షులే. వీటికి మనదేశంలోని బ్రీడింగ్‌ సెంటర్లు లద్దాఖ్‌ సరస్సులు మాత్రమే. ఇక్కడే గుడ్లు పెట్టి, పొదిగి వాటికి ఎగరడం నేర్పి తిరిగి తమతోబాటు సైబీరియాకి తీసుకుని పోతాయి. అలా అవి ప్రయాణిస్తున్నంత మేర వెళుతూ తిరిగి అలసిపోయాం. సాయంత్రం నడిచే ఓపిక లేక వాహనంలోనే సరస్సు దగ్గరకు వెళ్లి, సాయం సంధ్యా సమయంలో తళుకులీనే హిమవర్ణ సోయగాలను వీక్షించి ఆనందంగా బసకు చేరుకున్నాం.

ఆ మంచుకొండల్లో మంచు కురవదు!
దాదాపు 130 అడుగుల లోతులో 26 కి.మీ. పొడవూ సుమారు ఐదు కిలోమీటర్ల వెడల్పూ ఉండే త్సొ మొరిరి సరస్సు అందాలను మరోసారి చూసి, మర్నాడు ఉదయాన్నే తిరుగు ప్రయాణమయ్యాం. దారిలో మాహి అనే వంతెన వచ్చింది. అక్కడి నుంచి దారి మళ్లి ప్రయాణిస్తే త్సొ కర్‌ సరస్సు వస్తుంది. అదీగాక సింధునది మేం వచ్చిన దారిని ముంచెత్తడంతో ఆర్మీ వాళ్లు కూడా రూటు మార్చుకుని ఆ దారిలోనే ప్రయాణించారు. మార్గం అంతా గుంతలమయం. రప్‌షు లోయలోని లోతైన సరస్సు ఇది. దీని చుట్టూ 9 చదరపు కిలోమీటర్ల మోరి మైదానం ఉంది. దీని వెనకగా తుగ్‌జి, గర్షన్‌ అనే హిమాలయ పర్వతాలు ఉన్నాయి. అనేక సంవత్సరాల కిందట త్సొ కర్‌ సరస్సు ఈ పర్వతాల వరకూ విస్తరించి ఉండేదట. ఉప్పునీటి సరస్సు కావడంతో చాంగ్‌ పా అనే సంచారజాతి వారు సరస్సు నుంచి ఉప్పును తీసి టిబెట్‌కు తరలించేవారట. చిత్రమైన విషయం ఏంటంటే అక్కడ మంచు కురవదు, వర్షం పడదట. ఉష్ణోగ్రత వేసవిలో 30 డిగ్రీల సెంటీగ్రేడూ, చలికాలంలో -40 డిగ్రీలూ ఉంటుంది.

ఇక్కడ ఓ వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం కూడా ఉంది. అందులో బ్లాక్‌ హెడెడ్‌ కొంగలూ టిబెటన్‌ బాతులూ తోడేళ్లూ నక్కలూ మార్మోట్‌లూ గోధుమరంగు తలతో ఉండే గల్స్‌... వంటి అరుదైన జీవజాతులు ఉన్నాయి. అయితే మేం సరస్సు దగ్గరకు మాత్రం వెళ్లలేకపోయాం. ఎందుకంటే దానిచుట్టూ బురదతో నిండిన నీటి మొక్కలు ఉన్నాయి. అక్కడ కాలేస్తే లోపలకు కూరుకుపోతాయట. పైగా సరస్సు అంతా మంచుతో గడ్డకట్టుకుపోయి ఉంది. అందుకే దూరం నుంచే దాన్ని చూసి వెనుతిరిగాం.



Monday, 10 July 2017

అపూర్వ అమర్‌నాథ్‌ యాత్ర ప్రయాణం

ఏటా ఆషాఢమాస శుక్ల పాఢ్యమి నుంచి శ్రావణమాస శుక్ల పౌర్ణమి వరకు ఈ అమర్‌నాథ్‌ యాత్ర కొనసాగుతుంది. జమ్మూకశ్మీర్‌లోని మంచుకొండల్లో కొలువై ఈ అద్భుత దృశ్యాన్ని తిలకించడం కొత్త అనుభూతి జూన్‌ 29 నుంచి ప్రారంభమవుతుంది. నగరం నుంచి పెద్ద ఎత్తున ఈ యాత్రకు భక్తులు వెళుతుంటారు.

దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు అమరనాథ్‌ యాత్రకు తరలివెళ్తుంటారు. 40 రోజుల పాటు సాగే ఈయాత్రలో మంచుకొండలు, శివనామస్మరణతో మార్మోగుతాయి. అయితే జమ్మూకాశ్మీర్‌లోని అమర్‌నాథ్‌కు అలా వెళ్లడానికి మూడు నెలల ముందే పేర్లను రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలి. వాతావరణం అనుకూలంగా ఉంటేనే యాత్ర సాగుతుంది. యాత్రకు వెళ్లేవారు ఆరోగ్యధృవీకరణ పత్రాన్ని తీసుకోవాలి. అమర్‌నాథ్‌ షరైన్‌బోర్డు అనేక రకాల నిబంధనలతో యాత్రకు అనుమతిస్తుంది. 13 ఏళ్లలోపు పిల్లలు 75 ఏళ్లు దాటిన మహిళలను, గర్భిణిలను యాత్రకు అనుమతించరు. తెలుగురాష్ట్రాల వాళ్లు ఎక్కువగా అమర్‌నాథ్‌యాత్రకు వెళ్తుంటారు.

దరఖాస్తు ఇలా చేసుకోవాలి...
పాతబస్తీ Pathar Gattiలోని S.Y.J Shopping Mallలో జమ్మూకాశ్మీర్‌ బ్యాంకు, సికింద్రాబాద్‌ రాష్ట్రపతిరోడ్‌లో, హిమయతనగర్‌లోని Old MLA క్వార్టర్స్‌ సమీపంలో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకుల్లో యాత్రకు దరఖాస్తు ఫారాలను ఉచితంగా పొందవచ్చు. మే 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. www.shriamarnathjishrine.com వెబ్‌సైట్‌ నుంచి దరఖాస్తులను download చేసుకోవచ్చు. మొదట దరఖాస్తు చేసుకున్న వారికి మొదటి ప్రాధాన్యత ఉంటుంది. దరఖాస్తును పూరించి ఆరోగ్య ధృవీకరణ పత్రాన్ని తీసుకోవాలి. దరఖాస్తుకు 4 పాస్‌పోర్టుసైజు ఫొటోలను జతచేసి బ్యాంకులలో ఇవ్వవచ్చు. దరఖాస్తులను పరిశీలించిన తర్వాత బ్యాంకు అధికారులు కార్డును జారీ చేస్తారు. ఏ తేదీలలో యాత్రకు వెళ్లేది కార్డులలో పొందుపరుస్తారు.

రైళ్లలో వెళ్తే తక్కువ ఖర్చు..
అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లేవారు రైళ్లలో వెళ్తే తక్కువ ఖర్చవుతుంది. కొన్ని ట్రావెల్స్‌ సంస్థలు కూడా ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించాయి. నగరం నుంచి ఢిల్లీ వరకు ఒక రైలులో అక్కడి నుంచి జమ్మూతావీ, ఖత్రా వరకు మరో రైలులో వెళ్లవచ్చు. నగరం నుంచి ఢిల్లీకి స్లీపర్‌క్లాస్‌లో రూ.665ల చార్జీ, ఢిల్లీ నుంచి జమ్మూతావీ, ఖత్రా వరకు స్లీపర్‌క్లాస్‌ చార్జి రూ.360లు. జమ్మూ నుంచి హైదరాబాద్‌కు రాను పోను రూ.2వేలు ఖర్చు అవుతాయి. బ్రేక్‌ జర్నీ టికెట్‌ తీసుకుంటే ఈ ఖర్చు తగ్గుతుంది. జమ్మూతావీ రైల్వేస్టేషన్‌లో RTC బస్సులు, ప్రైవేటు వాహనాలు అందుబాటులో ఉంటాయి. Baltal(బల్టాల్‌), Pahalgam(పహల్‌గావ్‌) నుంచి అమర్‌నాథ్‌గుహ వరకు రెండు వైపులా ప్రయాణానికి గుర్రాలకు రూ.3 నుంచి రూ.8వేల వరకు వసూలు చేస్తారు. బేరం ఆడితే రేట్లు తగ్గిస్తారు. ఎక్కువ లగేజీ ఉంటే అదేస్థాయిలో కిరాయి వసూలు చేస్తారు.

హిమాలయాల్లో తెలుగు భోజనాలు...
అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లే తెలుగు వారికి కొన్ని సంస్థలు ఉచిత భోజన వసతి కల్పిస్తున్నాయి. జూన్‌ 29నుంచి ఆగస్టు 7 వరకు Baltal, Panjtarni(పంచతరణి)లో ఉచిత భోజన కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు సిద్దిపేట జిల్లాకు చెందిన అమర్‌నాథ్‌ అన్నదాన సేవాసమితి గౌరవాధ్యక్షుడు బండ అంజయ్య తెలిపారు. 40 రోజుల పాటూ ఈ అన్నదాన సత్రం కొనసాగుతుందన్నారు. ప్రతిరోజు ఉదయం 5గంటల నుంచి 11 గంటల వరకు నాలుగురకాల టిఫిన్స్‌ , మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు రాత్రి 7 గంటల నుంచి 10.30 గంటల వరకు ఉచిత భోజనం అందజేస్తారు. అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లే భక్తులు మరిన్ని వివరాలకోసం సెల్‌నెం.9440088511, 9848488511లలో సంప్రదించవచ్చు.

బృందాలుగా వెళ్లడం ఉత్తమం...
అమర్‌నాథ్‌ యాత్రకు బృందాలుగా వెళ్తే మంచిది. రిజిస్ట్రేషన్‌ ఫీజు కింద రూ.150లు చెల్లించాల్సి ఉంటుంది. బృందాలుగా వెళ్లేవారికి పోస్టల్‌చార్జీలు అదనంగా వసూలు చేస్తారు. 1నుంచి 5మందికి పోస్టల్‌ చార్జీకింద రూ.50లు, 6 నుంచి 10మందికి రూ.100లు, 11మందినుంచి 15మందికి రూ.150లు, 16మంది నుంచి 20మందికి రూ.200లు, 21మందినుంచి 25మందికి రూ.250లు, 26నుంచి 30మందికి రూ.300లు వసూలు చేస్తారు.

హెలికాప్టర్‌ల ద్వారా గుహకు చేరుకోవచ్చు...
అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లేవారు హెలికాప్టర్‌ల ద్వారా కూడా గుహకు చేరుకోవచ్చు. Baltal - Panjtarni, Pahalgam - Panjtarniల మధ్య ఏవీయేషన్‌ సంస్థలు హెలికాప్టర్‌లను నడుపుతున్నాయి. Baltal-Panjtarniల మధ్య ఒక్కొక్కరికి రూ.2వేలు, Pahalgam - Panjtarni వరుక రూ.4300లు చార్జీలుగా వసూలు చేస్తున్నారు. ఏప్రిల్‌ నెలలో ఆన్‌లైన్‌ ద్వారా హెలికాప్టర్‌ బుకింగ్‌ చేసుకోవచ్చు.

ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో మెడికల్‌ సర్టిఫికెట్లు...
అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లే భక్తులు ఆరోగ్య ధ్రువీకరణపత్రం తప్పనిసరిగా తీసుకోవాలి. నగరంలోని ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులలో అమర్‌నాథ్‌యాత్రకు మెడికల్‌ సర్టిఫికెట్లను జారీ చేస్తున్నారు. ఉస్మానియా ఆస్పత్రిలో ముగ్గురు వైద్యనిపుణులు, గాంధీ ఆస్పత్రిలో నలుగురు వైద్యనిపుణులు ఈ సర్టిఫికెట్లను జారీ చేస్తారు. మెడికల్‌ సర్టిఫికెట్లు, ఏఏ వైద్యపరీక్షలు చేయించుకోవాలో సూచనలు ఉంటాయి. వయస్సును బట్టి పూర్తిస్థాయి రక్త పరీక్షలు, మూత్ర పరీక్ష, చాతి ఎక్స్‌రే, గుండె సంబంధిత ECG, 2D ECHO పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది.

ఈ వస్తువులు తప్పనిసరిగా తీసుకువెళ్లాలి... 

అమర్‌నాథ్‌ యాత్ర ఎముకలు కొరికే చలి వాతావరణంలో సాగుతుంది. Monkey Capలు, Sweatersలు, చేతి గ్లౌజులు, Shoes తప్పనిసరిగా తీసుకెళ్లాలి. చేతికర్ర, టార్చిలైట్లు ఉంచుకోవాలి. అమరనాథ్‌ గుహకు చేరుకునేముందు మూడు కిలోమీటర్లు మంచుమీదనే నడవాల్సి ఉంటుంది. శ్వాసకోస సమస్యలు తలెత్తుతాయి. హారతికర్పూరం తప్పనిసరిగా వెంట తీసుకువెళ్లాలి. చలిబాగా ఉండడం వల్ల చెవిలో దూది పెట్టుకోవాలి. ఈ దూదిని ఇంటి వద్ద నుంచే తీసుకెళ్లడం మంచిది. డ్రైఫ్రూట్స్‌, గ్లూకోజ్‌ వెంట ఉండడం అవసరం. కడుపునొప్పి, విరోచనలు, తలనొప్పి, జ్వరం సంబంధించిన ట్యాబ్‌లెట్స్‌ను వైద్యుడి సలహాతో వెంటతీసుకెళ్లాలి. అమర్‌నాథ్‌ షరైన్‌బోర్డు గుర్రాలు, డోలి నిర్వాకులకు లైసెన్సు కార్డు ఇస్తుంది. గుర్రాలు, డోలిలో వెళ్లే యాత్రికులు అమర్‌నాథ్‌ గుహ వద్దకు వెళ్లగానే ట్యాక్సీ వారి గుర్తింపు కార్డును మన వద్ద ఉంచుకోవాలి. మంచులింగాన్ని దర్శనం చేసుకొని వచ్చేంత వరకు ట్యాక్సీ వారు మన కోసం ఎదురుచూస్తారు. దీని వల్ల మనం తీసుకువెళ్లే సామాన్లు వారు భద్రంగా ఉంచుతారు. లేకపోతే ఇబ్బందులు తప్పవు. అయితే మంచు మీద నడిచే బూట్లను జమ్మూకాశ్మీర్‌లో ప్రత్యేకంగా తయారు చేస్తారు. నగరంలోనే కాకుండా జమ్మూలోనే ఈ బూట్లను రూ.300లోపు రేట్లతో కొనుగోలు చేయవచ్చు.

