Showing posts with label కృష్ణ. Show all posts
Showing posts with label కృష్ణ. Show all posts

Tuesday, 31 October 2017

ఉడుపి భూలోక వైకుంఠం

ఉడుపి భూలోక వైకుంఠం


సరిగ్గా బ్రాహ్మీముహూర్తం రాగానే శంఖనాదాలు, దుందుభులు, నగారాలతో ప్రతిధ్వనిస్తుంది ఉడుపి మఠం. ఆలయ పూజారులతో సహా మఠంలో పని చేసేవారందరూ ఆ దివ్యనాదాలతో మేల్కొని, తమ దైనందిన చర్యలు ప్రారంభిస్తారు. కర్ణాటకలోని పేరెన్నికగన్న పుణ్యక్షేత్రాల్లో ప్రసిద్ధి పొందినది ఉడుపి. ధనిక-పేద; అగ్ర-నిమ్న కులాలనే భేదభావాలు మనుషులకే తప్ప, పరమాత్ముడికి లేవనేందుకు సాక్షాత్తూ ఆ కృష్ణభగవానుడే నిదర్శనం చూపించిన పుణ్యస్థలి ఉడుపి.

కర్ణాటక రాష్ట్రంలోని దక్షిణ కన్నడ జిల్లాకు పశ్చిమంగా, మంగుళూరుకు 60 కి.మీ దూరంలో ఉంది. ఉడుపి పుణ్యక్షేత్రం. నిత్యం ఉత్సవాలతో, లక్షలాది మంది యాత్రికులతో కళకళలాడుతూ ఉంటుంది ఈ పవిత్ర యాత్రాస్థలం. ‘ఉడుప’(చంద్రుడు)’ అనే పదాన్ని అనుసరించి ఈ క్షేత్రానికి ఉడుపి అనే పేరు వచ్చింది. పేరుకు తగ్గట్టే ఈ పవిత్ర క్షేత్రం స్వచ్ఛంగా, వెన్నెలలో ప్రకాశించే చంద్రుడిలా అద్వితీయమైన, అగోచరమైన దివ్యచైతన్యంతో అక్కడక్కడ పెద్ద పెద్ద మామిడి, పనస తోటలు, సువిశాలమైన పొలాలగుండా ప్రయాణించే యాత్రికులకు కొబ్బరి, పోక చెట్లు తమ తలలూపుతూ స్వాగతం పలుకుతాయి.

విశిష్టాద్వైత మత స్థాపకులు మధ్వాచార్యుల పవిత్ర హస్తాల మీదుగా స్థాపితమైన మఠం ఉడుపి. కనకదాసు అనే పరమభక్తుడిని నిమ్న కులస్థుడనే కారణంతో పూజారులు కృష్ణ దర్శనానికి నిరాకరించగా స్వయంగా తానే తన ప్రియభక్తునికి ప్రత్యక్ష దర్శనమిచ్చిన కరుణామూర్తి ఉడుపి చిన్నికృష్ణుడు. ఉడుపి పూర్వపు పేరు శివళ్ళీ. ఇది పరశురామక్షేత్రాలలో ప్రథమస్థానం కలిగి ఉంది. ప్రతి సంవత్సరం, లక్షలాది భక్తులు కృష్ణుని దర్శనం చేసుకోవటానికి ఉడుపిని సందర్శిస్తారు. స్వామి దర్శనం నవరంధ్రాలున్న కిటికీ ద్వారా చేసుకోవలసి ఉండటం ఈ దేవాలయ ప్రత్యేకత. ఉడుపి రథవీధిలో శ్రీ కృష్ణమందిరం ఉంది. ఉత్తర ద్వారం గుండా గుడిలోకి ప్రవేశించినప్పుడు కుడివైపు దేవాలయ కార్యాలయం, ఇంకొద్దిగా ముందుకు వెళ్ళితే మధ్వ సరోవరం కనిపిస్తుంది. ప్రధాన ఆలయానికి ద్వారం ఎడమవైపు ఉంటుంది. కొద్దిగా ముందుకు వెళితే చెన్నకేశవ ద్వారం వస్తుంది. దీని ద్వారా గర్భగుడిలో ప్రవేశం పీఠాధిపతులకు తప్పితే అన్యులకు ఉండదు. చెన్నకేశవ స్వామి ద్వారం నుండి ముందు వెళ్ళితే ప్రదక్షిణం చేసిన తరువాత శ్రీకృష్ణ దర్శనం వెండితో తాపడం పెట్టిన నవరంధ్రాల గవాక్షం గుండా చేసుకోవచ్చు. గర్భగుడికి కుడివైపు ముఖ్యప్రాణ దేవత (హనుమంతుడు), వామభాగాన గరుడ దేవర ఉన్నారు. స్వామి దర్శనం చేసుకొని ముందుకు వెళ్ళి దక్షిణ మార్గం వైపు వెళితే, ఎడమభాగాన మధ్వాచ్యారులు మంటపం కనిపిస్తుంది. ఉడుపి శ్రీకృష్ణ మఠానికి అనుసంధానంగా అష్టమఠాలు కృష్ణ మఠాలు ఉన్నాయి. ఈ ఎనిమిది మఠాలు ఉడుపి రథవీధిలో, శ్రీ కృష్ణ దేవాలయానికి చుట్టూ ఉంటాయి. అవి: పుత్తగె, పేజావర, పలిమారు, అదమారు, సోదె, శీరూరు, కాణియూరు, కృష్ణాపుర.

