Showing posts with label ఉత్తరాఖండ్‌. Show all posts
Showing posts with label ఉత్తరాఖండ్‌. Show all posts

Saturday, 16 June 2018

వాన జల్లుల్లో..లేత ఎండల్లో..






వాన జల్లుల్లో..లేత ఎండల్లో..

‘విహారయాత్రలు వేసవి సెలవుల్లోనే!’ అనే కాన్సెప్ట్‌ పాతబడు తోంది. ‘ఆనందించే హృదయం, ఆస్వాదించే నైజం ఉండాలే కాని సీజన్‌తో పనేముంది? కొండల్లో, కోనల్లో, లోయల్లో, పచ్చటి మైదానాల్లో నడుస్తూ... కురిసే చినుకు మధ్య తడుస్తూ... ప్రకృతిని తిలకించి పరవశించిపోవడం కన్నా సుఖం ఏముంటుంది?’ అంటోంది కొత్త తరం. అందుకే మాన్‌సూన్‌ టూర్స్‌ ఇప్పుడు పాపులర్‌ అవుతున్నాయి. మన దేశంలో ఎక్కువమంది ఎంపిక చేసుకుంటున్న అలాంటి గమ్యాల్లో కొన్ని... 


జీవితకాలపు అనుభూతి అగుంబే
ఎక్కడుంది?: కర్నాటక రాష్ట్రం షిమోగా జిల్లాలో. 

ప్రత్యేకతలేమిటి?:
‘దక్షిణ భారత చిరపుంజి’గా పేరు పొందిన అగుంబే అనేక ప్రత్యేకతలకు నెలవు. చుట్టూ దట్టమైన అడవులున్న ఈ ప్రాంతం సహ్యాద్రి పర్వతాల్లో మాల్నాడ్‌, శరావతి లోయల మధ్య ఉంటుంది. మైమరపించే జలపాతాలకూ, అత్యద్భుతమైన సౌందర్యానికీ అగుంబే పెట్టింది పేరు. ప్రకృతి ప్రేమికులు తప్పనిసరిగా చూడాల్సిన చోటు ఇది. అగుంబే ఘాట్‌ రోడ్డు దగ్గర నిలబడి- అరేబియా మహా సముద్రంలో సూర్యుడు అస్తమిస్తున్న దృశ్యం చూడడం జీవితకాలానికి సరిపోయే అనుభూతి అనడం అతిశయోక్తి కాదు. ఇక, కింగ్‌ కోబ్రాలకు ఈ ప్రాంతం పుట్టినిల్లు. ఇతర జాతుల సర్పాలు కూడా ఈ వర్షారణ్యంలో పెద్ద సంఖ్యలో ఉంటాయి. అరుదైన జంతు, వృక్షజాలంపై ఇక్కడ విస్తృతంగా పరిశోధవాన జరుగుతున్నాయి.

ఎలా వెళ్ళాలి?:
మంగుళూరుకు సుమారు 100 కిలోమీటర్ల దూరంలో అగుంబే ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ప్రాంతాల నుంచి మంగుళూరుకు రైలు సౌకర్యం ఉంది. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో అగుంబే చేరుకోవచ్చు. సమీప విమానాశ్రయం మంగుళూరులో ఉంది. హైదరాబాద్‌ నుంచి రైళ్ళ కన్నా రోడ్డు మార్గంలో (బెంగళూరు మీదుగా) తక్కువ సమయంలో వెళ్ళవచ్చు.

వసతి:
అగుంబేలో అన్ని బడ్జెట్లకూ సరిపోయే వసతి సదుపాయాలున్నాయి. అయితే అన్నిటికన్నా ఆకర్షించేది దొడ్డ మేను బంగళా. నూట యాభై ఏళ్ళ నాటి భవనంలో నడుస్తున్న ఈ వసతి గృహాన్ని కస్తూరక్క అనే వృద్ధురాలు నిర్వహిస్తున్నారు. సంప్రదాయ పద్ధతుల్లో చేసిన ఇంటి భోజనం, ఎంతో చరిత్ర కలిగిన పాత కాలం ఇంట్లో బస... పర్యాటకులకు ప్రధాన ఆకర్షణ. అన్నట్టు ఈ భవనంలోనే ‘మాల్గుడి డేస్‌’ హిందీ సీరియల్‌ చిత్రీకరించారు.


వానంతా అక్కడే! మౌసిన్‌రామ్‌
ఎక్కడుంది?: మేఘాలయ రాష్ట్రంలోని ఈస్ట్‌ ఖాసీహిల్స్‌ జిల్లాలో. 

ప్రత్యేకతలేమిటి?:
ప్రపంచంలోనే అతి ఎక్కువ వర్షపాతం కలిగిన ప్రదేశంగా మౌసిన్‌రామ్‌ గిన్నిస్‌ బుక్‌లో చోటు సంపాదించుకుంది. అంతకు ముందు ఆ ఘనత మౌసిన్‌రామ్‌కు దగ్గర్లో ఉన్న చిరపుంజికి ఉండేది. అంతేకాదు, ఎప్పుడూ తేమగా ఉండే ప్రదేశంగా కూడా మౌసిన్‌రామ్‌ గుర్తింపు పొందింది. ఏడాదిలో కనీసం ఆరు నెలల పాటు ఇక్కడ వర్షాలు పడుతూనే ఉంటాయి. అందుకని ఇక్కడి ప్రజలు కావలసిన సరుకులన్నీ నిల్వ చేసుకుంటూ ఉంటారు. వర్షాలు ఎక్కువ కాబట్టి వృక్షజాలం బాగా పెరుగుతుంది. చెట్ల వేర్లను ఒకదానితో ఒకటి అల్లి, వెదురు కర్రలతో వంతెనలను ఈ గ్రామస్థులు తయారు చేస్తారు. వీటిలో కొన్ని వంతెనలు వంద మీటర్ల పొడవు కూడా ఉంటాయి. కనీసం అయిదారుగురిని అవలీలగా మోయగలిగేంత పటిష్ఠంగా ఇవి తయారవుతాయి. ఇలాంటి వంతెనలు మరెక్కడా కనిపించవు.

ఎలా వెళ్ళాలి?:
గువాహటికి సుమారు 150 కిలోమీటర్ల దూరంలో మౌసిన్‌రామ్‌ ఉంది. తెలుగు రాష్ట్రాల నుంచి గువాహటికి రైళ్ళలో నేరుగా వెళ్ళవచ్చు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మౌసిన్‌రామ్‌ చేరుకోవచ్చు. సమీప ప్రధాన విమానాశ్రయం గువాహటిలో ఉంది.

వసతి:
మౌసిన్‌రామ్‌లో గెస్ట్‌హౌ్‌సలు, రిసార్టులు, హోటళ్ళు ఉన్నాయి. హోమ్‌ స్టే సదుపాయం కూడా అందుబాటులో ఉంది.


కొండా కోనల్లో... అంబోలి
ఎక్కడుంది?: మహారాష్ట్రలోని సింధుదుర్గ్‌ జిల్లాలో
ప్రత్యేకతలేమిటి?:
ఎటు చూసినా జలపాతాలతో, ఎత్తైన కొండలతో, చల్లటి గాలులతో ఆహ్లాదం కలిగించే ప్రాంతం అంబోలి. వేసవి విడిదిగానే కాదు, వర్షాకాలంలో సందర్శించడానికి అనువైన గమ్యంగా కూడా ఇది ప్రసిద్ధి చెందింది. వర్షపాతం ఎక్కువ కాబట్టి ఎప్పుడూ తడిగా కనిపించే అంబోలిలోని పల్లె వాతావరణం మనసుకు ప్రశాంతత కలిగిస్తుంది. సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో ఉన్న ఈ ప్రదేశం నుంచి సూర్యోదయాలూ, సూర్యాస్తమయాలూ వీక్షించడం ఒక మరపురాని అనుభూతి.

ఎలా వెళ్ళాలి?:
కర్నాటకలోని బెల్గాం నగరానికి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ప్రాంతాల రైళ్ళు ఉన్నాయి. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో 28 కి.మీ. దూరంలో ఉన్న అంబోలి చేరుకోవచ్చు. సమీప విమానాశ్రయం 113 కిలోమీటర్ల దూరంలోని గోవాలో ఉంది.

వసతి:
మహారాష్ట్ర టూరిజం, ప్రైవేటు సంస్థల యాజమాన్యంలో వసతి, భోజన సదుపాయాలున్నాయి.


అంతా పూల దుప్పటే! - వ్యాలీ ఆఫ్‌ ఫ్లవర్స్‌
ఎక్కడుంది?: ఉత్తరాఖండ్‌లోని ఛమోలీ జిల్లాలో
ప్రత్యేకతలేమిటి?:
ప్రకృతి అందాలను తనివితీరా చూడాలని కోరుకొనేవారికి వ్యాలీ ఆఫ్‌ ఫ్లవర్స్‌ నేషనల్‌ పార్క్‌ కన్నా మంచి ప్రదేశం మరొకటి ఉండదేమో.! చుట్టూ మంచు కప్పేసిన కొండలూ, అపురూపమైన బ్రహ్మకమల పుష్పాలతో సహా దాదాపు మూడువందల రకాల జాతుల పూలూ, విశాలమైన మైదానాలూ... అంతేకాదు అరుదైన సీతాకోక చిలుకలకూ, నల్లటి హిమాలయపు ఎలుగుబంట్లూ, కస్తూరి జింక లాంటి జీవాలకూ నిలయం ఇది. హిమవంతుడి కూతురు పార్వతీ దేవి ఉద్యానంగా దీన్ని అభివర్ణిస్తూ ఉంటారు. అందుకే ‘దేవభూమి’ అని పిలుస్తారు. ఇక్కడ హఠాత్తుగా మబ్బులు ముంచుకొచ్చి తడిపేసి పోతూ ఉంటాయి. జూన్‌ నుంచీ నవంబర్‌ వరకూ మాత్రమే సందర్శకులను ఈ వ్యాలీలోకి అనుమతిస్తారు. పూల సోయగాలు చూడాలంటే జూలై, ఆగస్ట్‌ నెలలు ఉత్తమం. ట్రెక్కింగ్‌ కోసం కూడా చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు. ఢిల్లీ, హరిద్వార్‌, ఋషీకేశ్‌ల నుంచి టూర్‌ ఆపరేటర్లు ప్రత్యేక ట్రెక్కింగ్‌ ప్యాకేజీలు నిర్వహిస్తారు. ఈ లోయను ప్రపంచ వారసత్వ సంపదగా ‘యునెస్కో’ గుర్తించింది. వ్యాలీ ఆఫ్‌ ఫ్లవర్స్‌ కు వెళ్ళే దారిలో హిమకుండ్‌ సాహిబ్‌ గురుద్వారానూ, గోవింద్‌ఘాట్‌కు 25 కి.మీ. దూరంలోని బదరీనాథ్‌నూ కూడా దర్శించుకోవచ్చు.

వసతి:
వ్యాలీ ఆఫ్‌ ఫ్లవర్స్‌లో వసతి సదుపాయాలు లేవు. సుమారు 21 కిలోమీటర్ల దూరంలో ఉన్న జోషీమఠ్‌లో కానీ, 49 కిలోమీటర్ల దూరంలోని ఛమోలీలో కానీ బస చేయవచ్చు.

ఎలా వెళ్ళాలి?:
ఢిల్లీ నుంచి హరిద్వార్‌, గోవింద్‌ఘాట్‌ మీదుగా రోడ్డు మార్గంలో వ్యాలీ ఆఫ్‌ ఫ్లవర్స్‌ చేరుకోవాల్సి ఉంటుంది. హరిద్వార్‌కు సుమారు 290 కిలోమీటర్ల దూరంలో ఈ పూల లోయ ఉంది. గోవింద్‌ఘాట్‌ నుంచి సుమారు 15 కిలోమీటర్లు ట్రెక్కింగ్‌ చేయాల్సి ఉంటుంది. గుర్రాల మీదా, డోలీల్లో కూడా వెళ్ళొచ్చు.


పన్నెండేళ్ళకు ఓసారి... - మున్నార్‌
ఎక్కడుంది?: కేరళలోని ఇడుక్కి జిల్లాలో
ప్రత్యేకతలేమిటి?:
తేయాకు, సిల్వర్‌ ఓక్‌ తోటలూ, లోయలూ, పర్వత శ్రేణులతో అలరారే మున్నార్‌ను భూతల స్వర్గంగా పర్యాటకులు వర్ణిస్తూ ఉంటారు. కేరళకు వచ్చే టూరిస్టులు తప్పనిసరిగా సందర్శించే ప్రాంతం ఇది. పడమటి కనుమలలో ఉన్న మున్నార్‌ చుట్టూ కొండలు ఆవరించి ఉంటాయి. ట్రెక్కింగ్‌ కోసం చాలామంది ఇక్కడికి వస్తారు. అలాగే ఘాట్లలో బైక్‌ల మీద చేరుకొనే వారు కూడా ఎక్కువే. మున్నార్‌ చుట్టుపక్కల చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఫోటోపాయింట్‌, ముత్తిరప్పుళ నది, ఇడుక్కి ఆర్క్‌ డ్యామ్‌, దేవికుళం హిల్‌ స్టేషన్‌, అట్టుకల్‌ జలపాతం వీటిలో కొన్ని. పన్నెండేళ్ళకు ఒకసారి మున్నార్‌ కొండల మీద ‘నీల కురంజి’ అనే జాతి పూలు పూస్తాయి. అప్పుడు నేలంతా పూల దుప్పటి కప్పుకున్నట్టుంటుంది. ఈ పుష్పాల్లో నలభైకి పైగా రకాలున్నాయి. వాటిలో కూడా వివిధ రంగులుంటాయి. అన్నట్టు, పుష్కరం- అంటే 2006వ సంవత్సరం తరువాత ఆ పూలు పూసేది ఈ ఏడాదే! జూలై నుంచి నవంబర్‌ మధ్య మున్నార్‌ టూర్‌ ప్లాన్‌ చేసుకుంటే ఆ పూల ఋతువును మీ కళ్ళల్లో నింపుకోవచ్చు.

ఎలా వెళ్ళాలి?:
ఎర్నాకుళం నగరానికి మున్నార్‌ సుమారు 130 కిలోమీటర్ల దూరంలో మున్నార్‌ ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ప్రాంతాల నుంచి మున్నార్‌కు రైళ్ళు ఉన్నాయి. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మున్నార్‌ చేరవచ్చు. సమీప విమానాశ్రయం కొచ్చిన్‌ (కొచ్చి)లో ఉంది.

వసతి:
మున్నార్‌లో సాధారణ హోటళ్ళు మొదలుకొని లగ్జరీ రిసార్టుల వరకూ... అన్ని బడ్జెట్లకూ అనువైన వసతి సదుపాయాలూ ఉన్నాయి.


పచ్చని ప్రకృతి ఒడిలో...  కొడైకెనాల్‌
ఎక్కడుంది?: తమిళనాడులోని దిండిగల్‌ జిల్లాలో
ప్రత్యేకతలేమిటి?:
తమిళనాడులో ఊటీ తరువాత ఎక్కువ మంది సందర్శించే చోటు కొడైకెనాల్‌. దేశ, విదేశీ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్న హిల్‌ స్టేషన్లలో ఇదొకటి. సమ్మర్‌ డెస్టినేషన్‌గా కొడైకెనాల్‌ ఖ్యాతి అందరికీ తెలిసిందే. అయితే ఈ ప్రాంతంలో జలపాతాలు ఉధృతంగా కనిపించేది మాత్రం వర్షాకాలంలో. వాతావరణం కూడా ఈ సీజన్లో హాయిగా ఉంటుంది. ఎండా, వానా దోబుచులాడుతూ ఉంటాయి. తడిసిన లోయలూ, పొగ మబ్బులు కమ్ముకున్న కొండలతో కొడైకెనాల్‌ చూడచక్కగా కనిపిస్తుంది. కొండలూ, మైదానాలూ, జలపాతాలూ, కొలనులతో సహజ సౌందర్యానికి ఆటపట్టుగా ఇది నిలుస్తోంది. సైకిలింగ్‌, బోటింగ్‌, ట్రెక్కింగ్‌, హార్స్‌ఏరైడింగ్‌ లాంటి సాహసాలకూ, వినోదాలకూ, గోల్ఫ్‌ లాంటి క్రీడలకూ ఇక్కడ లోటు లేదు. కొడైకెనాల్‌లో కూడా పన్నెండేళ్ళకు ఒకసారి నీల కురంజి పుష్పాలు పూస్తాయి. ఈ ఏడాది జూలై నుంచి అక్టోబర్‌ మధ్య వీటిని చూడవచ్చు. సమీపంలోని సైలెంట్‌ వ్యాలీ, పచ్చ లోయ, ఫౌనా ఫ్లోరా పూల మ్యూజియం, బ్రయంట్‌ పార్క్‌, బెరిజం చెరువు వ్యూ పాయింట్‌, కొడైకెనాల్‌ చెరువు, వెండి జలపాతం తప్పనిసరిగా సందర్శించాల్సిన ప్రదేశాల్లో కొన్ని.

ఎలా వెళ్ళాలి?:
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ప్రాంతాల నుంచి మదురై వైపు వెళ్ళే రైళ్ళు కొడైకెనాల్‌ రోడ్డు రైల్వే స్టేషన్‌లో ఆగుతాయి. అక్కడి నుంచి సుమారు 80 కిలోమీటర్ల దూరంలో కొడైకెనాల్‌ ఉంది. సమీప విమానాశ్రయం మదురైలో ఉంది. (120 కి.మీ.)

వసతి:
కొడైకెనాల్‌లో యాత్రికులు బస చేసేందుకు అనుకూలమైన సదుపాయాలు విస్తృతంగా ఉన్నాయి.

Wednesday, 6 June 2018

బదరీ నాధ్






బదరీ నాధ్
జోషిమఠ్, భవిష్య బదరి

కర్రా నాగలక్ష్మి 

నందప్రయాగ నుంచి మా ప్రయాణం బదరీ నాధ్ వైపు సాగింది. సుమారు 63 కిలో మీటర్ల ప్రయాణం తరువాత విష్ణు ప్రయాగ చేరేం. బదరీనాథ్ దారిలో వున్న పంచప్రయాగలలో ఒకటిగా ఈ విష్ణు ప్రయాగని లెక్కపెడతారు. ఇక్కడ అలకనంద  'నీతి పాస్' లో పుట్టిన దౌళిగంగతో సంగమించి విష్ణు గంగగా పిలవబడుతోంది. ధౌళి గంగ నీరు చాలా తెల్లగా ప్రవహిస్తూ పాల నురుగను తలపిస్తుంది.

సంగమం నుంచి కాలినడకను రెండు మూడు కిలో మీటర్లు వెళితే విష్ణు కుండం వస్తుంది. పచ్చని ప్రకృతి మధ్యన యీ కుండం చాలా ప్రశాంతతను కలుగ జేస్తుంది. అందుకనేనేమో నారదుడు విష్ణుమూర్తి కొరకై యిక్కడ తపస్సు చేసుకొని విష్ణుమూర్తిని పిన్నును చేసుకున్నాడు . పురాతనమైన పాడు పడ్డ చిన్న మందిరం, విష్ణుకుండినులు తప్ప మరకమీద లేవు.

విష్ణ ప్రయాగలో 400MW హైడెల్ పవర్ ప్రోజెక్ట్ నిర్మ్ంచిన తరువాత ఇక్కడ జనావాసాలు పెరిగాయి, కాలక్రమేణా విష్ణు కుండానికి ప్రాముఖ్యత పెరిగి ఈ మందిరం పునరుధ్దరింప బడుతుందని ఆశిద్దాం.

విష్ణుప్రయాగకి దగ్గరగా ఉన్న 'హనుమన్ చట్టి' నుంచి కాలినడకన వెళితే హనుమంతుడి మందిరం ఉందని అన్నారు, కాని ఆ నిర్జనమైన దారిలో మందిరానికి వెళ్లే సాహసం చెయ్యలేక పోయేము.

సంగమ ప్రదేశంలో విష్ణు గంగ పైన షడ్భుజాకారంలో ఓ చిన్న మందిరం వుంది, ఆ మందిరం 'అహల్యా బాయి హోల్కర్' చే నిర్మింపబడిందని, అందులో ఆమె తపస్సు చేసుకొనేదని స్థానికులు చెప్పేరు.

మేం వెళ్లినప్పుడు ఆ మందిరానికి మరమ్మత్తులు చేస్తున్నారు .

హైడల్ పవర్ ప్రాజక్టు రావడంతో ఈ గ్రామం పట్నంగా మారింది. ఇళ్లు, గెస్ట్ హౌసులు  స్కూల్స్ వచ్చేయి. రోడ్లుకూడా విశాలంగా మారేయి.