జూన్‌ 29నుంచి అమర్‌నాథ్‌యాత్ర...
అమర్‌నాథ్‌ యాత్ర ఈ సంవత్సరం జూన్‌ 29నుంచి ప్రారంభమవుతుంది. ఆగష్టు 7వ తేదీ రక్షాబంధన్‌ (రాఖీపౌర్ణమి) వరకు ఈయాత్ర కొనసాగుతుంది. 40 రోజుల పాటు ఈ యాత్ర ఉంటుంది. వాతావరణం అనుకూలిస్తే తప్ప ఈ యాత్రకు అనుమతించరు. జమ్మూకాశ్మీర్‌లోని అమర్‌నాథ్‌ గుహకు చేరడానికి రెండుమార్గాల ద్వారా వెళ్లవచ్చు. Pahalgam నుంచి అమర్‌నాథ్‌ వరకు చేరడానికి 45 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సివుంటుంది. రెండవ మార్గం Baltal గుండా కూడా వెళ్లవచ్చు. ఇక్కడి నుంచి అమర్‌నాథ్‌ గుహ కేవలం 14కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. అయితే ఈ మార్గం అత్యంత క్లిష్టతరమైనది. ఈ యాత్రకు వెళ్లే భక్తులు గుర్రాలు, డోలి లేక కాలిబాటన వెళ్లవచ్చు. Pahalgam నుంచి అమర్‌నాథ్‌ గుహకు కాలినడకన మూడు రోజులు పడుతుంది. మధ్యలో బేస్‌ క్యాంపులు ఉంటాయి. అక్కడ హాల్ట్‌ చేయవచ్చు. అదే విధంగా Baltal నుంచి కేవలం ఒక్కరోజులోనే అమర్‌నాథ్‌ గుహకు చేరుకోవచ్చు.

The Helicopter services from Pahalgam or Baltal is up to Panjtarni which is approximately 5-6 KMs from the Holy Cave Shrine of Shri Amarnath.






మహిమ లింగం


హిమవన్నగములు.. హిమానీ నదాలు.. హిమపాతము.. ఇన్నిటి మధ్య ఆధ్యాత్మిక మహిమను చాటుతూ వెలసిన హిమలింగం.. అమర్‌నాథ్‌! యుగాల కిందట దేవతామూర్తులు దర్శించుకున్న పుణ్యక్షేత్రం. ఏటా లక్షల మంది భక్తులు చూసి తరించే ప్రకృతి శిల్పం.. అమర్‌నాథ్‌! ఒకప్పుడు భక్తి పారవశ్యాల మధ్య సాగిన అమర్‌నాథ్‌ యాత్ర.. ఇప్పుడు ‘భయ’భక్తుల మధ్య సాగుతోంది. ఆ ధవళమూర్తి దర్శనానికి భద్రతా దళాల పహారా అవసరం అవుతోంది. తాజాగా ఉగ్రదాడితో కలకలం మొదలైనా.. శివయ్య దర్శనానికి మాత్రం భక్తులు వెనుకంజ వేయడం లేదు. భారమంతా ఆ లయకారుడి మీద వేసి, వ్యయ ప్రయాసలకోర్చి, యాత్ర కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమర్‌నాథ్‌ విశిష్టత మీ కోసం.

హిమాలయ పర్వత శ్రేణుల్లో వెలిసిన అందమైన గుహ. ఆ గుహాలయంలో గుంభనంగా కనిపించే శుద్ధ స్పటిక రూపం. ఈ హిమలింగం ప్రళయ కాలంలో వెలిసిందని పురాణాలు చెబుతున్నాయి. ప్రాణాలు పోయాక ఆ కైలాసాన్ని చేరుకుంటామో లేదో! అందుకే ప్రాణాలకు తెగించి అపర కైలాసంగా అభివర్ణించే అమర్‌నాథ్‌ క్షేత్రాన్ని దర్శించుకుంటారు భక్తులు. అడుగడుగునా ఇబ్బందులు ఎదురైనా.. వాటిని లెక్క చేయకుండా అమర్‌నాథ్‌ యాత్రకు పూనుకుంటారు.

అమర రహస్యం
అమర్‌నాథ్‌ ముక్తి క్షేత్రం. సముద్ర మట్టానికి 12,756 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ గుహలోనే పరమేశ్వరుడు పార్వతీదేవికి సృష్టి రహస్యాన్ని తెలియజేశాడంటారు. అమ్మవారికి సృష్టి రహస్యాన్ని తెలియజేసే క్రమంలో.. ఇతరులు ఎవరూ వినరాదని తన పరివారాన్ని ఒక్కో ప్రదేశంలో విడిచిపెట్టాడట శివుడు. నందీశ్వరుడిని పహల్గాంలో, శిఖలోని నెలవంకను చందన్‌వాడీలో, శేష్‌నాగ్‌ దగ్గర తన ఆభరణమైన వాసుకిని వదిలివేశాడట. మహాగణేశ పర్వతం దగ్గర వినాయకుడిని, పంచరతన్‌ దగ్గర పంచభూతాలను వదిలిపెట్టాడట. ఒక్క పార్వతిని మాత్రమే గుహ దగ్గరికి తీసుకొచ్చాడట. పార్వతితో ఆనంద లాస్యం చేసి ఆ తర్వాత సృష్టి రహస్యాన్ని తెలియజేశాడట. ఈ రహస్యాన్ని గుహపై ఉన్న ఒక పావురాల జంట విన్నదట. అమర రహస్యాన్ని చెప్పిన ప్రదేశం కావడంతో ఈ క్షేత్రానికి అమర్‌నాథ్‌ అని పేరు వచ్చింది. అంతటి దేవ రహస్యాన్ని విన్న ఆ పావురాలు మృత్యురాహిత్యాన్ని పొందాయని అంటారు. నేటికీ అమర్‌నాథ్‌ ఆలయంలో పావురాలు కనిపించడం విశేషం. పరమశివుడి పరివారం కొలువుదీరిన అమరనాథ్‌ పరిసర ప్రాంతాలు కూడా పుణ్యక్షేత్రాలుగా పరిఢవిల్లుతున్నాయి.

మంచు శిఖరం
ఏడాది పొడుగునా మంచుతో కప్పి ఉంటుందీ క్షేత్రం. ఏటా జూలై-ఆగస్టు నెలల్లో 45 రోజుల పాటు భక్తులకు దర్శన భాగ్యం కలుగుతుంది. గుహ అంతా మంచు పరుచుకుని ఒక వేదికగా కనిపిస్తుంది. దీనిపై ఆద్యంత రహితుడైన శివ రూపం మహిమాన్వితమై మంచు శిఖరంలా దర్శనమిస్తుంది. చంద్రుని వృద్ధి, క్షయాలను సూచిస్తూ.. ఈ లింగాకృతి పెరుగుతూ, తరుగుతూ ఉంటుంది. గరిష్ఠంగా ఆరు అడుగుల ఎత్తుకు చేరుకుంటుంది. ఏటా శ్రావణ పౌర్ణమి నాటితో అమర్‌నాథ్‌ యాత్ర ముగుస్తుంది. ఈ ఏడాది ఆగస్టు 7వ తేదీతో అమర్‌నాథుడి దర్శనానికి తెరపడనుంది.

శతాబ్దాలుగా..
అమర్‌నాథ్‌ క్షేత్ర వైభవం గురించి 11వ శతాబ్దానికి చెందిన కల్హణుడి ‘రాజతరంగిణి’ గ్రంథంలో ప్రస్తావన ఉంది. కశ్మీరదేశ రాణి సూర్యమతి అమరనాథుడికి బాణలింగం, త్రిశూలం కానుకగా సమర్పించుకుందట. నేటికీ అవి ఆలయంలో కనిపిస్తాయి. కశ్మీర రాజులెందరో స్వామిని తమ ఇలవేల్పుగా భావించేవారు. ఏటా అమర్‌నాథ్‌ యాత్ర నిర్వహించి భక్తిప్రపత్తులు చాటుకున్నారు. అమరనాథుడి సేవలో తరిస్తున్న బుటామాలిక్‌ వంశస్థుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వీరు యాత్ర సాగే దారిలో మధ్య మధ్యలో గుడారాలు వేసుకుని యాత్రికులకు వేడి వేడి తేనీరు, వంటకాలు అందిస్తుంటారు. యాత్రికుల నుంచి విరాళాలు తీసుకుని వచ్చిన మొత్తంలో మూడో వంతు తిరిగి భక్తుల అవసరాలకు వెచ్చిస్తారు.

అడుగడుగునా అపాయం..
అమర్‌నాథ్‌ యాత్ర ఎన్నో అనుభూతుల సమ్మేళనం. అకస్మాత్తుగా మారిపోయే వాతావరణం, ఎప్పుడు వచ్చి పడతాయో తెలియని కొండ చరియలు, మరోవైపు పాతాళాన్ని తలపించే లోయలు. ఏమాత్రం ఏమరపాటుగా వ్యవహరించినా ప్రమాదం తప్పదు. ఏ వేళలో ఏం చేస్తారో తెలియని ముష్కర మూక. ఇన్ని ఇబ్బందులు ఉన్నా అమరనాథుడి దర్శనార్థం భక్తులు తండోపతండాలుగా వస్తూనే ఉంటారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా అంతా శివయ్య లీల అనుకుంటూ ముందుకు సాగుతూనే ఉంటారు. ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ ఆధ్యాత్మిక చైతన్యాన్ని పురిగొల్పుతూ ‘బోలేనాథ్‌ అమర్‌నాథ్‌’ అని విశ్వాసంతో యాత్ర పూర్తి చేస్తారు.

ఐదేళ్లు రద్దు
శతాబ్దాలుగా సాగుతున్న అమర్‌నాథ్‌ యాత్ర ఉగ్రవాదుల దుశ్చర్యల కారణంగా ఐదేళ్లపాటు రద్దయింది. ఉగ్రవాదుల నుంచి యాత్రికుల ప్రాణాలకు ముంపు పొంచి ఉండటంతో 1991-95 మధ్యకాలంలో యాత్రను నిలిపివేసింది భారత ప్రభుత్వం. 1996లో యాత్రికులపై కాల్పులు జరపబోమని ఉగ్రవాదులు హామీ ఇవ్వడంతో యాత్రను పునరుద్ధరించారు. తీవ్రవాదుల ధోరణి కారణంగా దశాబ్దకాలంగా అమర్‌నాథ్‌ సందర్శించే యాత్రికుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. 2008లో 5.33 లక్షల మంది అమర్‌నాథ్‌ని దర్శించుకోగా 2016లో అది కేవలం 2.20 లక్షలకే పరిమితమైంది. 2017లో 1.46 లక్షల మంది మాత్రమే అమర్‌నాథ్‌ యాత్రకు ముందుకొచ్చారు.

ఇలా ముందుకు
శ్రీనగర్‌కు 141 కిలోమీటర్ల దూరంలోని పహల్గాం నుంచి అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభం అవుతుంది. ఇక్కడే అమర్‌నాథ్‌ యాత్ర బేస్‌ క్యాంప్‌ ఉంటుంది. పహల్గాం నుంచి అమర్‌నాథ్‌కు 45 కిలోమీటర్లు. బేస్‌క్యాంప్‌ నుంచి బృందాలుగా అమర్‌నాథ్‌ యాత్రకు బయల్దేరుతారు. పహల్గాంకు శ్రీనగర్‌ నుంచి రోడ్డు మార్గాన చేరుకోవచ్చు. ఈ ప్రయాణంలో రహదారికి ఇరువైపులా ఉండే లిడ్డర్‌ నదీపాయలు మనసును ఉల్లాసపరుస్తాయి.(Lidder River)

పహల్గాం నుంచి చందన్‌వాడీ(Chandanwari) మీదుగా యాత్ర సాగుతుంది.
  • చందన్‌వాడీ నుంచి యాత్ర సంక్లిష్టంగా మారుతుంది. ఇక్కడి దుకాణాల్లో డ్రైఫ్రూట్స్‌, చాక్లెట్లు, ఇతర తినుబండారాలు కొనుక్కొని మళ్లీ ప్రయాణం మొదలుపెడతారు. పచ్చదనం పరుచుకున్న కొండల నడుమ ప్రయాణించాలి. చందన్‌వాడీ నుంచి గుర్రాలు, డోలీలు అందుబాటులో ఉంటాయి. మూడున్నర అడుగులు ఉండే దారిలో, కొండ అంచుల వెంట వెళ్లాల్సి ఉంటుంది. కర్ర చేత పట్టుకుని నడుస్తుంటారు.
  • చందన్‌వాడీ నుంచి 11 కిలోమీటర్లు ప్రయాణించాక శేష్‌నాగ్‌ ప్రాంతం వస్తుంది. ఇక్కడ ఐదు కొండలు నాగుపాము పడగల్లా కనిపిస్తాయి.
  • ఈ పర్వతాల చెంతనే ఒక నీలిరంగు తటాకం ఉంటుంది. ఇందులో శంకరుడి ఆభరణం అయిన వాసుకి నిద్రిస్తుందని విశ్వసిస్తారు.
  • శేష్‌నాగ్‌ దగ్గర భక్తులకు బస చేసే సదుపాయం ఉంటుంది. శేష్‌నాగ్‌ నుంచి 18 కిలోమీటర్లు ప్రయాణిస్తే అమర్‌నాథ్‌ వస్తుంది.
  • పహల్గాం, చందన్‌వాడీ నుంచి అమర్‌నాథ్‌కు హెలికాప్టర్‌లో వెళ్లే సదుపాయం కూడా ఉంది.


132

Sunday, 2 April 2017

అమర్‌నాథ్‌ యాత్ర

కశ్మీర్‌ రాజధాని శ్రీనగర్‌కు 145 కిలోమీటర్ల దూరంలో, సముద్ర మట్టానికి 13వేల అడుగుల ఎత్తులో అమర్‌నాథ్‌ గుహలో భక్తులకు దర్శనమిస్తాడు భోళా శంకరుడు. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద గుహల్లో ఒకటి. 150 అడుగుల ఎత్తు, 90 అడుగుల పొడవున్న గుహ ఇది. హిమాలయ పర్వత సానువుల్లో అపురూపంగా, సహజసిద్ధంగా ఏర్పడిన గుహ ఇది. ఏడాదిలో జూలై, ఆగస్టు మాసాలు మినహా మిగతా సమయం అంతా ఈ గుహ పూర్తిగా మంచు కప్పుకుని ఉంటుంది. ఆ సమయంలో మైనస్‌ 5 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది. ఇలాంటప్పుడు గుహను చేరుకోవటం అసాధ్యం.

