Showing posts with label మేఘాలయ. Show all posts
Showing posts with label మేఘాలయ. Show all posts

Wednesday, 27 June 2018

మేఘాలయ






మేఘాలలో తేలిపోదామా ...


పచ్చని చెట్లమధ్య రాసి పోసినట్లుండే తెల్లని మేఘాలు... రోడ్డు పక్క, దూరంగా కనిపించే కొండలమీద ఉన్న చెట్లు... ఇలా ప్రకృతి మొత్తం తైలవర్ణచిత్రంలా ఉంటుందిక్కడ. ఇక వానాకాలంలో అయితే ఎటుచూసినా మేఘాల గుంపు కనిపిస్తుంది. ఆ వాతావరణం ప్రశాంతతకు చిహ్నమేమో అనిపిస్తుంది. అటువంటి మేఘాలయకు వెళ్లడమంటే మేఘాలలో తేలిపోవడమే.

మేఘాలయ భారతదేశపు ఈశాన్యప్రాంతంలో 300 కిలోమీటర్ల పొడవు, వంద కిలోమీటర్ల వెడల్పుతో పర్వతమయంగా ఉంటుంది. దీనికి ఉత్తరాన అస్సాం రాష్ట్ర సరిహద్దుగా బ్రహ్మపుత్ర నది.. దక్షిణాన షిల్లాంగ్‌ పట్టణం ఉంటుంది. ఇదే మేఘాలయ రాష్ట్ర రాజధాని కూడా...!

మేఘాలయ వాతావరణం మరీ వేడిగా, అలా అని మరీ చల్లగా ఉండదు. కానీ దేశం మొత్తంలో చూస్తే వర్షాలు మాత్రం ఈ ప్రాంతంలోనే అత్యధికం. ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో 1200 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదవుతుంది. షిల్లాంగ్‌కు దక్షిణాన ఉన్న చిరపుంజి పట్టణం ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతంగా గుర్తింపు పొందింది. ఆ దగ్గర్లోని మాసిన్రామ్‌లో కూడా అంతే.

మేఘాలయలో మూడోవంతు అటవీ ప్రాంతమే. పశ్చిమాన 'గరో' పర్వత శ్రేణులు, తూర్పున 'ఖాసి, జైంతియా' పర్వతశ్రేణులు ఉన్నాయి. కానీ ఇవి మరీ ఎత్తుగా ఉండవు. షిల్లాంగ్‌ శిఖరం అన్నింటికంటే ఎత్తైంది (1,965 మీటర్లు). పర్వతాల్లో విలక్షణమైన 'స్టేలక్టైటు, స్టేలగ్మైటు' సున్నపురాయి వుంటుంది.

వర్షాలు ప్రారంభమైన తర్వాత మేఘాలయలో పర్యాటకులు తప్పనిసరిగా వెళ్లే ప్రదేశం ఒకటుంది. అదే షిల్లాంగ్‌కు సమీపంలోని చిన్న చిన్న గుట్టలు. మధ్యలో రాళ్లు... చుట్టూ పెరిగిన పెద్దపెద్ద చెట్లు కలిగిన ప్రదేశం ఇది. వీటిని ప్రకృతి శక్తులను తృప్తిపరిచేందుకు ప్రత్యేకంగా రూపొందించారని అక్కడుండే ఖాశీ తెగకు చెందిన ఆదివాసీలు చెబుతుంటారు. షిల్లాంగ్‌ నుంచి చిరపుంజికి ప్రయాణం కనువిందు చేసే ప్రకృతి దృశ్యాలతో హాయిగా సాగిపోతుంది. దారి పొడవునా బంగ్లాదేశ్‌ మైదాన ప్రాంతాలు, సుడులు తిరుగుతూ పర్వతాలను కప్పేసే పొగమంచు, గలగలమనే చిన్న చిన్న జలపాతాలు... ఎంత చూసినా తనివి తీరదు. క్షణమైనా రెప్పవేయాలనిపించదు. అంతగా ప్రకృతి సౌందర్యం అలరిస్తుంది. చిరపుంజిలో విశ్రాంతి తీసుకునేందుకు రిసార్టులు అందుబాటులో ఉంటాయి. ఇక ట్రెక్కింగ్‌ చేయడానికి సిద్ధపడితే సహజసిద్ధంగా ఏర్పడిన వంతెనలు ఉండనే ఉన్నాయి. ఇవి ఒక్కోటి 200 సంవత్సరాల పురాతనమైనవి. అన్నీ రబ్బరు చెట్లతో సహజసిద్ధంగా ఏర్పడినట్లు చెబుతుంటారు.

బంగ్లాదేశ్‌ సరిహద్దుల్లోని మాలినోంగ్‌ గ్రామం కూడా మేఘాలయలో చూడదగిందే. ఇది ఆసియాలోనే పరిశుభ్రమైన గ్రామంగా పేరుగాంచింది. ''మేఘాలయ టూరిజం డెవలప్‌మెంట్‌ ఫోరం'' ఈ గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చాలా శ్రమించింది. ఆ శ్రమ ఫలితమా అన్నట్లు నిజంగానే ఆ ప్రాంతం చాలా శుభ్రంగా ఉంటుంది. రంగురంగు పూలు, చెట్ల కొమ్మల మీద విశ్రాంతి గృహాలు కలిగిన మాలినోంగ్‌... మేఘాలయలో తప్పక సందర్శించాల్సిన ప్రాంతాల్లో ఒకటి. ఇక్కడ ప్రజలు కూడా ఎంతో మర్యాదగా వ్యవహరిస్తారు. అయితే వారిని ఫొటోలు మాత్రం తీయనీయరు. షిల్లాంగ్‌ బారా బజార్‌లో స్త్రీల కోసం ప్రత్యేక దుస్తులు దొరుకుతాయి. అక్కడి ఖాసీ మహిళలు వీటిని లేసులు, పూసలతో అందంగా అలంకరించి ధరిస్తారు. అందరికీ అందుబాటు ధరల్లో అంటే... 200 రూపాయల నుంచి వేల రూపాయల ఖరీదు చేసే దుస్తులు ఇక్కడ లభిస్తాయి.