మధ్వాచార్యులవారు ఒకసారి సముద్రంలో తుఫానులో చిక్కుకున్న ఓడను, అందులోని ప్రయాణికులను తన తపశ్శక్తితో రక్షించాడు. అప్పుడు ఓడలోని నావికుడు ఆయనకు గోపీచందనం మూటను కానుకగా సమర్పించాడు. మధ్వాచార్యులు ఆ మూటను విప్పి చూడగా, ఆ చందనపు కణికల మధ్య చిన్నికృష్ణుడి విగ్రహం కనిపించింది. అది శ్రీకృష్ణుడి లీలగా భావించిన మధ్వాచార్యులవారు ఆ కృష్ణుడి విగ్రహాన్ని ఉడుపిలో ప్రతిష్ఠించారు. అదే మనం చూస్తున్న విగ్రహం. కనకదాసుకు కృష్ణపరమాత్మ పశ్చిమాభిముఖుడై దర్శనమిచ్చిన చోటనే ఒక మంటపం కట్టించారు. ఆ మంటపానికే కనకదాసు మంటపమని పేరు. ఉడుపిలో జరిపే పండుగలు, పర్వదినాలు: మకర. సంక్రాంతి, మధ్వ నవమి, హనుమాన్‌ జయంతి, శ్రీ కృష్ణ జన్మాష్టమి, నవరాత్రి మహోత్సవం, మధ్వ జయంతి (విజయ దశమి), నరక చతుర్దశి, దీపావళి, గీతాజయంతి వంటి పండుగలను పర్యాయ మఠంలో అంగరంగవైభవంగా జరుపుతారు.

దగ్గరలో ఉన్న మరికొన్ని ముఖ్య ప్రదేశాలు: 

కొల్లూరు ముకాంబికా దేవాలయం, మరవంతె బీచ్, మల్పే రేవు, కాపు దీపస్తంభం (కాపు లైటు హౌసు), కార్కళలోని గోమటేశ్వరుడు, వేణూరులోని గోమటేశ్వరుడు, అత్తూరులో సెయింట్‌ లారెన్స్‌ ఇగర్జి, సెయింట్‌ మేరీస్‌ ద్వీపం, మూడబిదరెలో సావిరకంబద బసది మణిపాల్, బైందూరు కోసళ్ళి జలపాతం, జామియా మసీదు, 200 సంవత్సరాల జామియా మసీదులో సరికొత్తగా 18,000 మంది ప్రార్థనలు చేసే విధంగా ప్రార్థనాశాలలున్నాయి. ఇక్కడ 3000 మంది భక్తులు బసచేయవచ్చు.