విష్ణు ప్రయాగ నుంచి మనకి మంచుతో కప్పబడ్డ పర్వతాలు కన్పించి కనువిందు చేస్తాయి. పాతికేళ్లముందు ఋషికేశ్ నుంచే చలి మొదలయేది, అడపాదడపా గడ్డకట్టిన మంచు కొండలపై కనిపిస్తూ, ఒక్కో మలుపులో వరసగా తెల్లని మంచుకప్పుకున్న యెత్తైన పర్వతాలు కనువిందు చేసేవి. కాని ఇప్పుడు అలాంటి సుందర దృశ్యాలు సుమారుగా లేవనే చెప్పాలి .

బదరీ వెళ్లే దారిలో వచ్చే మరో చిన్న ఊరు ' హేలంగ్ '. ఈ  ఊరులో పదికి మించి ఇళ్లు ఉండవు కాని ఈ 
ఊరుకి దగ్గరగా ఉన్న మూడు మందిరాలవల్ల యీ ఊరు యాత్రీకులలో ప్రాముఖ్యతను పొందింది.

ఇక్కడ నుండి సుమారు రెండుకిలోమీటర్ల దూరంలో కొండదిగువన పంచబదరీ క్షేత్రమైన 'ధ్యానబదరి
' మందిరాన్ని దర్శించుకోవచ్చు. చాలా చిన్న మందిరం . ఇక్కడ బదరీ నారాయణుడు ధ్యానం చేసుకున్నాడనేది స్థలపురాణం వల్ల తెలుస్తోంది .

హేలంగ్ నుంచి సుమారు పద్నాలుగు కిలోమీటర్ల నడక తరువాత పంచకేదార క్షేత్రమైన ' కపాలేశ్వర మందిరాన్ని , భవిష్య కేదార్ మందిరాన్ని దర్శించుకో వచ్చు .

బదరీ వెళ్లే దారిలో వచ్చే మరో వూరు 'పిపల్ కోటి'. దీని గురించి ప్రత్యేకంగా యెందుకు చెప్తున్నానంటే యీ 'పిపల్ కోటి'లో మనకి కాలసిన దక్షిణ భారతదేశముపు ఫలహారాలు దొరకుతాయి . ఇప్పడు మనకి బదరీనాథ్ లో కూడా మన ఆహారాలు గత అయిదారు సంవత్సరాలుగా దొరకుతున్నాయి . కాని 'పిపల్ కోటి' లో పాతిక సంవత్సరాల నుంచి (అప్పట్లోనే మొదటి మారు యాత్రకి వెళ్లేం ) పాతికేళ్ల కిందట బదరీలో అన్నం పెరుగు దొరికేవి కావు. పాలు లేని కాఫీ, టీలు వుండేవి. అప్పట్లో మంచి టీ టిఫిన్స్ , భోజనం ' పిపల్ కోట ' లోనే దొరికేవి.

జోషీమఠ్
ఋషికేశ్ కి సుమారు 251 కిలోమీటర్ల దూరంలో ఉత్తరాఖండ్ రాష్ట్రం లో చమోలి జిల్లాలో వుంది జోషిమఠ్ . శీతాకాలంలో బదరీనాథుని మందిరం మూసివేసినప్పుడు ఆ విగ్రహాలను జోషిమఠ్ లో వుంచి పూజలు చేస్తారు .

శంకరాచార్యుల వారు పురాణాలలో వున్న బదరీనాధ్ వర్ణనను అనుసరించి యిక్కడకు రాగా హిమపాతం వల్ల బదరీకి దారి మూసుకు పోగా ఆది శంకరులు తన శిష్యులతో యిక్కడ బస చేసి మఠస్థాపన చేసి మంచు కరిగినతరువాత బదరీ చేరి నారద కుండంలో వున్న విగ్రహాలను వెలికి తీసి ప్రతిస్టించేరు . శంకర భగవత్పాదులు నివాసమున్న స్థలం వారు వాడిన వస్తువుల యిక్కడ మనం చూడొచ్చు . శంకరాచార్యుల వారిచే స్థాపింపబడ్డ బదరీపీఠం జోషిమఠలో వుంద్ , యీ మఠం అధర్వణ వేదానికి సమర్పితమైంది.

జోషిమఠ్ లో టాక్సీ స్టాండు నుంచి కిందకి దిగితే నరసింహ మందిరం వస్తుంది . ఇది చాలా పురాతన మైన మందిరం , లోపల పూజారుల నివాసాలు వున్నాయి , పైన గదులలో ఆదిశంకరుల పడక , ఆసనం మొదలైనవి చూడొచ్చు . యీ మందిరానికి వున్న ప్రాముఖ్యత యేమిటంటే యీ మందిరం లో వున్న మూలవిరాట్టు కి ఒక చెయ్య విరిగిపోయి వుంటుంది . రెండో చెయ్య విరిగి పోయిన నాడు బదరీనాథ్ మందిరప్రాంతం మొత్తం నేలమట్టం అయిపోతుందట . తర్వాత బవిష్య బదరీ లో బదరీనారాయణుడు పూజలందుకుంటాడట.

జోషిమఠ్ నుంచి సుమారు పదమూడు కిలోమీటర్ల దూరంలో వున్న తపోవనం వెళ్లొచ్చు . తపోవనం ఋషులు మునులు తపస్సు చేసుకున్న ప్రదేశం అని అంటారు .

ఎక్కువ యాత్రీకుల తాకిడి లేని ప్రదేశం , ఆశ్రమాలు తప్ప మరేమీలేవు .

పచ్చని ప్రకృతి , ప్రశాంత కావాలనుకునే వారు తప్పక వెళ్ల వలసిన ప్రదేశం .

జోషిమఠ్ వూరులోంచి కొండపైకి వెళితే అక్కడ రెండుదారులు వస్తాయి . ఒకటి ఔలి , రెండవది తపోవనం వైపు వెళతాయి , బవిష్య బదరీ వెళ్లాలంటే తపోవనం రోడ్డు మీదుగా వెళ్లాలి .

భవిష్య బదరి వెళ్లడానికి ప్రయాణ సాధనాలు అంతగా లేవు , జోషిమఠ్ నుంచి టాక్సీ తీసుకోవచ్చు . ఋషికేశ్ నుంచి వచ్చిన టాక్సీలలో కూడా వెళ్లొచ్చు .

ఒకటి అరా లోకలు బళ్లు తప్ప మరే రాకపోక వుండవు , ఓ అయిదారు కిలో మీటర్లు వెళ్లిన తరువాత రోడ్డు కి కుడి వైపున రోడ్డు పైనే వేడినీటి బావి వుంటుంది . అందులో నీరు యెంత వేడిగా వుంటుందంటే నీరు కుతకుతలాడుతూ  వుంటుంది . పసుపు వర్ణం లో లోపలనుంచి మన్ను బయటకి వస్తూ వుంటుంది . మేము బవిష్యబదరి వెళదామనుకొని స్థానికుల దగ్గర సమాచారం సేకరిస్తూ వుంటే వారు యీ బావి గురించి , అందులోంచి వచ్చే పసుపుపచ్చటి మన్ను గురించి చెప్పి ఆ మన్నుకి చాలా మెడిసనల్ వేల్యూ వుందని యెటువంటి చర్మ రోగమైనా తగ్గిపోతుందని అక్కడ చుట్టుపక్కల గ్రామాల వారు దానినే చర్మరోగాలకు మందుగా వాడుతారని చెప్పడంతో మేము రెండు మూడు ప్లాస్టిక్ డబ్బాలు తీసుకు వెళ్లేం . మన్ను వేడిగా వుండటం వల్ల మేం డబ్బా తో తియ్యడాని ప్రయత్నిస్తే డబ్బా కడిగి సొట్టపడింది . అయితే యెలాగో మన్ను కలక్ట్ చేసేం .

సైన్సు ప్రకారం కిందన గంధకం నిక్షేపాలు వున్న చోట వేడినీటి బుగ్గలు యేర్పడతాయని , ఆ ప్రకారంగానే యిక్కడ పైకి వస్తున్న పసుపురంగు మన్నులో గంధకం కలసిందను కుంటే అక్కడ మట్టికి గంధకం వాసనలేదు . నాకు సల్ఫర్ యెలర్జీ వుండడం వల్ల నేను చర్మ రోగాలకు యే ఆయింట్ మెంట్ వాడను , వాడలేను . కాని యీ మన్ను వాడితే నాకు యెటువంటి ఎలర్జీ కలుగలేదు . ఈ వ్యాసం చదివిన పెద్దలు యెవరైనా నా సందేహం తీర్చగలరు .

అక్కడ నుంచి మరే 4 కిలో మీటర్ల ప్రయాణం తరువాత భవిష్య బదరీకి వెళ్లే కాలి దారి దగ్గర ఆగేం .

భవిష్య బదరీ స్థానికులలో ప్రాముఖ్యం పొందినా యెక్కువ యాత్రీకులు రాకపోడం తో యిక్కడ యాత్రీకులకు కావలసిన సదుపాయాలు లేవు  , అంటే నడవ లేని వారికి కోసం గుర్రాలు , డోలీలు లాంటివి , వసతి సౌకర్యాలు లేవు .

భవిష్య బదరి కొండలపై అయిదు కిలో మీటర్ల నడకన చేరుకోవచ్చు . ఆ ప్రాంతంలో రెండే గుర్రాలున్నాయని , ప్రొద్దుట వెళితే గుర్రాలు దొరకొచ్చని , ఆలశ్యం అయితే మన్నుమొయ్యడానికి తీసుకు వెళ్తారని చెప్పడంతో తొందరగా వెళ్లేం, స్థానికులు చెప్పినట్లు మాకు ఆ గుర్రాలు దొరికేయి , అయితే జీను కట్టని గుర్రాల మీద ప్రయాణం మహా సాహసమనే చెప్పాలి . యెలోగోవోలా ప్రయాణించసాగేం . గుర్రాలతోపాటు వూరు మీదుగా వూరంటే  నాలుగు కుటుంబాలు    అంతే , అదేవూరు . అక్కడ ఆ పేదవారిచ్చిన ఆథిధ్యం తీసుకున్నాం , యేదో వారు వండుకున్నది మాకు పెట్టేరు , అది తిని మేం యిచ్చిన డబ్బు వారు పుచ్చుకోకపోతే వారి పిల్లల చేతిలో పెట్టి బట్టలు కొనుక్కోమని చెప్పేం .

వారు వాళ్ల యిళ్ల ముందున్న స్థలంలో కూరగాయలు , గోధుమలు పండించుకుంటున్నారు .

తర్వాత దారిలో మరో పల్లెను కూడా దాటేం , పడిపోతున్న పెద్దపెద్ద రాళ్లను దాటుకొని , జలపాతాలను దాటుకొని పైకి చేరేం . పైన పేద్ద మైదానం , కనుచూపు మేర వరకు పచ్చని తివాసీ పరచినట్లుంది .

అక్కడ నుంచి పచ్చిక మీద నడుస్తూ మరో అర కిలో మీటరు నడిచేం , ఆ నడక ఆయాసం కలుగజేసినా రెండింతలు అహ్లాదాన్నిచ్చింది. కోనిఫర్ చెట్లతో నిండివున్న అడవిని చేరడం అక్కడ చిన్న కుటీరం , అందులో నివసిస్తున్న స్వామీజీని కలుసుకున్నాం , పేరడిగితే స్వామీజీలకు పేరేమిటి ? అనే సమాధానం చెప్పేరు . ఆ కుటీరం యెండని కాని వరాన్ని కాని ఆపలేదు , అలాగే స్వామీజీకి యే రక్షగా యివ్వలేదని చూడగానే తెలుస్తోంది . మరో కాషాయ అంగ వస్త్రం తప్ప మరేమీ లేవు . ఎలా వుంటున్నారు అనే ప్రశ్నకి " యిలాగే " అనే సమాధానం వచ్చింది .

మా గుర్రలాబ్బాయి , స్వామీజీ కుటీరానికి యెదురుగా వున్న కొండదగ్గరకు మమ్మలని తీసుకు వెళ్లేరు . కొండముందర చిన్న చిన్న కర్రలతో పందిర కట్టి వుంది , వెనుకాతలకొండని ఆనుకొని ఓ రాతి ఆకారం , కొండలోంచి బయటకి వస్తున్నట్టుగా వుంది . మొహం , కాళ్లు చేతులు వున్నాయి , మిగతా అవయవాలు తీరుగా యేర్పడలేదు . అదే బదరీనాథుని బవిష్య రూపమని , ఆకృతి పూర్తిగా యేర్పడిననాడు యిప్పటి బదరీ మూసుకుపోతుందని , యీ ఆకృతి బదరీనారాయణునిగా పూజలందుకుంటుందని వివరించేరు.

ప్రస్తుతం స్వామీజీ పూజలు నిర్వహిస్తున్నట్లు చెప్పేరు .

అక్కడ యెంత ప్రశాంతంగా వుందంటే అలా యెంతసేపైనా గడిపేయొచ్చని అని పించింది .

అయితే మా గుర్రాలబ్బాయి , స్వామీజీ పులులు తిరిగే వేళయిందని అంటే బయలుదేరి పోయేం  .

రోజూ అదే వేళకు పులులు అటు వైపు వస్తాయట , స్వామీజీ రోజూ చూస్తూ వుంటారట , కాని అతనిని యేమి చెయ్యవట . నాకు నమ్మబుద్దికలుగలేదు .

మట్టిలోంచి , నూతులలోంచి విగ్రహాలు బయటకి రావడం చూసేం అలా వచ్చిన విగ్రహాలు పూర్తిగా చెక్కబడి వుండడం కూడా చూసేం , నిరంతరంగా నీటి రాపిడికి ఆకృతులు యేర్పడడం కూడా చూసేం కాని యిక్కడ యెటువంటి నీరు పడకుండా యెవరూ చెక్కకుండా ఓ కొండ నుంచి ఆకృతి వుబ్బుగా పైకి రావడం మహా వింతగా అనిపించింది . రెండు చేతులు , తల , కాళ్లు , మధ్య శరీరం తెలుస్తున్నాయి అలాగే ఓ చెయ్యి పైకెత్తి శంఖం ధరించినట్లు మరొక చెయ్య అభయముద్రలో వున్నట్లు తెలుస్తోంది .

ఆ ప్రదేశాన్ని వదిలి రాలేక రాలేక వచ్చేం .

తర్వాత తపోవనం వైపు ప్రయాణం సాగించేం . భవిష్య బదరీనుంచి సుమారు 10 కిలోమీటర్ల ప్రయాణానంతరం లోయ లాంటి ప్రాంతం చేరుకున్నాం .

మిగతా వివరాలు పై వారం చదువుదాం అంత వరకు శలవు.




వ్యాలీ ఆఫ్‌ ఫ్లవర్స్‌ Valley of Flowers

అందాల పూలలోయ..!
‘హిమాలయాలు...  మంచుకొండలూ హిమనదాలూ జీవనదులూ సరోవరాలూ... వంటి ప్రకృతి అందాలకీ రకరకాల జీవజాతులకీ రంగురంగుల పూలజాతులకీ ముఖ్యంగా అరుదైన బ్రహ్మకమలాలకీ పుట్టిల్లు. అందుకే ఆ కొండల్లో ఎన్నిసార్లు తిరిగినా చూడాల్సినవేవో ఎక్కడో ఒకచోట మిగిలే ఉంటాయి. అలాంటిదే జోషిమఠ్‌ నుంచి బదరీనాథ్‌కు వెళ్లే దారిలో ఉన్న పూల లోయ ఉరఫ్‌ వ్యాలీ ఆఫ్‌ ఫ్లవర్స్‌...’ అంటున్నారు పుణెకి చెందిన కర్రా నాగలక్ష్మి.

వ్యాలీ ఆఫ్‌ ఫ్లవర్స్‌కి వెళ్లాలంటే ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలోని గోవింద్‌ఘాట్‌ మీదుగా వెళ్లాలి. హెలీకాప్టర్‌ సేవలు అందుబాటులో ఉంటాయి. కానీ వాటికన్నా అక్కడినుంచి నడకదారినగానీ గుర్రాలూ లేదా డోలీల్లోగానీ ప్రయాణించడమే మేలు. ఇక్కడ హిమపాతం, వర్షపాతం రెండూ ఎక్కువే. దాంతో హెలీకాప్టర్‌ సేవలు తరచూ రద్దు అవుతుంటాయి. హరిద్వార్‌ నుంచి గోవింద్‌ఘాట్‌కి 296 కి.మీ. అక్కడికి ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం నడుపుతున్న బస్సులూ ట్యాక్సీలతోబాటు ప్రైవేటు బస్సులూ ఉంటాయి. బస్సులో ఎక్కువ సమయం పడుతుందని టాక్సీలో బయలుదేరాం.

గోవింద్‌ఘాట్‌లో...
ముందుగా ఉత్తరాఖండ్‌లోని శ్రీనగర్‌కి చేరుకున్నాం. రాత్రి అక్కడ బస చేసి ఉదయాన్నే బయలుదేరి జోషిమఠ్‌కి వెళ్లాం. అప్పటికే గోవింద్‌ఘాట్‌కు వెళ్లే దారి మూసేశారట. దాంతో ఆ రోజు అక్కడే బస చేశాం. అక్కడినుంచి గోవింద్‌ఘాట్‌కి సుమారు 20 కిలోమీటర్లు. జోషిమఠ్‌ నుంచి బదరీనాథ్‌కు వెళ్లే మార్గాన్ని ఆనుకొనే ఉంటుంది గోవిందఘాట్‌. ఉదయాన్నే బయలుదేరి, ఓ కిలోమీటరు ప్రయాణించాక ఘాట్‌కు చేరుకున్నాం. అక్కడ హోటళ్లు అన్ని వర్గాలవాళ్లకీ అందుబాటులో ఉన్నాయి. సమీపంలోనే ఓ పక్క అలకనందా నది కనిపిస్తుంటుంది. దాని ఒడ్డున గురుద్వారా ఉంది. అందులో యాత్రికులకు ఉచిత భోజన, పార్కింగ్‌ సదుపాయాలు ఉన్నాయి. అక్కడి నుంచి కాలిబాట మొదలవుతుంది. మేం గురుద్వారా దగ్గరే ఆగి, తేలికపాటి బ్యాగుల్లో రెండు రోజులకి సరిపడా బట్టలూ ఇతరత్రా నిత్యావసర వస్తువులూ సర్దుకుని మిగిలినవి టాక్సీలోనే వదలి నడకదారిన బయలుదేరాం. గురుద్వారాలో లగేజీని దాచుకునే సౌకర్యం ఉంది. ఈ యాత్రకు అవసరమైన మాయిశ్చరైజింగ్‌ క్రీమూ సన్‌స్క్రీనూ చలిని ఆపే కోట్లూ కొండల్లో నడవడానికి వీలుగా ఉండే షూ తప్పనిసరి. తలనొప్పి, జ్వరం... వంటి వాటికి అవసరమైన మందుల్నీ వెంట తీసుకెళ్లాలి. టార్చిలైట్‌ తప్పనిసరి.

నదీ సంగమం!
ఓ అరకిలోమీటరు నడిచాక గానీ గుర్రాలూ డోలీలూ దొరకవు. నడక దారిన వెళ్లేవారికి సామాన్లు మోసేవారూ దొరుకుతారు. వ్యాలీ ఆఫ్‌ ఫ్లవర్స్‌తోబాటు హేమకుండ్‌ సాహెబ్‌ చూడ్డానికి గుర్రాలు మాట్లాడుకున్నాం. సుమారు 12 కిలోమీటర్లు ప్రయాణించాక ఘంగారియాకి చేరుకున్నాం. అక్కడి నుంచి ముందుగా వ్యాలీ ఆఫ్‌ ఫ్లవర్స్‌కి వెళ్లాలనుకున్నాం. ఆ దారిలో కాస్త దూరం మట్టి, బురద. మరికాస్త దూరం బండరాళ్లు. ఎత్తు ఎక్కువగా ఉన్నచోట గుర్రాలమీద నుంచి దిగి నెమ్మదిగా ఎక్కసాగాం.