డాన్‌, బోస్కో మ్యూజియం, బారా బజార్‌, షిల్లాంగ్‌ శిఖరం, ఎలిఫెంట్‌ ఫాల్స్‌, సహజ వంతెనలు... మొదలైనవి మేఘాలయలో చూడదగ్గ పర్యాటక ప్రాంతాలు. ఆహారం, విషయానికి వస్తే... చైనీస్‌, టిబెటన్‌, భారతీయ వంటకాలు లభిస్తాయి. ఇక్కడి పోలీస్‌ బజార్‌ ప్రాంతంలో చాలా హోటళ్లున్నాయి. ఈ హోటళ్లన్నింటిలోనూ లభించే 'మొమో'లను అక్కడి వారు ఇష్టంగా తింటుంటారు.

ఎలా వెళ్లాలంటే...
గౌహతి వెళ్లాక, అక్కడి నుంచి రహదారి మార్గంలో ప్రయాణించాల్సి ఉంటుంది. 13వందల రూపాయల అద్దెతో ట్యాక్సీలు దొరుకుతాయి. షేరింగ్‌ పద్ధతిలో అయితే మూడు వందలు అవుతుంది. ఇక షిల్లాంగ్‌లో తిరిగేందుకు కూడా ఈ షేరింగ్‌ ట్యాక్సీలే అనుకూలంగా ఉంటాయి.

సైకిలెక్కి హిమ పర్వతాల్ని చుట్టేద్దాం
ఓ వైపు కొండ.. మరోవైపు లోయలో గలగలా పారే బియాస్‌ నది పరవళ్లు, కొండచిలువలా మలుపులు తిరిగిన తారురోడ్డు, 50 నుండ 100 అడుగుల ఎత్తుదాకా పెరిగిన దేవదారు చెట్ల పరిమళం, నీరెండలో చల్లటి చలి... ఇంతటి వింత అనుభూతిని అందించే ఈ ప్రాంతంలో ఆహ్లాదం తప్ప మరేమీ కనిపిచదు. ఇది మరెక్కడో కాదు... హిమాచల్‌ ప్రదేశ్‌లోని మంచు పర్వతాల్లో...

భగభగమండే ఎండల నుంచి మంచు కొండలకు, కాంక్రీట్‌ అడవుల నుంచి కీకారణ్యానికి, రణగొణ ధ్వనుల నుంచి కిలకిలారావాల వైపుకు మహా కాలుష్యం నుంచి స్వచ్ఛమైన వాతావరణానికి, యాంత్రిక ప్రపంచానికి దూరంగా ప్రకృతి ఒడిలో హాయిగా గడపాలంటే హిమాచల్‌ప్రదేశ్‌కు వెళ్లాల్సిందే!

అక్కడ బోలెడన్ని పర్యాటక ప్రాంతాలున్నప్పటికీ, నేషనల్‌ హిమాలయన్‌ మౌంటెన్‌ బైటింగ్‌ అనే కార్యక్రమంలో భాగంగా కొండల్లో సరదాగా సైకిల్‌ తొక్కుతూ వెళ్లడానికి పర్యాటకులు ఆసక్తి చూపుతారు. చల్లగా వుండే 'కులు' పట్టణానికి 28 కిలోమీటర్ల దూరంలోని ఓట్‌ అనే ప్రాంతం నుంచి ఈ యాత్ర మొదలవుతుంది. సముద్ర మట్టానికి మూడు వేల అడుగుల ఎత్తులో ఉంటుంది ఓట్‌. ఇక్కడి నుంచి సైకిల్‌ తొక్కుకుంటూ వెళ్లాల్సిన ప్రదేశం 'జలోరీ పాస్‌'. ఇది సముద్ర మట్టానికి 10,500 అడుగుల ఎత్తులో వుంటుంది. మొదటి రోజున సైకిల్‌ తొక్కుతూ... 16 కిలోమీటర్ల దూరం వెళ్లాలి. యాత్రను ఏర్పాటు చేసిన నిర్వాహకులే సైకిల్‌ ఇస్తారు. ఇది గేర్ల సైకిల్‌. తలకు హెల్మెట్‌, మోచేతులు, మోకాళ్లకు గార్డ్స్‌, చేతులకు గ్లవ్స్‌, కళ్లకు గాగుల్స్‌ వేసుకుంటే... మనల్ని మనమే గుర్తుపట్టలేం. ఉదయం 8 గంటలకు మొదలవుతుంది ఈ పర్యటన.

'ఓట్‌' వద్ద సుమారు 3 కిలోమీటర్లు పొడవుండే సొరంగం గుండా వెళ్లాల్సి ఉంటుంది. పల్లంగా ఉండే దారిలో సర్రున దూసుకుపోతూ... ఎత్తైన చోట సైకిల్‌ దిగి దాన్ని నడుపుకుంటూ... ఒక్కో మైలురాయి కనిపించినప్పుడల్లా ఇన్ని కిలోమీటర్లు పూర్తి చేశామనే విజయగర్వంతో ముందుకు సాగిపోతుందీ ప్రయాణం.

మధ్యాహ్నానికి బియాస్‌ నది ఒడ్డుకు చేరుకోవచ్చు. నది ఒడ్డున బండరాళ్లపై కూర్చుని నీటి గలగలలు ఆస్వాదిస్తుంటే భలే వుంటుందిలే... అలసటమీద వెంట తెచ్చుకున్న భోజనాన్ని తింటుంటే ఎంత హాయిగా ఉంటుందో. సాయంత్రానికి నిర్వాహకులు ఏర్పాటు చేసిన ప్రదేశంలో బస చేయొచ్చు. నడక, సైకిల్‌ తొక్కడం పెద్దగా అలవాటులేని వారు రాత్రి భోజనాలయ్యాక ఆదమరచి నిద్రపోతుంటారు.

రెండో రోజు యాత్రలో 'జిబి' అనే ఊరు చేరుకోవాల్సి ఉంటుంది. ఇక్కడికి చేరుకోవాలంటే... మొదటిరోజు బస చేసిన ప్రదేశం నుంచి 12 కిలోమీటర్ల దూరం వెళ్లాలి. అయితే ఇది బాగా ఎత్తు ప్రదేశం... సైకిల్‌ తొక్కడం కంటే ఎక్కువసేపు నడవాల్సి ఉంటుంది. మధ్యాహ్నానికల్లా 'జిబి' చేరుకోవచ్చు. ఈ ప్రాంతం దాటి రెండు మూడు ఫర్లాంగుల దూరం అడవిలోకి వెళ్తే చూడముచ్చటైన చిన్ని జలపాతం ఆహ్వానిస్తుంది. అప్పుడే ఐస్‌ కరిగి నీరైనట్టుగా, ఈ జలపాతం నీళ్లు చాలా చల్లగా ఉంటాయి. ఈ నీళ్లలో స్నానం కాదు కదా... నీళ్లు పట్టుకోడానికే వణికిపోతాం. అంత చల్లగా ఉంటాయి.