జూలై వచ్చేసరికి ఇక్కడ వాతావరణం కొద్దిగా వేడెక్కుతుంది. మంచు కరుగుతుంటుంది. దీంతో గుహ స్పష్టంగా కనిపిస్తుంది. కానీ, శివలింగం ఉండే ప్రాంతంలో మాత్రం వాతావరణం ఎప్పటిలాగే ఉంటుంది. 45 రోజుల పాటు శివలింగం చెక్కు చెదరకుండా ఉంటుంది. ఆ తర్వాత క్రమంగా కరిగి అంతర్థానమవుతుంది. విచిత్ర మేమంటే గుహలో శివలింగం ప్రతి ఏటా ఒకే చోట, ఒకే ఎత్తులో ఆవిర్భవిస్తుంది. 90 అడుగుల పొడవైన గుహలో అదే చోట ఎందుకు వెలుస్తుంది. అదే శివ మహత్యం అంటుంటారు భక్తులు.

ఇది మామూలు ప్రయాణం కాదు. ఓ వైపు అత్యంత లోతైన లోయలు, ఇరుకు దారులు, గుర్రాలపై తప్ప వెళ్లలేని ప్రయాణం. అయినా భక్తులు అంత దూరం వెళ్లటానికి సంకోచించరు. అదంతా కేవలం పార్వతీ ప్రియ వల్లభుడిపై ఉన్న భక్తి, కొండంత నమ్మకం.


క్షణంలో మారే వాతావరణం 
ప్రపంచంలోనే అత్యంత కష్టమైన యాత్రల్లో ఒకటిగా పేరొందిన అమర్‌నాథ్‌ యాత్రకు ఏయేటికాయేడు భక్తులు భారీగా పెరుగుతున్నారు. యాత్రకు వెళ్లే వారు చలి నుంచి రక్షణ కోసం మంకీ క్యాప్‌లు, స్వెట్టర్లు, జర్కిన్లు, బ్లౌజ్‌లు, షూ తప్పని సరి. ఎందుకంటే అక్కడ వాతావరణం క్షణాల్లో మారుతుంది. అప్పటికప్పుడే వర్షం పడి కొండ చరియలు విరిగిపడతాయి. దారి మూసుకు పోతుంది. కాళ్లు జారుతూ ఉంటాయి. అందుకే చేతిలో కర్ర, టార్చ్‌లైట్‌ ఎప్పుడూ దగ్గర పెట్టుకోవాలి.

Monday, 14 November 2016

అద్వితీయం... అమరనాథుడి దర్శనం!

“అదో రాతి గుహ... దానిమీదగానీ ఆ చుట్టుపక్కలగానీ ఎక్కడా మంచులేదు. కానీ గుహలోపల ఉన్న శిలావేదికమీద ఏ బ్రహ్మదేవుడో మంచుతో లింగాన్ని చేసి ప్రతిష్ఠించినట్లుగా ధవళకాంతితో వెలిగిపోయే హిమలింగం... మహిమాన్వితమైన శివలింగం. అపురూపమైన ఆ అమరలింగ దర్శనం కోసమే అత్యంత కష్టమైన ఆ యాత్రకు సన్నద్ధమవుతారు భక్తులు... అదే అమరనాథ్‌ యాత్ర...” అంటూ ఆ విశేషాలను వివరిస్తున్నారు కడపకు చెందిన కె.ఎల్‌.సంపత్‌కుమార్‌.

మార్గమధ్యంలో వచ్చే అడ్డంకులన్నింటినీ శివనామస్మరణతో అధిగమించగలమన్న నమ్మకంతో గతేడాది మేం అమర్‌నాథ్‌ యాత్రకు బయలుదేరాం. లింగ రూపంలో ఉన్న శివశక్తిని పూజించడం అంటే పరమశివుడికి ఎంతో ప్రీతికరం అని మహాభారతంలో పేర్కొన్నాడు వేదవ్యాసుడు. ఏటా ఆషాడమాస శుక్ల పాడ్యమి నుంచి శ్రావణమాస శుక్ల పౌర్ణమి వరకూ భక్తులను ఈ యాత్రకు అనుమతిస్తారు. ఈ యాత్ర ఎన్ని రోజుల వరకూ ఉంటుందనేది వాతావరణం మీద ఆధారపడి ఉంటుంది. ఈ ఏడాది జులై రెండు నుంచి ఆగస్టు 29 వరకూ యాత్రకు అనుమతి ఉంది. అంటే 59 రోజులు. అయితే యాత్ర ప్రారంభ దినాల్లో వెళితేనే హిమలింగం పెద్దదిగా దర్శనమిస్తుంది. యాత్ర సమాప్తమయ్యే సమయానికి క్రమంగా మంచు కరిగి లింగాకారం అదృశ్యమైపోతుంది. మేం యాత్ర మొదలుపెట్టిన రెండో రోజునే హిమలింగ దర్శనంకోసం ఏర్పాట్లు చేసుకున్నాం. జనవరి తరవాత ప్రభుత్వం ఈ యాత్రా తేదీలను ఆయా వెబ్‌సైట్లలోనూ పత్రికల్లోనూ ప్రకటిస్తుంది. మనం అమరనాథ్‌జీ ట్రస్టువారి website (www.shriamarnathjishrine.com)లోకి వెళితే అన్ని వివరాలూ తెలుసుకోవచ్చు.

ఖీర్‌ భవానీ...
June 22వ తేదీన బెంగళూరు-నిజాముద్దీను రాజధాని ఎక్స్‌ప్రెస్‌ రైలులో అనంతపురం నుంచి బయలుదేరి 24వ తేదీన దిల్లీకి చేరుకున్నాం. జమ్మూ- కాట్రాలోని వైష్ణోదేవి మాతా దర్శనం చేసుకున్నాం. 27వ తేదీ సాయంకాలానికి బస్సులో శ్రీనగర్‌ చేరాం. మర్నాడు ఉదయాన్నే ఉపాహారం తీసుకుని శ్రీనగర్‌ నుంచి అమరనాథ్‌ యాత్రకు బయలుదేరాం. దారిలో గండర్‌బాల్‌, కంగన్‌, గుండ్‌ మొదలైన గ్రామాలమీదుగా దాదాపు 27 కిలోమీటర్ల దూరంలో ఉన్న తులాములా అనే గ్రామం చేరుకున్నాం. అక్కడి ఖీర్‌భవానీ దేవాలయం కాశ్మీరు ప్రాంతంలోని ప్రసిద్ధ హిందూ దేవాలయాల్లో ఒకటి. సహజమైన ఓ మంచునీటి బుగ్గతో ఏర్పడిన సరస్సు మధ్యలో ఈ ఆలయాన్ని చలువరాతితో నిర్మించారు. గర్భగుడిమీద బంగారు గుమ్మటం చూడ్డానికి ఎంతో బాగుంటుంది. గుడిలోని తులామాయిని పార్వతీదేవి అంశగా బావిస్తారు. ఈ దేవతకు పాయసాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. అందుకే ఈ దేవతను ఖీర్‌ భవానీగా పిలుస్తారు. ఇక్కడి సరస్సులోని నీరు స్వచ్ఛంగా స్ఫటికంలా మెరుస్తూ కనిపిస్తుంది. ఆ నీటి రంగు మారితే కాశ్మీరుకి విపత్తు సంభవిస్తుందన్నది స్థానికుల విశ్వాసం. చివరిసారిగా కార్గిల్‌ యుద్ధ సమయంలో నీరు ఎరుపురంగులోకి మారిందని అంటారు. ఈ దేవాలయ ప్రాంగణంలో చీనార్‌ వృక్షాలు చాలానే ఉన్నాయి. పక్కపక్కనే ఉన్న రెండు చీనార్‌ వృక్షాల శిఖరాగ్రాల మధ్య భారతదేశపటం కనిపిస్తుంటుంది.

బంగారు రాదారి!
ఖీర్‌ భవానీ ఆలయంలో దాదాపు గంటసేపు ఉన్నాం. మధ్యాహ్న సమయానికి శ్రీనగర్‌ నుంచి 84 కిలోమీటర్ల దూరంలో ఉన్న సొనేమార్గ్‌ చేరుకున్నాం. దారి పొడవునా ఓ వైపు సింధు నది, మరోవైపు హర్ముఖ పర్వత శ్రేణులూ... ప్రయాణం ఎంతో ఆహ్లాదకరంగా సాగింది. సోనేమార్గ్‌ అంటే బంగారు పచ్చిక బయళ్లు ఉన్న రహదారి అని అర్థం. ఇది సముద్రమట్టానికి దాదాపు 2730 మీటర్ల ఎత్తులో ఉన్న అత్యంత అందమైన ప్రాంతం. చుట్టూ ఎటు చూసినా పర్వతాలే. వాటి శిఖరాగ్రాలమీద మంచు మెరుస్తూ కనిపిస్తుంది. పూలతో నిండిన ఆల్విన్‌ వృక్షాలూ, చీనార్‌ చెట్లతో నిండిన పర్వతలోయలతో ఆ ప్రాంతం ఎంతో సుందరంగా ఉంది. శిఖరాగ్రాలమీద ఉన్న మంచు కరిగి చిన్న చిన్న జలపాతాలు ఏర్పడి చూపరులను కట్టిపడేస్తుంటాయి. ఇక్కడి గడ్సర్‌, సట్సర్‌ సరస్సులు ఎంతో నిర్మలంగా ఉంటాయి. ఇక్కడి తేజివ్యాస్‌ అనే హిమానీనదం వేసవికాలంలో పర్యటకులకు అద్భుతమైన విడిదిగా చెప్పవచ్చు. ఇక్కడి నుంచే లఢక్‌కు వెళ్లే జోజిల్లా లోయ మార్గం ప్రారంభమవుతుంది. ఇక్కడి సింధునదీ తీరాన ఉన్న ఓ హోటల్‌లో భోజనం చేసి సాయంకాలం నాలుగు గంటలకు బాల్టాల్‌ అనే గ్రామం చేరుకున్నాం. అమరనాథ గుహ చేరడానికి ఇదే మా బేస్‌ క్యాంపు.

పవిత్రగుహను చేరాలంటే...
ఆ పవిత్ర గుహను చేరడానికి రెండు మార్గాలున్నాయి. మొదటిది పహల్‌గావ్‌ను బేస్‌క్యాంపుగా చేసుకుని వెళ్లేది. రెండోది బాల్టాల్‌ మీదుగా వెళ్లేది. పహల్‌గావ్‌ మార్గంలో గుహను చేరడానికి 47 కిలోమీటర్లు ప్రయాణించాలి. పరమశివుడు పార్వతీదేవిని ఈ మార్గం ద్వారానే తీసుకెళ్లి గుహలో తన అమరకథను వినిపించాడనీ, ఈ పహల్‌గావ్‌ దగ్గర తన వాహనమైన నందీశ్వరుడిని వదిలి నడక ద్వారా గుహను చేరాడనీ పురాణ కథనం. పహల్‌గావ్‌ నుంచి దాదాపు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న చందనవాలీలో పరమశివుడు తన శిఖలోని చంద్రవంకని వదిలాడని అంటారు. అక్కడే మొదటిరాత్రి మజిలీ చేస్తారు. తరవాత 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న శేషనాగ్‌ అనే సరస్సు ఒడ్డున శివుడు తన ఆభరణాలైన సర్పాలను వదిలాడట. అక్కడే రెండో రాత్రి మజిలీ. తరవాత మార్గంలో ఉన్న మహాగుణాస్‌ అనే పర్వతశిఖరాన వినాయకుడినీ, పంచతరణి వద్ద పంచ భూతాలనూ విడిచాడనీ అంటారు. ఇక్కడే మూడో మజిలీ. శంకరుని శిరస్సులోని ఐదు పాయల నుంచి జలధారలు ఐదు నదులుగా బయటకు వచ్చి ఏకనదిగా ప్రవహించాయనీ, అదే ఈ పంచ తరణి అనీ అంటారు. మహాగుణాస్‌ పర్వతశిఖరం ఎత్తు 14,800 అడుగులు. అక్కడ ఆక్సిజన్‌ సాంద్రత చాలా తక్కువ. కాబట్టి యాత్రికులు ఆరోగ్యవంతులైతేనే ఈ యాత్రకు బయలుదేరాలి. పంచతరణి నుంచి నాలుగోరోజున ఏడు కిలోమీటర్లు నడిస్తే అమరనాథగుహ వస్తుంది. దారిలో పంచతరణి, అమరావతి అనే నదులు కలిసే ప్రాంతం వస్తుంది. దీన్ని సంగం అని వ్యవహరిస్తారు. ఇక్కడే పరమశివుడు పార్వతీదేవి సమేతంగా స్నానం చేసి గుహలోకి ప్రవేశిస్తాడు. ఎవరూ తన అమరకథను వినకూడదనే ఉద్దేశంతో గుహ చుట్టూ కాలాగ్నిని సృష్టించాడనీ దాంతో గుహ చుట్టూ ఉన్న ప్రాంతం భస్మమైందనీ అంటారు. అందుకే ఇప్పటికీ గుహ చుట్టూ ఉన్న నేల తెల్లగా భస్మం రూపంలో ఉంటుంది. అలాంటి ఏకాంత ప్రదేశంలో శంకరుడు తన అమరకథను పార్వతీదేవికి వినిపించాడు. కానీ యాదృచ్ఛికంగా కాలాగ్నికి భయపడి ఆ గుహలో తలదాచుకున్న పావురాల జంట, ఆ కథను విని అమరత్వం పొందాయన్నది పౌరాణిక కథనం. ఇప్పటికీ ఆ పావురాల జంటను అక్కడ చూడవచ్చు.