దారిలో అలకనందా నది పరవళ్లు తొక్కుతూ మమ్మల్ని పలకరిస్తూనే ఉంది. అత్యంత కష్టమ్మీద ఆ పన్నెండు కిలోమీటర్లూ ప్రయాణించాక పచ్చని మైదానం, చిన్న చిన్న సెలయేళ్లూ ప్రవహిస్తూ కనువిందు చేశాయి. ఘంగారియాకి వెళ్లడానికి మొత్తంగా ఆరుగంటల సమయం పట్టింది.
ఘంగారియా బైందరలోయలో ఉంది. బైందర గంగ, పుష్పవతి నదుల సంగమ ప్రదేశమే ఘంగారియా. ఈ రెండు నదులూ సంగమించి లక్ష్మణ గంగగా ప్రవహించి గోవింద్‌ఘాట్‌ దగ్గర అలకనందలో కలుస్తాయి. ఘంగారియాలో టెంట్లూ మట్టి ఇళ్లే ఉన్నాయి. వాటిల్లోనే యాత్రికులకి అవసరమైన భోజన, వసతి సదుపాయాలను కల్పిస్తారు. ఈ ఘంగారియా పూలలోయకీ హేమకుండ్‌ సాహెబ్‌కీ కూడలి లాంటిది. గోవింద్‌ఘాట్‌ తరవాత నివాస, భోజన సదుపాయాలు కలిగిన ప్రదేశం ఇదే. ఇక్కడి హోటళ్లు ఆరుగంటలకే మూసేస్తారు. ఆ లోగానే భోజనాన్ని ముగించుకోవాలి. బసలో సామాన్లు ఉంచి టీ, స్నాక్సూ కానిచ్చి పూలలోయకి బయలుదేరాం. మధ్యాహ్నం మూడు తరవాత ఈ లోయలోకి అనుమతించరు. ప్రవేశద్వారం వద్ద టిక్కెట్లు తీసుకుని నడక మొదలెట్టాం. ఒకసారి తీసుకున్న టిక్కెట్టుతో మూడురోజులవరకూ వ్యాలీలోకి వెళ్లవచ్చు.
అందాల పూలలోయలో...
ఉత్తరాంఛల్‌లోని చమోలి జిల్లాలోని సుమారు 3,660 మీటర్ల ఎత్తులోని సుందర ప్రదేశమే ఈ పూలలోయ. ఎగుడుదిగుడు కొండలమీద నడుచుకుంటూ వెళ్లాక నందాదేవి నేషనల్‌ పార్కు వచ్చింది. అందులోనుంచే వ్యాలీలోకి ప్రవేశించాలి. ఆ దారి బీభత్సమే. అక్కడ ఎప్పుడు వాన పడుతుందో ఊహించలేం. ఆ వానలకి కొండరాళ్లు దొర్లుకుంటూ వస్తుంటాయి. దాంతో నడవడమే కష్టం. ఏకంగా మూడు కిలోమీటర్లు నడవాలనుకున్న మా అంచనా తప్పింది. సూర్యాస్తమయానికి నందాదేవి నేషనల్‌ పార్కు గేటు దగ్గరకు చేరుకున్నాం. చీకటి రాత్రిలో ఎక్కువసేపు తిరగలేం అన్న కారణంతో వెనుతిరిగాం. మర్నాడు పొద్దున్నే అయిదు గంటలకి డోలీలు కట్టించుకుని బయలుదేరాం. నందాదేవి జాతీయ పార్కుకి వెళ్లడానికి మూడు కిలోమీటర్ల నడక అంటే రానూపోనూ ఆరు కిలోమీటర్లు, అంత నడక అలవాటు ఉండదు కాబట్టి డోలీ కట్టించుకుని బయలుదేరాం. డోలీవాళ్లే మాకు గైడ్స్‌. 

లేలేత సూర్యకిరణాలు హిమాలయాలపై పడి అవి తిరిగి పూలలోయలో ప్రతిబింబించే ఆ సుందర దృశ్యాన్ని వర్ణించడం మహాకవులకే సాధ్యం అనిపించింది. లోయంతా పూలముగ్గులేసినట్లే ఉంది. ఒక్కోచోట ఒక్కో రంగు పూలూ... మధ్యమధ్యలో ఇంద్రధనుస్సులా రంగురంగుల పూలూ వాటిమధ్యలో వచ్చే పిల్ల సెలయేళ్లూ దాటుతుంటే చిత్రమైన అనుభూతి. ఒకటి రెండు కిలోమీటర్ల దాటాక రంగురంగుల క్రోటన్లు... పూలమొక్కల మధ్యలో రంగుల ఆకుల మొక్కల్ని చూస్తుంటే, ఎవరో పుష్పగుచ్ఛంలో అమర్చినట్లుగా ఉంది. నిజంగా ఆ అమరిక అద్భుత ప్రకృతి చిత్రమే. దూరం నుంచి చూస్తే రంగురంగు చారల తివాచీ పరిచినట్లుగా కనిపిస్తోంది. ఈ పూలఅమరిక ఏటా మారిపోతుంటుంది. ఎందుకంటే గాలివానలకి విత్తనాలు రకరకాల ప్రదేశాల్లో పడి మొలకెత్తుతాయి. 

ఎంత దూరం నడిచినా నలువైపులా కనుచూపు మేరలో రంగురంగుల పూలే... జెరానియం, స్నేక్‌ ఫాయిల్‌, హుక్‌డ్‌ స్టిక్‌ సీడ్‌, హిమాలయన్‌ రోజ్‌, బ్లూ పాపీ, కోబ్రాలిల్లీ, డాగ్‌ ఫ్లవర్‌... ఇలా ఎన్నో రకాలు. వృక్ష నిపుణులకయితే పండగే. సెలయేళ్లు దాటుకుంటూ పూలవనంలో ఎంత దూరం ప్రయాణించామో తెలియలేదు. వెనక్కి రావాలనే అనిపించలేదు. ఒకచోట చిన్న సమాధి కనిపించింది. అది జాన్‌ మార్గరెట్‌ అనే ఆమెదనీ, 1939లో ఇక్కడ దొరికే అరుదైన పుష్పజాతులమీద అధ్యయనం చేసేందుకు వచ్చి ప్రమాదవశాత్తూ మరణించిందనీ రాసి ఉంది. తరవాతి కాలంలో ఆమె చెల్లెలు అక్క జ్ఞాపకార్థం సమాధిని నిర్మించిందని డోలీవాళ్లు చెప్పారు. ఆ తరవాతే ఈ ప్రదేశం వెలుగులోకి వచ్చింది. 

ఇక్కడ పూచే ప్రతి పూవూ ఔషధభరితమే. రామాయణంలో హనుమంతుడు తీసుకొచ్చిన సంజీవని పర్వతం ఈ పూలలోయలోదేనని అంటారు. ఆ పూలమీదుగా వీచే గాలిని పీల్చినా రోగాలన్నీ తగ్గుతాయట. సుమారు 8 కిలోమీటర్ల పొడవూ 2 కిలోమీటర్ల వెడల్పులతో హిమాలయ పర్వతశ్రేణుల మధ్య విస్తరించిన ఈ పూలలోయకి తూర్పున నందాదేవి అభయారణ్యం ఉంది. ట్రెక్కర్లు నందాదేవి అభయారణ్యానికి పొద్దున్నే వెళ్లి, సాయంకాలానికి తిరిగి వస్తుంటారు. ఇక్కడ మంచు పులి, నల్ల ఎలుగుబంట్లు, ఎర్ర నక్కలు, నీలి గొర్రెలు, కస్తూరి మృగాలు ఉంటాయి.
లోయలో అక్కడక్కడా కొంగలూ డేగలతోబాటు రంగురంగుల ఈకలతో ఉండే మోనల్‌ పక్షులు కనువిందు చేశాయి. అంత అందమైన లోయను వదల్లేక వదల్లేక వెనక్కి మళ్లాం. ఘంగారియా చేరాక గానీ మేం అల్పాహారం కూడా చేయలేదని గుర్తు రాలేదు. వేడివేడిగా నూడుల్స్‌ తిని, టీ తాగి హేమకుండ్‌ సాహెబ్‌కి బయలుదేరాం.

హేమకుండ్‌ సాహెబ్‌!
గోవింద్‌ఘాట్‌ నుంచి పూలలోయకి 12 కిలోమీటర్ల ప్రయాణం ఒక ఎత్తయితే, ఘంగారియా నుంచి హేమకుండ్‌ వరకూ ఉన్న ఐదు కిలోమీటర్ల దూరం మరో ఎత్తు. ఈ కిలోమీటర్ల లెక్క ఎప్పుడూ ఒకేలా ఉండదు. తరచూ కురిసే వర్షాల వల్ల ముందు ఉన్న దారి మూసుకుపోతుంటుంది. కొండరాళ్ల మధ్య నుంచి దారి చేసుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. హేమకుండ్‌కి వెళ్లడం అంటే 4329 మీటర్ల ఎత్తుకి చేరుకున్నట్లే. కొండలు నిటారుగా ఉంటాయి. శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు ఆక్సిజన్‌ సిలిండర్లు వెంట ఉంచుకోవడం మంచిది. సన్నగా వాన పడటంతో వణుకు మొదలైంది. భగవన్నామ స్మరణ చేసుకుంటూ ప్రయాణం సాగించాం. మరో రెండుకిలోమీటర్ల తరవాత కొండల్లో బ్రహ్మకమలం మొక్కలు పూలతో కనిపించేసరికి మా ఆనందానికి హద్దులేకపోయింది. మేం వెళ్లింది సెప్టెంబరు మాసం కావడం వల్ల బ్రహ్మకమలాల్ని చూడగలిగాం. ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం వీటిని రక్షిత పూసంపదగా ప్రకటించింది. పూలను ఫొటోలు తీసుకున్నాం. మిగిలిన ప్రయాణం కష్టంగా ఉన్నా బ్రహ్మకమలాలు చూసుకుంటూ ప్రయాణం సాగించాం. మొత్తం అయిదు కిలోమీటర్లూ రెండున్నర గంటల్లో చేరుకున్నాం. 

గుర్రాలు దిగి, గురుద్వారాకి నడిచి వెళ్లాం. గురుద్వారా బయట లాంగరులో వేడి టీ, కిచిడీ, రోటీ కూర ఇస్తున్నారు యాత్రికులకి. గురుద్వారాకి పక్కన ఉన్న సరస్సే హేమకుండ్‌. 1960లో ఇక్కడ గురుద్వారా నిర్మించారు. నాటి నుంచీ ఏటా ఇక్కడ యాత్రికులకు ఉచిత భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతిరోజూ ఉదయాన్నే ఐదు కిలోమీటర్లు నడిచి వచ్చి ఇక్కడ వంటలు చేసి పెట్టే వాళ్ల శ్రద్ధను మెచ్చుకోకుండా ఉండలేం. రాత్రికి హేమకుండ్‌లో ఎవరూ ఉండకూడదనీ దేవతలు ఆ సరస్సులో స్నానం చెయ్యడానికి వస్తారనీ వాళ్లను చూసిన మనుషులు ప్రాణాలతో ఉండరన్నది స్థానికుల నమ్మకం. దాంతో మళ్లీ మధ్యాహ్నం కిందకి వచ్చేస్తారు. అయితే రాత్రిపూట అక్కడ ఆక్సిజన్‌ ఉండదు కాబట్టి మరణిస్తారనేది సైంటిస్టుల వాదన. సరస్సు చుట్టూ ఏడు కొండలూ(సప్తశృంగపర్వతం) వాటిమీద సిక్కుల మతపరమైన ధ్వజాలూ కనిపిస్తాయి. వీటిని నిశాన్‌ సాహెబ్‌ అంటారు. అక్కడికి సమీపంలో ఓ చిన్నబోర్డు మీద లక్ష్మణుడు తపస్సు చేసుకున్న ప్రదేశం అని రాసి ఉంది. ఆ ఎముకలు కొరికే చలిలో సిక్కులు ఆ సరోవరంలో స్నానాలు చేయడం ఆశ్చర్యం కలిగించింది. అక్కడి హాల్లోని పవిత్ర గంథ్రాన్ని దర్శించి, వేడి టీ తాగి ఘంగారియాకి బయలుదేరాం.

బదరీనాథ్ ధాం యాత్ర






బదరీనాథ్ ధాం యాత్ర

భారతదేశంలో ఉన్న ముఖ్యమైన తీర్థ స్థానాలలో ఒకటైన బదరీనాథ్ పేరు తెలియని హిందువు ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. భారతదేశంలో నాలుగు ముఖ్యమైన యాత్రలైన రామేశ్వరం, ద్వారక, మధుర, బదరీనాథ్‌లను చార్‌ధాం యాత్ర అని అంటారు.

"ప్రతి హిందువు తమ జీవిత కాలంలో ఈ యాత్రలను చేసుకుంటే మొత్తం భారతదేశంలో ఉన్న అన్ని తీర్ధ స్థానాలను దర్శించుకున్నంత పుణ్యం వస్తుంది. " అని ఆది శంకరులు అన్నారు.

చార్‌ధాంలలో వొకటైన బదరీనాథ్ ధాంని " విశాల్ బదరి " అని కూడా అంటారు. ఇది వైష్ణవుల 108 దివ్య దేశాలలో 107వ దివ్య దేశంగా, అతి పవిత్ర స్థలంగా చెప్పాబడింది. ప్రతీ సంవత్సరం అక్షయ తృతీయ నాడు మొదలయ్యే ఈ యాత్ర ఆశ్వీజ శుక్ల దశమి వరకు కొనసాగుతుంది.

దేశరాజధాని ఢిల్లి నుంచి సుమారు 520 కిమీ దూరంలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఘరేవాల్ ప్రాంతంలో చమోలి జిల్లాలో వున్నది విశాల్ బదరి. ఢిల్లి నుంచి హరద్వార్, ఋషికేశ్ వరకు రైల్ మార్గం కుడా వుంది. అక్కడ నుంచి అంతా ఘాట్ రోడ్డు మీద ప్రయాణం సాగుతుంది. దేవప్రయాగ, శ్రీనగర్ (ఉత్తరా ఖండ్), రుద్రప్రయాగ్, కర్ణ ప్రయాగ్, నంద ప్రయాగ్, చమోలి, పిపల్ కోటి, జోషిమఠ్, గోవింద్ ఘాట్, పాండుకేశ్వర్ అనే ప్రాంతాల మీదుగా యీ ప్రయాణం సాగుతుంది.

సాధారణం గా మే, జూన్ మాసాలలో చాలా మంది యీ యాత్ర ప్లాన్ చేసుకుంటారు. ఆ రెండు మాసాలూ భక్తుల రద్దీ వుండడంతో వుండడానికి వసతి దొరకటం చాలా యిబ్బంది అవుతుంది అంతే కాకుండా దర్శనానికి కూడా చాలా సమయం చలిలో వేచి వుండవలసి వస్తుంది. జులై, ఆగస్ట్ నెలలు వర్షాలు కురుస్తాయి. కాబట్టి ఆ రెండు మాసాలు కూడా విడిచి పెడితే సెప్టెంబర్, అక్టోబర్ నెలలు ఈ యాత్రకి అనువుగా ఉంటాయి. మే, జూన్ నెలలలో ఉన్నంత చలి ఉండదు, వాతావరణం ప్లెజెంట్ గా ఉంటుంది. రద్దీ లేకపోవడంతో బదరీనాథునికి చేసే విష్ణు సహస్రనామ సేవ హారతి సేవలలో పాల్గొనవచ్చు.

ఉత్తరాఖంఢ్ రాష్ట్రంలోని చమోలి జిల్లాలో హిమాలయాలకూ, దేశ సరిహద్దుకు దగ్గరగా స్వఛ్ఛమైన జలాలతో ఉరుకులు పరుగులతో ప్రవహించే అలకనంద వొడ్డున ఉంది ఈ కోవెల. అలకనంద నది దాటగానే కుడి వైపున ఆది కేదార్ మందిరం, నారదకుండం, ఉష్ణ కుండం ఉంటాయి. బదరీనాధుని దర్శించుకొనే భక్తులు నారదకుండం దర్శించుకొని ఉష్ణకుండంలో స్నానాలు చేసుకొని ఆది కేదారేస్వరుని దర్శించుకొని బదరీనాధుని దర్శించుకుంటారు. కోవెల ముఖ్య ద్వారంలోకి ప్రవేశించగానే ఎడమచేతి వైపు చిన్న మందిరంలో లక్ష్మిదేవి కొలువై ఉంటుంది. అక్కడ నుంచి ఇంకా ముందుకి వెళితే వేదాంత దేశిక, రామానుజా చార్యుల మందిరాలను చూడొచ్చు. ఇంకొంచం ముందుకి వెళితే పెద్ద పెద్ద చెవులున్న రాక్షసుని విగ్రహం కనిపిస్తుంది. ఇతని పేరు గంఠాకర్ణుడని, ఇతడు అక్కడి క్షేత్రపాలకుడని రాసిన బోర్డ్ కనిపిస్తుంది. ప్రస్తుతం పాత విగ్రహానికి క్షతి కలగటంతో దాని స్థానే చిన్న విగ్రహం ప్రతిష్టించేరు.

అక్కడి పూజారులు గంటా కర్ణుని కధ యిలా చెప్తారు. వారు చెప్పిన ప్రకారం గంటాకర్ణుడు, రావణాసురుడు కుబేరునితో యుద్ధానికి వెళ్ళినపుడు అతని ముఖ్య సైన్యాధికారిగా ఉండేవాడని, ఆ యుద్ధములో రావణాసురుడు విజయం పొంది కుబేరుని సామ్రాజ్యమునకు గంటాకర్ణుని పట్టాభిషిక్తుని చేసి లంకకు వెళ్లిపోయెనట. గంటాకర్ణుడు కుబేరుని వద్దకు వెళ్లి అతని రాజ్యము అతనినే ఏలుకొమ్మని తాను శివ ధ్యానంలో గడుపుతానని కోరగా, కుబేరుడు వోడిన రాజ్యం తిరిగి తీసుకొనుట వీరుల లక్షణం కాదని రాజ్యభారం గంటాకర్ణునికే విడిచిపెట్టి కుబేరుడు 'మానా' గ్రామాన్ని ఆనుకొని ఉన్న కొండలలో తాను వొక కొండ రూపం ధరించెనని నేటికి కుడా కుబేరుడు ఆ పర్వతాలలో వొక పర్వతంగా ఉన్నాడని స్థానికుల నమ్మకం. గంటాకర్ణుడు దేవతలకు విధేయుడిగా పరిపాలన చేస్తూ తన భక్తితో శివుని మెప్పించి మోక్షాన్ని పొందుతాడు. గంటాకర్ణుని కోరిక మేరకు ఆ పెద్ద గంఠని దర్శించుకున్నవారికి కుడా మోక్షం కలిగేటట్లు శివుడు వరమిచ్చేడన్నది కధ. 2013లో సంభవించిన వరదలలో ఆ గంటకు గంటా కర్ణుని విగ్రహానికి క్షతి కలుగడంతో ఆరెండింటిని తొలగించేరు.

ఇక ఆదికేదార్ కధ
శివుడు పార్వతీ సమేతుడై యిక్కడ నివాసముండేవాడట. మహా భారత యుద్ధానంతరము విచలిత మనస్కుడయిన విష్ణుమూర్తి మహర్షుల సలహాను అనుసరించి తపస్సు చేసుకొనేందుకు అనువైన ప్రదేశాన్ని వెతుకగా విష్ణుమూర్తికి ఆదికేదార్ ప్రాంతం తపస్సాచరించుటకు అనువైనదిగా తోచుతుంది. కాని అప్పటికే శివ పార్వతులు అక్కడ నివాసముండుట చూచి ఆ ప్రదేశమును కపటము ద్వారా జయించి అక్కడ తపస్సు చేసుకోవాలని తలంచుతాడు. అందులో భాగంగా పార్వతీ పరమేశ్వరులు వ్యాహ్యాళికి పోవు మార్గంలో చిన్న బాలుని రూపంలో రోదిస్తూ ఉంటాడు. బాలుని పై జాలితో పరమేశ్వరుడు వారిస్తున్నా వినక పార్వతి ఆ బాలుని తమ నివాసానికి తెచ్చి సపర్యలు చేస్తుంది. మరునాడు పార్వతీ పరమేశ్వరులు వ్యాహ్యాళికి వెళ్లగా విష్ణుమూర్తి తపస్సమాధిలో మునిగిపోతాడు. తిరిగి వచ్చిన పర్వతీ పరమేశ్వరులు తేజోమూర్తి అయిన విష్ణు మూర్తిని చూచి జరిగిన మోసము గ్రహించి విష్ణుమూర్తికి యిష్ఠమైన శనగపప్పు ఆప్రదేశములో పండ కోడదనే శాపాన్ని పెట్టి ఇప్పటి కేదార్ కు చేరుకుంటారు. ఇక్కడ ఇతర పదార్ధములతో పాటు శనగ పప్పును నైవేద్యంగా సమర్పించడం కనిపిస్తుంది.

బదరీనాధ్ కోవెల దగ్గరనుంచి అలకనంద వొడ్డునే సుమారు వొక కిలొమీటరు దూరంలో విష్ణుమూర్తి బాలుని రూపంలో పార్వతికి లభించిన చోటును చూడొచ్చు.

వైకుంఠములో విష్ణుమూర్తిని కానక అతనిని వెతుకుతూ భూలోకానికి వచ్చిన లక్ష్మీదేవి ఆ కురుస్తున్న హిమపాతం మధ్యలో తపస్సమాధిలో ఉన్నవిష్ణుముర్తిని చూచి తాను బదరిక వృక్షముగా మారి తన స్వామిని హిమాపాతము నుండి కాపాడుతూ ఉంటుంది. కాలాంతరమున విష్ణుమూర్తి మనస్సు శాంతించగా ఇహలోకానికి వచ్చి తనరక్షణకై బదరికా వృక్షముగా అవతరించిన లక్ష్మిని గుర్తించి తాను ఆ ప్రదేశములో బదరీనాధునిగా పిలువబడి పూజింపబడతానని చెప్పెను.