మూడో రోజున 'షోజా' అనే ప్రాంతానికి చేరుకోవాలి. అక్కడికి వెళ్లాలంటే కేవలం ఎనిమిది కిలోమీటర్ల దూరమే. అంటే మొదటి రెండు రోజులకంటే తక్కువ దూరమే. అయినప్పటికీ ఒక్క అడుగైనా సైకిల్‌ తొక్కలేని పరిస్థితి. ఎందుకంటే నిట్టనిలువు రోడ్డు, పక్కనే పెద్ద పెద్ద లోయలు... తక్కువ బరువున్న సైకిలైనా, చాలా బరువు అనిపిస్తుంది. ఇలాంటి కొండల్లో కూడా విసిరేసినట్లుగా అక్కడక్కడ ఇళ్లు కనిపిస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఈ ఇళ్లలో ఫ్రిజ్‌ తప్ప అన్ని వసతులూ అందుబాటులో ఉంటాయి. అక్కడ ఫ్రిజ్‌ అవసరం వుండదుగా మరి.

భూమికి ఎనిమిది వేల అడుగుల ఎత్తులో ఉండే షోజాలో చలి జిల్లుమనిపిస్తుంది. వేసవిలోనే చాలా చలిగా ఉండే ఈ ప్రాంతం, చలికాలంలో అయితే అసలు ఊహించుకోడానికే వణికిపోతారు.

చివరి మజిలీ 'జలోరీ పాస్‌'. షోజా నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుందది. అయితే బాగా ఎత్తుగా ఉంటుంది. సైకిల్‌ తీసుకెళ్లినా లాభం ఉండదు. అందుకే నడిచే వెళ్లాలి. అలా వెళ్తుంటే వచ్చే మలుపుల ముందు తిరుమల కొండ, శ్రీశైలం మలుపులు కూడా బలాదూరే. ఇక్కడ పొరపాటున కాలుజారి కిందపడితే ఎముకల్లో సున్నం కూడా మిగలదు. అయితే అక్కడక్కడ కొండరాళ్లపై పేరుకుపోయిన మంచును తాకుతూ నడుస్తుంటే కలిగే ఆనందం మాత్రం మాటల్లో చెప్పలేనిది.

అలా జలోరీ పాస్‌ చేరుకున్నాక... అక్కడికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉండే 'శేషనాగ సరస్సు' చూడదగ్గది. ఇక్కడికి వెళ్లాలంటే మొత్తం అడవిలోనే నడవాల్సి ఉంటుంది. చిన్న సరస్సు, నల్లటి రంగులో నీళ్లు, చుట్టూ చెట్లున్నా సరస్సులో ఆకు అనేదే కనిపించకపోవడం వింతగా అనిపిస్తుంది. అయితే అది స్థానికులకు ఓ పవిత్రమైన కొలను. ఆ పక్కనే గుడి కూడా ఉంటుంది. సరస్సు అందాలు... దగ్గర్లోని మంచుకొండల సోయగాలు... చూసేందుకు రెండు కళ్లూ సరిపోవు.

పైకి ఎక్కడం కంటే... కిందికి దిగటం సులువే కాబట్టి... తిరుగు ప్రయాణానికి హాయిగా, ఆనందంగా బయలుదేరొచ్చు. అయితే ఆ ఆనందం వెనుక అపాయం పొంచే ఉంటుంది. ఎందుకంటే సైకిల్‌ బ్రేక్‌ ఏ మాత్రం ఫెయిల్‌ అయినా.. అదుపు తప్పినా అంతే సంగతులు. కాబట్టి చాలా జాగ్రత్తగా కిందికి దిగాల్సి ఉంటుంది.

చల్లటి ఐస్‌ లాంటి నీళ్లు, పర్వతాలు, కొండలు, లోయలు, సైకిల్‌ తొక్కినందుకు కాళ్ల నొప్పులు, ఆ నొప్పులతోనే ఆదమరచి నిద్ర. ఆనందం... ఆహ్లాదం... ఆ వెనకే పొంచిఉండే ప్రమాదం ... చలి, ఆ చలిలోనే చెమట... మంచు, వర్షం... ఇలాంటి అందమైన ఆహ్లాదకరమైన ప్రయాణమే ఇది.

నేషనల్‌ హిమాలరు మౌంటెన్‌ బైకింగ్‌ పేరుతో వ్యవహరించే ఈ టూర్‌ను యూత్‌ హాస్టల్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (వైహెచ్‌ఏఐ) అనే సంస్థ ఏర్పాటు చేస్తోంది. అంతేకాకుండా ఈ సంస్థ పలు ట్రెక్కింగ్‌ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఆసక్తి ఉన్న పర్యాటకులు తమ పేర్లను నమోదు చేసుకుని పర్యటించొచ్చు. మరిన్ని వివరాల కోసం వైహెచ్‌ఏఐ ఇండియా డాట్‌ ఆర్గ్‌ అనే వెబ్‌సైట్‌ను చూడొచ్చు. 

Saturday, 16 June 2018

వాన జల్లుల్లో..లేత ఎండల్లో..






వాన జల్లుల్లో..లేత ఎండల్లో..

‘విహారయాత్రలు వేసవి సెలవుల్లోనే!’ అనే కాన్సెప్ట్‌ పాతబడు తోంది. ‘ఆనందించే హృదయం, ఆస్వాదించే నైజం ఉండాలే కాని సీజన్‌తో పనేముంది? కొండల్లో, కోనల్లో, లోయల్లో, పచ్చటి మైదానాల్లో నడుస్తూ... కురిసే చినుకు మధ్య తడుస్తూ... ప్రకృతిని తిలకించి పరవశించిపోవడం కన్నా సుఖం ఏముంటుంది?’ అంటోంది కొత్త తరం. అందుకే మాన్‌సూన్‌ టూర్స్‌ ఇప్పుడు పాపులర్‌ అవుతున్నాయి. మన దేశంలో ఎక్కువమంది ఎంపిక చేసుకుంటున్న అలాంటి గమ్యాల్లో కొన్ని... 