బాల్టాల్‌ మార్గంలో...
దగ్గరదారి కావడంతో మేం బాల్టాల్‌ మార్గాన్ని ఎంచుకున్నాం. సాయంకాలం నాలుగు గంటలకు మా బస్సు బాల్టాల్‌ చేరింది. అక్కడ మాకు మా ట్రావెల్‌ ఏజెన్సీవారు ముందుగా ఏర్పాటుచేసిన టెంట్లలో వసతి కల్పించారు. అక్కడకు వెళ్లే సమయానికే దేశం నలుమూలల నుంచీ వచ్చిన స్వచ్ఛంద సేవాసంస్థల సభ్యులు ఉన్నారు. వాళ్లు యాత్రికుల సౌకర్యార్థం ఎన్నో ఉచిత భోజనశాలలు ఏర్పాటు చేశారు. వీటినే ‘భాండార్‌’లని పిలుస్తారు. మేమంతా అక్కడే తిన్నాం. ఖమ్మం జిల్లా నుంచి వచ్చిన ఓ సేవా సంస్థ గత 14 సంవత్సరాలుగా ఓ ఉచిత భోజనశాలను నిర్వహిస్తోంది. అక్కడ నుంచి అమరనాథగుహ దూరం 14 కిలోమీటర్లు. మా బృందంలోని 36 మంది యాత్రికుల్లో 28 మంది డోలీల్లోనూ, ఏడుగురు గుర్రాలమీదా, ఒకరు మాత్రం కాలిబాటనా వెళ్లడానికి నిశ్చయించుకున్నారు. మర్నాడు వేకువజామునే మేం కాలకృత్యాలు తీర్చుకుని, దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలోని డొమాయిల్‌లో ఉన్న నీల్‌గ్రధ్‌ ప్రవేశద్వారం వద్దకు చేరుకున్నాం. ఉదయం అయిదు గంటల సమయానికి ఆ ప్రవేశద్వారాలు తెరిచారు. మా యాత్రా పర్మిట్లను పరిశీలించి అక్కడి సరిహద్దు రక్షణ సిబ్బంది మమ్మల్ని అమరనాథయాత్రకు అనుమతించారు. వెళ్లేదారిలో మంచినీళ్లూ, కాఫీ, టీలూ, తినడానికీ దొరుకుతాయి. ఎక్కడ మంచుపడుతుందో ఎప్పుడు వాన కురుస్తుందో తెలియదు కాబట్టి రెయిన్‌కోట్లూ, గొడుగులూ, ఉన్నిదుస్తులూ తీసుకెళ్లడం శ్రేయస్కరం. దారిపొడవునా సైనిక సిబ్బంది ఉంటారు. ఎత్తుకు వెళ్లేకొద్దీ మంచు ముసుగేసుకున్న పర్వతశిఖర సౌందర్యాన్ని చూడ్డానికి రెండు కళ్లూ చాలవు. దారిపొడవునా హిమానీ నదాలూ, నదులూ, చిన్న చిన్న జలపాతాలూ పలకరిస్తూ ఆహ్లాదాన్ని పంచిస్తాయి. నాలుగున్నర కిలోమీటర్ల దూరం గడ్డకట్టిన మంచుమీదే నడవాల్సి వచ్చింది. దాదాపు పది గంటల సమయానికి సంగం చేరాం. ఢోలీలో వెళ్లినా, గుర్రాలమీదెక్కినా అందరూ కూడా సంగం దగ్గర నుంచి రెండున్నర కిలోమీటర్లు నడవాల్సిందే. సంగం నుంచి రెండున్నర కిలోమీటర్లు నడిచాక సుమారు 300 మెట్లు ఎక్కి ఆ పవిత్రగుహను చేరుకున్నాం. ఇది సముద్రమట్టానికి సుమారు 13,000 అడుగుల ఎత్తులో ఉంది. 60 అడుగుల పొడవూ, 30 అడుగుల వెడల్పూ, 15 అడుగుల ఎత్తూ ఉన్న ఆ గుహలోకి వెళ్లగానే కనిపించిన ఆ హిమలింగం, మమ్మల్ని భక్తిపారవశ్యంలో ముంచెత్తింది. దానికి పక్కనే మంచుతో ఏర్పడిన మరో రెండు చిన్న విగ్రహాలు కూడా కనిపించాయి. వీటిని పార్వతీదేవి, గణేశ మూర్తులుగా భావిస్తారు. ఆ పవిత్ర అమరనాథ గుహలో ఓ పావురాల జంటను చూశాం. నిజంగా సముద్రమట్టానికి అంత ఎత్తైన ప్రదేశంలో ఆ మంచు శిఖరాల మధ్య, సంవత్సరంలో దాదాపు 10 నెలలపాటు మనుష్య సంచారమే లేని చోట, ఆ పావురాలు అక్కడ ఉండటం ఆశ్చర్యకరమే. ‘ఏ జన్మ పుణ్యఫలమో ఆ అమరలింగేశ్వరుని దర్శించుకోగలిగాం’ అన్న సంతృప్తితో మేం వెనుతిరిగి సంగం వద్దకు వచ్చేసరికి మధ్యాహ్నం ఒంటిగంట అయింది. బాల్టాల్‌ చేరేసరికి సాయంత్రం ఆరుగంటలు... ఆ రాత్రికి అక్కడే విశ్రాంతి తీసుకుని మర్నాడు ఉదయమే బస్సులో శ్రీనగర్‌కు తిరిగివచ్చాం.

Friday, 10 June 2016

ఆద్యంతం మహాద్భుతం – అమర్‌నాథ్‌ ప్రయాణం

నాకు ప్రయాణాలు చెయ్యడం, కొత్త ప్రాంతాలు చూడడం చాలా ఇష్టమైన పనులు. ప్రయాణాలకి ఆఘమేఘాల మీద రడీ అయిపోతాను. అందులోను హిమాలయాల్లోకి పయనం అంటే ఇంక ఆలోచించేదే ముంది? అమర్‌నాథ్‌ ప్రయాణం అనుకోకుండా, హఠాత్తుగా సంభవించింది. నా సహచరుడితో పాటు నా తమ్ముడు, అతని భార్య, వాళ్ళ అక్క కూడా వచ్చారు. శ్రీనగర్‌, అమర్‌నాథ్‌ చాలా చలి ప్రాంతాలు కాబట్టి బోలెడంత ఉలెన్‌ సామగ్రితో శుక్రవారం ఉదయం మా ప్రయాణం మొదలైంది. ఢిల్లీ వెళ్ళి అక్కడి నుండి శ్రీనగర్‌ బయలుదేరాం.

నాకు ఢిల్లీ నుండి శ్రీనగర్‌ వెళ్ళే దారిలో కనబడే హిమాలయాలు చూడడం చాలా ఇష్టం. హిమాలయాల మీద నుంచి విమానం వెళుతున్నపుడు, మంచుతో కప్పబడిన, మహాత్తుంగ పర్వతశ్రేణులు, లోయలు, ఆ లోయల్లోని ఆవాసాలు చూస్తున్నప్పుడు మనసు దూదిపింజెలాగా ఎగిరి, ఆ హిమాలయాలమీద తిరుగాడుతుంది. అయితే ఈసారి కొండలన్నీ నిజరూపాన్ని ప్రదర్శించాయి తప్ప ఒక్క పిసరు కూడా మంచు లేదు. పర్వతశ్రేణులు ఠీవిగా నిలుచున్నాయి శుభ్రంగా స్నానం చేసినట్టు. అది వేసవి కావడం వల్ల మంచు మొత్తం కరిగిపోయింది. నా మనసు కూడా నీరయి పోయింది మంచు కనబడక.

చలితో గడగడలాడిపోతాం కాబోలు, శ్రీనగర్‌ అంటే చలి కదా అనుకుని భుజాలమీద శాలువాలు తగిలించుకున్న మాకు శ్రీనగర్‌ ఎయిర్‌పోర్టులో ఎర్రటి ఎండ ఈడ్చికొట్టింది. చురచురా కాలుస్తున్న ఎండ, ఇది శ్రీనగరా, జమ్మూనా అనే అనుమానాన్ని కలిగించింది. అంత వేడిగా వుందన్నమాట. హమ్మో! ఇంత ఎండేంటిరా బాబూ అని ఆపసోపాలు పడుతూ మా గెస్ట్‌హౌస్‌ చేరాం. అక్కడి వాతావరణం మమ్మల్ని కొంత సేదతీర్చింది. చుట్టూ కనబడే పచ్చటి, ఆకాశమంత ఎత్తు ఎదిగిన చీనార్‌ చెట్లు, గెస్ట్‌హౌస్‌ను ఆనుకుని ప్రవహించే జీలం నది మీంచి వచ్చే చల్లగాలి తగలగానే ఎండ, గిండ అంతా మర్చిపోయాం. శ్రీనగర్‌లో చినార్‌ మహావృక్షాలు చాలా అందంగా వుంటాయి. వందల సంవత్సరాలున్న అతిపెద్ద చెట్లు కూడా కనబడతాయి.

శ్రీనగర్‌ కొంత ప్రశాంతంగానే వున్నట్లు కనబడింది. క్రితం సంవత్సరం అల్లర్లతో అట్టుడుకింది కానీ ప్రస్తుతం మామూలుగానే వుంది. భద్రతా దళాలు కూడా తగ్గినట్లనిపించింది. ఇంతకుముందు అడుగడుగునా పోలీసుతో, సిఆర్‌ఫిఎఫ్‌ వాళ్ళో, బిఎస్‌ఎఫ్‌ వాళ్ళో కనబడే వాళ్ళు ప్రస్తుతం అక్కడ జీవితం ప్రశాంతంగా వుందన్న భ్రమ అయితే కలిగింది. మేము శ్రీనగర్‌లో చూడాల్సినవన్నీ ఆ రోజు సాయంత్రమే చూసేసాం. ముఖ్యంగా ఆపిల్‌ గార్డెన్‌లో చిన్నపిల్లలమే అయ్యాం. విరగకాసిన ఆపిల్‌ పండ్లు కనబడగానే ఆ గార్డెన్‌లోకి చొరబడి బోలెడన్ని ఫోటోలు దిగాం. శ్రీనగర్‌లో ఎనిమిదైనా చీకటి పడదు. ఎనిమిదన్నర రాత్రివేళ పగలే తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంది. మర్నాడు తొందరగా లేవాలి కాబట్టి తిరిగి గెస్ట్‌హౌస్‌కి వచ్చేసాం.

అమర్‌నాథ్‌ యాత్రకి వెళ్ళిన వాళ్ళలో బహుశా నేనే ఎలాంటి భక్తి భావనలు లేకుండా, ఒక అడ్వంచర్‌ యాత్రలాగా వెళ్ళానేమో అనిపించింది. ఎందుకంటే ఆ ప్రయాణం చాలా కఠినతరమైంది. అడుగడుగునా ప్రమాదం వుంది. భక్తి పారవశ్యంలో మనుష్యులు సాధారణంగా శరీర కష్టాన్ని లెక్క చేయరు. దేవుడి కోసం ఎలాంటి కష్టాన్నయినా భరించేస్తారు. నేను మాత్రం అమర్‌నాథ్‌ యాత్రని ఒక సాహసయాత్రగానే చూసాను. నాకు తెలుసు ఆ మంచు శివలింగం ఎలా ఏర్పడుతుందో. అదొక ప్రకృతిపరమైన అద్భుతం. అంతే.

మర్నాడు ఉదయం నాలుగు గంటలకి మేము ఇనోవాలో వున్నాం. మామూలుగా అయితే ఆ వేళపుడు చలి గడగడలాడించేస్తుంది. వొళ్ళంతా ఉలెన్‌ కప్పుకుంటే కానీ తట్టుకోలేం ఆ చలిని. కానీ అంత విపరీతమైన చలేమీ లేదు. ప్లెజంట్‌గా, హాయిగా వుంది. రోడ్డుకిరువైపులా బారులు తీరిన చీనార్‌ చెట్లు, ఎత్తైన పర్వత సముదాయం కళ్ళకి పండగ చేస్తుంటే మా వాహనం వేగంగా బాల్డాక్‌ వేపు దూసుకెళుతోంది. శ్రీనగర్‌ దాటి బయటకు వచ్చేస్తుంటే దర్శనమిచ్చింది సింధూ నది. ఆ ఉరవళ్ళు, పరవళ్ళు చూసితీరాల్సిందే. హిమాలయన్‌ రేంజస్‌. మహోత్తుంగ శ్రేణులు. ఆ కొండల్లోంచి జాలువారే అసంఖ్యాకమైన జలపాతాలు, అంతెత్తు కొండల్లోంచి వేగంగా ఉరికొస్తూ సింధూనదిలో లీనమయ్యే దృశ్యాలు మనల్ని రెప్ప వేయనీయవు. అమర్‌నాథ్‌ చేరేవరకు సింధు మనతోనే వుంటుంది. మనతో పాటే ప్రయాణం చేస్తుంది. ఒక చోట సన్నటి పాయలాగా, మరోచోట మన ఊళ్ళో కాలువలంత విశాలంగా, ఉధృతిగా ప్రవహిస్తుంటుంది. ఆ ప్రవాహవేగం నునుపు దేలిన రాళ్ళమీద గలగల సంగీతాన్ని ఆలపిస్తుంటుంది. ఆ ఉదయపువేళ, సింధునది సంగీతాన్ని వింటూ మోహపరవశులం కావాల్సిందే. అక్కడక్కడా మంచుటోపీలు పెట్టుకున్న పర్వశ్రేణులు, మంచుకరుగుతూ దిగువకు జాలువారే జలపాతాలు, ఆ జలపాతాల్ని ఆత్మీయంగా తనలో లీనం చేసుకునే సింధునది, ఆ పర్వతాల విశాలత్వం ముందు మనం మరుగుజ్జులమే అవుతాం. అపురూపమైన దృశ్యాలలో మునిగి తేలుతూ, ఆ సౌందర్యాన్నంతటిని ఔపోసన పట్టేయ్యాలన్నంత ఆత్రంతో కన్నురెప్పవేయకుండా కూర్చున్నాను నేను. మనస్సంతా మహా సంతోషంతో నిండిపోయింది. గుండెల్లోంచి రక్తం బదులు గాఢమైన అనుభూతి పొంగిపొర్లుతోంది. నేను మనిషిని మాత్రమే వాహనంలో వున్నాను. నా మనసు ఆ కొండల్లో తిరుగుతోంది. ఆ మంచులో పొర్లుతోంది. ఆ జలపాతాల్లో స్నానిస్తోంది. చల్లటి నదిలో ఈత కొడుతోంది.

నేను ఇలాంటి మానసిక స్థితిలో మునిగివుండగానే బాల్టాక్‌ వచ్చేసింది. నా కళ్ళు కూడా నేలమీదకొచ్చాయి. ఒక నిర్మానుష్య, నిరామయ స్థితిలోంచి మనుష్యులు, వాహనాలు కిటకిటలాడే స్థలంలోకి హఠాత్తుగా వొచ్చిపడ్డాం. హెలికాప్టర్ల రొద, గుర్రాల సకిలింపులు. అసంఖ్యాకంగా వెలసిన టెంట్లు, ఆప్రాంతమంతా సందడిగా, పెద్ద సంతలాగా వుంది. మేము వాహనం దిగి బయటకు రాగానే చలిగాలి గిలిగింతలు పెట్టింది. బ్యాగుల్లో వున్న ఉలెన్‌ అంతా వొంటిమీదికి చేరిపోయింది. సడన్‌గా వర్షం పడుతుంది అంటే రెయిన్‌ కోటుకూడా వాటికి తోడయ్యింది. బ్యాగుల్లో దాదాపు ఐదు కిలోల బరువు తగ్గిపోయి, మా శరీరాలు హఠాత్తుగా ఐదు కిలోలు బరువు పెరిగిపోయాయి. చుట్టూపరుచుకున్న సౌందర్యాన్ని చూస్తూ నిలబడ్డాం. మూడు హెలికాప్టర్లు జనా న్ని మోసుకువెళుతున్నాయి. ఇట్టేవెళ్ళి అట్టే తిరిగొస్తున్నాయి.