గర్భ గుడిలో రెండు చేతులలో శంఖు, చక్రాలు ధరించి యోగముద్రలో తామరపువ్వుపై కూర్చున్న నాలుగు చేతుల బదరీనాధుని విగ్రహంతో పాటు కుబేరుడు, నర నారాయణులు, నారదుడు, గరుత్మంతుడు, ఉద్దవుడు, నవదుర్గలు మిగతా కొన్ని దేవతా మూర్తులను చూడొచ్చు.

బదరీనాథ్ కోవెలకి అరకిలొమీటరు దూరంలో బ్రహ్మ కపాలంలో చనిపోయిన వారికి పిండ ప్రదానం చేస్తే చనిపోయిన వారికి ఊర్ధ్వలోక ప్రాప్తి కలుగుతుందని చెప్తారు. బ్రహ్మ నాలుగో ముఖం అన్నీ తప్పుడు మాటలు మాట్లడేదట, దానికి ఆగ్రహించిన విష్ణుమూర్తి తన చక్రంతో ఆ తలను ఖండించగా అది భూలోకంలో ఇక్కడ పడిందట.

బదరీనాథ్ నుండి భారత దేశపు సరిహద్దు ఆఖరు జనావాస గ్రామంగా పిలువా బడే "మానా" గ్రామం మూడు కిలోమీటర్ల దూరంలో వుంటుంది.

భారత దేశపు ఆఖరి టీ దుకాణం లో వేడివేడి తీ తాగి సేద తీరి వినాయకుడి గుహ, వ్యాస గుహల్ని దర్శించు కోవచ్చు. వ్యాస గుహలో వ్యాసుడు కూర్చొని మహాభారత కధ చెప్పగా వినాయకుడు గణేశ గుహలో కూర్చొని మహాభారతాన్ని రచించెనని చెప్తారు. వ్యాసగుహకు కొద్ది దూరం లో భీంపుల్ దగ్గర ఉదృతంగా ప్రవించే సరస్వతీ నది కొద్ది అడుగుల దూరంలో అంతర్వాహిని అయిపోతుంది. పెద్ద శబ్దం తో ప్రవహిస్తూ తన మహాభారత రచనకు ఆటంకం కలిగిస్తున్న సరస్వతిని హోరు తగ్గించుకోనమని వ్యాసుడు కోరగా సరస్వతి నది వ్యాసుని మాట పెడ చెవిన పెట్టడంతో వ్యాసుడు అంతర్వాహిని కమ్మని శాపమిస్తాడు. యిక్కడ అంతర్వాహిని అయిన సరస్వతీ నది తిరిగి అలహాబాద్ లో పైకి వచ్చి గంగా, యమునలతో సంగమిస్తుంది.

భీమ్ పుల్ నుంచి వొక కిమీ దూరంలో చిన్న మహాలక్ష్మి మందిరం చూడొచ్చు విష్ణుమూర్తిని వెతుకుతూ వచ్చినప్పుడు లక్ష్మీ దేవి మొదట కాలు పెట్టిన ప్రదేశంగా చెప్తారు. రెండు కిలోమీటర్లు నడిచి వెళితే ద్రౌపతి సమాధిని చూడొచ్చు. అక్కడి నుంచి మరో కిలోమీటరు నడిస్తే కుంతీదేవి సమాధి చూడొచ్చు. కుంతీ దేవి సమాధి నుంచి " వసుధార " మరో మూడు కోలోమీటర్ల దూరం వుంటుంది. కాని వసుధార వరకు వెళ్ళాలంటే మిలటరీ పెర్మిషన్ తెచ్చుకోవాలి. అందుకే మేము కుంతీదేవి సమాధి వరకు వెళ్లి కూడా వసుధార వెళ్లలేకపోయేం. వ్యాస గుహ దగ్గర వున్న కొండలపై వో గుఱ్ఱం ఆకారం కనిపిస్తుంది. అది విష్ణు మూర్తిని దివి నుంచి భువికి తెచ్చిన గుఱ్ఱంగా చెప్తారు. వ్యాస గుహ దగ్గర వున్న స్థానికులని ఎవరిని అడిగినా దీనిని చూపిస్తారు.

యింకా యిక్కడ చూడ వలసిన ప్రదేశాలు యివి నవదుర్గా మందిరం, శివకోవెల, చరణ పాదుక, ఊర్వశి మందిరం, పంచ శిలలుగా చెప్పబడే నర శిల నారాయణ శిల, నారద శిల, గరుడ శిల, వరాహ శిల, పంచ ధారలుగా చెప్పే నాలుగు వేద ధారలు, వసుధారలు.

బదరినాథ్ మందిర ప్రాంగణం లోంచి వెనుక వైపుకి చూస్తే నరశిల, నారాయణశిల కనిపిస్తాయి, వాటిపైన కాషాయరంగు పతాకాలు వుండడం కూడా గమనించ వచ్చు. నారదశిల, గరుడశిలలు ఉష్ణకుండం దగ్గర చూడొచ్చు. వరాహశిలఅలకనంద నది దాటి మందిరానికి వచ్చేటప్పుడు అలకనంద నదిలో కుడివైపున చూడొచ్చు.

వేదధారలుగా పిలువబడే నాలుగు ధారలు మానా గ్రామం వెళ్ళే దారిలో కొండల మీంచి రోడ్డు మీదకు ప్రవహిస్తూ కనిపిస్తాయి. వసుధార భీంపూల్ దగ్గర నుంచి దూరంగా కొండలలో వాతావరణం బాగుంటే కనిపిస్తుంది.

ఊర్వశి మందిరం
సతీదేవి మొక్క 108 పీఠాలలొ యిది వొకటి. యిక్కడ సతీ దేవి యొక్క ఊరువు భాగం పడిందని అంటారు. యీ ప్రదేశం లోనే విశ్వామిత్రుని ఊరువులనుంచి ఊర్వశి వుద్భవించిందని అంటారు. యీ మందిరం చాలా చిన్నది. యిది బదరీనాథ్ గ్రామంలో వుంటుంది. స్థానికులు దీనిని 'ఊర్వశి మాతా మందిర్ ' గా వ్యవహరిస్తారు.

చరణ్ పాదుక -- బదరీనాథ్ కోవెల వెనుక వైపునుంచి కాలి బాటన వెళితే స్వఛ్చమైన నవ్వు మొహాలతో ఆప్యాయంగా పలుకరించి టీ తాగండి ,భోజనం చేసి వెళ్ళండి అని పిలిచే స్టానికుల యిళ్ల మధ్య నుంచి వెళ్ళితే కొంత దూరంలో " అఘొరీ బాబా ఆశ్రమం " కనిపిస్తుంది. దానిని దాటుకొని స్వచ్చమైన సెలయేరు ప్రక్కగా పచ్చని కొండ చరియలలో ప్రయాణం చేస్తూ నాలుగు కిలోమీటర్లు నడిస్తే చరణ్ పాదుక చేరుకోవచ్చు. యిక్కడ నారాయణుడు తన పాదరక్షలు విడిచి పెట్టి ఆదికేదార్ వెళ్ళేడనేది యిక్కడ ప్రచారంలో వున్న కధ.

శంకరాచార్యులు బదరీ నాథ్ గురించి వేదాలలో చదివి యీ ప్రదేశాన్ని వెతుక్కుంటూ వచ్చి విగ్రహాలు నారద కుండంలో వున్నట్లు తెలుసుకొని వాటిని బయటికి తీయించి తిరిగి ప్రతిష్ఠించి పూజలు చేసి తనతో కుడా వచ్చిన నంబూద్రి బ్రాహ్మణులను నిత్య పూజాది కార్య క్రమాలు నిర్వర్తించుటకు నియమించెనని చెప్తారు. యిప్పటికి యిక్కడ నంబూద్రి వంశస్తులే పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శంకరా చార్యులచే నిర్మించ బడ్డ యీ దేవాలయం రెండు మూడు మార్లు జరిగిన ప్రకృతి విపరీతాలకు నేలకూలిందని అంటారు. 2013 లో సంభవించిన వరదలలో యీ కోవెలకు ఎక్కువ హాని జరుగలేదు.

ఈ యాత్ర సంవత్సరంలో ఆరు నెలలు మాత్రమే జరుగుతుంది. మిగతా ఆరునెలలు కోవెల తలుపులు మూసివేస్తారు. యీ ప్రాంతంలో కార్తీక మాసం మొదలు వైశాఖ మాసం వరకు హిమపాతం విపరీతంగా వుండడంతో యిక్కడి ప్రజలు యీ ఆరునెలలు ఆణి మఠ్, జోషిమఠ్ లలో గడుపుతారు. యీ ఆరునెలలు బదరీ నాథుని మూర్తులను ఆణి మఠ్ లో వున్న కోవెలలో వుంచి పూజలు నిర్వహిస్తారు. యీ కోవేలని వృద్ద బదరి అని అంటారు. వైశాఖ మాసంలో వచ్చే శుక్ల తదియ నాడు బదరీ కోవెల తలుపులు ఆ జిల్లా కలెక్టర్ సమీపంలో తెరుస్తారు. తలపులు మూసినప్పటి అఖండ దీపం ఆరునెలల తరువాత కూడా వెలుగుతూ వుండడం వో విశేషం. ఆ రోజున అఖండ దీపం దర్శించు కోడానికి ప్రపంచ నలుమూలాల నుంచి వేలాది భక్తులు తరలి వస్తారు.

ఉత్తరాఖండ్ యాత్రలు చేసుకోనే వారికి ముఖ్యంగా చేసే సూచన యేంటంటే తగినన్ని వులెన్స్ పట్టుకు వెళ్ళడం, అందాజుగా వారం రోజులు యాత్ర అంటే మరో నాలుగు రోజులు కలుపుకొని అన్ని రోజులకు సరిపడే విధంగా ప్రణాళిక వేసుకుంటే మంచిది. యెటువంటి ప్రాకృతిక విపత్తులు లేకుండా యాత్ర జరిగితే మంచిదే కాని పర్వత ప్రాంతాలలో వాతావరణంలో హెచ్చు తగ్గులు విపరీతంగా  ఉంటాయి. అన్నింటికీ తగు జాగ్రత్తలు తీసుకోవడం విజ్ఞుల లక్షణం.

యాత్రలు ఎందుకు చెయ్యాలి అంటే మనిషిలో సహన శక్తిని పెంచుతుందట. భగవన్నామ స్మరణతో యాత్ర మొదలు పెట్టండి.

కర్రా నాగలక్ష్మి 

Saturday, 14 April 2018

ముక్తిధామాలు - చార్‌ధామ్‌

ముక్తిధామాలు


హిందువులు ఎంతో పవిత్రంగా భావించే యాత్రల్లో ఉత్తరాఖండ్‌ ‘చార్‌ధామ్‌’ యాత్ర ఒకటి. ప్రతి సంవత్సరం వేసవిలో మొదలై, శీతకాలంలో ముగిసే ఈ యాత్రకు లక్షలాది భక్తులు తరలివస్తూ ఉంటారు. మంచుతో చలిగా ఉండే వాతావరణం మధ్య ఎగుడుదిగుడుగా ఉండే పర్వత సానువుల్లో సాగే ఈ యాత్రను సాహసోపేతమైన ఆధ్యాత్మిక యాత్రగా అభివర్ణించవచ్చు.

ఏమిటి ఉత్తరాఖండ్‌ చార్‌ధామ్‌ యాత్ర?:
భారతదేశంలోని నాలుగు దిక్కుల్లో ఉన్న పూరి, రామేశ్వరం, ద్వారక, బదరీనాథ్‌లలో ఆది శంకరాచార్యులు మఠాలను స్థాపించారు. ఆ మఠాలు ఉన్న ప్రదేశాల్లోని ఆలయాల సందర్శనను చార్‌ధామ్‌ యాత్ర అని అంటారు. కాగా, హిమాలయ సానువుల్లో నెలకొన్న పవిత్రమైన నాలుగు ఆలయాల సందర్శనను కూడా (ఉత్తరాఖండ్‌) చార్‌ధామ్‌ (లేదా ఛోటా చార్‌ధామ్‌) యాత్రగా వ్యవహరిస్తారు. ఇవి ఉత్తరాఖండ్‌లోని యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్‌, బదరీనాథ్‌లలో ఉన్నాయి. క్రీస్తుశకం ఎనిమిదో శతాబ్దంలో ఆదిశంకరాచార్యులు వీటిని స్థాపించినట్టు కథనాలున్నాయి. వీటి సందర్శన యాత్రను ‘ముక్తి యాత్ర’ అని కూడా అంటారు.

ఈ ఏడాది ప్రారంభ తేదీలు: యమునోత్రిలో, గంగోత్రిలో ఏప్రిల్‌ 18, కేదార్‌నాథ్‌లో 29, బదరీనాథ్‌లో ఏప్రిల్‌ 30.
ముగిసే తేదీలు: యమునోత్రి, గంగోత్రిలో, కేదార్‌నాథ్‌లో నవంబర్‌ 9, బదరీనాథ్‌లో ప్రకటించాల్సి ఉంది

ఎలా వెళ్ళాలి?:
అయిదు రోజుల నుంచి పదిహేను రోజుల వరకూ వివిధ ప్యాకేజీలను ట్రావెల్ప్‌ సంస్థలు ఆఫర్‌ చేస్తున్నాయి. సాధారణంగా ఢిల్లీ నుంచి ఈ యాత్రలు ప్రారంభమవుతాయి. వివరాలను ఆ సంస్థల వెబ్‌సైట్లలో తెలుసుకోవచ్చు. లేదా ఢిల్లీ నుంచి హరిద్వార్‌ చేరుకొని అక్కడి నుంచి ఈ యాత్ర చేపట్టవచ్చు. హెలికాప్టర్లలో కూడా ఈ ధామాలను దర్శించుకోవచ్చు.

ఇదీ మార్గం :
యమునోత్రికి...ఢిల్లీ నుంచి హరిద్వార్‌కు 210 కిలోమీటర్లు, అక్కడినుంచి యమునోత్రికి 236 కిలోమీటర్లుంటుంది, తరువాత ఏడు కిలోమీటర్లు ట్రెక్కింగ్‌ చేయాల్సి ఉంటుంది.
గంగోత్రికి... అక్కడి నుంచి ఉత్తరకాశి మీదుగా గంగోత్రికి దాదాపు 220 కి.మీ..
కేదార్‌నాథ్‌కి... తిరిగి ఉత్తర కాశి, రుద్రప్రయాగ మీదుగా 254 కిలోమీటర్ల దూరం ప్రయాణించి, 20 కిలోమీటర్లు ట్రెక్కింగ్‌ చేసి కేదార్‌నాథ్‌ చేరుకోవచ్చు.
బదరీనాథ్‌కి... కేదార్‌నాథ్‌ నుంచి రుద్రప్రయాగ మీదుగా 160 కి.మీ. దూరంలో బదరీనాథ్‌ ఉంది. బదరీనాథ్‌ నుంచి రుషీకేశ్‌కు సుమారు 300 కి.మీ.. అక్కడి నుంచి ఢిల్లీకి 230 కి.మీ. పర్వత ప్రాంతాల్లో రాత్రి ఎనిమిది గంటల నుంచి తెల్లవారుజామున నాలుగు గంటల వరకూ వాహన ప్రయాణాలను అనుమతించరు.

Wednesday, 14 March 2018

మానసా దేవి





ఇష్టార్ధాలను శీఘ్రంగా పూరించే మానసా దేవి

మన దేశంలో అనేక ప్రాచీన దేవాలయాలు ఉన్నాయి. ఆ ఆలయాలలో అతి ముఖ్యమైనవి అష్టదశ శక్తి పీఠాలు. ప్రతి క్షేత్రం దానికదే ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ప్రసిద్ధి చెందింది. వాటిలో మానసా దేవి దేవాలయం కూడా ఒకటి. ఈ దేవాలయం ఆలయ గర్భగుడిలో మానసా దేవి వెలసి అత్యంత మహిమాన్విత శక్తిస్వరూపిణిగా భక్తులకు దర్శనమిస్తుంది. ఈ ఆలయం పంచ తీర్థాలు లేదా ఐదు తీర్థాలలో ఒకటిగా వుంది. దేశంలోని అన్ని ప్రాంతాల నుండి భక్తులు ఈ శక్తిని ఆరాధిస్తారు. కాబట్టి ఆ దేవాలయం యొక్క స్థలపురాణం ఏమిటి? ఆ తల్లి శక్తి ఏమిటి? ఆమె ఎక్కడ వెలసియున్నది? అనే అనేకమైన ప్రశ్నలకు సమాధానంగా వ్యాసంమూలంగా సంక్షిప్తంగా తెలుసుకుందాం.

ఈ మానసా దేవి దేవాలయం భారత దేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో పవిత్రమైన నగరం హరిద్వార్ లో వుంది. ఈ దేవాలయం ఒక హిందూ దేవాలయం. మానస దేవికి అంకితం చేయబడినది. ఈ దేవాలయం హిమాలయాల యొక్క దక్షిణ పర్వత శ్రేణులలోని శివాలిక్ కొండల మీద బిల్వా పర్వతం పైన వుంది. ముఖ్యంగా ఈ తీర్థక్షేత్రాన్నిను బిల్వా తీర్థం అని పిలుస్తారు.

ఆశ్చర్యం ఏంటంటే ఒకానొకకాలంలో ఆదివాసీలచే పూజించబడిన ఈ తల్లి అనేక వేల సంవత్సరాల తరువాత హిందూధర్మంలో పూజించడం ప్రారంభించటం జరిగింది. హాలాహలాన్నిసేవించిన పరమేశ్వరునికి విషప్రభావం నుంచి మానస దేవి రక్షించినది. అదేవిధంగా పరమశివుడు ఆమె కోరికను మెచ్చి తన కూతురిగా స్వీకరించాడు అనే కథ ప్రచారంలో ఉంది.

ఈ గుడి ప్రత్యేకత ఏమంటే ఈ మానసాదేవి భక్తుల కోరికలను త్వరగా నెరవేరుస్తుంది. అందువల్ల చాలామంది భక్తులు ఈ దేవాలయాన్ని సందర్శిస్తారు. వారి కోరికలను నెరవేర్చటానికి ఈ తల్లి వెలిసిన స్థలంలో ఒక పవిత్రమైన చెట్టు ఉంది. వారు ఆ చెట్టు దగ్గర నిలబడి భక్తులు తమ కోర్కెలను కోరుకుని దారం కడితే శీఘ్రంగా ఇష్టార్థాలు నెరవేరుతాయని నమ్ముతారు.

భక్తులు వారి కోరికలు నెరవేరిన తరువాత, వారు ఈ దేవాలయానికి వచ్చి తమ దారాలను విప్పుతారు. ఆ తల్లిని భక్తితో పూజించటానికి టెంకాయలు, పండ్లు, పూలమాలలు మరియు ధూపదీపాలను మానసాదేవికి సమర్పించి వెళ్తారు.

ఆరాధనకు యోగ్యమైన స్థలం ఇది, హరీద్వార్ లోని మూడు పీఠాలలో ఇది కూడా ఒకటి. ఇతర రెండు పీఠాలు ఏవంటే ఒకటి చండి దేవి దేవాలయం మరొకటి మాయాదేవి దేవాలయం

మానసాదేవి ఆలయం పురాతన ఆలయాలలో ఒకటి. హరిద్వారాన్ని సందర్శించే యాత్రికులు తప్పకుండా ఈ తల్లిని దర్శించుకుంటారు. ఈ పవిత్రమైన దేవాలయం అనేక శతాబ్దాలనుంచి హరిద్వార్ లో పవిత్రమైన సంప్రదాయాన్ని కొనసాగిస్తూనే ఉంది.

ఈ దేవాలయం నుంచి గంగానది మరియు హరిద్వార్ న్ని చూడవచ్చును. ఈ తీర్థయాత్రకు వెళ్ళాలంటే మెట్లమార్గం ద్వారా వెళ్ళాలి. ఈ ఆలయానికి ఒక "తాడు మార్గం" కూడా ఉంది. ఈ సేవను "మానాసాదవి ఉడాన్ కటోలా" అని కూడా పిలుస్తారు. యాత్రికులకు ఈ ప్రదేశంలో చండి దేవి ఆలయం కూడా ఉంది.

ఈ తాడు-మార్గం సుమారు 540 మీటర్లు (1,770 అడుగులు) మరియు ఎత్తు 178 మీటర్లు (584 అడుగులు) వుంది. సాధారణ రోజులలో ఈ దేవాలయాన్ని ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు భక్తులు మానసాదేవిని దర్శించుకొనవచ్చును.

పార్వతి దేవి రూపంలో "మానస" మరియు "చండి" రూపంలో రెండు దేవతలు లీనమై వెలసినారని అక్కడి ప్రజలు నమ్ముతారు.

అందువల్లనే మనసా దేవి దేవాలయం బ్లూ మౌంట్ ఎదురుగా బిల్వ పర్వతంమీద వెలసియున్నది.