జీవితకాలపు అనుభూతి అగుంబే
ఎక్కడుంది?: కర్నాటక రాష్ట్రం షిమోగా జిల్లాలో. 

ప్రత్యేకతలేమిటి?:
‘దక్షిణ భారత చిరపుంజి’గా పేరు పొందిన అగుంబే అనేక ప్రత్యేకతలకు నెలవు. చుట్టూ దట్టమైన అడవులున్న ఈ ప్రాంతం సహ్యాద్రి పర్వతాల్లో మాల్నాడ్‌, శరావతి లోయల మధ్య ఉంటుంది. మైమరపించే జలపాతాలకూ, అత్యద్భుతమైన సౌందర్యానికీ అగుంబే పెట్టింది పేరు. ప్రకృతి ప్రేమికులు తప్పనిసరిగా చూడాల్సిన చోటు ఇది. అగుంబే ఘాట్‌ రోడ్డు దగ్గర నిలబడి- అరేబియా మహా సముద్రంలో సూర్యుడు అస్తమిస్తున్న దృశ్యం చూడడం జీవితకాలానికి సరిపోయే అనుభూతి అనడం అతిశయోక్తి కాదు. ఇక, కింగ్‌ కోబ్రాలకు ఈ ప్రాంతం పుట్టినిల్లు. ఇతర జాతుల సర్పాలు కూడా ఈ వర్షారణ్యంలో పెద్ద సంఖ్యలో ఉంటాయి. అరుదైన జంతు, వృక్షజాలంపై ఇక్కడ విస్తృతంగా పరిశోధవాన జరుగుతున్నాయి.

ఎలా వెళ్ళాలి?:
మంగుళూరుకు సుమారు 100 కిలోమీటర్ల దూరంలో అగుంబే ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ప్రాంతాల నుంచి మంగుళూరుకు రైలు సౌకర్యం ఉంది. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో అగుంబే చేరుకోవచ్చు. సమీప విమానాశ్రయం మంగుళూరులో ఉంది. హైదరాబాద్‌ నుంచి రైళ్ళ కన్నా రోడ్డు మార్గంలో (బెంగళూరు మీదుగా) తక్కువ సమయంలో వెళ్ళవచ్చు.

వసతి:
అగుంబేలో అన్ని బడ్జెట్లకూ సరిపోయే వసతి సదుపాయాలున్నాయి. అయితే అన్నిటికన్నా ఆకర్షించేది దొడ్డ మేను బంగళా. నూట యాభై ఏళ్ళ నాటి భవనంలో నడుస్తున్న ఈ వసతి గృహాన్ని కస్తూరక్క అనే వృద్ధురాలు నిర్వహిస్తున్నారు. సంప్రదాయ పద్ధతుల్లో చేసిన ఇంటి భోజనం, ఎంతో చరిత్ర కలిగిన పాత కాలం ఇంట్లో బస... పర్యాటకులకు ప్రధాన ఆకర్షణ. అన్నట్టు ఈ భవనంలోనే ‘మాల్గుడి డేస్‌’ హిందీ సీరియల్‌ చిత్రీకరించారు.


వానంతా అక్కడే! మౌసిన్‌రామ్‌
ఎక్కడుంది?: మేఘాలయ రాష్ట్రంలోని ఈస్ట్‌ ఖాసీహిల్స్‌ జిల్లాలో. 

ప్రత్యేకతలేమిటి?:
ప్రపంచంలోనే అతి ఎక్కువ వర్షపాతం కలిగిన ప్రదేశంగా మౌసిన్‌రామ్‌ గిన్నిస్‌ బుక్‌లో చోటు సంపాదించుకుంది. అంతకు ముందు ఆ ఘనత మౌసిన్‌రామ్‌కు దగ్గర్లో ఉన్న చిరపుంజికి ఉండేది. అంతేకాదు, ఎప్పుడూ తేమగా ఉండే ప్రదేశంగా కూడా మౌసిన్‌రామ్‌ గుర్తింపు పొందింది. ఏడాదిలో కనీసం ఆరు నెలల పాటు ఇక్కడ వర్షాలు పడుతూనే ఉంటాయి. అందుకని ఇక్కడి ప్రజలు కావలసిన సరుకులన్నీ నిల్వ చేసుకుంటూ ఉంటారు. వర్షాలు ఎక్కువ కాబట్టి వృక్షజాలం బాగా పెరుగుతుంది. చెట్ల వేర్లను ఒకదానితో ఒకటి అల్లి, వెదురు కర్రలతో వంతెనలను ఈ గ్రామస్థులు తయారు చేస్తారు. వీటిలో కొన్ని వంతెనలు వంద మీటర్ల పొడవు కూడా ఉంటాయి. కనీసం అయిదారుగురిని అవలీలగా మోయగలిగేంత పటిష్ఠంగా ఇవి తయారవుతాయి. ఇలాంటి వంతెనలు మరెక్కడా కనిపించవు.

ఎలా వెళ్ళాలి?:
గువాహటికి సుమారు 150 కిలోమీటర్ల దూరంలో మౌసిన్‌రామ్‌ ఉంది. తెలుగు రాష్ట్రాల నుంచి గువాహటికి రైళ్ళలో నేరుగా వెళ్ళవచ్చు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మౌసిన్‌రామ్‌ చేరుకోవచ్చు. సమీప ప్రధాన విమానాశ్రయం గువాహటిలో ఉంది.

వసతి:
మౌసిన్‌రామ్‌లో గెస్ట్‌హౌ్‌సలు, రిసార్టులు, హోటళ్ళు ఉన్నాయి. హోమ్‌ స్టే సదుపాయం కూడా అందుబాటులో ఉంది.


