Showing posts with label హర్యానా. Show all posts
Showing posts with label హర్యానా. Show all posts

Saturday, 10 June 2017

కురుక్షేత్రం - భరతజాతికి ధర్మక్షేత్రం

కురుక్షేత్రం అనే పేరు వినగానే మహాభారత యుద్ధం కనులముందు కదలాడుతుంది. భీష్మద్రోణ కృపాచార్యులూ, కురు పాండవులూ సల్పిన ఘోరయుద్ధ దృశ్యాలు బొమ్మకడతాయి.
అటువంటిది మనం నేరుగా కురుక్షేత్రానికి వెళ్లి, అలనాడు అక్కడ జరిగిన యుద్ధం తాలూకు ఆనవాళ్లను చూస్తే?
శ్రీ కృష్ణుడి పాదధూళితో పవిత్రమైన ఆ నేలపై నడయాడుతూ, ఆ కట్టడాలను చూస్తూ ఒళ్లు గగుర్పొడిచే ఆ సన్నివేశాలను గుర్తుకు తెచ్చుకున్న తర్వాత దగ్గరలోనే గల బ్రహ్మసరోవరంలో స్నానం చేసి వస్తే?
ఓహ్‌! ఊహించడానికే ఎంతో అద్భుతంగా ఉంది కదా!
ఆ అద్భుతమైన అనుభూతిని సొంతం చేసుకోవాలంటే మనం హరియాణా రాష్ట్రానికి వెళ్ల వలసిందే!

స్థలపురాణం:
కురుక్షేత్రానికే ధర్మక్షేత్రమని పేరు. కేవలం ఇక్కడ మహాభారత యుద్ధం జరగడం వల్లే ఈ ప్రదేశం ప్రసిద్ధ పర్యాటక స్థలమో, పుణ్యస్థలమో కాలేదు. వామన పురాణం ప్రకారం కురువంశానికి మూలపురుషుడైన కురు అనే రాజు సరస్వతీ నది ఒడ్డున గల సుందర, ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చుని అష్టాంగమార్గాల ద్వారా భగవంతుని మెప్పించాడు. ఆ రాజు తపస్సుకు, భక్తి శ్రద్ధలకు మెచ్చిన భగవంతుడు అతనికి రెండువరాలనిచ్చాడు. అవేమంటే... అతని పేరుమీదుగా ఆ స్థలానికి కురుక్షేత్రం అనే పేరు వస్తుందని, పరమ పవిత్రమైన ఆ ప్రదేశంలో మరణించిన వారికి స్వర్గార్హత లభిస్తుందనీ... అందుకే ఈ ప్రదేశానికి కురుక్షేత్రమనే పేరు వచ్చింది.

తెల్లవారి పాలనలో ఇదంతా మరుగున పడిపోయింది. స్వాతంత్య్రం సంపాదించిన తర్వాత పురావస్తు శాఖ వారు చేసిన పరిశోధనలలో ఈ విషయాలన్నీ బయట పడ్డాయి. అందుకే కురుక్షేత్రమనే పేరును తిరిగి పెట్టారు. యుద్ధారంభానికి ముందే గురువులు, సహాధ్యాయులు, మిత్రులు, బంధువులు, రక్తసంబంధీకులను చూసిన అర్జునుడు వీరిని చంపడానికా నేను యుద్ధం చేయడం... అని నిర్వేదం చెందడంతో శ్రీకృష్ణుడు యుద్ధం ఎందుకు చేయాలో, యుద్ధాన్ని ఎలా చూడాలో వివరిస్తూ చేసిన బోధే భగవద్గీత. ఆ బోధ ఇక్కడే జరిగింది. కొన్ని తరాలకు.. కాదు కాదు.. కొన్ని యుగాలపాటు మానవ వికాసానికి తరగని నిధిని అందించింది. అందుకోసమైనా కురుక్షేత్రాన్ని సందర్శించి తీరాలి. తరతరాలుగా ప్రాచీన చారిత్రక, పౌరాణిక, హిందూ సాంస్కృతిక వైభవాలను కలిగి ఉన్న యాత్ర కురుక్షేత్రం.