చేరుకోవడానికి ఎలా?
మానస దేవి టెంపుల్ కి 2 విధాలుగా చేరుకోవచ్చు. కాలునడక లేదా కేబుల్ కారు ద్వారా. హరిద్వార్, స్టేషన్ నుండి కేవలం 1 కిలోమీటర్ల దూరంలో, ఢిల్లీ నుండి 215 km, డెహ్రాడూన్ నుండి 50 కిలోమీటర్ల దూరంలో, డెహ్రాడూన్ జాలీ గ్రాంట్ విమానాశ్రయం నుండి 45 కిలోమీటర్ల దూరంలో, రిషికేశ్ నుండి 30 కిలోమీటర్లదూరంలో,మస్సూరు నుండి 85కిమీ ల దూరంలో వుంది. మీరు సులభంగా రిక్షా ద్వారా ఆలయానికి చేరవచ్చును.




కేదారనాథ్‌ - బద్రినాథ్‌





వెండికొండల్లో కేదారం... బద్రినాథ్‌


దేవభూమిగా ఖ్యాతిచెందిన ఉత్తరాఖండ్‌లో కేదార్‌నాథ్‌, బద్రినాథ్‌లు హిమాలయ పర్వతసానువుల్లో ఉన్నాయి. హిమాలయ శ్రేణుల్లో వెలసిన ఈ పుణ్యక్షేత్రాలు ఏటా మంచులో కూరుకుపోయి ఉంటాయి. దాదాపు ఆరునెలలు మూసి ఉండే ఈ ఆలయాలు సాధారణంగా మేనెలలో మాత్రమే తెరచుకుంటాయి. అక్టోబర్‌లో లేదా నవంబర్‌లో తిరిగి మూసుకుపోయే మంచు మేటల వల్ల దర్శనానికి వీలుపడదు.

దిల్లీ నుంచి సుమారు 500కి.మీ దూరంలో వున్న ఈ క్షేత్రాలకు యాత్రికులకు అనుకూలమైన రీతిలో ఎన్నో టూరిస్టు బస్సులు నడుస్తుంటాయి. హరిద్వార్‌, రుషికేశ్‌ల మీదుగా ఈ ప్రయాణాన్ని (రిషికేశ్‌ వరకూ రైల్లో వెళ్లొచ్చు). ప్లాన్‌ చేసుకోగలిగితే, ఒకే టూర్‌ ప్యాకేజీగా చక్కని యాత్ర ప్లాన్‌ చేసుకోగలిగిన వారవుతారు. రిషికేశ్‌ నుంచి హిమాలయాల మీదనే కేదార్‌నాథ్‌ చేరుకోవాలంటే 250కి.మీ దూరం ప్రయాణించాలి.

ఒకవైపు ఎత్తయిన పర్వతాలు, ఇంకో వైపు అగాధమైన లోయలు. దానికున్న దారి మాత్రం ఇరుకు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కైలాసనాథుడిపై భారం వేసి ప్రయాణం చేయతగిన యాత్ర. పైగా కొండచరియలు విరిగిపడి దారి ఎక్కడెక్కడ మూసుకుపోతుందో కూడా చెప్పలేని పరిస్థితి.

ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన కేదారం శివభక్తుల పాలిట మందారం. విష్ణుభక్తులకు బదరీ మోక్షరాదారి.

ఇక్కడ భగవంతుని మహిమకు గొప్ప నిదర్శనం. ఈ రెండు ఆలయాలకూ తాళాలు వేసే ముందు ఆఖండ జ్యోతిని వెలిగిస్తారు. ఆలయాలను ఆర్నెల్ల తర్వాత తిరిగి తెరిచాక కూడా ఇవి వెలుగుతూనే వుంటాయి.పూర్తిగా మంచుతో కప్పబడిపోయినా.. వీటికి కావలసిన వాయు ప్రసారం ఎలా అందుతుందో అన్నది ఇప్పటికీ మానవుడి పరిశోధనకు అంతుబట్టకపోవడం దైవమహిమకు నిదర్శనంగానే నిలిచిపోయింది. ప్రఖ్యాత శాస్త్రవేత్తలు సైతం దీనికి జవాబు చెప్పలేకపోయారు. దీనిని దైవమహిమగానే భావించాలి.

అంతేకాకుండా.. ఈ రెండు క్షేత్రాలకు మధ్య వందలాది కి.మీ పరిధిలో నిత్యశీతలం... తప్ప వేడి అనేది ఉండదు. ఇటువంటి చోట 120డిగ్రీల సెంటిగ్రేడ్‌ ఉష్ణోగ్రత కలిగిన వేడినీటి వూటల ప్రవాహం. నిజంగా ఇది అద్భుతం. ఇదెలా సాధ్యమనే విషయమై పరిశోధనలు అయితే జరిగాయి. కానీ పరిశోధనలకు అందలేదు. జన్మలో ఒక్కసారైనా ఈ క్షేత్రాలను దర్శించలేని వారి జన్మవృథా అనేది కొందరి విశ్వాసం.

ఈ యాత్ర కష్టసాధ్యమే కానీ అసాధ్యమేమీ కాదు.

12 వేల అడుగుల ఎత్తులో.. కేదార్‌నాథ్‌
గౌరీకుండ్‌ అనే శిఖర ప్రాంతం వరకు ఏదో రీతిన వాహన సదుపాయాలు లభ్యం అవుతున్నప్పటికీ అక్కడి నుంచి మోటారు వాహనాలకు అవకాశం లేదు. డోలీ కట్టించుకుని కానీ, కాలినడకన ప్రయాణించి కానీ 14కి.మీ ప్రయాణం తప్పదు. ఎంతో సుశిక్షితంగా, సునిశితంగా గుర్రాలు యాత్రికుల్ని తీసుకెళ్లగలవు. కానీ వాటిని ఎక్కేవారికి ధైర్యం చాలకపోతే ఇబ్బందే. డోలీ ప్రయాణం ఖరీదైనది. ఒక్కో వ్యక్తికి 14కి.మీలకు రానుపోను రూ.2,500లకు పైగా వసూలు చేస్తారు.





సముద్రమట్టానికి 12వేల అడుగుల ఎత్తున ఉన్న, మంచుతో అవరింపబడి ఎంతో మనోహరంగా ఉన్న కేదార్‌నాథ్‌ ఆలయాన్ని పాండవులు నిర్మించారని ప్రతీతి.

శివభక్తుల పాలిట భువిలో వెలసిన కైలాసంగా భావించబడుతున్న ఈ జ్యోతిర్లింగ క్షేత్రంలో భక్తులే స్వయంగా కేదారేశ్వరుని దర్శించుకుని పూజలు జరుపుకోవచ్చు. ఆదిశంకరాచార్యులు స్వయంగా ఈ శివుని దర్శించాకే హిమాలయాల్లోకి వెళ్లి అదృశ్యమయ్యారట.

ఇక్కడ ఇప్పటికీ వందలాది సంవత్సరాల నుంచి రుషులు తపస్సు చేస్తున్నారని కొందరు చెబుతుంటారు. వారిలో వృద్ధాప్య ఛాయలు ఏమాత్రం కనిపించవు. ఇక్కడ మరణిస్తే పునర్జన్మ ఉండదంటారు.

ఇంత శీతల ప్రదేశంలోనూ పర్యాటకులకు అనువైన వసతి గృహాలు, హోటళ్లు ఉంటాయి. విద్యుత్తు సరఫరాకు అవకాశం లేని ప్రాంతం. మేలో మండు వేసవిలో ఇక్కడ మాత్రం చలిగా ఉంటుంది. 



బదరీనాథ్‌






కేదారనాథ్‌ నుంచి సరాసరి బదరీనాథ్‌కు వెళ్లలేం. తిరిగి గౌరీకుండ్‌కు చేరుకోవాలి. ఇక్కడి నుంచి బదరీనాథ్‌ 230కి.మీ దూరంలో ఉంటుంది.

జోషీమఠ్‌ వరకు అన్నికాలాల్లోనూ యాత్రికులకు వెళ్లగల అవకాశం ఉంటుంది. ఇక్కడి నుంచి బదరీనాథ్‌కు 42కి.మీ ఇది కూడా వన్‌వే ట్రాఫిక్‌. గౌరీకుండ్‌ నుంచి జోషీమఠ్‌ 160 కి.మీ.దూరంలో ఉంది.

బదరీ దేవాలయం మూసి ఉన్న కాలంలో నారాయణుడికి ఇక్కడే పూజలు జరుగుతాయి.

జోషీమఠ్‌ నుంచి బదరీనాథ్‌ చేరుకోవడానికి సుమారు 4గంటలు ఈ పడుతుంది.ఈ ప్రాంతం హిమాలయాల్లో సుమారు పదివేల అడుగుల ఎత్తున ఉంటుంది.విష్ణుభక్తులకు ఇది భూలోక వైకుంఠం. బ్రహ్మకపాలం పేరుగల ప్రాంతం ఇక్కడికి చేరువలోనే ఉంది.ఇక్కడ పితృదేవతలకు పిండప్రదానం చేస్తే, ఏ ఇతర ప్రాంతాల్లోనైనా ఏటా పిండ ప్రదానం అవసరం లేదని చెబుతారు. ఈ ప్రదేశంలో ఎక్కువగా రేగు చెట్లు ఉండటం వల్ల ఈ ప్రాంతాన్ని బదరీనాథ్‌ అంటారట.

క్రీ.శ 15శతాబ్దిలో గఢ్వాల్‌ రాజులచే ఇక్కడ ఆలయం నిర్మితమైందనీ కానీ క్రీ.శ 8వ శతాబ్ది నాటికే, ఇక్కడ శంకరాచార్యుల వారి ప్రయత్నంతో ఆలయానికి అంకురార్పణ జరిగిందని చెబుతారు. కేదార్‌నాథ్‌ మాదిరిగానే ఇక్కడ కూడా తప్తకుండ్‌లో వేడినీటి వూటలు వస్తుంటాయి.

ఇక్కడికి సమీపంలోనే ‘మానా’అనే ఊరు ఉంది. ఈ గ్రామం భారత్‌-చైనా సరిహద్దును ఆనుకొని ఉంది. భారతదేశానికి సంబంధించి ఇదే చివరి గ్రామం.

ఎలా వెళ్లాలి
హైదరాబాద్‌ నుంచి కేదార్‌నాథ్‌ 1,485 కి.మీ దూరంలో ఉంది. కేదార్‌నాథ్‌ వెళ్లడానికి రైలు, విమాన సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. కేదార్‌నాథ్‌కు 239కి.మీ దూరంలో ఉన్న డెహ్రాడూన్‌లోని జాలీగ్రాంట్‌ విమానాశ్రయానికి దిల్లీ నుంచి ప్రతిరోజూ విమానాలు ఉన్నాయి. విమానాశ్రయం నుంచి టాక్సీ సౌకర్యం ఉంది. కేదార్‌నాథ్‌కు 221దూరంలో ఉన్న రిషికేష్‌కు రైలు సౌకర్యం ఉంది. ఇక్కడి నుంచి ట్యాక్సీలో కేదార్‌నాథ్‌ (14 కి.మీ) చేరువకు వెళ్లవచ్చు. అక్కడి నుంచి 14కి.మీ నడక మార్గంలో కేదార్‌నాథ్‌ చేరుకోవచ్చు. రిషికేశ్‌, కోట్‌ద్వార్‌ నుంచి రోడ్డు మార్గాన యాత్రికులు ట్యాక్సీలు, ఇతర ప్రైవేటు వాహనాల్లో దిల్లీ - మనా జాతీయరహదారి(538కి.మీ) మీదుగా చేరుకోవచ్చు. కేదార్‌నాథ్‌ నుంచి నడకదారిలో గౌరీకుండ్‌ చేరుకుని, రిషికేశ్‌, డెహ్రాడూన్‌, కోట్‌ద్వారా, హరిద్వార్‌ నుంచి బస్సు సౌకర్యం కూడా ఉంది.

* పటా- కేదార్‌నాథ్‌కు పవన్‌హాన్స్‌, యూటీఎయిర్‌, ఎయిర్‌ఛార్టర్‌, ప్రభాతమ్‌ సంస్థలు హెలికాప్టర్‌ సేవలను ప్రారంభించాయి. దీనికి ఒక్కొక్కరికిగాను రూ.7,000నుంచి 7,200వరకు వసూలు చేస్తున్నారు.



Saturday, 1 April 2017

చార్‌ధామ్‌ యాత్ర





చార్‌ధామ్‌ యాత్ర

జీవిత కాలంలో ఒక్కసారైనా వెళ్లితీరాలని కోరుకునే యాత్ర. వెళ్లే మార్గం సంక్లిష్టమైనదైనా ప్రకృతి సోయగాలలో ప్రశాంతతను పొందాలని ఆకాంక్షించే యాత్ర. హిమాలయ పర్వత శ్రేణులలో వెలసిన ఆరాధ్య దైవాలను దర్శించి, తరించాలని తపించే యాత్ర. అదే, అతిపవిత్రమైన చార్‌ ధామ్‌ యాత్ర.

గంగోత్రి, యమునోత్రి,  బద్రీనాథ్, కేదార్‌నాథ్‌ ఈ నాలుగు పుణ్యక్షేత్రాలను ఒకేసారి సందర్శించుకొని రావటాన్ని ‘చార్‌ధామ్‌ యాత్ర’ అంటారు. సంవత్సరంలో ఆరు నెలల పాటు దేవతలు పూజిస్తారని పేరొందిన ఈ నాలుగు ఆలయాలను మిగిలిన ఆరు నెలల కాలంలో మానవులు సందర్శించుకోవచ్చు. ఎంతో మహిమాన్వితమైన ఈ ఆలయాల ద్వారాలు ప్రతి సంవత్సరం మే మొదటి వారంలో తెరుస్తారు. తిరిగి నవంబర్‌లో దీపావళి పర్వదినం తర్వాత మూసివేస్తారు.  ఈ నాలుగు ఆలయాలూ ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోనే ఉన్నాయి. గంగానది, యమునా నది జన్మస్థలాలను గంగోత్రి, యుమునోత్రి అంటారు. అలాగే బద్రీనాథ్‌లో శ్రీ మహావిష్ణువు, కేదార్‌నాథ్‌లో శివుడు స్వయంభువుగా వెలిసినట్టు పురాణాలు చెబుతున్నాయి.

యమునోత్రిచార్‌ధామ్‌ యాత్రలో మొదటగా దర్శించుకునే ధామం (క్షేత్రం) యమునోత్రి. యమునానది జన్మస్థలంలోనే యమునాదేవి ఆలయం ఉంది. యమునానది ప్రాశస్త్యం గురించి ఒక్కో పురాణం ఒక్కో కథను వివరిస్తున్నాయి. ప్రముఖంగా చెప్పుకునేది – సూర్యదేవుడి అర్ధాంగి ఛాయాదేవి. వీరికి యముడు, యమున సంతానం. ఛాయాదేవికి కూతురైన యమున మీద ఒకానొక సమయంలో ఆగ్రహం కలిగి భూలోకంలో ఉండమని శపించిందట. దాంతో యమున భూలోకంలో నదిగా అవతరించిందట.

గంగోత్రిచార్‌ధామ్‌ యాత్రలో సులువుగా చేరుకోగలిగే ప్రాంతం గంగోత్రి. ఈ నది జన్మస్థలం ఉత్తరాఖండ్‌లోని ఉత్సర కాశీ జిల్లాలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం. సముద్రమట్టానికి 3,750 మీటర్ల ఎత్తులో హిమాలయ పర్వత శ్రేణులలో ఉంది. నదులన్నింటిలో గంగానది పరమపవిత్రమైనదిగా పూజలందుకుంటోంది. గోముఖం నుండి గంగోత్రి చేరే వరకు ఈ ప్రవాహంలోని నీటికి ఎక్కడా మానవ స్పర్శ అంటదు. అందువల్లే తమిళనాడు రామేశ్వరంలోని లింగేశ్వరస్వామికి నిత్యాభిషేకం గంగోత్రి నీటితోనే చేస్తారు.

కేదార్‌నాథ్‌అత్యున్నతమైన ద్వాదశ జ్యోతిర్లింగాలలో మొదటిది కేదార్‌నాథ్‌. వైశాఖమాసంలో అంటే ఏప్రిల్‌ ఆఖరి వారం లేదా మే నెల మొదటి వారంలో తెరుస్తారు. తిరిగి అక్టోబరు నెల ఆఖరి వారం లేదా నవంబరు  మొదటి వారంలో మూసివేస్తారు. నరనారాయణులు కేదారనాథుని అనుమతి తీసుకొని, బదరీనాథ్‌లో తపస్సు చేశారని స్థలపురాణం చెప్తోంది.

బద్రీనాథ్‌జగద్గురు ఆదిశంకరుల వారు నెలకొల్పిన ఈ క్షేత్రంలో అన్ని తీర్థాలలోని సమస్త దేవతలూ నివసిస్తారనీ నమ్మకం. ఈ ఆలయంలో వైశాఖం నుండి కార్తీక మాసం వరకు మానవులు, మార్గశిరం నుండి చైత్రమాసం చివరి వరకు నారద మహర్షి స్వామికి పూజలు చేస్తారని కథనాలు. గర్భాలయంలో ఉత్సవమూర్తితో పాటు స్వామి ఎడమవైపున నరనారాయణులు శ్రీదేవి– భూదేవి, నారదుడు, ఉద్ధవుడు... కుడివైపున కుబేరుడు, గరుత్మంతుడు కొలువుదీరి ఉన్నారు. పితరులకు ఇక్కడ పిండ ప్రదానం చేస్తే వారికి మోక్షం సిద్ధిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి.

చార్‌ధామ్‌ యాత్ర ఏప్రిల్‌ చివరి వారం, మే నెలలో చేయవచ్చు.



Saturday, 18 March 2017

‘స్కందపురాణం’లో నైనితాల్ ప్రాంతం విశిష్టత





‘స్కందపురాణం’లో నైనితాల్ ప్రాంతం విశిష్టత 

నైనితాల్.. భారతదేశపు సరస్సుల జిల్లాగా పిలువబడే అద్భుతమైన ప్రదేశం. హిమాలయ శ్రేణులలో ‘కుమావొన్ హిల్స్’ మధ్య భాగంలో వున్న ఈ ప్రాంతం అందమైన సరస్సులను కలిగి వుంది. నైనీతాల్ పేరులోని నైనీ అంటే నయనం.. తాల్ అంటే సరసు. భారతదేశంలో నైనీతాల్ ప్రసిద్ధ హిల్ స్టేషనే కాకుండా పుణ్యా క్షేత్రాలలో ఒకటిగా ప్రఖ్యాతి గాంచింది. ఇది సముద్రమట్టానికి 2084 మీటర్ల (6,837 అడుగుల) ఎత్తున ఉంది. నైనీతాల్ కంటి ఆకారం కలిగిన ఉన్న పర్వతశిఖరాల మద్యనున్న ప్రదేశంలో ఉపస్థితమై ఉంది. ఈ ప్రాంతానికి ‘నైనితాల్’ అనే పేరు రావడం వెనుక వున్న చరిత్ర ‘స్కందపురాణం’లో పొందుపరచబడింది.

పేరువెనుక చరిత్ర :
‘స్కందపురాణం’లోని మానస ఖండ్ లో నైనితాల్ ను ‘ముగ్గురు ఋషుల సరస్సు’ లేదా ‘ముగ్గురు ఋషుల సరోవరం’ అని అంటారు. ఆ ముగ్గురు ఋషుల పేర్లు అత్రి, పులస్త్య, పులాహ. వీరు ముగ్గురు తమ దాహం తీర్చుకునేతందుకు నైనితాల్ వద్ద ఆగారు. ఈ ప్రాంతంలో నీరుకోసం ఎంత వెదికినప్పటికీ వారికి దొరకలేదు. దీంతో వారు ముగ్గురు కలిసిన వెంటనే ఒక పెద్ద గొయ్యి తవ్వడం ప్రారంభించారు. దానిలోకి ‘మానస సరోవరం’ నీటిని నింపి వారు తమ దాహం తీర్చుకున్నారు. ఆ విధంగా నైనితాల్ సరస్సు సృష్టించబడింది. మరో కథనం ప్రకారం ఇక్కడ శివుడి భార్య అయిన సతి ఎడమ కన్ను పడి.. ఆ ప్రాంతంలో నైని సరస్సు సృష్టించబడింది.