ఓ అరగంట తర్వాత మా వంతుకూడా వచ్చింది. హెలికాప్టర్‌లో ఎక్కేముందే మా బరువు చెక్‌చేసారు. అందరం బరువు పెరిగాం. సంతోషంలో ఉబ్బిపోయామనుకుంటా అని నేనంటే అందరూ నవ్వారు. ఒక్కొక్కళ్ళకి ఐదు వేలు వసూలు చేసారు హెలికాప్టర్‌ వాళ్ళు. ఇంజన్‌ ఆపకుండానే హడావుడిగా ఎక్కిస్తున్నారు. విపరీతమైన గాలి. మేము కూడా పరుగులెడుతూ వెళ్ళి కూర్చున్నాం. హెలికాప్టర్‌ గాల్లోకి లేచింది. కొండల మధ్యనుంచి వెళుతుంటే కింద సింధునది కనిపిస్తుంది. కొండల అంచులో గుర్రాలమీద వెళుతున్నవాళ్ళు, నడుస్తున్న వాళ్ళు చీమల బారుల్లా కన్పిస్తున్నారు. ఏడు నిమిషాల్లో హెలికాప్టర్‌ గమ్యం చేరింది. మేము దిగుతుంటే ఎవరో కామెంట్‌ చేసారు. “వీడిదుంపతెగ ఐదువేలు తీసుకుని అయిదు నిమిషాలైనా తిప్పలేదు” అని. ఎక్కి కూర్చుని సర్దుకోగానే దిగండి, దిగండి అంటూ హెచ్చరికలు. ఉరుకులు పరుగులతో హెలికాప్టర్‌ దిగి, మాకోసం ఎదురుచూస్తున్న పోలీస్‌ ఆఫీసర్‌ దగ్గరకు నడిచాం. అతను తెలుగువాడు. రండి రండి అంటూ మమ్మల్ని ఆహ్వానించి C.R‌.P.F‌. వాళ్ళ కేంప్‌ ఆఫీసులోకి తీసుకెళ్ళాడు. అక్కడ చలి ఎక్కువగానే వుంది. మేము కూర్చోగానే విలటరీ దుస్తుల్లో వున్న వ్యక్తి మాకు వేడి వేడి టీ తెచ్చి ఇచ్చాడు. ఆ చలిలో టీ తాగడం హాయిగా అన్పించింది. కేంప్‌లో వున్న ఆఫీసర్‌ మాకోసం గుర్రాలను మాట్లాడటం కోసం, గుర్రాల యజమానులను పిలిపించాడు. అక్కడినుండి ఆరు కిలోమీటర్లు కొండలపైన గుర్రాలమీద వెళ్ళాలి. అదికూడా అమర్‌నాథ్‌ గుహవరకు తీసుకువెళ్ళరు. అక్కడ మళ్ళీ నిటారుగా వుండే మెట్లెక్కాలి. ఒక్కొక్కరికి 800/- రూపాయలవుతుందని ఆయన మాకు వివరించాడు. మేము సరే అన్నాం. గుర్రాల వాళ్ళు గుర్రాలు తేవడానికి వెళ్ళారు. ఆఫీసర్‌ మాతో అక్కడి విశేషాలు మాట్లాడుతూ సడన్‌గా ఓ మాటన్నాడు. ఆ మాట వింటున్న వాళ్ళ గుండె ఝల్లుమంది. వెన్నులోంచి భయం జరాజరా పాకినట్లయింది. ఆయన హిందీలో ఇలా అన్నాడు. “గుర్రాలలో సూసైడల్‌ టెండన్సీస్‌ ఇక్కడ చాలా ఎక్కువ. అవి చనిపోవాలనుకుంటే తల పక్కకు వాల్చేస్తాయి. లేదా దేనికైనా తలను కొట్టుకుంటాయి. అపుడు గుర్రంతో పాటు దాని మీద ప్రయాణించేవారికి చాలా రిస్క్‌. ఇటీవల ఒకామెని మోసుకెళుతున్న గుర్రం హఠాత్తుగా చనిపోయి కిందికి పడిపోయింది. దాని మీద కూర్చున్న మహిళ శవం కూడా దొరకలేదు. కొండల్లో మంచులో ఎక్కడికో జారిపోయింది.” అన్నాడు. నేను వెంటనే “వాట్‌ ఈస్‌ ది ప్రికాషన్‌” అంటే “నథింగ్‌” అన్నాడు. ఆ మాటలు విని అందరూ జడుసుకున్నట్టు ముఖాలు పెట్టారు. ఈ లోపు గుర్రాలొచ్చాయి. ఆయనకి థాంక్స్‌ చెప్పి టెంట్‌ లోంచి బయట పడ్డాం. గుర్రాలెందుకు ఆత్మహత్య చేసుకుంటాయా అని ఆలోచిస్తూ, మాకోసం మాట్లాడిన గుర్రాలవేపు నడిచాం.

అమర్‌నాథ్‌కి అసలైన ప్రయాణం మొదలైంది. గుర్రమెక్కడం కష్టమే. నా గుర్రం నడిపే వ్యక్తి పేరు షరీఫ్‌. గుర్రం పేరు రాజా. షరీఫ్‌ సహాయంతో గుర్రమెక్కగలిగాను. అతను నన్ను పట్టుకుని కూర్చోబెట్టి, కాళ్ళకు రింగులు తొడిగాడు. రాజా మీద నా స్వారీ మొదలైంది. నాలుగడుగులు వేసేసరికి ఒళ్ళంతా కదిలిపోవడం, ఓ పక్కకి జారిపోవడం. హమ్మో! ఆరు కిలోమీటర్లు దీనిమీద కూర్చోవాలా? అన్పించేలా గుర్రం మీద ప్రయాణం మొదలైంది. జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేని ప్రయాణమది.

కొండవాలు మీద ఏమాత్రం ఎడ్జ్‌ లేని చోట గుర్రం, దాని పక్కనే షరీఫ్‌ నడుస్తున్నారు. కిందికి చూస్తే కళ్ళు తిరిగేంత లోతైన లోయ. ఆ లోయలో ఉధృతంగా ప్రవహిస్తున్న సింధునది. గుర్రం కాలు జారితే నేరుగా పడేది నదిలోనే. మధ్యలో కొండల్లో కూడా పడొచ్చు. ప్రయాణం సాగుతున్నంతసేపు ఫరీఫ్‌ కబుర్లు చెబుతూనే వున్నాడు. సలహాలిస్తూనే వున్నాడు. “ఆప్‌ నీచే మత్‌ దేఖో! ఊపర్‌ దేఖో! ఆస్మాన్‌ కితనా సుందర్‌ హై! పహాడ్‌ కితనా సుందర్‌ హై. ఉస్‌ కో దేఖో! నీచే మత్‌ దేఖో (కింది లోయలోకి చూడొద్దు. పైన ఆకాశం కొండలు చాలా అందంగా వుంటాయి. వాటిని చూడు గానీ కిందికి అస్సలు చూడకు.) అంటూ నాకు కౌన్సిలింగ్‌ లాంటిది చేస్తూనే వున్నాడు. కానీ నా దృష్టి లోయమీదే. గుర్రం ఎత్తులెక్కుతున్నపుడు వెనక్కి వాలమని, కిందికి దిగుతున్నపుడు ముందుకు వొంగమని చెబుతాడు. గుర్రాలు నడిపే వాళ్ళందరి గొంతులోంచి ‘పీఛే’, ‘ఆగే’ అనే మాటలు ఆగకుండా వినిపిస్తూనేవుంటాయి. గుర్రం పెద్ద పెద్ద బండరాళ్ళమీద కాళ్ళేసి పైకి ఎక్కుతున్నప్పుడు, వాలులోంచి కిందికి దిగుతున్నపుడు మన ప్రాణాలు అరచేతిలోకి వస్తాయి. ఎన్నోసార్లు ఇంక మనపని అయిపోయింది. పడిపోతాం అనిపిస్తుంది. మంచు మీద, మంచు కరిగిన చిత్తడి మీద గుర్రం నడుస్తున్నపుడు చాలా భయమని పిస్తుంది. ఇంతెత్తు బండల మీద షరీఫ్‌ గుర్రాన్ని ఎక్కిస్తున్నపుడు, కిందికి దిగుతున్నపుడు నేను అమ్మో! అంటూ చాలా సార్లు అరిచాను. అతను నన్ను ఒకచేత్తో పట్టుకుని జారిపోకుండా చాలాసార్లు సాయం చేసాడు.

సన్నటి కాలి బాట లాంటి దారి మీదే పోయే గుర్రాలు వచ్చే గుర్రాలు. నడిచేవాళ్ళు. ఒక్కోసారి అటు యిటు గుర్రాలు నడిచేదారిలేక ఆగిపోయేవి. మా గుర్రం కొండ అంచుమీద నిలబడి పోయేది. కిందికి చూస్తే కళ్ళు తిరిగినంత పనవుతుంది. మెల్లగా క్రాస్‌ చేసి బయలు దేరేవి. చుట్టూ ఉత్తంగ హిమాలయ పర్వతాల శ్రేణులు. కొన్ని మంచుతో కప్పబడి, ఎండపడి ధవళవర్ణంలో మెరిసిపోయేవి. నీలం రంగు ఆకాశం. స్వచ్ఛంగా అక్కడక్కడా కొండలమీద కూర్చున్న నల్లమబ్బులు. ప్రకృతి సౌందర్యాన్ని తనివితీరా ఎంజాయ్‌ చేద్దామంటే, కూర్చున్నది గుర్రం మీదాయే! పడకుండా గట్టిగా పట్టుకుని కూర్చోవడానికే కష్టంగా వుంది. సగం దూరం నడిచాక, కొన్ని ఎత్తులెక్కి, కిందికి దిగి భయంతో గడగడలాడాక ప్రయాణం అలవాటైంది. ఏమవుతుందిలే. కిందపడతాం. కానీయ్‌. అంతమంది వెళుతున్నారు. నేనెందుకు భయపడాలి. ఎంజాయ్‌ ద ట్రిప్‌. చుట్టూ అపరిమితమైన సౌందర్యం. చూడు. మళ్ళీ ఛాన్సు రాదు.’ సెల్ఫ్‌ కౌన్సిలింగ్‌ ఇచ్చుకుంటూ, షరీఫ్‌ పాడుతున్న కాశ్మీరీ పాటలు ఎంజాయ్‌ చెయ్యడం మొదలుపెట్టాను. అతనితో కబుర్లు చెప్పసాగాను. అతను తన గుర్రం గురించి విశేషాలు, అమర్‌నాథ్‌ యాత్ర విశేషాలు, తనొకసారి వైజాగ్‌ వచ్చానని, వైజాగ్‌కి మూడు పేర్లున్నాయి కదా అని విశాఖపట్టణం, వైజాగ్‌, వాల్తేర్‌ అంటూ చెప్పి నన్ను ఆశ్చర్యంలో ముంచెత్తాడు. తానెంత మంది ఆంధ్రా ప్రయాణికుల్ని తన గుర్రం మీద తీసుకెళ్ళాడో చెప్పాడు. ఇలా కబుర్లలో మునగడం వల్ల మనసులో బిగపట్టిన భావమేదో, భయం కావొచ్చు సడలినట్లయింది. కానీ ఆ కొండలవాలు మీద, గుర్రం మీద ప్రయాణం మాత్రం అత్యంత ప్రమాదకరమైందే. చాలా రిస్క్‌తో కూడుకున్నది. ప్రాణాలకు తెగించి ప్రయాణం చెయ్యడమే. బహుశ భక్తితో వచ్చేవాళ్ళ మనసులో ఒక భావన ఉండొచ్చు! ఇట్లాంటి చోట చనిపోయినా ఫర్వాలేదు. విధిని నమ్మేవాళ్ళు మాత్రం ఎలా రాసిపెట్టి వుంటే అలా జరుగుతుంది. ఈ కొండల్లో చావాలని రాసిపెట్టివుంటే ఎవరాపగలరు అనే ఒక భరోసా వాళ్ళ మనసుల్లో ఉండొచ్చు. నాకలాంటి నమ్మకాలు లేవు. నా ప్రయాణం ప్రకృతిలోకి. నాకు అమర్‌నాథ్‌ గుహ, అక్కడ ఏర్పడే మంచు శివలింగం గమ్యం కాదు. కానీ ఆ గుహలో ఆ మంచుమూర్తి ఏర్పడకపోతే ఈ ప్రయాణమే కుదరదు. ఇంత ప్రమాదకరమైన ప్రయాణం జనాలు చేసేది ఆ మంచుమూర్తిని దర్శించుకోవడానికే. నేను దీన్నొక సాహసయాత్రగానే ఎంజాయ్‌ చేసాను. భయం, గగుర్పాటు, విభ్రమం లాంటి భావాలు అడుగడుగునా కలుగుతాయి కానీ భక్తి మాత్రం నాకసలు కలగనే కలగదు. భయం కూడా చాలా తక్కువసార్లు. హఠాత్తుగా గుర్రం ముందుకి తూలినపుడు, పెద్ద పెద్ద బండరాళ్లమీద జారినపుడు గుండె గొంతులోకొస్తుంది. ప్రయాణం మొదట్లో కెమెరా బయటకు తీసి ఫోటోలు తీసే సాహసం చెయ్యలేకపోయాను. రెండు చేతులతో గుర్రాన్ని పట్టుకోవడమే సరిపోతుంది. అయితే ప్రయాణం సగం పైన సాగాక కొంత ధైర్యమొచ్చి కెమెరా తీసి, వీడియో తీసాను. ఫోటోలు క్లిక్‌ చెయ్యడం చాలా కష్టం. వీడియో కొంచం తేలిక. నేను ప్రయాణిస్తున్న దారిని, కొండవాలుని, కింది లోయని, సింధుని రికార్డ్‌ చేసాను. అయితే అప్పటికే చాలావరకు కిందికొచ్చేసాం. ఎత్తైన కొండల్ని షూట్‌ చెయ్యలేకపోయాను. కెమెరా పట్టుకుని పైకి కిందికి చూస్తే ఇంకేం లేదు. కిందపడటం ఖాయం. “ఇంకెంత దూరం షరీఫ్‌ భయ్యా” అని వందసార్లు అడిగివుంటాను. “ఆగయా! వో దేఖో, వో గుఫా హైనా వోయీ హై (అదిగో వచ్చేసాం. ఆ కన్పడే గుహే)” అంటూ చెప్పేవాడు.