పాజక: ఉడిపి నుండి 12 కి.మీ దూరంలో ఉంది. ఇక్కడ మాధవాచార్యుడు ద్వైతసిద్ధాంత ప్రసంగం చేశాడు.
కొల్లూరు: ఉడిపి నుండి 74 కి.మీ దూరంలో ఉంది. మూకాంబికాదేవి నివాసిత ప్రదేశమని భక్తుల విశ్వాసం.
కర్కల: ఉడిపి నుండి 37 కి.మీ దూరంలో ఉంది. ఇక్కడ జైన బసదీలు (ఆలయాలు), గోమటేశ్వర శిల్పం (బృహద్రూపం ) ప్రత్యేక ఆకర్షణ.
అనెగుడ్డె: ఉడిపి నుండి 30 కి.మీ.లు. ఇక్కడ ప్రముఖ గణేశాలయం ఉంది.
ఆత్తుర్‌ చర్చి: ఉడిపి నుండి 25 కి.మీ.లు. ఇక్కడ ఏటా నిర్వహించే సంతకు కులమతభేద రహితంగా ప్రజలు వస్తారు.
బర్కూర్‌: ఉడిపి నుండి 15కి.మీల దూరం. జైన బసదీలు ఉన్న బర్కూరు తులునాడు రాజులకు రాజధాని.
సాలిగ్రామ: ఉడిపి నుండి 27కి.మీల దూరం. ఇక్కడా గురునరసింహస్వామి ఆలయం ఉంది.
పరంపల్లి: ఇక్కడ ఎనిమిది వందల ఏళ్ల నాటి పురాతనమైన విష్ణుమూర్తి ఆలయం ఉంది.
పెర్నకిల: ఇక్కడ ఒక పురాతన గణేశుని ఆలయం ఉంది.
పెర్దోర్‌: ఉడిపి నుండి 22 కి.మీ దూరంలో ఉంది.
అగుంబే – షిమోగా రాష్టీయ్ర రహదారి సమీపంలో అనంతపద్మనాభస్వామి ఆలయం ఉంది.
హరియాద్క: ఉడిపి నుండి 16 కి.మీలు. పురాతనమైన వీరభద్రాలయం ఉంది.
శంకరనారాయణ: ఉడిపి నుండి 40 కి.మీలు. శకరనారాయణాలయం ఒక సరోవరం మధ్యన ఉండడం విశేష ఆకర్షణ.
మారనకట్టె: ఉడిపి నుండి 45 కి.మీలు. ఈప్రాంతం ప్రకృతి ఆరాధకులకు స్వర్గభూమివంటిది.
మందర్హి: ఉడిపి నుండి 20 కి.మీలు. ఇక్కడ అమ్మనవారు (దుర్గాపరమేశ్వరి) ఆలయం ఉంది. ఇక్కడ ప్రసాదంగా ఇచ్చే ‘దోశ‘ సంతానప్రాప్తి కలిగిస్తుందని ప్రజలు విశ్వాసం.
ముదుహోలె కర్కడ: ఇక్కడ పురాతన దుర్గాపరమేశ్వరి ఆలయం ఉంది.
సోమేశ్వర వన్యప్రాణి అభయారణ్యం: ఇది ఉడిపి నుండి 40 కి.మీలు. ఇక్కడ అరుదైన జంతువులు, పక్షులు, ఔషధ మొక్కలు ఉన్నాయి.
మూకాంబికా వన్యప్రాణి అభయారణ్యం: ఇది ఉడిపి నుండి 50 కి.మీలు. కుందపూర్‌– కొల్లూర్‌ రోడ్డు పక్కన విస్తరించి ఉంది.
కుర్ధు తీర్ధ జలపాతాలు: ఉడిపి నుండి 42 కి.మీలు. పశ్చిమ కనుమలలోని దట్టమైన అరణ్యాల మధ్య, 300 అడుగులున్న ఒక అందమైన జలపాతం. ఋషుల తపస్సుతో ఈ మడుగు ఎంతో పవిత్రతను, ప్రాధాన్యతను సంతరించుకుంది.
మంగ తీర్ధ: కుర్ధు తీర్ధకు ఎగువన మంగ తీర్ధ ఉంది. ఇది దట్టమైన అరణ్యాల మధ్య నిటారుగా ఉన్న పర్వతాలలో ఉంది కనుక ఇక్కడకు కోతులు తప్ప మానవమాత్రులు చేరలేరు కనుక దీనిని కోతుల తీర్థం అని కూడా అంటారు.
బర్కన జలపాతం: ఉడిపి నుండి 54 కి.మీ దూరంలో ఉంది. ఇది పశ్చిమ కనుమలలో ఉడిపి, చికమగళూరు, శివమొగ్గ కూడలి ప్రాంతంలో ఉంది; బెల్కల్‌ తీర్థ జలపాతం, అరసిన గుండి, కుద్లు తీర్థ, కొసల్లి జలపాతం, సౌపర్ణిక, స్వర్ణ, చక్ర, సీత, వర్హి, కుబ్జ నదులున్నాయి. ఈ నదులలో అందమైన నదీ ద్వీపాలు ఉన్నాయి. వీటిని కుర్దూలు అంటారు. వీటిలో కొన్ని ద్వీపాలలో జనావాసాలు ఉన్నాయి.

విశేషాల ఉడిపి
శ్రీ కృష్ణుని రథానికి బ్రహ్మరథమని పేరు. ఇది బంగారంతో రూపొందింది.
శ్రీ కృష్ణుని ఉత్సవ విగ్రహాన్ని రత్నఖచితమైన సింహాసనంపై ఉంచుతారు.
అలనాడు శ్రీ కృష్ణుడు కనకదాసుకు దర్శనమిచ్చిన గవాక్షం(కిటికీ)లో నుంచే ఈ నాటికీ భక్తులు స్వామిని దర్శనం చేసుకుంటున్నారు.

ఎలా వెళ్లాలి?
దేశంలోని అన్ని ప్రధాన నగరాలనుంచి మంగుళూరుకు రైళ్లు, బస్సులు ఉన్నాయి. అక్కడి నుంచి యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉడుపికి బస్సులు, ప్రైవేటు వాహనాలలో చేరుకోవచ్చు. హైదరాబాద్‌ నుంచి ఉడుపికి నేరుగా బస్సులున్నాయి. హైదరాబాద్‌ డెక్కన్‌ నుంచి వాస్కోడిగామా ఎక్స్‌ప్రెస్‌ ఉంది.
– డి.వి.ఆర్‌.భాస్కర్‌

ద్వారక - మునిగి తేలిన నగరం

ద్వారక
మునిగి తేలిన నగరం


ద్వారకనగరాన్ని శ్రీ కృష్ణుడు పరిపాలించాడని పురాణాల్లో చదువుకున్నాం కదా... ఆయన తన అవతారాన్ని చాలించి వైకుంఠం చేరిన తరువాత ఈ పవిత్ర నగరం సముద్రపు జలాలలో మునిగిపోయింది. మహాభారత యుద్ధం జరిగిన 36 సంవత్సరాల అనంతరం ఈ నగరం సముద్రంలో కలిసి పోయింది. విష్ణు పురాణం ద్వారకానగర మునక గురించి ప్రస్తావించింది. యాదవ ప్రముఖులు గాంధారి శాపప్రభావాన, మునుల శాపప్రభావాన తమలో తాము కలహించికొని నిశ్శేషంగా మరణిస్తారు. ఆ తరువాత శ్రీ కృష్ణుని ఆదేశం మీద అర్జునుడు యాదవకుల సంరక్షణార్థం ఇక్కడకు వచ్చి శ్రీకృష్ణ బలరాములకు అంత్యక్రియలు నిర్వహించి ద్వారాకాపుర వాసులను ద్వారక నుండి దాటించిన మరు నిమిషం ద్వారక సముద్రంలో మునిగిపోయింది. ద్వారకానగరం మునిగిపోవడంతో ద్వాపరయుగం అంతమై కలియుగం ప్రారంభమైంది.