మరికొన్ని ఆసక్తికర విశేషాలు :

  • భూతల స్వర్గంలా తలపించే ఈ నైనితాల్ ఎంతో ఆకర్షణీయంగా వుండటంతోపాటు ప్రశాంత వాతావరణాన్ని కలిగివుంటుంది. బ్రిటిష్ వ్యాపారి అయిన ఫై.బర్రోన్ అనే వ్యక్తి ఈ ప్రాంత అందాలకు ముగ్ధుడై 1839లో ఒక బ్రిటిష్ కాలనీ స్థాపించి దానిని ప్రసిద్ధి చేశాడు. ఆంగ్లో నేపాలీ యుద్ధం (1814-1816) తరువాత ఈ ప్రాంతం కుమాన్ హిల్స్ బ్రిటిష్ పాలనలోకి వచ్చింది. అయినప్పటికీ 1841 తరువాతనే నైనీతాల్ అభివృద్ధిచేయబడింది.
  • 1846లో బెంగాల్ సైన్యానికి చెందిన కేప్టన్ ఆర్టిల్లరీ నైనీతాల్‌ను దర్శించాడు. ఆయన మాటలలో ‘దాదాపు సముద్రమట్టానికి 7,500 అడుగులు (2,300 మీటర్లు) ఎత్తువరకు నివాసగృహాలు వ్యాపించి ఉన్నాయి’ అని వర్ణించాడు. తరువాత కాలంలో అటవీప్రాంతంలో సెయింట్ జాన్ చర్చ్ నిర్మాణం జరిగింది.
  • నైనిటాల్ సందర్శనకు ప్రణాళిక చేసే వారు ఇక్కడే కల హనుమాన్ ఘర్ కూడా తప్పక చూడాల్సిందే! దీంతోపాటు ఇండియాలోని 51 శక్తి పీఠాలలో ఒకటైన నైనా దేవి టెంపుల్ కూడా తప్పక చూడాలి.
  • షాజాన్‌పూరుకు చెందిన చక్కెర వ్యాపారి పి.బారన్ యురేపియన్ హౌస్ (భక్తుల వసతి గృహం) నిర్మాణంతో ఇక్కడ మొదటి నిర్మాణం ఆరంభం అయింది.


‘గంగోత్రి’



‘గంగోత్రి’
గంగాదేవి నదిరూపంలో ప్రతిష్టితమైన పుణ్యక్షేత్రం

దేశంలో వెలసిన పవిత్రపుణ్యక్షేత్రాల్లో ‘గంగోత్రి’ ఒకటి. గంగాదేవి నదిరూపంలో ప్రతిష్టితమైన ఈ ప్రదేశం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తరకాశీలో వుంది. ఇది హిమాలయాల పర్వత శ్రేణులలో సముద్ర మట్టానికి 4,042 మీటర్ల ఎత్తులో వుంది. ఈ ప్రదేశం హిమాలయాల్లోని చార్‌ధామ్‌లలో ఒకటి. అక్కడ గంగానది బాగీరథి పేరుతో పిలువబడుతుంది. పూర్వం గంగాదేవిని భూమికి తీసుకోవడానికి భాగీరథుడు కారణం కాబట్టి.. ఆ పేరు వచ్చింది. గంగాదేవి భూవిలో నదిరూపంలో ప్రతిష్టితమవడానికి ఓ పురాణగాధ వుంది. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం...

పురాణ గాధ :పూర్వం ‘సగరుడు’ అనే రాజు రాక్షస సంహారం తరువాత పాప పరిహారార్ధం ‘ఆశ్వమేధ’ యాగం చేశాడు. అప్పుడు సగరుని వైభవాన్ని చూసిన స్వర్గరాజు దేవేంద్రుడు సగరుడు తనపదవికి పోటీకి వస్తాడేమోనన్న భయపడతాడు. దాంతో సగరుడి యాగాన్ని ఎలాగైనా భంగం కలిగించాలని భావించి సగరుని అశ్వమేధ అశ్వాన్ని అపహరిస్తాడు. అనంతరం ఆ అశ్వాన్ని కపిలముని ఆశ్రమంలో కట్టి వేసి ఏమీ తెలియనట్టుగా తిరిగి వెళ్లిపోతాడు. ఈ మొత్తం తతంగం సగరుని 60 వేల కుమారులకు తెలియదు. ఆ అశ్వాన్ని కపిలమునియే అపహరించాడని భావించి.. అశ్వరక్షణార్ధం వెంట వచ్చి కోపంతో కపిల మహాముని ఆశ్రమంలో ప్రవేశిస్తారు. తపో దీక్షలో ఉన్న కపిలమునిని భంగం కలిగిస్తారు. దీంతో తీవ్ర కోపాద్రిక్తుడైన ఆ కపిలముని.. తన తపోభంగానికి కారణమైన సగరుని కుమారులు 60వేల మందిని భస్మం చేస్తాడు.

అలా కపిల మునిచే భస్మం కావింపబడ్డ తన పిత్రుల ఊర్ధ్వ గతుల కోసం సగరుని మనుమడు అయిన భాగీరథుడు తపస్సు చేశాడు. గంగాదేవిని ప్రత్యక్షం చేసుకుంటాడు. ప్రత్యక్షం చేసుకున్న గంగాదేవిని స్వర్గంనుండి భూమికి వచ్చి తన పిత్రులకు మోక్షం ప్రసాదించమని వేడుకుంటాడు. అయితే.. గంగాదేవి తన రాకను భూమి భరించలేదని, దానిని భరించగలిగినవాడు ఒక్క సాంభశివుడేనని చెప్తుంది. అప్పుడు భాగీరథుడు.. గంగాదేవిని భూమికి తీసుకువచ్చే ప్రయత్నంలో సహకరించమని శివుణ్ణి కోరుకుంటాడు. శివుడు అందుకు అంగీకరించి గంగానదిని తన జటాఝూటాలలో బంధించి మెల్లగా భూమి మీదికి వదిలినట్లు పురాణాలు చెప్తున్నాయి.

ఉత్తరాఖండ్

హిమాలయాల ఒడిలో పర్యాటకుల మనసు దోచుకునే ఉత్తరాఖండ్

హిమాలయాల ఒడిలో పర్యాటకుల మనసు దోచుకునే ఉత్తరాఖండ్ విహారం... వారి మదిలో చిరకాలం గుర్తుండిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఉత్తరాఖండ్ పేరు చెప్పగానే ముందుగా గుర్తుకు వచ్చేది డెహ్రాడూన్. కానీ, ఇప్పటిదాకా భయటపడని ఎన్నో అందాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ప్రకృతి అందాలతో పర్యాటకులను పరవశుల్ని చేయడమే కాదు సంస్కతీ సాంప్రదాయల్లో కూడా ఉత్తరాఖండ్ ఎంతో పేరెన్నికగన్నది. దానికి ప్రత్యక్ష ఉదాహరణ కుంభమేళ. అంతేకాకుండా మనదేశంలో గోల్ఫ్ ఆటకు అనువైన ప్రదేశాలలో ఉత్తరాఖండ్ కూడా ఒకటి. 'కోర్బట్ నేషనల్ పార్క్ అండ్ టైగర్ రిజర్వ్'... అంతరించిపోతున్న మన జాతీయ జంతువు పెద్దపులికి ఇష్టమైన నివాసం. అంతేకాకుండా పర్వాతారోహలకు ఎంతో ఇష్టమైన పర్వతశిఖారాలు కూడా ఇక్కడ ఉన్నాయి. అలాంటి వాటిలో 'నందాదేవి పీక్' ప్రముఖమైనవి. జాతీయ వింతలు 'వాలీ ఆఫ్ ఫ్లవర్స్', 'నందాదేవీ జాతీయ ఉద్యానవనం' లాంటి ప్రదేశాలు తప్పకుండా చూసి తీరాల్సిందే. 'యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్'లు గా గుర్తింపు సంపాదించుకున్న ఈ ప్రదేశాలు పర్యాటకులను ఆకట్టుకోవడంలో ముందువరుసలో నిలుస్తున్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే సందర్శకుల మనసుదోచే ఇలాంటి పర్యాటక కేంద్రాలు ఇక్కడ అనేకం ఉన్నాయి.

సరస్సుల నగరంగా గుర్తింపు పొందిన నైనితాల్ లో ఒకప్పుడు సుమారు 60కి పైగా చెరువులు, సరస్సులు ఉండేవట. ఇందులో 'నైనీ' అనే సరస్సు ఎంతో పేరుగాంచింది. ఇక్కడ మహాఋషులు, మునులు నివాసం ఉన్నట్టు స్కందపురా ణంలో ఉంది. నైనితాల్ సరస్సును 'ట్రై రిషి సరోవర్' (ముగ్గురు ఋషుల సరోవరం) కూడా పిలుస్తారు. అత్రి, పులస్త్య, పులహ అనే మహాఋషులు... నీరు దొరకకుండా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న నైనితాల్‌లో ఒక సరస్సు నిర్మించాలని తలపెట్టారు. అలా ఒక లోతైన గుంతను తవ్వి... టిబెట్ దగ్గర ఉన్న పవిత్ర మానస సరోవరం నుండి నీటిని తెచ్చి నింపారని ప్రతీతి. అలా ఏర్పడిందే నేడు మనం చూస్తున్న నైనితాల్ సరస్సు. ఈ సరస్సులో స్నానం చేస్తే సాక్షాత్తు ఆ మానస సరోవరంలోనే స్నానమాచరించినంత పుణ్యం దక్కుతుందట.

దేశంలో ఉన్న 64 శక్తిపీఠాలలో నైనితాల్ కూడా ఒకటి. 64 ముక్కలైన పార్వతీ దేవి శరీరభాగాల్లో ఆమె కన్ను ఈ ప్రాంతంలో పడిందట. అలా ఈ ప్రాంతానికి నైనితాల్ (హిందీలో నయన్ అంటే కన్ను) అనే పేరు వచ్చిందని ప్రతీతి. అందుకే ఆ శక్తి స్వరూపిణిని ఇక్కడ నైనాదేవి పేరుతో పిలుస్తారు. నైనాదేవీ ఆలయం దేశంలోని శక్తిపీఠాలలో ఒకటిగా విరాజిల్లుతోంది. పర్యాటకులు ఇక్కడి చేరుకోవాలంటే... దగ్గరి విమానాశ్రయం పంత్‌నగర్. ఇది నైనితాల్‌కు 71 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడి నుండి రోడ్డు మార్గం గుండా వెళ్లవచ్చు. రైలుమార్గం ద్వారా చేరుకునే పర్యాటకులు కథ్‌గోదామ్ రైల్వే స్టేషన్ గుండా వెళ్ళవచ్చు (ఈ స్టేషన్ నైనితాల్‌కు 31 కి.మీ).

ఉత్తరాఖండ్‌లో పచ్చదనంతో మైమరిపించే మరో ప్రదేశం ఆల్మోరా. ఇక్కడి ప్రకృతి పచ్చదనానికి పరవశించని పర్యాటకుడు ఉండడంటే అతిశయోక్తి కాదు. ప్రశాంత వాతారణంతో కొండకోనలతో అలరారుతున్న ఈ ప్రాంతాన్ని చూస్తే ప్రకృతీమాత తన నైపుణ్యాన్నంతటినీ రంగరించి మరీ తీర్చిదిద్దిందా అనిపిస్తుంది. కోశీ, సుయాల్ నదుల ప్రవాహం ఆల్మోరాకు మరింత అందాన్ని చేకూర్చింది. ఆల్మోరా ప్రకృతి అందాలతోనే కాదు, ప్రముఖుల నివాసాలతో ప్రసిద్ధిగాంచింది. స్వామీ వివేకానంద తన హిమాలయాల పర్యటనలో ఆల్మోరాను తాత్కాలిక విడిదిగా ఎంచుకున్నారట. అలా ఆయన కొన్నాళ్ళు ఇక్కడే గడిపాడట. అంతేకాకుండా స్వాతంత్య్ర సమరయోధుడు గోవింద్ వల్లభ్ పంత్, ప్రముఖ హిందీ విద్వాంసుడు సుమిత్రానందన్ పంత్, నోబెల్ గ్రహీత సర్ రొనాల్డ్ రాస్‌లకు జన్మస్థలం ఆల్మోరా. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కూడా తన బాల్యంలో కొంతకాలాన్ని ఇక్కడే గడిపాట. ధోని తండ్రికి రాంచీలో స్థిరపడక మునుపు ఇక్కడ ఫామ్‌లు ఉండేవట. ఇక్కడి చేరుకోవాలంటే నైనితాల్‌కు మాదిరిగానే పంత్‌నగర్ విమానాశ్రయం నుండి చేరుకోవాలి. రైలుమార్గం గుండా వచ్చే పర్యాటకులు కోథ్‌డామ్ రైల్వేస్టేషన్ నుండి చేరుకోవచ్చు.

మనదేశంలో గోల్ఫ్ ఆటకు సంబంధింన మైదానాలకు మారుపేరు రాణీఖేత్. ఎటుచూసిన పచ్చని తివాచీ పరిచనట్లుండే ఈ ప్రాంతంలో 9 మౌంటేన్ గోల్ఫ్ లింక్‌లు ఉన్నాయి. ఓక్ అడవుల్లో విస్తరించి ఉన్న ఈ గోల్ఫ్ కోర్స్‌లు పర్యాటకులను ఇట్టే కట్టిపడేస్తాయి. చలికాలంలో మంచు దుప్పటి పరుచుకున్నట్లుండే ఈ ప్రదేశం వేసవిలో మాత్రం సైనిక స్థావరంగా సేవలందిస్తుంది. ఇవేకాకుండా ఝులా దేవి ఆలయం, చౌభాటియా ఇక్కడ చూడాల్సిన ప్రదేశాలు. సమీపంలోని కథ్‌గోదామ్ రైల్వేస్టేషన్ గుండా ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు. దూరప్రాంతం నుండి వచ్చే పర్యాటకులకు దగ్గరి విమానాశ్రయం... పంత్ నగర్. ఇది రాణీఖేత్‌కు 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

Monday, 23 January 2017

శిర్ఖండాదేవి - చంద్రవదనాదేవి






మంచు కొండల్లో మహాదేవి దర్శనం

హిమాలయ పర్వతాలు మహాదేవుడికే కాదు, మహాదేవికీ నిలయాలే అనడానికి నిదర్శనంగా నిలుస్తాయి ఉత్తరాఖండ్‌లోని శివాలిక్‌ శ్రేణుల్లోని శిర్ఖండాదేవి, చంద్రవదనాదేవి శక్తిపీఠాలు. అంటూ ఆ విశేషాలు చెప్పుకొస్తున్నారు పుణెకు చెందిన కర్రా నాగలక్ష్మి.

శిర్ఖండాదేవి

ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో డెహ్రాడూన్‌ జిల్లాలో ఉన్న ప్రసిద్ధ వేసవి విడిది మసూరీ రోప్‌వేలూ జలపాతాలూ బౌద్ధారామాలూ మాల్‌ రోడ్డూ మేఘాలను తాకుతున్నట్లుండే పర్వతాలతో ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. అయితే వాటితోపాటు దాని చుట్టుపక్కల చూడదగ్గ ప్రదేశాలు ఇంకేం ఉన్నాయా అని స్థానికుల్ని ఆరాతీయడంతో తెలిసినవే ఎన్నడూ వినని ఈ రెండు శక్తిపీఠాలు. ముందుగా శిర్ఖండాదేవిని దర్శించుకుందామని బయలుదేరాం. మసూరీకి 34 కిలోమీటర్ల దూరంలో ధనౌల్టీకి సమీపంలో సముద్రమట్టానికి సుమారు 2760 మీటర్ల ఎత్తులో ఉంది శిర్ఖండాదేవి ఆలయం. మసూరీ నుంచి అంతా ఘాట్‌ రోడ్డు ప్రయాణమే. చుట్టూ పైన్‌ చెట్లతో కూడిన దట్టమైన అడవి మధ్యలో మా ప్రయాణం సాగింది. రోడ్డు పక్క అక్కడో ఇల్లూ ఇక్కడో ఇల్లూ తప్ప మరేమీ లేవు. కద్దుఖల్‌ అనే గ్రామంలో ఓ చోట రెండు పాకలు వేసి ఉన్నాయి. నాలుగు గుర్రాలు కూడా ఉన్నాయి. కానీ మేం ఈ గ్రామం నుంచి నడిచి వెళ్లాలనుకున్నాం. అయితే చలి బాగా ఉండటంతో అక్కడి పాకలో వేడివేడి టీ తాగి నడక ప్రారంభించాం. మూడు కిలోమీటర్లు నడవడానికి మాకు గంటన్నర సమయం పట్టింది. అక్కడ దారి మెట్లు మెట్లుగా జారుడుగా ఉంది. కొన్ని మెట్ల తరవాత వంకలు తిరిగిన సన్నని కాలి బాట మొదలైంది. ఆ తరవాత దారి నిట్టనిలువుగా పైకి ఎక్కేలా ఉంది. చుట్టూ ఉన్న ప్రకృతి సోయగం ఆయాసాన్ని మరిపించినా అంత చలిలోనూ మాకు చెమటలు పట్టాయి. ఎట్టకేలకు మందిరం ప్రాంగణంలోకి అడుగుపెట్టాం. అక్కడ ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం ఏర్పాటుచేసిన బోర్డు మీద మందిరం స్థలపురాణం వివరంగా రాసి ఉంది. వెళ్లగానే ముందు మందిరంలోకి వెళ్లాం. అది చాలా చిన్నగా ఉంది. అమ్మవారి విగ్రహం కూడా చాలా చిన్నది. అక్కడ అమ్మవారి దర్శనం చేసుకోగానే అక్కడేదో శక్తి ఉన్నట్లే అనిపించింది. దక్ష ప్రజాపతి కుమార్తె సతీదేవి మృతదేహంతో ఆ పరమశివుడు చేసిన రుద్రతాండవం కారణంగా ఆమె శిరస్సు శరీరం నుంచి వేరయి ఈ పర్వత శిఖరాల మీద పడిందట. సతీదేవి శరీర భాగాలు పడిన ప్రదేశాల్నే శక్తిపీఠాలుగా పిలుస్తారు. అలా ఆమె శిరస్సు పడటం ద్వారా వెలసినదే ఈ శిర్ఖండా దేవి. ఇక్కడ దేవీ నవరాత్రులూ గంగా నవరాత్రులూ నిర్వహిస్తారు. ఆ సమయంలో చుట్టుపక్కల ప్రదేశాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు. మిగిలిన సమయాల్లో పెద్దగా ఉండరు. మేం వెళ్లినప్పుడు ఆ మందిరంలో ఇంకెవ్వరూ లేరు. అందుకే అక్కడ చాలాసేపు కూర్చుని స్తోత్రాలు చదువుకుని తిరుగుప్రయాణమయ్యాం.

చంద్రవదనాదేవి!
ఈ ప్రాంతంలో ఏడాది పొడవునా మంచుపడుతూ ఉంటుంది. వర్షాకాలంలో పర్యటించకపోవడమే మేలు. తిరుగుప్రయాణంలో మేం మసూరీకి కాకుండా స్థానికుల నుంచి సమాచారం తీసుకుని చంద్రవదనాదేవి పీఠానికి బయలుదేరాం. దేవ ప్రయాగ రోడ్డులో ప్రయాణం మొదలైంది.

దారి మొత్తం కొండ రోడ్డే. అడవిగుండానే సాగుతుంది. అక్కడక్కడా చిన్న చిన్న గ్రామాలూ మెట్ట వ్యవసాయం తప్ప మరేమీ లేవు. సుమారు 60 కిలోమీటర్లు ప్రయాణించాక జామనీఖాల్‌ గ్రామానికి చేరుకున్నాం. అక్కడ నుంచి సుమారు మరో ఏడు కిలోమీటర్లు ప్రయాణించి చంద్రవదనీ పర్వతానికి చేరుకున్నాం. అక్కడ నుంచి సుమారు ఓ కిలోమీటరు కొండమీదకి నడిచి చంద్రవదనాదేవి మందిరానికి చేరుకున్నాం. ఇది కూడా చాలా చిన్న మందిరం. మందిరం దగ్గర పూజారి తప్ప ఇంకెవ్వరూ కనిపించలేదు. గర్భగుడి మధ్యలో ఎర్రని బట్ట పైనుంచి కట్టి ఉంది. పూజారిని అది తొలగిస్తే అమ్మవారిని దర్శించుకుంటామని అడిగాం. అయితే దాన్ని ఎప్పుడూ తొలగించమని ఆయన చెప్పిన సమాధానం విని ఆశ్చర్యపోయాం. చంద్రవదనాదేవి అంటే అందమైనది అని అర్థం. అయితే ఆ మందిరంలో అసలు అమ్మవారి విగ్రహమే లేదట. మరక్కడ ఏమి ఉంటుందని అడిగితే ఆయనకూ సరిగ్గా తెలీదట. కానీ శ్రీచక్రం ఉండొచ్చు అన్నాడు. ఎందుకంటే రోజూ ఉదయమూ సాయంత్రమూ పూజారి కళ్లకు గుడ్డ కట్టుకుని ధూపదీపనైవేద్యాలు సమర్పించి ఇవతలకు వస్తారట. రుద్రతాండవం చేస్తోన్న శివుణ్ణి ఆపేందుకు విష్ణుమూర్తి తన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండించినప్పుడు ఆమె గుప్తాంగం చంద్రవదనీ పర్వతంమీద పడిందట. అమ్మవారి ప్రతిరూపమైన శ్రీచక్రాన్ని అంగం ఉన్న ప్రదేశంలో ప్రతిష్టించి ఉంటారనీ దాన్ని పరులెవరూ చూడకూడదనీ చెప్పారాయన. అక్కడ ఉన్న ఎర్ర బట్టను సైతం కళ్లకు గంతలు కట్టుకుని ఏడాదికోసారి మారుస్తారట. అందుకే మేం కూడా ఆ ఎర్రబట్టకు ఇవతల నుంచే పూజ ముగించి బయటకు వచ్చాం. దసరా నవరాత్రుల్లో చుట్టుపక్కల గ్రామ ప్రజలు వచ్చి అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటారు. తిరుగుప్రయాణంలో సుమారు 35 కిలోమీటర్లు ప్రయాణించి దేవప్రయాగకు చేరుకున్నాం. అప్పటికే సాయంత్రం ఏడవడంతో ఆ రాత్రికి అక్కడే బస చేసి, అరుదైన శక్తి పీఠాలను దర్శించుకున్నామన్న సంతృప్తితో ఆ మర్నాడు పుణెకి తిరిగి వచ్చాం.