ఓ గంటన్నర ప్రయాణం తర్వాత జనంతో, షాపులతో, పోలీస్‌, సి.ఆర్‌.పి.ఎఫ్‌లతో కిటకిట లాడుతున్న ప్రదేశంలో మా గుర్రం రాజా ఆగింది. చెయ్యందించి షరీఫ్‌ నన్ను గుర్రం దింపాడు. కాలుకింద పెట్టగానే ఒళ్ళంతా చాలా బరువన్పించింది. 14,000 వేల అడుగుల ఎత్తుమీద ఉన్నాం. ఆక్సిజన్‌ చాలా తక్కువగా ఉంటుంది. మాతోపాటే వున్న పోలీసాయన మమ్మల్ని CRPF క్యాంపు ఆఫీసుకు వెళదామని, అక్కడ కాసేపు రెస్ట్‌ తీసుకుని పైకి వెళదామని సూచించాడు. నా పరిస్థితి ఏం బాగోలేదు. ఒక్క అడుగు వెయ్యలేకపోయాను. మెట్లెక్కడంలో, ఎత్తులెక్కడంలో నాకు చాలా సమస్యలున్నాయి. ఒకసారి మైసూర్‌ వెళ్ళినపుడు, నిటారుకొండ శ్రావణ బెల్గోడా ఎక్కడానికి ప్రయత్నించినపుడు నేను ఫెయింట్‌ అయి కిందపడిపోయాను. వాంతి చేసుకుని ఒళ్ళంతా చెమటలు పట్టి ప్రాణం మీదికి తెచ్చుకున్నాను. సగం దారిలో అలా జరగడం వల్ల నా సహచరుడు చాలా భయపడ్డాడు. మనుష్యులు మోసే డోలీ మీద మిగతా ప్రయాణం చెయ్యాల్సి వచ్చింది. ఇపుడు కూడా అదే యిబ్బంది ఎదురైంది. “మేడం! కొంచం దూరమే వుంది. క్యాంప్‌ ఆఫీసులో రెస్ట్‌ తీసుకుందురు గానీ పదండి” అంటాడు. ఊహూ! నేనొక్క అడుగెయ్యలేక కూలబడిపోయాను. కొంచం సేపు అలా కూర్చున్నాక, మంచి నీళ్ళు తాగి సేదతీరి చాలా మెల్లగా నా శరీరాన్ని ఈడ్చుకుంటూ, ఊపిరి పీల్చడంలో చాలా కష్టపడుతూ క్యాంప్‌ ఆఫీసు వరకు నడిచాను. మమ్మల్ని మోసుకొచ్చిన గుర్రాలు కిందనే ఆగిపోయాయి. మేము గుహ వరకు వెళ్ళి వచ్చాక మమ్మల్ని మళ్ళీ కిందికి తీసుకెళతాయి.

కేంప్‌ ఆఫీసులో కొంచెం సేపు కూర్చుని వేడివేడి టీ తాగాక నేను కొంత తేరుకున్నాను. అయినా మెట్లు ఎక్కి పైకి వెళ్ళే సాహసం చెయ్యలేకపోయాను. ఆరువందలు ఇచ్చి డోలీ మాట్లాడుకున్నాను. అప్పటి వరకు గుర్రం నన్ను మోసుకొస్తే, డోలీలో కూర్చోబెట్టి, బతికుండగానే నలుగురు మనుష్యులు పైకి మోసుకెళ్ళారు. కెమెరా, సెల్‌ఫోన్‌లు తీసుకెళ్ళకూడదట. మేము CRPF అతిథులం కాబట్టి మమ్మల్ని చెక్‌ చెయ్యలేరు. నేను డోలీలో కూర్చుని గుహ వరకు వీడియో వేసాను. మా పోలీసాయన గమనించి “వద్దు మేడం. ఫోటోలు తియ్యొద్దు. కెమెరా లోపల పెట్టేయండి” అని హెచ్చరించాడు. నేను కెమెరా లోపల పడేసాను. పదిహేను నిముషాల్లో డోలీ పైకి చేరింది. అమర్‌నాథ్‌ గుహ ముందు నన్ను దింపేసారు. బూట్లు తీసేయమన్నారు. కాళ్ళు నేలమీద పెట్టగానే జివ్వుమన్నాయి. గుహ ఖాళీగా వుంది. ముంచుమూర్తి లేదు. భక్తులు తీవ్ర ఆశాభంగం పొందుతున్నారు. నిజానికి మంచుమూర్తి చాలా రోజులు క్రితమే కరిగిపోయింది. మైనస్‌ డిగ్రీ చలి వుంటేనే మంచు గడ్డకడుతుంది. చలి మాత్రం చాలా వుంది గానీ మైనస్‌ డిగ్రీ లేదు. మెట్లెక్కి వస్తున్న వాళ్ళు చాలా ఆయాసపడుతూ, ఆపసోపాలు పడుతూ వచ్చారు. శివలింగం ఇదే అంటూ చూపించారు. అక్కడేమీ లేదు. పక్కనే కొంత మంచు పేరుకొని వుంది. దాన్ని “పార్వతి మయ్యా” అంటూ చూపించారు. పార్వతి ఇక్కడే వుందట. శివుడు కైలాసం వెళ్ళిపోయాడట. “శివ్‌జి కైలాస్‌ చలే గయా” అని పూజారి అంటే “పార్వతీ కో అకేలే ఛోడ్‌కర్‌ క్యోం చలే గయా” అని నేనంటే “అయ్‌సీ బాత్‌ నహీ కరనా బేటీ” అని రెండు చెంపలూ వాయించుకున్నాడు పూజారి. నాతో వున్న వాళ్ళు నావేపు గుర్రుగా చూసారు. కాళ్ళకు చెప్పుల్లేవు. జివ్వున లాగేస్తున్నాయి. నేను అక్కడ ఒక రెయిలింగ్‌ వుంటే దాని మీద ఎక్కి కూర్చున్నాను. పూజారి నావేపు చాలా కోపంగా చూసి “ఐసా నహీ బైఠనా హై” అన్నాడు. నేనింక అక్కడ వుండకుండా కొంచం కిందికి దిగి వచ్చేసాను. చుట్టూ అద్భుతమైన కొండలు. మంచుతో కప్పబడి, ఎండకు తెల్లగా మెరుస్తున్నాయి. కొన్ని ఒట్టి బండలు, మంచు కానీ, చెట్లుగానీ లేవు. కొన్ని ఆకుపచ్చటి దుప్పట్లు కప్పుకున్న కొండలు. కళ్ళు చెదిరే సౌందర్యం.

అమర్‌నాథ్‌ గుహ చాలా చిన్నది. ఓ పెద్ద కొండలో ఏర్పడిన సహజమైన గుహ. ఆ గుహమీద ఓ పెద్ద రంధ్రం వుంది. ఆ రంధ్రం లోంచి మంచు మెల్లగా జారి పడుతూ లింగాకృతి దాలుస్తుంది. ఒక్కో డ్రాప్‌ పడుతూ, గడ్డ కడుతూ, క్రమంగా గుహపై భాగం వరకూ పెరుగుతుంది. నిలువుగా లింగాకృతిలో ఏర్పడుతుంది. ఉష్ణోగ్రత పెరిగితే మంచుమూర్తి కరిగిపోతుంది. నిజానికి వారం రోజుల్లోనే అది కరిగి పోతుందట. క్రితం సంవత్సరం మిలటరీ వాళ్ళు ఏవో రసాయనాలు పూసి కరగకుండా చేసారనే ఆరోపణలు పేపర్లలలో వచ్చాయి. ఈసారి మరి అలాంటిది చేసారో లేదో గానీ మంచుమూర్తి తెలియదు. మొత్తం కరిగిపోయింది. భక్తులు మాత్రం ప్రవాహంలా వస్తూనే వున్నారు. ఈ గుహ, మంచుమూర్తికి సంబంధించి ఒక కథ ప్రచారంలో వుంది. దాని గురించి తర్వాత రాస్తాను.

అమర్‌నాథ్‌ గుహలో నాకు అమితంగా ఆసక్తి కల్గించినవి అక్కడ తిరుగాడుతున్న నాలుగైదు పావురాలు. వాటిని పంచ పాండవులంటారట. చాలా పెద్దగా వున్నాయి. రెండు పావురాలు జంటగా ఎగురుతూ ఆడుతున్నాయి. మిగిలినవి విడిగా అటూ ఇటూ తిరుగుతున్నాయి. చాలా అందంగా వున్నాయవి. మనం ఇళ్ళల్లో చూసే వాటికన్న భిన్నంగా వున్నాయి. అంత ఎత్తైన కొండలమీద పావురాలు ఎందుకున్నాయో, ఎలా అక్కడికి చేరాయో అనేది మాత్రం మిస్టరీనే. గమ్మత్తేమిటంటే అవి అందరికీ కనబడవట. నాకు ఐదు కనబడ్డాయి. అవి ఎగురుతూ బయటకెళుతూ గుహలోకి వస్తుండడం వల్ల కొంతమందికి కనబడక పోవచ్చు. అవి పంచపాండవులని, అయిదు కన్పిస్తే గొప్ప అదృష్టమనే కామెంట్లు కూడా విన్నాను. నన్ను డోలీలో మోసుకొచ్చిన రఫీక్‌ “మాజీ! ఆప్‌! లక్కీ హై. ఆప్‌ కో పాంచ్‌కి పాంచ్‌ కబూతర్‌ మిల్‌గయా” అన్నాడు. నేను నవ్వేసి ఊరుకున్నాను. భక్తిరసం పొంగిపోర్లే చోట ఇలాంటివి బ్రహ్మాండంగా ప్రచారంలో వుంటాయి. ఆ మంచుకొండల్లో పావురాలు ఏం తిని బతుకుతాయా, మొత్తం మంచుతో కప్పడిపోయినపుడు ఈ పావురాలు ఎక్కడకు పోతాయో అని ఆలోచిస్తూ బూట్లు వేసుకోవడానికి అష్టకష్టాలు పడుతుంటే రఫీక్‌ చొరవగా బూట్లందుకుని తొడగడం మొదలు పెట్టాను. నేను వొద్దని వారిస్తూన్నా విన్పించుకోకుండా “ఆప్‌! హమారా మా జైసే. చప్పల్‌ పెహన్‌నేసే కుచ్‌ నహీ హోగా” (మీరు మీ అమ్మలాంటి వారు. బూట్లు తొడిగితే ఏం కాదు) అన్నాడు. అయినా నాకు చాలా గిల్టీగా అన్పించింది. అతని సహకారంతో బూట్లు తొడుక్కుని, మళ్ళీ డోలీలో కూర్చుని కిందికి దిగేసాం.

CRPF క్యాంపులో కాసేపు కూర్చుని, మళ్ళీ వేడిగా ఓ టీ తాగి, వాళ్ళందరితో ఫోటోలు దిగాం. అక్కడ చాలా మంది తెలుగు పోలీసులున్నారు. చిత్తూర్‌ నుండి, శ్రీకాకుళం, కర్నూల్‌ జిల్లాలకు చెందిన గురునాధరెడ్డి, ధనికుమార్‌, విద్యాధర్‌ మాకు చాలా సహకరించారు. ముఖ్యంగా నేను గుర్రం దిగి నడవలేని స్థితిలో వున్నపుడు, నా చెయ్యి పట్టుకుని చాలా జాగ్రత్తగా నడిపించిన ధనికుమార్‌కి ఎప్పటికీ కృతజ్ఞురాలనే. అలాగే ్పుష్ట్ర ఆఓ కమాండెంట్‌ హరీందర్‌ సింగ్‌ మమ్మల్ని ఎంతో ఆదరంగా ఆహ్వానించడంతో పాటు అమర్‌నాథ్‌కి సంబంధించి ఎన్నో విశేషాలు చెప్పాడు. యాత్ర మొదలయ్యిన దగ్గర నుండి ఆగస్టు 12 వరకు అక్కడి స్థితిగతులు ఎలా వుంటాయో చెప్పాడాయన.

ఈ యాత్ర నిర్వహణ మొత్తం CRPFదే. యాత్రకు ముందు యాత్ర తర్వాత నిర్మానుష్యంగా వుండే ఆ ప్రాంతం రెండు నెలల పాటు జనంతో కిటకిటలాడిపోతుంది. గుర్రాలు, డోలీలు, హెలికాప్టర్లు, దుకాణాలు, అసంఖ్యాకంగా టెంట్‌లు, అడుగడుగునా పోలీస్‌, CRPF జవాన్లు, అధికారులు ఎంతో శ్రమించి అమర్‌నాథ్‌ యాత్రను నిర్వహిస్తారు. సివిలియన్‌ అధికారులు ఒక్కరు కూడా లేరు. అంతా మిలటరీ కంట్రోల్‌ లోనే వుంటుంది. BSNL చాలా కష్టం మీద కొన్ని లాండ్‌లైన్‌లు వేస్తుంది. వాళ్ళ మొబైల్స్‌ మాత్రమే పని చేస్తాయి. గుహ దగ్గర ఏర్పాటయ్యే టెంట్స్‌, దుకాణ సముదాయం, సరుకులు అన్నింటినీ గుర్రాలు నిరంతరాయంగా మోస్తూ వుంటాయి. గుర్రం తప్ప వేరే రవాణా సదుపాయం లేదు. రెండు నెలల పాటు జరిగే మహా జాతర అది. వేలాది మంది మిలటరీ వాళ్ళు శ్రమించి, సెక్యూరిటీ కల్పించి నిర్వహిస్తారు. ఆగస్టు పన్నెండు తర్వాత ఆ అయిదు పావురాలు తప్ప మరో పిట్ట కూడా అక్కడ మిగలదు. మంచు కురవడం మొదలైతే ఆ చుట్టు పక్కలకి కూడా వెళ్ళలేము. 30 అడుగుల మందాన మంచు కురిసి కొండలు, దారులు, సింధు నది అన్నీ కలగలిసి పోతాయట. పావురాలు ఎక్కడికి వెళతాయా? ఏం తింటాయా అని ఆలోచిస్తూ, హరేందర్‌ సింగ్‌ గారికి కృతజ్ఞతలు చెప్పి మేము మా గుర్రాలున్న చోటుకి వచ్చేసాం.