పదహారో శతాబ్దంలో ఈ అలయ నిర్మాణం జరిగినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. శ్రీకృష్ణుని ముదిమనుమడు వజ్రనాభుడు ఈ ఆలయానికొక రూపునిచ్చాడని చెబుతారు. ప్రస్తుతం మనకు కనిపించే అయిదంతస్తుల దివ్య ఆలయ శిఖరం మీద సూర్యచంద్రుల చిహ్నాలతో విలసిల్లే పతాకం కనిపిస్తుంది. ఈ ఆలయంలోకి స్వర్గ, మోక్షద్వారాలనే రెండు ద్వారాల గుండా ప్రవేశించవచ్చు. గర్భగుడిలో నాలుగు భుజాలతో విలసిల్లే త్రివిక్రమ(వామన) మూర్తి ఉన్నారు. ఆలయ సమీపంలో బలరాముడికి, కృష్ణుడికీ కుమారుడు, మనుమడూ అయిన ప్రద్యుమ్న అనిరుద్ధులకూ, శివకేశవులకూ ప్రత్యేకమైన పూజాస్థానాలున్నాయి. ఈ ఆలయంలో దేవకి, జాంబవతి, సత్యభామల విగ్రహాలు కూడా ఉన్నాయి. రుక్మిణీదేవికి మాత్రం ఈ ఆలయానికి దూరంగా ప్రత్యేకమైన ఆలయం ఉంది. ఆమె శ్రీకృష్ణుని అష్టమహిషుల్లో ప్రధానమైనది కాబట్టి ఈ ఆలయానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. గోమతీ నది సముద్రంలో కలిసే చోటున ద్వారకాధీశుని ఆలయం ఉంది.

ఈ క్షేత్రానికి సమీపానే గోమతీ నది సముద్రంలో సంగమిస్తుంది. అక్కడ నుండి బస్సుమార్గంలో బేట్‌ ద్వారక చేరాలి. ఇది శ్రీ కృష్ణుని నివాస స్థలం. ఇక్కడ స్వామి శంఖ చక్రధారియై ఉపస్థితమై ఉన్నాడు. దీనికి ఐదు కి.మీ. దూరంలో శంఖతీర్థం ఉంది. ఇక్కడ పెరుమాళ్ళ వక్షస్థలాన శ్రీదేవి ఉపస్థితమై ఉంది. రుక్మిణీదేవి ఉత్సవ తాయార్‌. ఇక్కడ అనేక సన్నిధులు ఉన్నాయి. ఇక్కడ నిత్యం తిరుమంజనం జరుగుతుంది. పసిపిల్లాడిలా–రాజులా–వైదికోత్తమునిలా అలంకారాలు జరుగుతుంటాయి. ద్వారక నుండి ఓఖా పోవుమార్గంలో ఐదు కి.మీ.ల దూరాన రుక్మిణీదేవి సన్నిధి ఉంది. ఇదే రుక్మిణీ కల్యాణం జరిగిన ప్రదేశం. ద్వారకాపురిలో వసుదేవ, దేవకి, బలరామ, రేవతి, సుభద్ర, రుక్మిణీదేవి, జాంబవతీదేవి, సత్యభామాదేవి ఆలయాలు కూడా ఉన్నాయి. బేట్‌ ద్వారక ఆలయానికి వెళ్ళే మార్గంలో రుక్మిణీదేవికి ప్రత్యేక ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని బోటులో ప్రయాణించి చేరుకోవాలి.

పవిత్ర నగరం
ద్వార్‌ అనే పదానికి సంస్కృత భాషలో వాకిలి, ద్వారం లాంటి అర్థాలు ఉన్నాయి. ద్వార్‌ అనే పదం ఆధారంగా ఈ నగరానికి ఈ పేరు వచ్చింది. అనేక ద్వారాలు ఉన్న నగరం కనుక ద్వారక అయింది. హిందువులు అతి పవిత్రంగా భావించే చార్‌ ధామ్‌ (నాలుగు ధామాలు) లలో ద్వారకాపురి ఒకటి. మిగిలిన మూడు పవిత్రనగరాలు బద్రీనాథ్, పూరి, రామేశ్వరం. ద్వారకాధీశుని ఆలయాన్ని జగత్‌మందిరం అని పిలుస్తారు. ఈ ఆలయ ప్రధాన దైవం శ్రీకృష్ణుడు. ద్వారకాపురి సమీపంలో జ్యోతిర్లింగాలలో ఒకటైన నాగేశ్వరలింగం ఉంది. ద్వారకలో శంకరాచార్యుడు ద్వారకా పీఠం స్థాపించబడింది. ఆది శంకరాచార్యులవారు నెలకొల్పిన నాలుగు మఠాలలో ఇది ఒకటి. మిగిలినవి శృంగేరి, పూరి, జ్యోతిర్మఠం. ద్వారకా పీఠాన్ని కాళికా పీఠంగా కూడా అంటారు.

శ్రీద్వారకనాథ్‌ మహాత్యం
ఆదిశంకరులు ద్వారకాధీశుడిని దర్శించి ద్వారకాపీఠాన్ని ప్రతిష్ఠించాడు. ఇక్కడ కృష్ణుడు క్షత్రియ రాకుమార వివాహ అలంకరణలో దర్శనం ఇస్తాడు. 108 దివ్యదేశాలలో ఈ క్షేత్రం ఒకటి. ద్వారకానా«థుడికి అనేక సేవలు, దర్శనాలు ఉంటాయి. దర్శనలకు తగినట్లు వస్త్రధారణలో మార్పులుంటాయి.