Friday, 6 January 2017

గంగోత్రి - ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం !

గంగోత్రి, ఇది ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీలో ఉన్న ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం. ఇది సముద్ర మట్టానికి 3750 మీ. ఎత్తున, హిమాలయాల పర్వత శ్రేణులలో ఉన్నది. ఈ ప్రదేశం భగిరథి నది ఒడ్డున ఉన్నది. గంగోత్రి 'చార్ ధామ్' మరియు 'దో ధామ్' ఈ రెండిటి యొక్క పవిత్ర స్థలం. పురాణాల ప్రకారం, గంగా దేవత భగీరథ రాజు, అతని పూర్వీకుల పాపాలను కడిగివేయటానికి నది రూపంలో వొచ్చింది. దీనినే గంగ నది అని పిలుస్తున్నారు. గంగ యొక్క ప్రవాహవేగ ఒరవడి భూమి కొట్టుకుపోకుండా, శివుడు అతని శిఖలో గంగను బంధించాడు. గంగా నది లేదా గాంజెస్ యొక్క మూలం,గంగోత్రి నుండి 19 కి. మీ. దూరంలో ఉన్న గౌముఖ్ . గంగానది ఆవిర్భవించినప్పుడు, దీనిని 'భగీరథి' అని కూడా పిలిచేవారు.

భగిరథి నది ఎగువ పరీవాహక ప్రాంతంలో దట్టమైన అడవులు ఉన్నాయి. ఈ ప్రాంతంలో మంచు పర్వతాలు, హిమానీనదాలు, పొడవైన గట్లు, లోతైన సన్నని త్రోవలు, ఊర్ధ్వ శిఖరాలు మరియు సన్నని లోయలు ఉన్నాయి. దీని యొక్క ఎత్తు 1800 నుండి సముద్ర మట్టానికి 7083 మీటర్ల వరకు ఉంటుంది. పర్యాటకులు ఇక్కడ ఉప ఆల్పైన్ కానిఫేర్ అడవులు, ఆల్పైన్ పొదలు మరియు ఆకుపచ్చ పచ్చిక బయళ్లను చూడవొచ్చు. ఈ అడవిని ఇండో-చైనా సరిహద్దు వరకు విస్తరించిన 'గంగోత్రి నేషనల్ పార్క్' గా ప్రకటించారు.

గంగోత్రి, పురాతన ఆలయాలు మరియు మతపరమైన నమ్మకాలకు ప్రసిద్ది చెందింది. ఈ ప్రాంతంలో గంగోత్రి ఆలయం ఒక ప్రధాన హిందూ మతం పుణ్యక్షేత్రం. ఈ ఆలయాన్ని గూర్ఖా రాజు, అమర్ సింగ్ తాప18 వ శతాబ్దం లో నిర్మించారు. భక్తులు అధిక సంఖ్యలో గంగా దేవతను ఆరాధించటానికి ఈ ఆలయాన్ని సందర్శిస్తున్నారు. పర్యాటకులు ఇక్కడ ఉన్న గ్యానేశ్వర్ ఆలయం మరియు ఏకాదశరుద్ర ఆలయాన్ని కూడా సందర్శించవొచ్చు. ఇక్కడ జరిగే 'ఏకాదశ రుద్రాభిషేకం పూజ' చాలా ప్రశస్తి చెందింది.భగీరథి శిల మరియు గంగోత్రిలో మునిగినట్లు ఉన్న శివలింగం వివిధ మత విలువలకు సంబంధం కలిగి ఉన్నాయి. ఈ సహజ శివలింగం శీతాకాలంలో నీటి మట్టం తగ్గి ఉండటం వలన, ఈ కాలంలో మాత్రమే కనిపిస్తుంది. భగీరథి శిల, ఈ రాయి మీదే భగీరథ రాజు తపస్సు చేశారని ఒక నమ్మకం. పర్యాటకులు, గంగోత్రి ఆలయానికి దగ్గరలో ఉన్న 'గౌరికుండ్' మరియు 'సూర్య కుండ్' కూడా సందర్శించ వొచ్చు.

గంగోత్రిలో ట్రెక్కింగ్ అనుభూతిని పూర్తిగా పొందవొచ్చు. ఈ పట్టణం నుండి చిన్న ట్రెక్ ద్వారా 'పాండవ గుఫా' చేరుకోవొచ్చు. మహాభారత వీరులు మరియు రాజులు అయిన పాండవులు ధ్యాన ప్రదేశం ఈ గుహ (హిందీలో 'గుఫా') అని ఒక నమ్మకం.సముద్ర మట్టానికి 3000 మీ. ఎత్తున ఉన్న 'దయార బుగ్యాల్' ను పర్యాటకులు ట్రెక్కింగ్ ద్వారా చేరుకోవొచ్చు. ఇది చాలా ఎత్తులో ఉన్న అందమైన గడ్డి మైదానం, ఇక్కడ నుండి పర్యాటకులు హిమాలయాల అద్భుతమైన సౌందర్యాన్ని ఆస్వాదించవొచ్చు. దీనిని చేరుకోవాలంటే, రెండు గ్రామాలు, 'బర్సు' మరియు 'రైతల్' నుండి ట్రెక్కింగ్ దారులనుండి చేరుకోవొచ్చు. ఈ ట్రెక్కింగ్ దారులగుండా వెళ్ళేప్పుడు 'శేష్నాగ్ ఆలయాన్ని' సందర్శించవొచ్చు.ఇక్కడ పర్యాటకులు శీతాకాలంలోనార్డిక్ మరియు ఆల్పైన్ స్కైయింగ్ కూడా అనుభూతి చెందవొచ్చు. ఆలి, ముండలి, కుష్ కళ్యాణ్, కేదర్ కాంత, టెహ్రీ గార్వాల్లోని, బెడ్ని బుగ్యల్ మరియు చిప్లకోట్ లోయ దగ్గరలో ఉన్న స్కైయింగ్ కు అనువైన స్థలాలు. గంగోత్రి పట్టణంలో, గంగోత్రి-గౌముఖ్ -తపోవన్ ట్రెక్కింగ్ స్థావర కాంప్ ఉన్నది. 'కేదార్తల్' ను కూడా ట్రెక్కింగ్ మార్గానికి అనుసంధించారు. గంగోత్రికి చుట్టుపక్కల ప్రాచుర్యంలో ఉన్న గాంజెస్ హిమనదం, మనేరి, కేదార్ తల, నందనవన్, తపోవన్ విశ్వనాధ్ ఆలయం, దోడి తల్, తెహ్రి, కుటేటి దేవి ఆలయం, నచికేత తల్, గంజ్ఞాని మొదలయిన వాటిని కూడా పర్యాటకులు సందర్శించవొచ్చు.
దీనిని విమానం, రైల్, బస్సు మార్గాల ద్వారా సులభంగా చేరుకోవొచ్చు. డెహ్రడున్ లో ఉన్న జోల్ గ్రాంట్ ఎయిర్ పోర్ట్ నుండి టాక్సీలను అద్దెకు తీసుకుని ఇక్కడకు చేరుకోవొచ్చు. ఇందిరా గాంధి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్,న్యూ ఢిల్లీ నుండి డెహ్రడున్ కు చాలా తరుచుగా విమానాలు అందుబాటులో ఉన్నాయి. రిషికేశ్ రైల్వే స్టేషన్ నుండి కూడా రైళ్ళు అందుబాటులో ఉన్నాయి. దగ్గరలో ఉన్న నగరాలనుండి గంగోత్రికి బస్సులు కూడా పర్యాటకులకు అందుబాటులో ఉన్నాయి.

Monday, 14 November 2016

మబ్బుల్లో విడిది... లాన్స్‌డౌన్‌..!

పచ్చని కొండలూ దట్టమైన అడవులూ ఉరికే జలపాతాలూ గలగలా పారే నదీప్రవాహాలూ స్వచ్ఛమైన నీలి సరస్సులూ వాటి నడుమ విరిసిన ఆధ్యాత్మిక క్షేత్రాలూ... ఇలా ఎన్నో సుందర ప్రకృతి దృశ్యాలకు పెట్టింది పేరు ఉత్తరాఖండ్‌. ప్రకృతిప్రేమికులనూ భక్తులనూ అమితంగా ఆకర్షించే అక్కడి కొండప్రాంతాల విశేషాలను చెప్పుకొస్తున్నారు హైదరాబాద్‌కు చెందిన పులిపాక సాయినాథ్‌.
లాన్స్‌డౌన్‌, జిమ్‌కార్బెట్‌... ఈ పేర్లు వినగానే ఇవేవో విదేశాల్లో ఉన్నాయేమో అనుకుంటాం. కానీ ఇవి మనదేశంలోని ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోనే ఉన్నాయి. ఈ రాష్ట్రంలోని నైనీతాల్‌, మసూరీ, రిషికేశ్‌, హరిద్వార్‌... ప్రాంతాలు ఇప్పటికే ఎంతో ప్రాచుర్యం పొందాయి. లాన్స్‌డౌన్‌, జిమ్‌కార్బెట్‌... కూడా ఇక్కడే ఉన్నాయి. ఈ రెండూ కూడా తప్పక చూడదగ్గ ప్రదేశాలని తెలుసుకుని మేమంతా హైదరాబాద్‌ నుంచి ఉదయం 8 గంటలకి విమానంలో బయలుదేరి 11 గంటలకు దిల్లీ చేరుకున్నాం. అక్కడి నుంచి అన్ని ప్రాంతాలనూ చూడ్డానికి కారు బుక్‌ చేసుకున్నాం.
దిల్లీ నుంచి నేరుగా డెహ్రాడూన్‌ మీదుగా మసూరీకి బయలుదేరాం. ఘజియాబాద్‌, ముజఫర్‌నగర్‌, మీరట్‌, రూర్కీ మీదుగా సాయంత్రానికి డెహ్రాడూన్‌కి చేరుకున్నాం. ఈ నగరం ఉత్తరాఖండ్‌ రాజధాని. అక్కడ నుంచి మసూరీకి 35 కిలోమీటర్లు. అయితే అది పూర్తిగా ఘాట్‌రోడ్డు. అన్నీ మలుపులే. కొండ ఎక్కుతూంటే మేం ఆకాశంలో ప్రయాణిస్తున్నట్లే థ్రిల్లింగ్‌గా అనిపించింది. ఆ రాత్రికి మసూరీలోనే బస. రాత్రివేళలో పై నుంచి చూస్తే కింద ఉన్న దీపాలు నీలాకాశంలోని చుక్కల్లా కనిపించాయి.
అక్కడి వాతావరణం కట్టిపడేసింది...
ఉదయం లేవగానే సన్నటిజల్లు పడుతూ ఉంది. బయటకు వచ్చి చూస్తే మేఘాల పైన ఉన్నామా అనిపించింది. మసూరీ పెద్ద పట్టణం కాదు కానీ, సముద్రమట్టానికి ఆరువేల అడుగుల ఎత్తులో ఉన్న చూడచక్కని హిల్‌స్టేషన్‌. ప్రకృతిమాత పచ్చకోక కట్టుకున్నట్లుగా ఎటుచూసినా పచ్చనివృక్షాలే. అక్కడి కొండల్నీ గుట్టల్నీ అలాగే ఉంచి ఆ ఎత్తుపల్లాల్లోనే భవనాలను నిర్మించారు. ఇందులో ఎక్కువ భాగం హోటళ్లే కావడం విశేషం. దగ్గరలో 16 కిలోమీటర్ల దూరంలో కెంప్టీ ఫాల్స్‌ జలపాతం ఉంది. ఇక్కడ కొండల మధ్య సహజంగా ఏర్పడ్డ జలపాతాలూ సరస్సులూ చూసితీరాల్సినవే. దర్శనీయ స్థలాలు ఎక్కువగా లేకున్నా ఇక్కడి ఆహ్లాదకరమైన 
వాతావరణం సందర్శకులను రారమ్మని పిలుస్తుంటుంది. రెండురోజులపాటు ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ అక్కడే ఉండి తరవాత రిషికేశ్‌, హరిద్వార్‌లకు ప్రయాణం అయ్యాం. మసూరీ నుంచి హరిద్వార్‌కు 105 కిలోమీటర్లు. డెహ్రాడూన్‌ మీదుగానే వెళ్లాలి. ఉదయం 11 గంటలకు రిషికేశ్‌ చేరుకున్నాం. అప్పుడు అక్కడ కావడ్‌ అనే భక్తుల దీక్షా యాత్ర నడుస్తోంది. ఈ కారణంగా రోడ్లూ, స్నానఘట్టాలు అన్నీ వాళ్లతోనే నిండి ఉన్నాయి. రిషికేశ్‌లో లక్ష్మణ్‌ఝూలా దాటి వెళ్లి పవిత్ర గంగానదికి ప్రణమిల్లి స్నానం చేసి దగ్గరలోని శివాలయాన్ని దర్శించుకున్నాం. గంగానది పరవళ్లు తొక్కుతూ వేగంగా ప్రవహిస్తోంది. అక్కడి హస్తకళల షాపుల్లో వస్తువులు అందరినీ ఆకట్టుకున్నాయి. పాలరాయి, పంచలోహాలతో చేసిన దేవతా విగ్రహాలు చాలా బాగున్నాయి. వాటి ధరలు కూడా లక్షల రూపాయల్లో ఉన్నాయి. అక్కడినుంచి 37 కి.మీ.దూరంలోని హరిద్వార్‌కి వెళ్లాం. హరిద్వార్‌లో గంగమ్మతల్లికి దండంపెట్టుకుని దగ్గరలో ఉన్న ప్రదేశాల్లో కాసేపు తిరిగి, లాన్స్‌డౌన్‌కి బయలుదేరాం. ఇది హరిద్వార్‌ నుంచి 110 కిలోమీటర్లు. మూడు గంటల ప్రయాణం.
ఆనందం అనిర్వచనీయం!
మా ప్రయాణంలో ఎక్కువభాగం గంగానది వెంబడే సాగిందని చెప్పాలి. రోడ్డు వెడల్పు తక్కువగా ఉన్నా రెండువైపులా బ్రహ్మాండంగా పెరిగిన పచ్చగడ్డీ, దానికి ఆవలివైపున కాలువ నయనానందాన్ని కలిగించాయి. నజీబాబాద్‌ దాటాక మళ్లీ ఘాట్‌రోడ్డు ప్రయాణం. రోడ్డుకి ఒకవైపున పెద్ద లోయ. లోయంతా పచ్చని చెట్లూ జలపాతాలతో నిండి ఉంది. సాయంత్రానికి లాన్స్‌డౌన్‌లో బుక్‌చేసుకున్న హోటల్లో దిగాం. బాల్కనీ నుంచి చూస్తే ఎదురుగా లోయలూ...వాటిమీద దట్టమైన పొగమంచూ... తలుపులు తెరిస్తే చాలు... మేఘాలు లోపలికి వచ్చేస్తుంటాయి. అవి అలా వస్తుంటే మా ఆనందం అనిర్వచనీయం. ఆ కొండల్లో అక్కడక్కడా నివాసం ఏర్పరచుకున్న ఓ 50 ఇళ్లు ఓ వూరిలా కనిపిస్తాయి. సాయంకాలంవేళ ఘాట్‌రోడ్డులో రెండు కిలోమీటర్లు నడిచాం. తిరిగి వస్తూ అక్కడ కూర్చున్న ఓ పదిమంది స్థానికులను పలకరించాం. ఓ నాలుగు కిలోమీటర్లు పైకి పోతే ఓ బజారు ఉందట. అక్కడే ఓ స్కూలు కూడా ఉందనీ, పిల్లలు ప్రైవేటు వాహనంలో వెళ్లి వస్తారనీ చెప్పారు. అనారోగ్యం పాలైతే 40 కిలోమీటర్ల దూరంలో కింద ఉన్న కోట్‌ద్వారకి వెళ్లి చూపించుకుంటామని చెప్పారు. అక్కడివాళ్లలో ఎక్కువభాగం ఆర్మీలో పనిచేస్తారట.
మర్నాడు నాలుగు కిలోమీటర్లు ప్రయాణించి లాన్స్‌డౌన్‌ బజారుకి వెళ్ళాం. ఇది ఆర్మీ హెడ్‌ క్వార్టర్స్‌. దీన్నే సదర్‌ బజార్‌ అనీ గాంధీ చౌక్‌ అనీ అంటారు. ఒకటే బజారు. ఇక్కడంతా ఆర్మీ జవాన్లు తిరుగుతుంటారు. వాళ్ల కార్యాలయాలూ ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ దర్శనీయ స్థలాలు చాలానే ఉన్నాయి. కానీ ఎక్కడకు వెళ్లాలన్నా కొండ పైకన్నా వెళ్లాలి, లేదా కిందకన్నా దిగాలి. ఇక్కడ కొండలమధ్య సహజంగా ఏర్పడ్డ సరస్సు భుల్లాతాల్‌ అని ఉంది. సరస్సులో పడవెక్కి షికారుకి కూడా వెళ్లవచ్చు. పక్కనే పిల్లలకి ఝాలా పార్కు కూడా ఉంది. ఆ సరస్సులో ఇటు నుంచి అటు దాటడానికి ఇనుప రెయిలింగ్‌ ఉన్న ఓ వంతెన ఉంది. ఒకసారికి పదిమంది మాత్రమే వెళ్లాలి అని చెప్పారు.
అక్కడి నుంచి రెండు కిలోమీటర్లు పైకి పోతే లాన్స్‌డౌన్‌ వ్యూ పాయింట్‌ ఉంది. దాని పేరు టిప్‌ ఇన్‌ టాప్‌. ఈ ప్రదేశం అత్యంత ఎత్తైన ప్రదేశం. దీని ఎత్తు దాదాపు ఆరు వేల అడుగులు. అక్కడినుంచి చుట్టూ ఉన్న శివాలిక్‌ పర్వతశ్రేణుల్నీ వాటిమధ్యలోని పచ్చని లోయల్నీ కళ్లు విప్పార్చుకుని మరీ చూశాం. అక్కడక్కడా చిన్న చిన్న గ్రామాలు ఉన్నాయి. ఇక్కడి నుంచి అడ్డదారిలో 300 కిలోమీటర్లు ప్రయాణిస్తే చైనా వస్తుందని చెప్పారు స్థానికులు. టిప్‌ ఇన్‌ టాప్‌ నుంచి కిందకి దిగుతుంటే మధ్యలో ఆంగ్లేయుల కాలం నాటి సెయింట్‌ మేరీ చర్చి ఒకటి వచ్చింది. అది చూశాక, దగ్గరలోనే ఉన్న మిలటరీ వాళ్ల దర్వాన్‌సింగ్‌ మ్యూజియంలోకి వెళ్లాం. పాతకాలంనాటి ఆర్మీకి సంబంధించిన వస్తువులను భద్రపరిచారక్కడ. నాలుగురోజులపాటు విశ్రాంతి తీసుకోవాలనుకునే వాళ్లకి ఇది చూడచక్కని విడిది. చూడాలనుకునేవాళ్లు ఇక్కడకు దగ్గరలో ఉన్న తారకేశ్వర్‌ మహదేవ్‌ ఆలయాన్నీ దుర్గాదేవి ఆలయాన్నీ కణ్వాశ్రమాన్నీ చూసి రావచ్చు. మేం ఆ పచ్చని ప్రకృతిలోనే రెండు రోజులు గడిపి అక్కడకు 140 కిలోమీటర్ల దూరంలో ఉన్న జిమ్‌కార్బెట్‌కి బయలుదేరాం.
జిమ్‌కార్బెట్‌కి ముందు వూరైన రాంనగర్‌ వరకూ రైలు సౌకర్యమూ ఉంది. అక్కడి నుంచి జిమ్‌కార్బెట్‌ పార్కు 16 కిలోమీటర్లు. సాయంత్రానికి అక్కడకు చేరుకున్నాం. అది పూర్తిగా అరణ్య ప్రాంతం. జిమ్‌కార్బెట్‌ ఓ ఆంగ్లేయ దొర. మంచి వేటగాడు. పులుల సంరక్షణకోసం అభయారణ్యాన్ని ఏర్పాటుచేయడంలో కీలకపాత్ర పోషించడంతో ఆయన పేరునే పెట్టారు. సుమారు 1300 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న దీన్ని కార్బెట్‌ టైగర్‌ రిజర్వ్‌ అనీ జిమ్‌కార్బెట్‌ నేషనల్‌ పార్కు అనీ పిలుస్తారు. ఇక్కడ దాదాపు 300 పైగా పులులు ఉన్నాయట. ప్రస్తుతం ఇది కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉంది. ఇక్కడ ప్రభుత్వ హోటళ్లూ రిసార్టులతోబాటు ప్రైవేటువి కూడా ఉన్నాయి. వాటిల్లో ఉన్నప్పటికీ అడవిలో ఉన్న భావనే కలుగుతుంటుంది. చుట్టూ దట్టమైన వృక్షాలూ పక్షుల కిలకిలారావాలతో మరో ప్రపంచాన్ని తలపిస్తుంది. ఈ అడవి గుండా గంగానది ఉపనది అయిన కోసీ ప్రవహిస్తూ ఉంటుంది. మేం బసచేసిన రిసార్టు ముందు కూడా కోసీ నది ప్రవహిస్తుండటంతో ఆ ప్రదేశం మాకెంతో నచ్చింది.
అడవిలో ఆటవిడుపు
అటవీ అధికారుల అనుమతితో సఫారీకి వెళ్లవచ్చు. ఫొటో గుర్తింపుకార్డులు తప్పనిసరి. అటవీశాఖ ఆరు సఫారీ జోన్లనూ వాటికి గేట్లనూ ఏర్పాటుచేసింది. మమ్మల్ని ఆరోజు ఝిర్నా గేటు ద్వారా లోపలకు పంపారు. ప్రైవేటు జిప్సీ జీపులు కూడా తిరుగుతుంటాయి. వీటి ధరలు కాలాన్ని బట్టి మారుతుంటాయి. సఫారీ సాహసభరితంగానూ థ్రిల్లింగ్‌గానూ అనిపించింది. ఈ జీపులను నదులూ కొండలూ గుట్టలూ బండరాళ్లూ ఎక్కించి నడుపుతారు. ప్రతి జీపులో ఓ గైడ్‌ కూడా వచ్చి అన్నీ వివరంగా చెబుతారు. ఎక్కడైనా జింకలూ ఏనుగులూ పులులూ కనిపిస్తే ఆపి చూపిస్తారు. అలా అడవిలోకి తీసుకుని వెళ్లాక, మధ్యలో ఓ పావుగంట విశ్రాంతి తీసుకోనిస్తారు. తిరుగు ప్రయాణం మరోదారిలో ఉంది. పులులసంఖ్య బాగానే ఉన్నా మనం వెళ్లినప్పుడు అవి కనిపించడం అనేది మన అదృష్టం. తరవాత కోసీనది అవతలి వైపు ఉన్న గార్జియా మాత ఆలయానికి వెళ్లాం.
సరస్సుల నగరం
మర్నాడు జిమ్‌కార్బెట్‌ పార్కుకి 64 కిలోమీటర్ల దూరంలో ఉన్న నైనీతాల్‌కి వెళ్లాం. సుమారు మూడు గంటలు ప్రయాణించి అక్కడకు చేరుకున్నాం. ఈ నగరం ఎప్పుడూ చల్లని పొగమంచుతో నిండి ఉంటుంది. కొండలమధ్య ఉన్న ఇక్కడి లోయల్లో మొత్తం తొమ్మిది సరస్సులు ఉన్నాయి. నైనీతాల్‌, భీమ్‌తాల్‌, నౌకుచియతాల్‌, సత్తాల్‌, ఖుర్పాతాల్‌, సడియాతాల్‌... మొదలైనవి. అందువల్లే దీనికా పేరు. దీన్ని ‘లేక్‌ డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ ఇండియా’ అని కూడా అంటారు. ఈ సరస్సులలో రంగురంగుల పడవల్లో హాయిగా విహరించవచ్చు. దక్షయజ్ఞంలో మృతిచెందిన సతీదేవి కళ్లు ఇక్కడ పడ్డాయనీ అవే నయన్‌ సరస్సుగా ఏర్పడ్డాయనీ కూడా చెబుతారు. ఈ ప్రాంతాన్ని 64 శక్తిపీఠాల్లో ఒకటిగానూ పేర్కొంటారు. ఈ సరస్సు ఒడ్డునే నైనాదేవి ఆలయం ఉంది. అప్పుడే తిరిగి రావాలనిపించకపోయినా మర్నాడు కార్బెట్‌ నుంచి దిల్లీకీ అక్కడినుంచి సాయంత్రానికి హైదరాబాద్‌కి చేరుకున్నాం.