కొండా కోనల్లో... అంబోలి
ఎక్కడుంది?: మహారాష్ట్రలోని సింధుదుర్గ్‌ జిల్లాలో
ప్రత్యేకతలేమిటి?:
ఎటు చూసినా జలపాతాలతో, ఎత్తైన కొండలతో, చల్లటి గాలులతో ఆహ్లాదం కలిగించే ప్రాంతం అంబోలి. వేసవి విడిదిగానే కాదు, వర్షాకాలంలో సందర్శించడానికి అనువైన గమ్యంగా కూడా ఇది ప్రసిద్ధి చెందింది. వర్షపాతం ఎక్కువ కాబట్టి ఎప్పుడూ తడిగా కనిపించే అంబోలిలోని పల్లె వాతావరణం మనసుకు ప్రశాంతత కలిగిస్తుంది. సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో ఉన్న ఈ ప్రదేశం నుంచి సూర్యోదయాలూ, సూర్యాస్తమయాలూ వీక్షించడం ఒక మరపురాని అనుభూతి.

ఎలా వెళ్ళాలి?:
కర్నాటకలోని బెల్గాం నగరానికి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ప్రాంతాల రైళ్ళు ఉన్నాయి. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో 28 కి.మీ. దూరంలో ఉన్న అంబోలి చేరుకోవచ్చు. సమీప విమానాశ్రయం 113 కిలోమీటర్ల దూరంలోని గోవాలో ఉంది.

వసతి:
మహారాష్ట్ర టూరిజం, ప్రైవేటు సంస్థల యాజమాన్యంలో వసతి, భోజన సదుపాయాలున్నాయి.


అంతా పూల దుప్పటే! - వ్యాలీ ఆఫ్‌ ఫ్లవర్స్‌
ఎక్కడుంది?: ఉత్తరాఖండ్‌లోని ఛమోలీ జిల్లాలో
ప్రత్యేకతలేమిటి?:
ప్రకృతి అందాలను తనివితీరా చూడాలని కోరుకొనేవారికి వ్యాలీ ఆఫ్‌ ఫ్లవర్స్‌ నేషనల్‌ పార్క్‌ కన్నా మంచి ప్రదేశం మరొకటి ఉండదేమో.! చుట్టూ మంచు కప్పేసిన కొండలూ, అపురూపమైన బ్రహ్మకమల పుష్పాలతో సహా దాదాపు మూడువందల రకాల జాతుల పూలూ, విశాలమైన మైదానాలూ... అంతేకాదు అరుదైన సీతాకోక చిలుకలకూ, నల్లటి హిమాలయపు ఎలుగుబంట్లూ, కస్తూరి జింక లాంటి జీవాలకూ నిలయం ఇది. హిమవంతుడి కూతురు పార్వతీ దేవి ఉద్యానంగా దీన్ని అభివర్ణిస్తూ ఉంటారు. అందుకే ‘దేవభూమి’ అని పిలుస్తారు. ఇక్కడ హఠాత్తుగా మబ్బులు ముంచుకొచ్చి తడిపేసి పోతూ ఉంటాయి. జూన్‌ నుంచీ నవంబర్‌ వరకూ మాత్రమే సందర్శకులను ఈ వ్యాలీలోకి అనుమతిస్తారు. పూల సోయగాలు చూడాలంటే జూలై, ఆగస్ట్‌ నెలలు ఉత్తమం. ట్రెక్కింగ్‌ కోసం కూడా చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు. ఢిల్లీ, హరిద్వార్‌, ఋషీకేశ్‌ల నుంచి టూర్‌ ఆపరేటర్లు ప్రత్యేక ట్రెక్కింగ్‌ ప్యాకేజీలు నిర్వహిస్తారు. ఈ లోయను ప్రపంచ వారసత్వ సంపదగా ‘యునెస్కో’ గుర్తించింది. వ్యాలీ ఆఫ్‌ ఫ్లవర్స్‌ కు వెళ్ళే దారిలో హిమకుండ్‌ సాహిబ్‌ గురుద్వారానూ, గోవింద్‌ఘాట్‌కు 25 కి.మీ. దూరంలోని బదరీనాథ్‌నూ కూడా దర్శించుకోవచ్చు.

వసతి:
వ్యాలీ ఆఫ్‌ ఫ్లవర్స్‌లో వసతి సదుపాయాలు లేవు. సుమారు 21 కిలోమీటర్ల దూరంలో ఉన్న జోషీమఠ్‌లో కానీ, 49 కిలోమీటర్ల దూరంలోని ఛమోలీలో కానీ బస చేయవచ్చు.

ఎలా వెళ్ళాలి?:
ఢిల్లీ నుంచి హరిద్వార్‌, గోవింద్‌ఘాట్‌ మీదుగా రోడ్డు మార్గంలో వ్యాలీ ఆఫ్‌ ఫ్లవర్స్‌ చేరుకోవాల్సి ఉంటుంది. హరిద్వార్‌కు సుమారు 290 కిలోమీటర్ల దూరంలో ఈ పూల లోయ ఉంది. గోవింద్‌ఘాట్‌ నుంచి సుమారు 15 కిలోమీటర్లు ట్రెక్కింగ్‌ చేయాల్సి ఉంటుంది. గుర్రాల మీదా, డోలీల్లో కూడా వెళ్ళొచ్చు.


పన్నెండేళ్ళకు ఓసారి... - మున్నార్‌
ఎక్కడుంది?: కేరళలోని ఇడుక్కి జిల్లాలో
ప్రత్యేకతలేమిటి?:
తేయాకు, సిల్వర్‌ ఓక్‌ తోటలూ, లోయలూ, పర్వత శ్రేణులతో అలరారే మున్నార్‌ను భూతల స్వర్గంగా పర్యాటకులు వర్ణిస్తూ ఉంటారు. కేరళకు వచ్చే టూరిస్టులు తప్పనిసరిగా సందర్శించే ప్రాంతం ఇది. పడమటి కనుమలలో ఉన్న మున్నార్‌ చుట్టూ కొండలు ఆవరించి ఉంటాయి. ట్రెక్కింగ్‌ కోసం చాలామంది ఇక్కడికి వస్తారు. అలాగే ఘాట్లలో బైక్‌ల మీద చేరుకొనే వారు కూడా ఎక్కువే. మున్నార్‌ చుట్టుపక్కల చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఫోటోపాయింట్‌, ముత్తిరప్పుళ నది, ఇడుక్కి ఆర్క్‌ డ్యామ్‌, దేవికుళం హిల్‌ స్టేషన్‌, అట్టుకల్‌ జలపాతం వీటిలో కొన్ని. పన్నెండేళ్ళకు ఒకసారి మున్నార్‌ కొండల మీద ‘నీల కురంజి’ అనే జాతి పూలు పూస్తాయి. అప్పుడు నేలంతా పూల దుప్పటి కప్పుకున్నట్టుంటుంది. ఈ పుష్పాల్లో నలభైకి పైగా రకాలున్నాయి. వాటిలో కూడా వివిధ రంగులుంటాయి. అన్నట్టు, పుష్కరం- అంటే 2006వ సంవత్సరం తరువాత ఆ పూలు పూసేది ఈ ఏడాదే! జూలై నుంచి నవంబర్‌ మధ్య మున్నార్‌ టూర్‌ ప్లాన్‌ చేసుకుంటే ఆ పూల ఋతువును మీ కళ్ళల్లో నింపుకోవచ్చు.