ప్రతి ఒక్క భారతీయుడూ తన జీవితకాలంలో తప్పక సందర్శించలసిన తీర్థస్థలి. గంగాసరస్వతీ నదులు పునీతం చేసిన నేల ఇది. 360 పుణ్యక్షేత్రాలున్న పరమ పవిత్రమైన మహాభారత సంగ్రామ స్థలి ఇది. యుద్ధమంటే మామూలు యుద్ధమా అది... పద్ధెనిమిది అక్షౌహిణుల సైన్యం తాలూకు రక్తంతో తడిసిన రుధిర భూమి. 1947కు ముందు ఈ ప్రాంతాన్ని స్థానేశ్వరం అని పిలిచేవారు. ఇక్కడ కొలువైన స్థానేశ్వరుడనే మహాశివుడి ఆలయం పేరుమీదుగా ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది. ఆ తర్వాత మాత్రమే భారతప్రభుత్వం దీనికి కురుక్షేత్రం అనే పేరును నిర్ణయించింది. కురుక్షేత్రంలోనే అమిన్‌ అనే ప్రాంతం ఉంది. ఇక్కడే అభిమన్యుడు పద్మవ్యూహాన్ని ఛేదించినట్లు చెబుతారు.

కురుక్షేత్రంలోని దర్శనీయ స్థలాల్లో ముఖ్యమైనది బ్రహ్మసరోవరం. ఈ సరస్సులో స్నానం చేస్తే సమస్తపాపాలు పోతాయని పురాణోక్తి. ఇక్కడ కుంభమేళా సమయంలోనూ , గ్రహణ సమయాల్లోనూ యాత్రీకుల రద్ధీ అధికంగా కనిపిస్తుంది. స్థానిక ‘ సన్నిహిత, వనగంగ’ సరస్సులను కూడా అక్కడి ప్రజలు పరమ పవిత్రంగా భావిస్తారు. ఇక్కడి ‘.జ్యోతిసార’ అనే ప్రదేశంలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి గీతోపదేశం చేసినట్టు చెబుతారు. ఇక్కడ ఉండే ఒక పెద్ద మర్రిచెట్టు పర్యాటకులను బాగా ఆకర్షిస్తుంది. బ్రహ్మదేవుడు సృష్టిని ఇక్కడినుంచే ఆరంభించాడని ప్రతీతి. అందుకే ఇక్కడికి చేరువలోని సరోవరానికి బ్రహ్మసరోవరమని పేరు.

ఎలా వెళ్లాలంటే...?
ఢిల్లీ నుంచి సుమారు 160 కిలోమీటర్లు, చండీగఢ్‌ నుంచి 80 కిలోమీటర్లు ఉన్న ఈ యాత్రాస్థలికి అన్ని రకాల వాహన సౌకర్యాలూ ఉన్నాయి. ఢిల్లీ సెంట్రల్‌ బస్‌ టర్మినల్‌ నుంచి చండీగఢ్‌కు వెళ్లే బస్సుల్లో మనం ఇక్కడికి చేరుకోవచ్చు.

– DVR. భాస్కర్‌

Tuesday, 22 March 2016

మనసు పరిమళించే సుందర ప్రదేశం "కురుక్షేత్ర"

కురుక్షేత్ర అంటే మనం అందరం అనుకునే మహాభారత యుద్ధం జరిగిన స్థలంగా కాకుండా... అనేక యుగాలకు ముందు పరిపాలించిన "కురు" అనే చక్రవర్తికి జ్ఞాపకంగా ఏర్పడిన ప్రాంతమని అక్కడి స్థల పురాణం చెబుతుంది. ఈ ప్రదేశం హర్యానా రాష్ట్రంలో కురుక్షేత్ర జిల్లాలోని పట్టణము. కురుక్షేత్ర అనగా కురు వంశీయుల భూమి.