మంచుకోడల్లో మహేశ్వరుడు


ప్రయాణం కష్టమైనప్పటికీ ఉత్తరాఖండ్‌లోని మంచుకొండల మధ్యలో 11,473 అడుగుల ఎత్తులోని మధ్యమహేశ్వర్‌ను చూడాలనుకున్నాం. రుషికేశ్‌కు 227 కిలోమీటర్ల దూరంలో ఉందీ శైవక్షేత్రం. ఉఖీమఠ్‌ నుంచి సుమారు 31 కిలోమీటర్ల దూరం మట్టిరోడ్డుమీద ప్రయాణించి రాన్సీ గ్రామం చేరుకున్నాం. ఈ రోడ్డు చిన్న వాహనాలు ప్రయాణించేందుకు మాత్రమే అనుకూలం. రాత్రికి రాన్సీ గ్రామంలోనే బసచేశాం. పొద్దున్నే గుర్రాలమీద బయలుదేరాం. రాన్సీ నుంచి మధ్యమహేశ్వర్‌కు 14 కిలోమీటర్లు. కాలినడకన లేదా గుర్రాలమీదగానీ వెళ్లాలి.
అక్కడ యాత్రికులు తక్కువ!
ఈ దారిలో గౌదర్‌ అనే గ్రామం వస్తుంది. ఇక్కడే మహేశ్వర్‌ గంగ, మార్త్యాండ గంగలు సంగమిస్తాయి. ఇక్కడ యాత్రికులకు కావలసిన భోజన, నివాస సౌకర్యాలు ఉన్నాయి. గౌదర్లో భోజనం చేసి కాసేపు విశ్రమించాం. ఈ దారిలోనే ఉన్న మరో గ్రామం కాళీమఠ్‌. దీన్నే సిద్ధపీఠం అంటారు. కాళీమఠ్‌లో కాళీ ఉపాసకులకు మంత్రసిద్ధి కలుగుతుందనే నమ్మకంతో సాధువులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఇక్కడ మహాకాళి, మహాలక్ష్మి మందిరాలూ, భైరవుడి ఆలయమూ ఉన్నాయి. ప్రయాణమంతా దట్టమైన అడవుల మధ్య కాలిబాటనే సాగింది. మధ్యలో వచ్చే గ్రామాలదగ్గర మెట్ల సేద్యం కనిపిస్తుంటుంది. మిగిలిన ప్రాంతమంతా అడవే. ఈ అడవిలో చిరుతపులుల సంచారం ఎక్కువని స్థానికులు చెప్పారు. చుట్టూ ఉన్న పచ్చని ప్రకృతి ఎంత ఆహ్లాదకరంగా అనిపించినా ప్రయాణం మాత్రం కష్టమే. పొద్దున ఏడింటికి బయలుదేరిన మాకు గుర్రాలమీద మధ్యమహేశ్వర్‌కి చేరేసరికి సాయంత్రం ఐదు గంటలు అయింది.
సముద్రమట్టానికి సుమారు 3,497 మీటర్ల ఎత్తులో చుట్టూ మంచుతో కప్పబడ్డ హిమాలయాల నడుమ పచ్చని తివాచీ పరిచినట్లున్న పచ్చికలోయలో ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి హడావుడీ ఆర్భాటమూ లేకుండా కనిపిస్తుంది మహేశ్వర్‌ మందిర్‌. అక్కడ రూములు కూడా చాలా సాధారణంగానే ఉంటాయి. అక్కడే ఫ్రెష్‌ అయి దర్శనానికి వెళ్లాం. ఆ సమయంలో సాయంత్రం హారతి ఇస్తున్నారు. గుడిలో మేమూ పూజారిగారూ తప్ప ఎవరూ లేరు. ఓ పక్కగా సన్నని సెలయేరులా ప్రవహిస్తున్న మధ్యమహేశ్వర్‌ గంగ ఒడ్డున పూజలు అందుకుంటోన్న నాభి ఆకారంలోని శివలింగాన్ని చూడగానే ప్రశాంతంగా అనిపించింది. గర్భగుడికి కుడివైపున పాలరాతి జ్ఞానసరస్వతి విగ్రహం ఉన్న మందిరమూ, బయటఉన్న చిన్న మందిరాల్లో పార్వతీదేవి, అర్ధనారీశ్వరుల విగ్రహాలూ ఉన్నాయి. ఈ ప్రాంతం ఏడాదిలో ఆరునెలలకాలం మంచుతో కప్పబడిఉంటుంది. ఆ సమయంలో ఉత్సవమూర్తులను ఉఖీమఠ్‌లో ఉంచి పూజాకార్యక్రమాలు నిర్వహిస్తారు.
బుడా మహేశ్వర్‌!
మందిరంలోనుంచి బయటకు వచ్చిన మాకు ఓ పక్కగా ఉన్న టెంట్‌లోనే హోటల్‌ను నడుపుతోన్న దాని యజమాని రొట్టెలు తిని రూములోకి వెళ్లమన్నాడు. మరో అరగంటలో అతను హోటల్‌ మూసేస్తాడట. చలి బాగా పెరగడంతో మేం రాత్రి భోజనాలు కానిచ్చుకుని విశ్రమించాం. మర్నాడు ఉదయాన్నే మధ్య మహేశ్వరుడి హారతి చూసుకుని కొండ పై ఉన్న బుడా మహేశ్వర్‌ని దర్శించుకునేందుకు కాలినడకన బయలుదేరాం. కిందనుంచి బుడామహేశ్వర్‌కి రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది. గుర్రాలు అంత పైకి ఎక్కవని చెప్పారు. మాక్కూడా వూపిరి పీల్చుకోవడం కష్టమైంది. అంత చల్లని వాతావరణంలోనూ చెమటలు పట్టాయి. కానీ పైకి చేరాక అక్కడి ప్రకృతి అందాలు మమ్మల్ని మరో లోకంలో విహరింపజేశాయి. అక్కడ ఓ చిన్నమందిరం, అందులో ఓ శివలింగం ఉన్నాయి. దాన్నే బుడా మహేశ్వర్‌ అంటారు. ప్రతిరోజూ ముందుగా బుడా మహేశ్వర్‌కి పూజలు చేశాకే మధ్య మహేశ్వరుడికి పూజలు నిర్వహిస్తారు. అక్కడ నుంచి చూస్తే చుట్టూ తెల్లని మంచుతో కప్పబడ్డ చౌఖంబా, కేదార్‌నాథ్‌, నీలకంఠ, త్రిశూల్‌, కామెట్‌, పంచోలి పర్వతశిఖరాల మధ్య స్వచ్ఛమైన జలాలతో ఉన్న సరస్సు కనువిందు చేస్తుంది. పర్వతాల్లో వర్షాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ యాత్ర సెప్టెంబరు, అక్టోబరులో పెట్టుకుంటే మంచిది. ప్రతి ఏడాదీ కేదార్‌నాథ్‌ మందిరం తెరిచిన పదిహేను రోజులకి దీన్ని తెరుస్తారు. కేదార్‌నాథ్‌ మూయడానికి ముందే దీన్ని మూసేస్తారు. ఈ మందిరంలో కర్ణాటకకు చెందిన లింగాయత శైవులు పూజారులుగా ఉంటున్నారు.
కేదార్‌నాథ్‌, తుంగనాథ్‌, రుద్రనాథ్‌, మధ్యమహేశ్వర్‌, కపాలేశ్వర్‌లను పంచ కేదారాలు అని అంటారు. ఈ ఐదింటినీ అదే వరసలో దర్శించుకోవాలి అని చెబుతారు.ఈ పంచ కేదార మందిరాల్నీ పాండవులే నిర్మించి శివుణ్ని పూజించి ఆయన అనుగ్రహాన్ని పొందారని చెబుతారు. అందుకే ఇవన్నీ ఒకేలా ఉంటాయి. ఈ మందిరం కూడా కేదార్‌నాథ్‌ మందిర ట్రస్ట్‌ వారి ఆధ్వర్యంలోనే నడుస్తోంది. మేం అక్కడ నుంచి కిందకి వచ్చి పది గంటలకల్లా తిరుగు ప్రయాణమయ్యాం.

Monday, 5 September 2016

మంచుకొండల్లో మహేశ్వరుడు..!

మంచుకొండల్లో మహేశ్వరుడు..!

ప్రయాణం కష్టమైనప్పటికీ ఉత్తరాఖండ్లోని మంచుకొండల మధ్యలో 11,473 అడుగుల ఎత్తులోని మధ్యమహేశ్వర్ను చూడాలనుకున్నాం. రుషికేశ్కు 227 కిలోమీటర్ల దూరంలో ఉందీ శైవక్షేత్రం. ఉఖీమఠ్ నుంచి సుమారు 31 కిలోమీటర్ల దూరం మట్టిరోడ్డుమీద ప్రయాణించి రాన్సీ గ్రామం చేరుకున్నాం. ఈ రోడ్డు చిన్న వాహనాలు ప్రయాణించేందుకు మాత్రమే అనుకూలం. రాత్రికి రాన్సీ గ్రామంలోనే బసచేశాం. పొద్దున్నే గుర్రాలమీద బయలుదేరాం. రాన్సీ నుంచి మధ్యమహేశ్వర్కు 14 కిలోమీటర్లు. కాలినడకన లేదా గుర్రాలమీదగానీ వెళ్లాలి.

అక్కడ యాత్రికులు తక్కువ!
ఈ దారిలో గౌదర్ అనే గ్రామం వస్తుంది. ఇక్కడే మహేశ్వర్ గంగ, మార్త్యాండ గంగలు సంగమిస్తాయి. ఇక్కడ యాత్రికులకు కావలసిన భోజన, నివాస సౌకర్యాలు ఉన్నాయి. గౌదర్లో భోజనం చేసి కాసేపు విశ్రమించాం. ఈ దారిలోనే ఉన్న మరో గ్రామం కాళీమఠ్. దీన్నే సిద్ధపీఠం అంటారు. కాళీమఠ్లో కాళీ ఉపాసకులకు మంత్రసిద్ధి కలుగుతుందనే నమ్మకంతో సాధువులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఇక్కడ మహాకాళి, మహాలక్ష్మి మందిరాలూ, భైరవుడి ఆలయమూ ఉన్నాయి. ప్రయాణమంతా దట్టమైన అడవుల మధ్య కాలిబాటనే సాగింది. మధ్యలో వచ్చే గ్రామాలదగ్గర మెట్ల సేద్యం కనిపిస్తుంటుంది. మిగిలిన ప్రాంతమంతా అడవే. ఈ అడవిలో చిరుతపులుల సంచారం ఎక్కువని స్థానికులు చెప్పారు. చుట్టూ ఉన్న పచ్చని ప్రకృతి ఎంత ఆహ్లాదకరంగా అనిపించినా ప్రయాణం మాత్రం కష్టమే. పొద్దున ఏడింటికి బయలుదేరిన మాకు గుర్రాలమీద మధ్యమహేశ్వర్కి చేరేసరికి సాయంత్రం ఐదు గంటలు అయింది.

సముద్రమట్టానికి సుమారు 3,497 మీటర్ల ఎత్తులో చుట్టూ మంచుతో కప్పబడ్డ హిమాలయాల నడుమ పచ్చని తివాచీ పరిచినట్లున్న పచ్చికలోయలో ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి హడావుడీ ఆర్భాటమూ లేకుండా కనిపిస్తుంది మహేశ్వర్ మందిర్. అక్కడ రూములు కూడా చాలా సాధారణంగానే ఉంటాయి. అక్కడే ఫ్రెష్ అయి దర్శనానికి వెళ్లాం. ఆ సమయంలో సాయంత్రం హారతి ఇస్తున్నారు. గుడిలో మేమూ పూజారిగారూ తప్ప ఎవరూ లేరు. ఓ పక్కగా సన్నని సెలయేరులా ప్రవహిస్తున్న మధ్యమహేశ్వర్ గంగ ఒడ్డున పూజలు అందుకుంటోన్న నాభి ఆకారంలోని శివలింగాన్ని చూడగానే ప్రశాంతంగా అనిపించింది. గర్భగుడికి కుడివైపున పాలరాతి జ్ఞానసరస్వతి విగ్రహం ఉన్న మందిరమూ, బయటఉన్న చిన్న మందిరాల్లో పార్వతీదేవి, అర్ధనారీశ్వరుల విగ్రహాలూ ఉన్నాయి. ఈ ప్రాంతం ఏడాదిలో ఆరునెలలకాలం మంచుతో కప్పబడిఉంటుంది. ఆ సమయంలో ఉత్సవమూర్తులను ఉఖీమఠ్లో ఉంచి పూజాకార్యక్రమాలు నిర్వహిస్తారు.

బుడా మహేశ్వర్!
మందిరంలోనుంచి బయటకు వచ్చిన మాకు ఓ పక్కగా ఉన్న టెంట్లోనే హోటల్ను నడుపుతోన్న దాని యజమాని రొట్టెలు తిని రూములోకి వెళ్లమన్నాడు. మరో అరగంటలో అతను హోటల్ మూసేస్తాడట. చలి బాగా పెరగడంతో మేం రాత్రి భోజనాలు కానిచ్చుకుని విశ్రమించాం. మర్నాడు ఉదయాన్నే మధ్య మహేశ్వరుడి హారతి చూసుకుని కొండపై ఉన్న బుడా మహేశ్వర్ని దర్శించుకునేందుకు కాలినడకన బయలుదేరాం. కిందనుంచి బుడామహేశ్వర్కి రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది. గుర్రాలు అంత పైకి ఎక్కవని చెప్పారు. మాక్కూడా వూపిరి పీల్చుకోవడం కష్టమైంది. అంత చల్లని వాతావరణంలోనూ చెమటలు పట్టాయి. కానీ పైకి చేరాక అక్కడి ప్రకృతి అందాలు మమ్మల్ని మరో లోకంలో విహరింపజేశాయి. అక్కడ ఓ చిన్నమందిరం, అందులో ఓ శివలింగం ఉన్నాయి. దాన్నే బుడా మహేశ్వర్ అంటారు. ప్రతిరోజూ ముందుగా బుడా మహేశ్వర్కి పూజలు చేశాకే మధ్య మహేశ్వరుడికి పూజలు నిర్వహిస్తారు. అక్కడ నుంచి చూస్తే చుట్టూ తెల్లని మంచుతో కప్పబడ్డ చౌఖంబా, కేదార్నాథ్, నీలకంఠ, త్రిశూల్, కామెట్, పంచోలి పర్వతశిఖరాల మధ్య స్వచ్ఛమైన జలాలతో ఉన్న సరస్సు కనువిందు చేస్తుంది. పర్వతాల్లో వర్షాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ యాత్ర సెప్టెంబరు, అక్టోబరులో పెట్టుకుంటే మంచిది. ప్రతి ఏడాదీ కేదార్నాథ్ మందిరం తెరిచిన పదిహేను రోజులకి దీన్ని తెరుస్తారు. కేదార్నాథ్ మూయడానికి ముందే దీన్ని మూసేస్తారు. ఈ మందిరంలో కర్ణాటకకు చెందిన లింగాయత శైవులు పూజారులుగా ఉంటున్నారు.

కేదార్నాథ్, తుంగనాథ్, రుద్రనాథ్, మధ్యమహేశ్వర్, కపాలేశ్వర్లను పంచ కేదారాలు అని అంటారు. ఈ ఐదింటినీ అదే వరసలో దర్శించుకోవాలి అని చెబుతారు.ఈ పంచ కేదార మందిరాల్నీ పాండవులే నిర్మించి శివుణ్ని పూజించి ఆయన అనుగ్రహాన్ని పొందారని చెబుతారు. అందుకే ఇవన్నీ ఒకేలా ఉంటాయి. ఈ మందిరం కూడా కేదార్నాథ్ మందిర ట్రస్ట్ వారి ఆధ్వర్యంలోనే నడుస్తోంది. మేం అక్కడ నుంచి కిందకి వచ్చి పది గంటలకల్లా తిరుగు ప్రయాణమయ్యాం.

బృహదీశ్వరాలయం B

అణువణువూ అద్భుతం బృహదీశ్వరాలయం ‘‘గుడులూ గోపురాలకు పేరొందిన తమిళనాడు రాష్ట్రాన్ని సందర్శించాలనుకునే వాళ్లకు ముందుగా గుర్తొచ్చేది తంజావూరు...