ఎలా వెళ్ళాలి?:
ఎర్నాకుళం నగరానికి మున్నార్‌ సుమారు 130 కిలోమీటర్ల దూరంలో మున్నార్‌ ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ప్రాంతాల నుంచి మున్నార్‌కు రైళ్ళు ఉన్నాయి. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మున్నార్‌ చేరవచ్చు. సమీప విమానాశ్రయం కొచ్చిన్‌ (కొచ్చి)లో ఉంది.

వసతి:
మున్నార్‌లో సాధారణ హోటళ్ళు మొదలుకొని లగ్జరీ రిసార్టుల వరకూ... అన్ని బడ్జెట్లకూ అనువైన వసతి సదుపాయాలూ ఉన్నాయి.


పచ్చని ప్రకృతి ఒడిలో...  కొడైకెనాల్‌
ఎక్కడుంది?: తమిళనాడులోని దిండిగల్‌ జిల్లాలో
ప్రత్యేకతలేమిటి?:
తమిళనాడులో ఊటీ తరువాత ఎక్కువ మంది సందర్శించే చోటు కొడైకెనాల్‌. దేశ, విదేశీ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్న హిల్‌ స్టేషన్లలో ఇదొకటి. సమ్మర్‌ డెస్టినేషన్‌గా కొడైకెనాల్‌ ఖ్యాతి అందరికీ తెలిసిందే. అయితే ఈ ప్రాంతంలో జలపాతాలు ఉధృతంగా కనిపించేది మాత్రం వర్షాకాలంలో. వాతావరణం కూడా ఈ సీజన్లో హాయిగా ఉంటుంది. ఎండా, వానా దోబుచులాడుతూ ఉంటాయి. తడిసిన లోయలూ, పొగ మబ్బులు కమ్ముకున్న కొండలతో కొడైకెనాల్‌ చూడచక్కగా కనిపిస్తుంది. కొండలూ, మైదానాలూ, జలపాతాలూ, కొలనులతో సహజ సౌందర్యానికి ఆటపట్టుగా ఇది నిలుస్తోంది. సైకిలింగ్‌, బోటింగ్‌, ట్రెక్కింగ్‌, హార్స్‌ఏరైడింగ్‌ లాంటి సాహసాలకూ, వినోదాలకూ, గోల్ఫ్‌ లాంటి క్రీడలకూ ఇక్కడ లోటు లేదు. కొడైకెనాల్‌లో కూడా పన్నెండేళ్ళకు ఒకసారి నీల కురంజి పుష్పాలు పూస్తాయి. ఈ ఏడాది జూలై నుంచి అక్టోబర్‌ మధ్య వీటిని చూడవచ్చు. సమీపంలోని సైలెంట్‌ వ్యాలీ, పచ్చ లోయ, ఫౌనా ఫ్లోరా పూల మ్యూజియం, బ్రయంట్‌ పార్క్‌, బెరిజం చెరువు వ్యూ పాయింట్‌, కొడైకెనాల్‌ చెరువు, వెండి జలపాతం తప్పనిసరిగా సందర్శించాల్సిన ప్రదేశాల్లో కొన్ని.

ఎలా వెళ్ళాలి?:
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ప్రాంతాల నుంచి మదురై వైపు వెళ్ళే రైళ్ళు కొడైకెనాల్‌ రోడ్డు రైల్వే స్టేషన్‌లో ఆగుతాయి. అక్కడి నుంచి సుమారు 80 కిలోమీటర్ల దూరంలో కొడైకెనాల్‌ ఉంది. సమీప విమానాశ్రయం మదురైలో ఉంది. (120 కి.మీ.)

వసతి:
కొడైకెనాల్‌లో యాత్రికులు బస చేసేందుకు అనుకూలమైన సదుపాయాలు విస్తృతంగా ఉన్నాయి.

Tuesday, 7 June 2016

హిమశిఖరాల సొగసు.. షిల్లాంగ్‌




NohkalikaiFalls

అంబరాన్ని తాకే కొండలు, పాతాళాన్ని మరిపించే ప్రకృతి సిద్ధమైన లోయలు, ఎక్కడ చూసినా పరుచుకున్నట్లు కనిపించే పచ్చదనం, ఎత్తయిన పర్వత శిఖరాల అంచుల నుండి జాలువారే జలపాతాలు చూడాలంటే షిల్లాంగ్‌ను సందర్శించాల్సిందే. భారతదేశపు ఈశాన్య ప్రాంతంలో అతి చిన్న రాష్ర్టమైన మేఘాలయా రాజధాని ఈ షిల్లాంగ్‌.
 Elephant Falls Shillong

షిల్లాంగ్‌ ప్రకృతి అందాలను చూసి, ఆ దేవదేవుడైన మేఘరాజు మైమరచిపోయి తన పరివారంతో పర్యావరణ అందాలను పరికించడానికి కొండలపైకి అరుదెంచాడా అన్నట్లుంటుంది. ఇక్కడి వాతావరణాన్ని గమనిస్తే, కొండల మీద పాము మెలికను తలపించే కాలిబాటలు, దట్టమైన అడవులు కనువిందు చేస్తాయి.