మళ్ళీ రాజా మీద సవారీ. షరీఫ్‌ చెయ్యందించి గుర్రాల మీద కూర్చోబెట్టాడు. గుర్రం మీద కిందికి దిగడం మాత్రం చాలా భయానకమైన అనుభవం. లోతుల్లోకి దిగుతున్నపుడు షరీఫ్‌ నన్ను కూడా పట్టుకుని దింపేవాడు. అలా చాలా సార్లు జరిగింది. “ఆప్‌ డరనా నహీ. మైహూనా” అని షారూఖ్‌ ఖాన్‌ లెవెల్‌లో భరోసా ఇచ్చేవాడు. బిర్రబిగుసుకుపోయి, ప్రాణాలరచేత పట్టినట్లు గుర్రాన్ని గట్టిగా పట్టుకుని, ఆ లోయల్ని, నదీ ప్రవాహాన్నీ చూస్తూ, ఎదురుగా గుర్రాలొచ్చినపుడు ఇంక నా పనయిపోయింది. లోయలోకి పడ్డం ఖాయం అనుకుంటూ – అలా ఎన్నో సార్లు జరిగింది. రెండుసార్లు గుర్రం తూలి పడబోయింది. ఆ కుదుపులకి నేను కూర్చున్న జీను ఒకపక్కకి జరిగిపోయింది. అది గమనించి నన్ను దింపి జీనును సరిచేసి, తాను కప్పుకున్న ఉన్ని కోటుని కూడా దాని మీద పరిచి నన్ను మళ్ళీ జాగ్రత్తగా కూర్చోబెట్టాడు. ఆ సన్నటి దారిలో విపరీతమైన రద్దీ. వచ్చే గుర్రాలు, పోయే గుర్రాలు. ట్రాఫిక్‌ జామ్‌లు. గుర్రాల్ని వెనక్కి నడిపించినపుడు మాత్రం గుండె జారిపోతుంది. ఆ దారిని విశాలం చెయ్యలేని నిస్సహాయస్థితి వల్లను, మామూలు రోజుల్లో అక్కడంతా మంచే వుంటుంది కాబట్టి రిపేర్లు లాంటివి కూడా జరగవు. రెయిలింగ్‌ లాంటిది కట్టడం కూడా అసాధ్యమే. అందుకే అమర్‌నాథ్‌ యాత్ర అత్యంత ప్రమాదకరంగా వుంటుంది. ప్రాణాలకి భరోసా లేని యాత్ర. ఆ సాహసయాత్ర చేసి తిరిగొచ్చామంటే తిరిగొచ్చాం. అంతే. రాలేకపోనువచ్చు. అన్నిటికి సిద్ధపడే అసంఖ్యాకంగా భక్తులు, వృద్ధులు కూడా తరలి వస్తాను. నాకు భక్తితో సంబంధం లేకపోయినా సాహసాలు చెయ్యడంతో పాటు, అత్యంత మనోహరమైన, సౌందర్యంతో నిండిన ఆ ప్రదేశానికి వెళ్ళడం ప్రాణ సమానం. ప్రాణం పోతుందేమో నన్నంత రిస్క్‌ వున్నప్పటికీ. బహుశ భక్తులు పోతే దైవైక్యంగా భావించొచ్చు. నేను పోతే ప్రకృతైక్యంగా అనుకోవాలి కాబోలు. ఇలాంటి ఆలోచనలతో గంటన్నర పైనే ప్రయాణం చేసి, ఎన్నో ప్రమాదాలను దాటి కిందికొచ్చాం. అప్పటికి టైమ్‌ ఒంటి గంట కావస్తోంది. ఉదయం నించి టీ తప్ప మరేం తినలేదు. మా హెలికాఫ్టర్‌ రెడీగా వుందని ధనికుమార్‌ చెప్పాడు. గుర్రాలకి డబ్బులిచ్చేసాం. షరీఫ్‌కి, రాజాకి బోలెడన్ని కృతజ్ఞలు చెప్పి నేను షరీఫ్‌కి రెండు వందలు టిప్‌ ఇచ్చి గుర్రానికి బాగా తిండి పెట్టు అని చెప్పాను. నేను అంత టిప్‌ ఇవ్వడం చూసి అందరూ గయ్‌మన్నారు. ముఖ్యంగా ధనికుమార్‌, “మేడం మీరు అంతలేసి టిప్‌లివ్వొద్దు. వాళ్ళు మిగతా వాళ్ళని పీడిస్తారు.” అన్నాడు. నాకు ఆ సలహాలేవీ బుర్రకెక్కలేదు. కొండలమీద, ఎత్తైన మెట్లమీద, కొండ అంచుమీద ఎంతో నైపుణ్యంతో గుర్రాన్ని నడిపించిన షరీఫ్‌ మీద, అతని గుర్రం రాజా మీద కలిగిన అభిమాన వ్యక్తీకరణకి అంతకన్నా మార్గం కనబడలేదు. నిజానికి ఆ గుర్రం పాదాలకి నమస్కరించాలి. షరీఫ్‌ పాదాలని కళ్ళకద్దుకోవాలి. గుర్రమెక్కి కూర్చున్న నేనే అంత కష్టపడిపోతే గుర్రంతో పాటు నడిచిన అతని శ్రమని గమనించాలి కదా. ఆ గుర్రం ఆత్మహత్య చేసుకోకుండా నన్ను సురక్షితంగా చేర్చింది కదా!. షరీఫ్‌ చాలా సంబరపడి పోయాడు. బహుశ అంత టిప్‌ ఎవరూ ఇచ్చివుండకపోవచ్చేమో అన్పించింది అతని ముఖం చూసాక. అతని సంతోషం చూసాక నా కృతజ్ఞతాభారం కొంచం తగ్గినట్లయింది. షరీఫ్‌ని, రాజాగుర్రాన్ని నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. అందులో సందేహమే లేదు.

ఐదు నిముషాల్లో మమ్మల్ని హెలికాప్టర్‌ బాల్టాక్‌లో దించేసింది. అమర్‌నాథ్‌ కొండలకి గుడ్‌బై చెప్పి హెలికాప్టర్‌లో కూర్చున్నాం. తీరా తిరిగి వచ్చేటప్పుడు ఆ అందాన్నంతా అలా వదిలేసి రావడానికి ఎంత దిగులేసిందో చెప్పలేను. హెలికాప్టర్‌ లోంచి చూస్తుంటే గుర్రాలలో మేము ప్రయాణించిన దారి స్పష్టంగా కనబడుతోంది. వందలాది గుర్రాలు, మనుష్యులు చీమల బారుల్లా కదులుతున్నారు. నాలుగు రోజులు గడిస్తే నరమానవుడెవరూ కన్పించని, ఆ నిర్మానుష్య, నిశ్శబ్ద, నిరామయ పరిసరాలు నా గుండెల్లో వొదిగిపోయాయి. అమర్‌నాథ్‌ గుహ, ఆ గుహలో గుంభనంగా ఏర్పడే మంచుమూర్తి మీద గొప్ప ప్రేమ కలిగింది నాకు ఆ క్షణాన. ఆ మంచుమూర్తిని చూడటానికే కదా ఇన్ని లక్షల మంది ఇక్కడికొస్తున్నారు. భక్తిపారవశ్యంతో కొందరు ప్రకృతి ఆరాధనలో నాలాంటి అల్పసంఖ్యాకులు కొందరు అమితమైన శ్రమకోర్చి, అంతమందిని తన దగ్గరకు రప్పించుకుంటున్న మంచుమూర్తిని ముద్దాడాలన్నంత మైమరపు కలిగింది కానీ అది కాస్తా కరిగి నీరైపోయింది.

రెండున్నరకి ఇనోవాలో మా తిరుగుప్రయాణం మొదలైంది. అందరం చాలా అలిసిపోయాం. ఏమీ తినలేదు. కళ్ళు మూతలు పడుతున్నా బలవంతంగా తెరిచి, మళ్ళొకసారి పర్వత సముదాయాలను, జలపాతాలను, సింధునదిని మనసారా చూస్తూ కూర్చున్నాను. అపుడపుడు కళ్ళు మూతలు పడుతున్నా, మూసిన రెప్పల వెనక కూడా అమర్‌నాథ్‌ అందాలే అలరిస్తున్నాయి. కన్ను మూసినా, తెరిచినా అద్భుత సౌందర్యమే. శ్రీనగర్‌లోకి ప్రవేశించామనడానికి నిదర్శనంగా, బారులు తీరిన చినార్‌ చెట్లు స్వాగతం పలికాయి. ఐదుగంటలకి మా గెస్ట్‌ హౌస్‌ చేరాం. చిత్రంగా ఎవరినీ ఆకలి బాధించలేదు కానీ రెండు బ్రెడ్డు ముక్కలు, వేడి వేడి కాఫీ పడేసరికి అందరికీ, అపుడు ఆకలి గుర్తొచ్చింది.

తలారాస్నానం చేసి, గెస్ట్‌ హౌస్‌ పై భాగానికి వెళితే నిదానంగా ప్రవహిస్తున్న జీలం నది కనబడింది. సింధు నది ఉరవళ్ళకి, జీలం నది నిదానానికి పోలికే లేదు. నీళ్ళ వేపు చూస్తూ కూర్చుంటే అలసట అంతా మాయమై ఫ్రెష్‌గా అయిపోయింది.

మర్నాడు శ్రీనగర్‌లో వుండే నా ఫ్రెండ్‌ వహీదా ఇంటికి వెళ్ళాం. వాళ్ళింట్లో మాటల సందర్భంలో అమర్‌నాథ్‌ గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి. 150 సంవత్సరాల క్రితం బూటా మాలిక్‌ అనే పశువుల కాపరి తొలిసారి అమర్‌నాథ్‌ గుహను కనుక్కున్నాడట. అతను ముస్లిమ్‌. అతను పశువుల్ని మేపుకుంటూ ఆ పరిసరాల్లో తిరుగుతున్నపుడు ఒక సిద్ధుడు ఆయనకు కనబడ్డాడట. అతనికి ఒక కమండలం లాంటిది ఇచ్చాడట. ఇంటికెళ్ళి చూస్తే దాంట్లో బంగారం వుందట. మాలిక్‌ మర్నాడు తిరిగొచ్చి చూస్తే సిద్ధుడు కనబడలేదట. సిద్ధుడి కోసం వెతుకుతూ తిరుగుతుంటే, అక్కడొక గుహ, ఆ గుహలో ఏర్పడిన మంచుమూర్తి కనబడిందట. చాలా కాలం అతనక్కడే వుండిపోయి సిద్ధుడి కోసం ఎదురుచూస్తూ ఆ మంచుమూర్తి దగ్గరే ఉండిపోయాడట. క్రమంగా ఈ వార్త బయటకు పొక్కి జనం రావడం మొదలైంది. మొదట్లో హిందువులు, ముస్లిమ్‌లు కలిసి శ్రీనగర్‌ నుండే పెద్ద ఊరేగింపుగా అమర్‌నాథ్‌కి వెళ్లేవారట. జూన్‌ నెలలో పౌర్ణమి రోజున మంచుమూర్తి పూర్తిగా ఏర్పడి, చంద్రుడిలో కళలు తగ్గే కొద్దీ, మంచు కూడా క్రమంగా కరిగిపోయేదట. పౌర్ణమి నాటికి అమర్‌నాథ్‌ చేరేలా శ్రీనగర్‌ నుంచి ఊరేగింపు బయలుదేరేదట.

క్రమంగా అమర్‌నాథ్‌ హిందువుల పుణ్యక్షేత్రంగా రూపుదిద్దుకుంది. కాశ్మీర్‌లో వేర్పాటు వాదం మొదలై, ఉధృతమయ్యాక ముస్లింలు పాల్గొనడం తగ్గింది. ఊరేగింపు కూడా శ్రీనగర్‌ నుండి వెళ్ళడం లేదిపుడు. శ్రీనగర్‌కు దగ్గరల్లోని పెహల్‌గావ్‌ బేస్‌ క్యాంప్‌గా రూపొందింది. చాలా వరకు యాత్ర అక్కడ నుండే మొదలవుతుంది. ఇంతకు ముందు యాత్రికుల మీద వేర్పాటువాదుల దాడులు కూడా జరిగాయి. ప్రస్తుతం అడుగడుగునా తుపాకీ పహారాలోనే యాత్ర నడుస్తోంది.

ఇంటర్‌నెట్‌లో ఇంకొక కథ ప్రచారంలో వుంది. అమర్‌నాథ్‌ గుహకి 5000ల సంవత్సరాల చరిత్ర వుందని, పురాణాలలో దీని ప్రసక్తి వుందని, కల్హణుని రాజతరంగిణిలో అమర్‌నాథ్‌గుహ గురించి వుందని, కాశ్మీరీ రాజులు తమ వేసవి విడిదిగా అమర్‌నాథ్‌కి వెళ్ళేవారనే కథనం వుంది. అయితే అమర్‌నాథ్‌ని మొదట కనుగొన్నది మాత్రం ముస్లిమ్‌ పశువుల కాపరి బూటామాలిక్‌ అన్నదానికి డాక్యుమెంటరీ ఎవిడెన్స్‌ కూడా వుంది. అమర్‌నాథ్‌ గుహ దగ్గర భక్తులు సమర్పించే సంపదలో ఇప్పటికీ బూటామాలిక్‌ కుటుంబీకులకు వాటా వెళుతుంది. నిజానికి ఈ యాత్ర ఇటీవలిది కాదని, ఎన్నో వందల సంవత్సరాలుగా కొనసాగుతోందని, కాశ్మీరు, ఆఫ్గనిస్తాన్‌ పరిపాలన కింద ఉన్నపుడు ఈ యాత్రకి బ్రేక్‌ వచ్చివుండచ్చని, ఆ తర్వాతే బూటామాలిక్‌ దీన్ని తిరిగి కనుక్కొని ఉండొచ్చని ఈ కథనంలో పేర్కొన్నారు.

హిందు ముస్లిమ్‌ల సౌహార్ద్రానికి సాక్షిగా నిలిచిన అమర్‌నాథ్‌, మతసామరస్యపు పువ్వుల్ని పూయించాలని ఆశిద్దాం. ఒక ముస్లిమ్‌ యువకుడు కనుక్కొన్న అమర్‌నాథ్‌ గుహ ఈరోజు కోట్లాది మంది హిందువులకు పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రమవ్వడం ఎంత మానవీయంగా వుందో, నమ్మకాలు, మానవీయ కోణాన్ని తగ్గించకూడదని అర్థం చేసుకోవాలి. ఈ కోణం నాలాంటి మతాతీతంగా బతికే వాళ్ళకి గొప్ప సంతోషాన్ని కల్గించి తీరుతుంది.