ద్వారకాసామ్రాజ్యం
మహాభారతం, హరివంశం, స్కాంద పురాణం, భాగవత పురాణం, విష్ణుపురాణాలలో ద్వారకాపురి ప్రస్తావన ఉంది. ప్రస్తుత ద్వారకాపురి సమీపంలో శ్రీ కృష్ణ నిర్మితమైన ద్వారాపురి ఉండేదని. పురాణేతిహాసాలలో వర్ణించబడిన విధంగా అది సముద్రగర్భంలో కలసిపోయిందని విశ్వసిస్తున్నారు. శ్రీ కృష్ణుడు యుద్ధాల వలన జరిగే అనర్థాల నుండి ద్వారకావాసులను రక్షించే నిమిత్తం ద్వారకానగర నిర్మాణం చేసి యాదవులను ఇక్కడకు తరలించి సురక్షితంగా పాలించాడని పురాణ కథనాలు వర్ణిస్తున్నాయి.  ద్వారకా నగరాన్ని శ్రీ కృష్ణుడి ఆజ్ఞానుసారం విశ్వకర్మ నిర్మించాడని ప్రతీతి. సౌరాష్ట్ర పడమటి సముద్రతీరంలో ఈ భూమి నగర నిర్మాణార్థ్ధం ఎంచుకోవడమైంది. ఈ నగరం ప్రణాళిక చేయబడి తరువాత నిర్మించబడింది. గోమతీనదీ తీరంలో ప్రణాళికాబద్ధంగా నిర్మించబడిన నగరం ద్వారక. ఈ నగరానికే ద్వారామతి, ద్వారావతి కుశస్థలి అని పేర్లున్నాయి. ఇది నిర్వహణా సౌలభ్యం కోసం ఆరు విభాగాలుగా విభజించి నిర్మించబడింది. నివాస ప్రదేశాలు, వ్యాపార ప్రదేశాలు, వెడల్పైన రాజమార్గాలు, వాణిజ్యకూడళ్లు, సంతలు, రాజభవనాలు, అనేక ప్రజోపయోగ ప్రదేశాలతో నిర్మితమైనది. రాజ్యసభా మంటపం పేరు సుధర్మ సభ. రాజు ప్రజలతో సమావేశం జరిపే ప్రదేశం ఇదే. ఈ నగరం సుందర సముద్రతీరాలకు ప్రసిద్ధం.

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషన్‌ టెక్నాలజీకి చెందిన ఒక బృందం చేసిన పరిశోధనలలో సముద్రగర్భంలోని ద్వారాపురి కనుగొనబడింది. ఆరు మాసాల పరిశోధనానంతరం 2000 డిసెంబరు మాసంలో కనుగొన్నారు. ఈ పరిశోధనానంతరం అదే విద్యాసంస్థ 2001లో జరిపిన పరిశోధనలో సముద్రజలాల్లో మునిగి ఉన్న కళాఖండాలను స్వాధీనపరచుకున్నారు. అలా లభించిన కళాఖండాలలోని భాగాలు యు. కె లోని ఆక్స్‌ఫర్డ్, జర్మనీ లోని హానోవర్‌ అలాగే పలు భారతీయ విద్యాసంస్థలకు కాలనిర్ణయ పరిశోధనా నిమిత్తం పంపారు.

బేట్‌ ద్వారక
బేట్‌ ద్వారక ప్రధాన దైవమైన శ్రీ కృష్ణుని ఆలయాలు ఇక్కడ ఉన్నాయి. పురాతన హిందూ సంప్రదాయానికి బేట్‌ ద్వారక ప్రసిద్ధి చెందింది. ఇక్కడ సముద్రతీర ప్రదేశాలు పురాతన వస్తువులకు ప్రసిద్ధి చెందినవి. ఇక్కడ లభించే మట్టి పాత్రల అవశేషాలు క్రీస్తు శకంలో సముద్రతీర దేశాలతో జరిగిన వ్యాపార, వాణిజ్యాలకు తార్కాణం. ఈ పుష్కలమైన రేవుపట్టణం మతప్రధానమయిన కేంద్రం. శ్రీ కృష్ణుడు అవతారం చాలించి వైకుంఠానికి వెళ్ళిన తరువాత సముద్రగర్భంలో కలసి పోయిందనే విశ్వాసానికి బలం చేకూరుతోంది. నిర్మాణశాస్త్ర నిపుణుల బృందాల పరిశోధనా ఫలితంగా అనేక పురాతన కళాఖండాలు సముద్రగర్భం నుండి వెలికి వచ్చాయి. ఇక్కడ అధిక సంఖ్యలో లభించిన రాతి లంగర్లు పురాతనకాలంలో ఉన్న రేవుపట్టణాలలో బేట్‌ ద్వారక చాలా ప్రముఖమైనదని సూచిస్తున్నాయి. బేట్‌ ద్వారక పరిసరాలు నౌకలు సురక్షితంగా నిలవడానికి అవకాశం కల్పిస్తూ ఈ నగరాన్ని సముద్రతరంగాల నుండి రక్షించిందని తెలియజేస్తున్నాయి.