ఇక్కడ ఎల్లప్పుడూ వర్షం తుంపరలు పడుతూ ఎంతో ఆహ్లాదానికి గురిచేస్తాయి. ప్రతిరోజూ ఇక్కడ వర్షం కురవడం షిల్లాంగ్‌ ప్రత్యేకత. ఇక్కడ వీచే చల్లని గాలులతో కదిలే పూదోటలు చెట్ల ఆకుల సవ్వడులు ఓ చిత్ర విచిత్రమైన సంగీతాన్ని ఆలపిస్తున్నట్లుగా ఉంటుంది. వీనులవిందైన ఆ సవ్వడి మనస్సుకు ఎంతో ఉత్తేజాన్ని కలుగజేస్తుంది. 
Living Root Bridge of Cherrapunji

షిల్లాంగ్‌లోని అడవులలో వందల కొద్ది పక్షి జాతులు, వాటికి పోటీపడేలా జంతు జాతులు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంటాయి. పక్షులు, జంతువులు కలిసి సంగీత కచేరీ చేస్తున్నట్లుగా ఉంటాయి వాటి ధ్వనులు. ఇలాంటి ప్రకృతి సహజ ధ్వనుల మధ్య పెరిగి నందుకేనేమో మేఘాలయా జాతి ప్రజలలో కూడా సంగీతం సహజంగానే వచ్చినట్లుంటుంది. 

మేఘాలయా ప్రజల పాటలు, సంగీత వాయిద్యాలు కూడా అన్నీ విశేషాలుగానే చెప్పుకోవచ్చు. ఇక్కడి ప్రతి కుటుంబంలోనూ ఒక గాయకుడు, వాయిద్య కారుడు తప్పకుండా ఉంటారు. ప్రతి పది కుటుంబాలకు కలిసి ఒకే మ్యూజికల్‌ బ్యాండ్‌ కూడా ఉంటుంది. ఈ రకంగా, ప్రకృతి సంగీతంలో మమేకమైన ఈ ప్రజలు, వారు పాడే పాటలో్లనూ, వాయిద్యాల లోనూ ఆ సంగీతాన్ని ప్రపంచానికి వినిపిస్తున్నారు.

మేఘాలయాలో మూడో వంతు అటవీమయం కాగా... పశ్చిమాన ‘గారో’ పర్వత శ్రేణులు, తూర్పున ‘ఖాసి’, ‘జైంతియా’ పర్వతశ్రేణులు ఉన్నాయి కానీ, ఇవి మరీ ఎత్తైనవి కావు. ‘షిల్లాంగ్‌ శిఖరం’ అన్నింటికంటే ఎత్తైనది (1,965 మీటర్లు).

ఇలా వెళ్లాలి:
షిల్లాంగ్‌కు 40 కిలోమీటర్ల దూరంలో ఉమ్రోయ్‌ ఎయిర్‌పోర్టు ఉంది. వారంలో నిర్దేశిత రోజులో్ల కలకత్తా నుంచి ఉమ్రోయ్‌కు విమానాలుంటాయి. అలాగే గౌహతిలోని గోపినాథ్‌ బోర్డోలోయ్‌ ఎయిర్‌పోర్టు నుంచి ఇక్క డికి చేరుకోవచ్చు. మేఘాలయా నుంచి మాత్రం రైలు సౌకర్యం లేదు. అయితే దేశంలోని అన్ని ముఖ్య పట్టణాల నుంచి గౌహతికి మాత్రం రెగ్యులర్‌గా రైళ్ళు నడుస్తుంటాయి.

Monday, 14 September 2015

ఆరు నెలలు వానే

దిక్కులు పిక్కటిల్లే ఉరుముల గర్జనలు. పట్టపగళ్లు కంటిని పొడిచే చీకట్లు. రాలే చినుకులకు పోటీగా పిడుగులు. రోజులు, వారాలు వెరవని కుండపోత వర్షం. ఎడతెరిపి లేకుండా ఆరునెలల పాటు వానలో నానే గ్రామం మన దేశంలోనే ఉంది. పాదాల్ని తాకుతూ వెళ్లే మలయ మారుతాలు, పచ్చగా తడారని అడవులు, ఎప్పుడూ సడి చేసే సెలయేళ్లతో భూలోక స్వర్గ ధామంగా నిలిచిన ప్రాంతమది. ప్రపంచంలోనే అత్యంత తడి ప్రాంతంగా గుర్తించిన ఆ ప్రాంతం అందరూ అనుకునేట్టు చిరపుంజి కాదు.. మాసిన్రామ్‌. మేఘాల డోలికల్లో ఆటలాడుతూ, చినుకుతడికి పరవశించిన పువ్వులా అందాల్ని వికసిస్తుంది ఆ చెమ్మనైన ప్రాంతం. 

చిరపుంజికి దగ్గరలోనే ఉన్న కుగ్రామాల క్లస్టర్‌ ఈ ప్రాంతం. ప్రపంచంలో అత్యధికంగా వర్షపాతం నమోదైన గ్రామంగా గిన్నిస్‌ బుక్‌ రికార్డులకు ఎక్కింది మాసిన్రామ్‌. మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌కు కేవలం 65 కిలోమీటర్ల సమీపంలోనే ఉంటుంది. మేఘాలకు ఆలయమైన ఆ రాష్ట్రంలో అధిక వర్షపాతం సాధారణమే అయినా ఈ ప్రాంతంలో మాత్రం అది అతి తీవ్రం. మేఘాలను తమకు వస్త్రంలా చుట్టుకునే ఖాసీ కొండల్లో ఈ ప్రాంతం విస్తరించి ఉంది. ఇంత దుర్భేద్య వాతావరణ పరిస్థితుల్లోను స్థానిక ఖాసీ ప్రజలు జీవనం సాగిస్తున్నారు. ఆరు నెలలు ఓపిగ్గా ఇళ్లలో నిరీక్షిస్తే వసంతం వచ్చేస్తుందని చాలా తేలిగ్గా చెప్పేస్తారు. అందాక బుట్టల్ని, చీపుర్లను అల్లుతూ, వారి ప్రత్యేకత అయిన టార్టాన్‌ శాలువాలను నేస్తూ గడుపుతారు. మబ్బులు వీడినా చెమ్మ ఆరని ఆ ప్రాంతంలో వర్తక వాణిజ్యాలు చేసుకుంటారు. మబ్బులన్నీ కరిగి చలికాలం వచ్చేస్తే తీరిగ్గా ఇంటి మరమ్మతులకు కుటుంబమంతా కదులుతుంది. అంత అలజడి సృష్టించే వర్షంపై వారికి చాలా గౌరవం. వర్షాకాలం పూర్తయింది కదా అని ఏ పండగ పబ్బం చేసుకుని సంతోషాల్లో మునిగిపోరు. వెంటనే పనుల్లో నిమగమై రహదారులు, మార్కెట్లను సరిచేసు కుంటారు. విరిగిపడిన కొండ చరియల్ని పక్కకు తొలగించడం, వరద నీరు కూల్చేసిన నిర్మాణాలను పునరుద్ధరించడానికే చాలా రోజులు పడతాయి. 