శ్రీనగర్‌కి గుడ్‌బై చెప్పేసి మేము ఎయిర్‌పోర్టు వైపు బయలుదేరాం. అద్భుతానుభావాలను పంచిన అమర్‌నాథ్‌ ప్రయాణం ఆ విధంగా ముగింపుకొచ్చింది.




కొండవీటి సత్యవతి

Tuesday, 7 June 2016

మంచుపూల వనాల్లో...

కాశ్మీరుకి బయల్దేరే ముందు మేము పడ్డ ఆందోళన ఇంతా అంతా కాదు. 'కాశ్మీరా? ఫరవాలేదా? అక్కడంతా అల్లర్లట కదా, కాల్పులట కదా' అని మా మిత్రులు, సన్నిహితులూ మొదట్లో భయపెట్టారు. తీరా అక్కడికి చేరాక ఆ భయమంతా పటాపంచలైపోయింది. మీడియా కాస్త ఎక్కువ చేస్తోందేమో అనే అనుమానం వచ్చింది.

విశాఖపట్నం నుండి విమానంలో బయలుదేరిన మేము అంటే మా అమ్మా నాన్నా నేనూ ఢిల్లీలో దిగి, అక్కడ ఆ రాత్రి బస చేసి, మరుసటి రోజు మూడు గంటల ప్రాంతంలో కాశ్మీరుకు చేరాం. దారిలో విమానంలోంచి హిమాలయాలను చూడడం గొప్ప అనుభవం. ఆ కొండలన్నీ చిన్న పిల్లలు ఆడుకోవడానికి కట్టిన తెల్లటి ఇసుక గూళ్లలా కనిపించాయి. పై నుండి భూమిని చూడటమే ఒక వింత అనుభవమయితే అలాంటిది ఏకంగా హిమాలయాలనే చూడటం మహా అద్భుత అనుభవం.

ముందుగానే జమ్ముకాశ్మీర్ పర్యాటక కేంద్రం వారి రూమ్స్‌ను ఇంటర్నెట్‌లో బుక్ చేసుకున్నందువల్ల హోటల్ 'లలారుఖ్' చేరుకుని గదిలో సామన్లు పెట్టి కొంతసేపు విశ్రాంతి తీసుకున్నాం. తర్వాత శ్రీనగర్‌లోని అందమైన ప్రాంతాలు చూడడానికి బయల్దేరాం.

ఇంకొన్ని కళ్లుంటే...
ఊరు చూపెట్టడానికి ఆటోవాడు ఎంత తీసుకుంటాడని అక్కడివారిని అడిగితే, మమ్మల్ని వారు చాలా విచిత్రంగా చూశారు. ఎందుకలా చూశారో మొదట మాకు అర్థం కాలేదు. పర్యాటకులు చలికి భయపడి ఎక్కువగా ఆటోల్లో తిరగరనీ, సుమోల్లోనే తిరుగుతారనే విషయం తర్వాత తెలిసింది. మేం ఒక సుమో మాట్లాడుకుని పావు గంటలో దాల్ సరస్సు పక్క నుంచి 'మొగల్ నిషాద్' గార్డెన్స్‌కు వెళ్లాం. ఆ గార్డెన్ ముందు వైపు దాల్ సరస్సు వెనుక మంచు కొండలు. మధ్యలో తివాచీ పరిచినట్లు పచ్చదనం. చూడడానికి నాకు ఇంకొన్ని కళ్లుంటే బావుండేదనిపించింది.

కాశ్మీరులో గొప్పవారైనా, పేదవారైనా ఇంటి పై కప్పును రేకులతోనే వేసుకుంటారు. కప్పులన్నీ ఇంగ్లీషు 'ఎ' ఆకారంలో ఉండి కురిసిన మంచు జారిపోవడానికి వీలుగా ఉంటాయి.

తర్వాత రోజు గుల్మార్గ్ వెళ్లాం. ఆ చోటంతా మంచు నిండుగా అందంగా కనిపించింది. ఆ ముందు రోజు వరకూ బాగా వర్షం పడి, దారంతా మంచుతో నిండిపోయి యాత్రికులను ఇబ్బంది పెట్టిందట. కాని మేం వెళ్లిన రోజునుండే వర్షాలు తగ్గి, రోడ్డు మీద పేరుకుపోయిన మంచును ఊడుస్తున్నారు. మన దగ్గర మున్సిపాలిటీ వాళ్లు రోడ్డు మీద చెత్త ఊడ్చినట్టు అక్కడ మంచును ఊడ్చి పారేస్తున్నారు.

స్టెడ్జ్ బళ్లపై తిరిగాం
గుల్మార్గ్ మంచు కొండల్లో ఆడుకోవాలనుకునే వాళ్లు అక్కడే పొడవాటి జర్కిన్లు, బూట్లూ అద్దెకు తీసుకోవచ్చు. మేము 'స్లెడ్జ్' బళ్ల మీద చిన్న చిన్న మంచుకొండలు ఎక్కాము. ఈ బళ్లను మనుషులే తాడుకట్టి లాగుతారు. ఆ మంచుకొండల పై బళ్లతో జారుతూ వెళుతుంటే ఎవ్వరైనా సరే బాల్యంలోకి వెళ్లిపోవలసిందే.

తర్వాత 'హజరత్‌బల్ దర్గా'కి వెళ్లాం. మహ్మద్ ప్రవక్త వెంట్రుక ఉండడం వల్లే అది వారికి ఎంతో పవిత్రం. ఆ దర్గా వెనుక భాగం నుంచి దాల్ సరస్సులో బోట్ షికారు చేశాం. మధ్యలో ఒక చోట చిన్న ద్వీపంలా కనిపించింది. అక్కడ నాలుగు చినార్ చెట్లు ఉన్నాయి. అందుకే ఆ చోటుని 'చార్ చినార్' అంటారు. బోటులో అక్కడిదాకా వెళ్లొచ్చాం.

సింధునదిలో గంతులేశాం
రెండవ రోజు మేము సోన్‌మార్గ్ వెళ్లాం. దారిలో మాకు కొన్ని స్కూళ్లు కనబడ్డాయి. స్కూలు పిల్లలు ఎండలో కూర్చోవడం చూసి పాపమనిపించింది. వారంతా ఎండ కోసం అక్కడ కూర్చున్నారని తెలిశాక నవ్వుకున్నాం. సోన్‌మార్గ్ వెళ్లే దారికి ఇరుపక్కలా ఆవాల పొలాలు ఎక్కువగా కనిపించాయి. ఆ మొక్కలకి పసుపు పచ్చ పూలు ఉంటాయి. దారి పొడుగూతా ఎటు చూసినా పసుపు పచ్చ అందాలే.

సోన్‌మార్గ్ కూడా గుల్మార్గ్ లాగే మంచు కొండలతో నిండి ఉంటుంది. కానీ ఇక్కడ మంచు కరిగి సింధూనదిగా ప్రవహిస్తుంది. పరవళ్లు తొక్కి పారుతున్న నదిని చూస్తే అందమైన లేడి పిల్ల చెంగు చెంగున గంతులేసి పరిగెడుతున్నట్లు ఉంటుంది. నదిలో చెయ్యి పెడితే షాక్ కొట్టేంత చల్లగా ఉన్నాయి. అయినా సరే ముఖం కడుక్కొని, ఆ నీళ్లు తాగి, మా దగ్గరున్న సీసాల్లో నింపుకొని కదల్లేక కదిలాం.

అక్కడ నుంచి ఆసియాలోనే అతి పెద్ద సరస్సయిన వుళ్లారు సరస్సు చూడడానికి వెళ్లాం. సరస్సు చుట్టూ పార్కులాంటిది కట్టారు. మంచు కొండలు, చెట్లు చూస్తున్నప్పుడు కాశ్మీరు వాళ్లు వాళ్ల సినిమాలు తీయడానికి వేరే ఎక్కడికీ వెళ్లనవసరం లేదనిపించింది.

అందాల 'టులిప్' గార్డెన్
అక్కడి నుండి శ్రీనగర్‌లోని ఫేమస్ టులిప్ గార్డెన్‌కి వెళ్లాము. అక్కడ రంగు రంగుల 'టులిప్స్' చూపరులను కట్టిపడేస్తాయి. నలుపు, తెలుపు, గులాబి, కాషాయం, ఎరుపు, పసుపు ఇంకా బోలెడు రంగురంగుల టులిప్స్‌ను చాలా అందమైన ఆకృతుల్లో పెంచారు. ఆ తోటను చూస్తే చిన్నప్పుడు చదివిన జానపద కథల్లో యువరాణుల పూల తోట ఇదేనేమో అనిపించింది.

మూడో రోజు పహల్గాం వెళ్లాం. అక్కడికి వెళ్లే దారిలో లిడ్డర్ వేలీ కనబడుతుంది. లిడ్డర్ వేలీ అంటే అదేదో లోయ కాదు - ఒక నది. ఆ నదిలో ఎవరు గేలం వేసినా తప్పనిసరిగా చేప తగులుతుందని విని ఆశ్చర్యపోయాం. దీన్ని బట్టి ఆ నదిలో ఎన్ని లక్షల చేపలున్నాయో అనిపించింది! ఆ నీళ్లు మానస సరోవరం దగ్గరి మంచు కరిగి ప్రవహిస్తుండడం వల్ల వచ్చినవట. ఎలాగూ మానస సరోవరం వరకూ వెళ్లలేం కదా అని ఆ నీళ్లలో కాసేపు దిగి ఆడుకున్నాం. ఆ నీళ్లు కూడా ఒళ్లు జిల్లుమనేంత చల్లగా ఉన్నాయి. అక్కడి పారే నదులు అంత అందంగా ఎందుకుంటాయా అని ఆలోచిస్తే ... పారే నీటికి ఇరుపక్కలా కొండ రాళ్లు ఉండడం వల్లనేమో అన్పించింది. మన దగ్గర ఇసుక ఉన్నట్టు. నీరు ఆ రాళ్లకు తగుల్తూ, ఆ రాళ్ల సందుల్లోంచి పైకి చిందుతూ తుంపర్లుగా లేస్తూ వెళ్లడం మనోహరంగా కన్పించే దృశ్యం. అదే రోజు శ్రీనగర్‌లో పారి మహల్ కూడా వెళ్లాం. పారి మహల్ నుంచి దాల్ సరస్సు మొత్తం కనిపిస్తుంది.

కాశ్మీరీలు యాత్రికుల్ని గౌరవిస్తారు
శ్రీనగర్‌లో మనుషులు చాలా స్నేహశీలతతో కనిపించారు. యాత్రికులను గౌరవిస్తారు. పర్యాటకుల్ని మోసం చేయరు. ఒకరోజు అక్కడ ఒక ఆటో డ్రైవర్‌ని మమ్మల్ని జీలమ్ నదికి తీసుకెళ్లమని అడిగితే ఇంత దగ్గరగా ఉన్న దానికి ఆటో ఎందుకని చెప్పి దారి చూపించాడే కానీ అటూ ఇటూ తిప్పి డబ్బులు అడగాలనుకోలేదు. అక్కడి మనుషులతో మనం కాస్త ప్రేమగా మాట్లాడితే చాలు టీ తాగి వెళ్లమనో, భోంచేసి వెళ్లండనో ఎంతో మర్యాదగా వాళ్లింటికి ఆహ్వానిస్తారు. మనుషుల పట్ల వారు చూపించే ప్రేమకు కళ్లు చిప్పిల్లాయి నాకు.

చలిపులికి భయపడిపోయాను
మేం వెళ్లింది ఏప్రిల్ నెలలో. అక్కడ పగటి గరిష్ఠ ఉష్టోగ్రత 25 డిగ్రీల కంటే ఎక్కువ లేదు. అదే చలికాలంలో మైనస్ 20 డిగ్రీలకు పడిపోతుందట. అయితే మన ఉష్ణోగ్రత 45 డిగ్రీల వరకూ ఉంటుందని చెబితే 'అమ్మో ... మేము అక్కడ వస్తే మాడి మసైపోతామేమో' అని నవ్వారు. చలంటే ఎంతో ఇష్టపడే నేను రాత్రుళ్లు 8 రగ్గులు కప్పుకుని పడుకోవాల్సి వచ్చింది. మొదట్లో అరచేతులు కనిపించనంత పొడుగాటి చొక్కాల్లాంటివి చూసి ఆశ్చర్యపోయా. ఒకర్నిద్దర్ని చూసి అవిటి వారేమో అనుకున్నాను. ఎండ వచ్చేకొద్దీ ఒక్కొక్కరూ చేతుల్ని బయటకి తీయడం చూసి 'హమ్మయ్య' అనుకున్నాను. చలికి భయపడి అరచేతుల్ని చొక్కాల్లోపల ఉంచుకున్నారని అర్థమైంది.

మన స్కూళ్లు ఏప్రిల్, మే మాసాల్లో మూసేస్తే అక్కడ చలికి భయపడి నవంబర్, డిసెంబర్లలో మూసేస్తారట. మనవి వేసవికాలం సెలవులైతే వాళ్లవి శీతాకాలం సెలవులన్నమాట. అన్నం పొయ్యి మీద నుంచి దించగానే తినెయ్యాలి అక్కడ. లేదంటే క్షణాల్లో బిరుసెక్కిపోతుంది. 'కీషవ' అనే డ్రై ఫ్రూట్స్‌తో చేసిన లిక్విడ్ స్వీట్‌ని నేను చాలా ఇష్టంగా తాగాను.

మేం సుమోలో వెళ్తున్నప్పుడు ఒక ఉద్యోగిని కలిశాం. మాతో కాసేపు మాట్లాడిన తరువాత 'కాశ్మీరు గురించి, మా వాళ్ల గురించి మీ వాళ్లతో ఏమని చెప్తారు' అని అడిగాడాయన. 'ఇక్కడ ప్రశాంతంగా ఉందని, ఇక్కడి ప్రజలు చాలా మంచివాళ్లని' చెబుతాం అని బదులిస్తే అతను చాలా సంతోషించాడు.

- ఎస్.ఎ. కిరణ్మయి

బృహదీశ్వరాలయం B

అణువణువూ అద్భుతం బృహదీశ్వరాలయం ‘‘గుడులూ గోపురాలకు పేరొందిన తమిళనాడు రాష్ట్రాన్ని సందర్శించాలనుకునే వాళ్లకు ముందుగా గుర్తొచ్చేది తంజావూరు...