ఎలా వెళ్లాలి?
హైదరాబాద్‌ నుంచి అహ్మదాబాద్‌కు విమానంలో వెళ్లి, అక్కడి నుంచి ద్వారకకు రోడ్డు మార్గాన వెళ్లవచ్చు.
సికింద్రాబాద్, అహ్మదాబాద్‌ ఓఖా ఎక్స్‌ప్రెస్‌లో ద్వారకకు సుమారు 39 గంటల ప్రయాణం. ద్వారక రైల్వేస్టేషన్‌ నుంచి పదినిమిషాలలో ద్వారకాధీశుని ఆలయానికి చేరుకోవచ్చు.

గోపరాజు పూర్ణిమాస్వాతి

Monday, 29 August 2016

కృష్ణుయ్య ఐదు దివ్య ధామాలు

‘దేవకి పంట...
వసుదేవు వెంట...
యమునను నడిరేయి దాటితివంట...
వెలసితి వంట..
నందుని ఇంట...
రేపల్లె ఇల్లాయెనంటా....’

పుడుతూనే ఇన్ని లీలలు చేసిన బాలకృష్ణుడి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. నేడు ఆ నల్లనయ్య పుట్టినరోజు. తాను వెలసిన క్షేత్రాలంటే కన్నయ్యకు వెన్నముద్దలంత ఇష్టం. అటువంటి ఐదు దివ్య ధామాల్లో స్వామితో కలసి మనమూ విహరిద్దాం రండి.



మధుర - బృందావనం


శ్రీకృష్ణ పరమాత్మ జన్మించిన ప్రదేశంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మధురకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడి కేశవ్దేవ్ దేవాలయం హిందువులకు అత్యంత పవిత్రం. ఈ దేవాలయాన్ని శ్రీకృష్ణుడి మునిమనుమడైన వజ్రనాభుడు దాదాపు ఐదువేల సంవత్సరాల కిందట నిర్మించాడని స్థలపురాణం. ఈ దేవాలయంలో జన్మాష్టమితోపాటు వసంత పంచమి, మహాశివరాత్రి, గోపాష్టమి, దీపావళి మొదలైన పండుగలను ఎంతో ఘనంగా నిర్వహిస్తారు.

చూడదగిన ప్రదేశాలు
శ్రీకృష్ణ జన్మభూమి దేవాలయం, గర్భ గుహ, భాగవత భవన్తోపాటు కృష్ణుడు బాల్యంలో నడయాడిన గోకులం, బృందావనం వంటి ప్రదేశాలు కూడా మధుర జిల్లాలోనే ఉన్నాయి. మధుర నుంచి బృందావనం 11 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ గోవిందదేవ్, మీరాబాయి, మదనమోహన దేవాలయాలు ప్రసిద్ధి పొందినవి. బృందావనానికి సమీపంలోనే గోవర్ధన పర్వతం ఉంది. నేటికీ దీపావళి పండుగ తరవాత రోజున గోవర్ధన పూజ నిర్వహించడం ఆనవాయితీ. గోవర్ధన గిరిని చిటికెన వేలుపై ఏడు రోజులు ఎత్తి పట్టుకొన్న శ్రీకృష్ణుడు, ఈ రోజునే ఇంద్రుడి గర్వభంగం చేశాడని చెబుతారు. ఈ పర్వతాన్ని స్థానికులు కృష్ణుడి ప్రతిరూపంగా కొలుస్తారు. మధుర నుంచి గోకులం 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. వీటితోపాటు మొఘలుల కాలంనాటి జామా మసీదు, కుసుమ సరోవరం, రాధా కుండ్, మధుర మ్యూజియం సందర్శనీయ స్థలాలు.

ఎలా చేరుకోవాలి?
హైదరాబాద్ నుంచి మధుర 1375 కి.మీ. దూరంలో ఉంది. హైదరాబాద్ నుంచి నేరుగా రైలు సదుపాయం ఉంది. మధురకు సమీప అంతర్జాతీయ విమానాశ్రయం (147కి.మీ.) న్యూఢిల్లీలో ఉంది. సమీప డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ ఆగ్రాలోని ఖేరియా విమానాశ్రయం(49కి.మీ.).


ద్వారక

ఏడు మోక్షపురుల్లో ఒకటిగా పిలిచే ద్వారక, గుజరాత రాష్ట్రంలో గోమతీ నదీ తీరంలో ఉంది. సంస్కృతంలో ద్వారక అంటే ‘స్వర్గానికి ద్వారం’ అని అర్థం. కృష్ణుడు పరిపాలించిన ప్రాంతంగా ద్వారక సుపరిచితం. ఇక్కడ దాదాపు 2500 సంవత్సరాల కిందట నిర్మించిన ద్వారకాధీశుడి దేవాలయం ప్రధానమైనది. జగద్గురువు ఆది శంకారాచార్యులు నెలకొల్పిన నాలుగు ప్రధాన మఠాల్లో ఒకటైన ద్వారకా పీఠం (కాళికా మఠం) ఇక్కడే ఉంది. కృష్ణ భక్తురాలైన మీరాబాయి ఇక్కడే స్వామి ప్రతిమలో లీనమైందని చెబుతారు. ఏటా జన్మాష్టమికి ఇక్కడ నిర్వహించే వేడుకలను తిలకించేందుకు దేశ విదేశాలకు చెందిన వేలాది మంది భక్తులు హాజరవుతారు.