రికార్డు వర్షపాతం విషయంలో కొలంబియాలోని లియోరో, లోపెజ్‌ డెల్‌ మికారు ప్రాంతాలతో వివాదముంది. కానీ, 1985లో ఇక్కడ కురిసిన 26,000 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుతో వాటిని పక్కకు నెట్టింది. సముద్ర మట్టానికి 7000 అడుగుల ఎత్తులో బంగాళా ఖాతం దగ్గరగా ఉండటం వల్ల ఈ స్థాయి వర్షపాతానికి కారణం. ఇక్కడ భారీగా గుంపులు గుంపులుగా ఉండే కొండల వల్ల ఋతుపవనాల మార్గం బాగా ఇరుకై నొక్కుకునేలా వెళ్లడంతో కుండపోత కురుస్తుందని వాతావరణ నిపుణుల వివరణ. స్థానిక జలాశయాల నుంచి తయారయ్యే మేఘాలు కొండల్ని చుడుతూ పైకి లేచే క్రమంలో చల్లబడి వర్షిస్తాయి. మే, జూలై నెలల్లో వర్షం తన ప్రతాపాన్ని చూపిస్తుంది.

అంత వర్షం పడినా అక్కడ మంచినీటి లభ్యత కష్టమే. విద్యుత్‌ సదుపాయం ఉన్నా కోతలే ఎక్కువ. ఆ గ్రామాలను కలుపుతూ ప్రధాన రహదారి ఒక్కటే ఉంది. అక్కడ ప్రత్యేకంగా పెరిగే గడ్డితో వారు తమ ఇళ్లను నిర్మించుకుంటారు. అది చక్కటి సౌండ్‌ ప్రూఫ్‌గా పనిచేసి ఉరుములు, పిడుగుల శబ్దాలను తగ్గిస్తుంది. కుండపోతగా కురుస్తున్న చినుకుల శబ్దం వల్ల గ్రామస్తులు పెద్ద గొంతుకతో మాట్లాడుకుంటారు. వారికి ఆ వాతావరణం ఎంతలా అలవాటైందంటే ఏ చింత లేకుండా జీవనం సాగిస్తున్నారు. గ్రామాన్ని, వర్షాన్ని ప్రేమిస్తూ హాయిగా బతికేస్తున్నారు. 

నెలల ముందు నుంచే వర్షాకాల పరిస్థితులకు సన్నద్ధమవుతారు. వంటచెరకును అడవి నుంచి సమకూర్చుకుంటారు. అదే వారి వంటకు, కాంతికి ఆధారం. ఆహార ధాన్యాలను నిల్వ చేసుకుంటారు. క్నప్‌ అనే ఛత్రం ఇక్కడ ప్రత్యేకం. మోకాలి వరకు ఉండే ఈ గొడుగులను వెదురు చీలికలు, ప్లాస్టిక్‌ పట్టాలు, చీపురు గడ్డితో తయారు చేస్తారు. చూడ్డానికి తాబేలు డొప్పలా ఉండే ఈ గొడుగులను శరీరానికి కట్టుకుని పనులు చేస్తుంటారు. రెండు చేతులతో సులువుగా పనిచేసుకునేలా చాలా నేర్పుగా వీటిని స్థానిక మహిళలు తయారు చేస్తారు. ఈదురు గాలుల్లోను పనులు చక్కబెట్టుకునేందుకు ఇవి ఉపయోగ పడతాయి. చీపురు గడ్డిని నీటిలో తడిపి చెక్క దిమ్మెలతో వాటిని బల్లపరుపుగా చేసి ఎండబెడతారు. దీనివల్ల గడ్డి చాలా దృఢంగా మారుతుంది. ఇక్కడ తయారు చేసిన చీపుర్లు, బుట్టలు, శాలువాలు ఎగుమతి అవుతాయి. వర్షాకాలానికి ముందు కొందరు వేరే ప్రాంతాల్లో ఉన్న తాత్కాలిక నివాసాలకు తరలిపోతారు. స్థానికుల పేర్లు గమ్మత్తుగా ఉంటాయి. మూన్‌స్టార్‌ అనే పేర్లు ఇక్కడ సాధారణం. బ్రిటీష్‌ కాలనీలు, మిషనరీల ప్రభావం వల్ల వీరు అలా పేర్లు పెట్టుకోవడం అలవాటైంది. చాలామందికి వాటి అర్థాలు తెలీదు.

ప్రకృతి వంతెనలు
ప్రకృతిని తమకు అనుకూలంగా మార్చు కోవడంలో వీరికి వీరే సాటి. రబ్బర్‌ చెట్ల వేర్లను ఒకదానికొకటి వెదురు బొంగుల ద్వారా అల్లుకునేలా చేసి వంతెనలు నిర్మించుకుంటారు. సజీవ వంతెనలుగా ఆశ్చర్యం గొలిపే వీటి ద్వారానే అడవుల్లో, గ్రామాల్లో తిరుగుతుంటారు. కొన్ని చాలా విశాలంగా మన కాంక్రీట్‌ వంతెనల పొడవు ఉంటాయి. చాలా దృఢంగా మారేందుకు ఏళ్ల తరబడి వేచి చూస్తారు. కొన్నింటికి దశాబ్దాల కాలం పడుతుంది. ఇలాంటి వంతెనలు ప్రపంచంలో మరెక్కడా కనబడవు. ఇలా ప్రకృతితో మమేకమై అసాధారణ వాతావరణానికి అనుకూలంగా మారి బతుకు బండిని లాగించేస్తున్నారు.

బృహదీశ్వరాలయం B

అణువణువూ అద్భుతం బృహదీశ్వరాలయం ‘‘గుడులూ గోపురాలకు పేరొందిన తమిళనాడు రాష్ట్రాన్ని సందర్శించాలనుకునే వాళ్లకు ముందుగా గుర్తొచ్చేది తంజావూరు...