కురుక్షేత్రలో అద్భుతమైన ఆలయాలుగానీ, కట్టడాలు ఉండవుగానీ... "బ్రహ్మ సరోవరం" అనే ఓ కొలను ఉంటుంది. పూర్వం చాలా పెద్దదిగా ఉండే ఈ బ్రహ్మ సరోవరాన్ని.. ఇటీవలి కాలంలో పునర్నిర్మించారు. ప్రస్తుతం దీని పొడవు 1170 మీటర్లు, వెడల్పు 546 మీటర్లు. గ్రహణం సమయంలో ఈ సరస్సులో స్నానం చేయడం చాలా పుణ్యమని చెబుతుంటారు. అందువల్ల ఉత్తర దేశంలోని చాలా ప్రాంతాల నుంచి గ్రహణం రోజుల్లో కొన్ని లక్షలమంది కురుక్షేత్రను దర్శిస్తుంటారు.

బ్రహ్మ సరోవరం ఒడ్డునే రోడ్డుకు రెండో వైపున లక్ష్మీనారాయణుని పురాతన ఆలయం ఉంది. ఈ రోడ్డుకు ఆనుకునే ఈ మధ్య నిర్మించిన చిన్న, పెద్ద ఆలయాలు చాలానే ఉంటాయి. ఊరినుండి దూరంగా ఓ వైపున ఇటీవలనే నిర్మించిన చిన్న ఆలయం, దానికి ఆనుకుని ఓ పెద్ద దిగుడుబావి లాంటి చిన్నకొలను ఉంటాయి.

ఈ ఆలయంలోనే భీష్ముడు అంపశయ్యమీద పడుకున్న దృశ్యం ఉంటుంది. ఆ పక్కనే ఉండే కొలనులో నుండే అర్జునుడు వేసి బాణం ద్వారా పాతాళగంగ పైకి వచ్చినట్లు పూర్వీకుల కథనం. అలాగే ఊరికి మరోవైపున "జ్యోతి సర్" అనే కొలను ఉంది. దీని ఒడ్డునే శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేసినట్లు స్థలపురాణం.

ఇక బ్రహ్మ సరోవరం ఒడ్డునే ఉండే రోడ్డుకు రెండో వైపున బిర్లా ధర్మశాల, జాట్ ధర్మశాలలు ఉన్నాయి. అయితే కురుక్షేత్ర అనే ఊరు మన హైదరాబాద్, సికింద్రాబాద్ లాగానే కురుక్షేత్ర, తానేశ్వర్ అని రెండు భాగాలుగా ఉంటుంది. "స్థానీశ్వరుడు" అనే పేరుగల దేవుడి ఆలయం ఇక్కడ ఉన్న కారణంగా ఆ ఊరికి స్థానీశ్వర్ అనే పేరు ఏర్పడి.. కాల క్రమంలో తానేశ్వర్ అయింది. తానేశ్వర్‌లో స్థానీశ్వరాలయం, భద్రకాళి ఆలయం అనే పురాతమైన ఆలయాలు కూడా ఉన్నాయి.

ఎలా వెళ్ళాలంటే... న్యూఢిల్లీ నుంచి ఉత్తరంగా చండీగఢ్, జమ్మూల వైపు వెళ్లే రైలు మార్గంలో కురుక్షేత్ర ఉంటుంది. ఢిల్లీ నుంచి 165 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతానికి చేరుకోవాలంటే... సుమారుగా నాలుగన్నర గంటల రైలు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అలాగే... ఢిల్లీ నుంచి ప్రతి అరగంటకూ బస్సులు ఉన్నాయి.

బృహదీశ్వరాలయం B

అణువణువూ అద్భుతం బృహదీశ్వరాలయం ‘‘గుడులూ గోపురాలకు పేరొందిన తమిళనాడు రాష్ట్రాన్ని సందర్శించాలనుకునే వాళ్లకు ముందుగా గుర్తొచ్చేది తంజావూరు...