చూడదగిన ప్రదేశాలు
రుక్మిణీ దేవి దేవాలయం, గోమతీ ఘాట్, బెట్ ద్వారక, నాగేశ్వర జ్యోతిర్లింగం, ద్వారక లైట్హౌస్, గీతామందిరం, సముద్ర నారాయణ దేవాలయం.

ఎలా చేరుకోవాలి?
హైదరాబాద్ నుంచి ద్వారక 1581 కి.మీ. దూరంలో ఉంది. హైదరాబాద్ నుంచి నేరుగా రైలు సదుపాయం ఉంది. సమీప విమానాశ్రయం జామ్నగర్ (137 కి.మీ). జామ్నగర్, అహ్మదాబాద్ల నుంచి ద్వారకకు బస్సులో చేరుకోవచ్చు.


గురువాయూర్

కేరళ రాష్ట్రం గురువాయూర్లోని శ్రీకృష్ణ దేవాలయాన్ని భూలోక వైకుంఠంగా కీర్తిస్తారు. ఈ దేవాలయంలో స్వామి నాలుగు చేతులతో... పాంచజన్యం, సుదర్శన చక్రం, కౌమోదకి, తామర పువ్వును ధరించి దర్శనమివ్వడం విశేషం. శ్రీకృష్ణుడు జన్మించిన సమయంలో దేవకి, వసుదేవులకు ఇదే రూపంతో దర్శనమిచ్చాడని ప్రతీతి. అందుకే గురువాయూర్ను ‘దక్షిణ భారత ద్వారక’గా పేర్కొంటారు. ఈ దేవాలయం ఆవిర్భావం గురించి నారద పురాణంలో ఒక ఆసక్తికరమైన గాథ ఉంది. అర్జునుడి మునిమనుమడు (అభిమన్యుడి కుమారుడు) అయిన పరీక్షిత్తు మహారాజు తక్షకుడు అనే పాము కాటుతో మరణిస్తాడు. దీనికి ప్రతీకారంగా ఆయన కుమారుడు జనమేజేయుడు నిర్వహించిన సర్పయాగంలో వేలాది పాములు అగ్నికి ఆహుతి అవుతాయి. ఈ పాపం కారణంగా ఆయనకు తీవ్రమైన కుష్ఠు వ్యాధి సోకుతుంది. ఎన్ని చికిత్సలు చేసినా ఫలితం ఉండదు. ఆ సమయంలో గురు దత్తాత్రేయ స్వామి ఆదేశాన్ని అనుసరించి గురువాయూర్లో కొలువైన శ్రీకృష్ణుడిని సేవించి రోగ విముక్తుడవుతాడు. ఇక్కడి స్వామిని గురువాయూరప్పన్గా కొలుస్తారు. స్వామి విష్ణువు రూపంలో ఉన్నప్పటికీ ఈ ఆలయం కృష్ణ ఆలయంగానే ప్రసిద్ధి పొందింది. బాల కృష్ణుడి రూపంలో స్వామి నేటికీ ఈ దేవాలయంలో సంచరిస్తుంటాడని భక్తుల విశ్వాసం.

చూడదగిన ప్రదేశాలు
గురువాయూర్లోని రుద్రతీర్థం, మమ్మియూర్ మహాదేవ క్షేత్రం, ఎలిఫెంట్ క్యాంప్ శాంక్చురీ, పున్నత్తూర్ కొట్ట, వెంకటాచలపతి దేవాలయం, పార్థసారథి దేవాలయం, చాముండేశ్వరి దేవాలయం, హరికన్యక దేవాలయాలను సందర్శింవచ్చు. గురువాయూర్కు 80 కిమీ దూరంలో జగద్గురు ఆదిశంకరాచార్యుల జన్మస్థలమైన కాలడి గ్రామం ఉంది. అక్కడ పూర్ణానది ఒడ్డున ఉన్న శ్రీకృష్ణ దేవాలయం చూడదగింది.

ఎలా చేరుకోవాలి?
హైదరాబాద్ నుంచి గురువాయూర్ 975 కి.మీ. దూరంలో ఉంది. హైదరాబాద్ నుంచి నేరుగా రైలు సదుపాయం లేదు. త్రిసూర్ వరకు రైల్లో వెళ్లి అక్కడ నుంచి మరో రైల్లో గురువాయూర్ వెళ్లొచ్చు. లేదా రోడ్డు మార్గంలో (30 కి.మీ) తేలిగ్గా వెళ్లొచ్చు. సమీప విమానాశ్రయం కొచ్చిన్లో ఉంది. (80 కి.మీ). కేరళ, కర్ణాటక, తమిళనాడులోని అన్ని ప్రధాన నగరాల నుంచి బస్సు సదుపాయం ఉంది.


ఉడిపి

కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపి క్షేత్రంలో కొలువైన చిన్ని కృష్ణుని ఆలయం హిందువులకు పరమ పవిత్రమైన ప్రాంతం. ఇక్కడి కృష్ణ మఠాన్ని 13వ శతాబ్దంలో ద్వైత సంప్రదాయ స్థాపకులు మధ్వాచార్యులు ప్రారంభించారు. ఆయన ఇక్కడ ఎనిమిది మఠాలు స్థాపించి వాటికి ఎనిమిది మందిని అధిపతులుగా ఏర్పాటు చేశారు. ఈ మఠాధిపతులే నేటికీ గర్భాలయంలో కృష్ణ పూజలు నిర్వహిస్తున్నారు. వీరికితప్ప ఇతరులెవరికీ మూలమూర్తిని తాకే అవకాశం లేదు. ఇక్కడి కృష్ణ విగ్రహాన్ని మధ్వాచార్యులు ప్రతిష్ఠించారు. ప్రతి రెండేళ్ళకు ఒకసారి నిర్వహించే ‘పర్యాయ’ పండుగ సందర్భంగా ఒక్కో మఠాధిపతికి దేవాలయం బాధ్యతలు అప్పగిస్తారు. ఇక్కడి స్వామికి ప్రతిరోజూ 14 రకాలైన పూజలను నిర్వహిస్తారు. ఈ ఆలయం వెనుక భాగంలో ఉన్న కిటికీ నుంచి స్వామిని దర్శించుకోవడం ప్రత్యేకత.. తన భక్తుడైన కనకదాసుడికి స్వామి ఈ కిటికీ నుంచే దర్శనం ప్రసాదించారని ప్రతీతి. అందుకే దీన్ని ఆయన పేరు మీదుగా ‘కనకన కిండి’ అని పిలుస్తారు.

చూడదగిన ప్రదేశాలు
చంద్రేశ్వర, అనంతేశ్వర దేవాలయాలు, సెయింట్ మేరీస్ ఐలాండ్, అనెగుడ్డె వినాయక దేవాలయం, కొడి బీచ్, కుద్లు ఫాల్స్, ఇంద్రాణి పంచదుర్గ పరమేశ్వరి దేవాలయం, మట్టు బీచ్, బ్రహ్మి దుర్గ పరమేశ్వరి దేవాలయం, కుండేశ్వర దేవాలయం, బెల్కల్ తీర్థ ఫాల్స్ .

ఎలా చేరుకోవాలి?
హైదరాబాద్ నుంచి ఉడిపి 780 కి.మీ. దూరంలో ఉంది. హైదరాబాద్ నుంచి నేరుగా రైలు సదుపాయం లేదు. మంగళూరు వరకు రైల్లో వెళ్లి అక్కడ నుంచి ఉడిపి (54 కిమీ) రైలు లేదా బస్సులో వెళ్ళవచ్చు. సమీప విమానాశ్రయం మంగళూరు (137 కి.మీ).



నెమలి

ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం నెమలి గ్రామంలోని వేణుగోపాలస్వామి ఆలయం ప్రముఖ పుణ్య క్షేత్రాల్లో ఒకటి. ఇక్కడి స్వామి ఎంతో మహిమ కలిగిన స్వామిగా భక్తులు భావిస్తుంటారు. సంతానం లేనివారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ఎక్కువగా ఈ ఆలయానికి వస్తుంటారు. 1953లో నెమలి గ్రామానికి చెందిన వనమా సీతారామయ్య అనే షావుకారు అదే గ్రామానికి చెందిన దారా నరసయ్య అనే రైతు పొలం కొన్నారు. అందులోని మట్టిని తవ్వుతుండగా స్వామి విగ్రహం, శంఖం, పాచిక బయటపడ్డాయి. విషయాన్ని కూలీలు షావుకారు దృష్టికి తీసుకువచ్చారు. 1957 ఫిబ్రవరి 6న స్వామి వెలిసిన ప్రాంతంలోనే ఆలయాన్ని నిర్మించి విగ్రహాలను ప్రతిష్టించారు. ప్రతి ఏడాది మార్చిలో నెమలి వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలు కనుల పండువగా జరుగుతాయి. పౌర్ణమి రోజున స్వామి కల్యాణం వైభవోపేతంగా నిర్వహిస్తారు. భక్తుల విరాళాలతో ఆలయ ప్రాంగణంలో నిర్మించిన గోశాలలో నిత్య పూజలు జరుగుతాయి. ప్రతి పౌర్ణమికి స్వామివారి కల్యాణం జరుగుతుంది. భక్తుల విరాళాలతో నిత్య అన్నదానం చేస్తున్నారు.

ఎలా చేరుకోవాలి?
ఏపీలో విజయవాడకు సుమారు 60 కిలోమీటర్ల దూరంలోను, తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా మధిరకు 16 కిలో మీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. ఆలయానికి చేరుకునేందుకు బస్సు సౌకర్యంతో పాటు రైలు సౌకర్యం కూడా ఉంది. విజయవాడ, మధిర రోడ్డు మార్గం ద్వారా ఇక్కడకు చేరుకోవచ్చు. విజయవాడ నుంచి రైలు మార్గం ద్వారా నెమలి చేరుకునే వీలుంది. ఖమ్మం నుంచి కల్లూరు, చినకోరుకొండ, పొచవరం, వెంకటాపురం, తాళ్లూరు, ఉమ్మడిదేవరపల్లి మీదుగా నెమలి చేరుకోవచ్చు. 

Andhrajyothy

బృహదీశ్వరాలయం B

అణువణువూ అద్భుతం బృహదీశ్వరాలయం ‘‘గుడులూ గోపురాలకు పేరొందిన తమిళనాడు రాష్ట్రాన్ని సందర్శించాలనుకునే వాళ్లకు ముందుగా గుర్తొచ్చేది తంజావూరు...