Wednesday, 14 June 2017

మున్నార్‌ సోయగాలు

మైమరిపించే మున్నార్‌ సోయగాలు



వేసవిలో ప్రకృతి అందాల మధ్య సేదతీరాలంటే కేరళలోని మున్నార్‌ వెళ్లాల్సిందే. జలపాతాలు, లోయలు, తేయాకు తోటల అందాలతో మున్నార్‌ స్వర్గలోకాన్ని తలపిస్తుంది. నాలుగు రోజులు టూర్‌ ప్లాన్‌ చేసుకుంటే మున్నార్‌ చుట్టుపక్కల ముఖ్యమైన ప్రదేశాలన్నీ చుట్టేసి రావచ్చు. ఆ విశేషాలు ఇవి...

అట్టుకల్‌ వాటర్‌ఫాల్స్‌
ప్రకృతి సృష్టి ఎంత అందంగా ఉంటుందో చూడాలంటే ఇక్కడికి వెళ్లాల్సిందే. దట్టమైన అడవి, ఎత్తైన కొండల మధ్య నుంచి జాలువారే జలపాతం ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక్కడికి వెళ్లే దారి ఇరుకుగా ఉంటుంది. నైపుణ్యం ఉన్న డ్రైవర్లు మాత్రమే వాహనం నడిపించాలి.

దేవికుళం
మున్నార్‌ సమీపంలో ఉండే హిల్‌స్టేషన్‌ ఇది. అందమైన లోయలు, ఎత్తైన పర్వతాలతో దేవికుళం మనోహరంగా ఉంటుంది. మండు వేసవిలోనూ చల్లటిగాలి మిమ్మల్ని పరవశింప చేస్తుంది. మరిచిపోలేని ట్రెక్కింగ్‌ అనుభూతిని సొంతం చేసుకోవచ్చు.

మత్తుపెట్టి ఇండో స్విస్‌ ఫామ్‌
మున్నార్‌ సమీపంలో ఉండే మత్తుపెట్టి డ్యామ్‌ పాపులర్‌ పిక్నిక్‌ స్పాట్‌. డ్యామ్‌లో బోట్‌ రైడ్‌ చేయొచ్చు. ఇక్కడ అధిక దిగుబడిని అందించే రకరకాల పశువులను బ్రీడింగ్‌ చేస్తుంటారు. పర్యాటకులను మూడు షెడ్ల వరకు మాత్రమే సందర్శించడానికి అనుమతిస్తారు. డ్యామ్‌లో బోటింగ్‌ చేయడానికి ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5:30 వరకు అనుమతి ఉంటుంది. ఫామ్‌ను సందర్శించడానికి ఉదయం 9 నుంచి 11 వరకూ, మధ్యాహ్నం 2 నుంచి 3:30 వరకు అనుమతిస్తారు. బోటింగ్‌ ఫీజు రూ.300. పావుగంట నదిలో విహరించొచ్చు. ఫామ్‌ ఎంట్రీ ఫీజు రూ.5.

ఫొటో పాయింట్‌
మున్నార్‌ వెళ్లిన వారు తప్పక సందర్శించాల్సిన స్పాట్‌ ఇది. ఇక్కడి నుంచి తేయాకు తోటల అందాలు, సిల్వర్‌ ఓక్‌ ట్రీల సోయగాలు కనువిందు చేస్తాయి. చిన్న చిన్న కొండలు, చిన్న సరస్సులు నయనానందకరంగా ఉంటాయి. కెమెరాలకు పని చెప్పడానికి అనువైన ప్రదేశం ఇది. అందుకే ఈ ప్రదేశానికి ఫొటో పాయింట్‌ అని పేరు స్థిరపడింది.

పోతమేడు
మున్నార్‌కు 6కి.మీ దూరంలో ఉంటుంది. ఇక్కడి నుంచి చూస్తే టీ, కాఫీ తోటల అందాలు, లోయలు మంత్రముగ్ధుల్ని చేస్తాయి. ప్రకృతి ప్రేమికులు, ట్రెక్కింగ్‌ చేసేవాళ్లు ఈ ప్రదేశాన్ని బాగా ఇష్టపడతారు. ఆకాశం నిర్మలంగా ఉంటే ఇక్కడికి 60 కి.మీ దూరంలోని ముత్తిరపుళ రివర్‌, ఇడుక్కి ఆర్క్‌ డ్యామ్‌ అందాలు కనిపిస్తాయి. ఫొటోగ్రఫీని ఇష్టపడే వారు దీన్ని తప్పక సందర్శించి తీరాల్సిందే.

ఎలా చేరుకోవాలి?
విమానంలో : మున్నార్‌లో ఎయిర్‌పోర్టు లేదు. సమీపంలో అంటే రోడ్డు మార్గంలో 110 కి.మీ దూరంలో కొచ్చిన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు ఉంది. కొచ్చిన్‌ నుంచి కారు తీసుకుని మున్నార్‌ చేరుకోవచ్చు. మదురై ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు 140 కి.మీ దూరంలో ఉంది. ఇక్కడి నుంచి క్యాబ్‌ లేక బస్సులో మున్నార్‌ చేరుకోవచ్చు.
బస్సులో: కేరళ, తమిళనాడులోని ముఖ్యమైన పట్ణణాలు, నగరాల నుంచి మున్నార్‌కు బస్సు సదుపాయాలున్నాయి.
రైలులో : మున్నార్‌కు 110 కి.మీ దూరంలో అళువా రైల్వేస్టేషన్‌ ఉంది. ఎర్నాకుళం రైల్వేస్టేషన్‌, మదురై రైల్వేస్టేషన్‌ 130 కి.మీ దూరంలో ఉన్నాయి. రైలులో ఇక్కడి వరకు చేరుకుంటే క్యాబ్‌లో లేదంటే బస్సులో మున్నార్‌ చేరుకోవచ్చు. 


వసతి : మున్నార్‌లో బస చేయడానికి రిసార్టులు, హోటల్స్‌ అందుబాటులో ఉన్నాయి. బడ్జెట్‌ను బట్టి ఎంచుకోవచ్చు.

విశేషాలు...

  • సముద్ర మట్టానికి 1600 నుంచి 1800 మీటర్ల ఎత్తులో ఉంటుంది.
  • ఆగస్టు నుంచి మే వరకు సందర్శించడానికి అనువైన సమయం.
  • ఉష్ణోగ్రతలు 0 నుంచి 25 డిగ్రీల వరకు ఉంటాయి.
  • మున్నార్‌లో ఏటా ఉత్పత్తి అయ్యే తేయాకు 50 వేల మెట్రిక్‌ టన్నులు(5 కోట్ల కేజీలు) ఉంటుంది.

Saturday, 10 June 2017

గురువాయూర్‌ ఆలయం - మహిమాన్వితం.. మనోహరం

ప్రకృతి అందాలకు, ఆయుర్వేద పంచకర్మ చికిత్సకు, అనేకమైన అపురూపమైన ఆలయాలకు నెలవు కేరళ. అటువంటి కేరళలో స్వర్గ మర్త్య పాతాళలోకాలూ కలసిన భూలోక వైకుంఠం గురువాయూర్‌. అసలు ఈ పేరు వినగానే శంఖచక్ర గదా పద్మాలతో కూడి, విష్ణు స్వరూపుడైన శ్రీకృష్ణ భగవానుడి దివ్యమంగళ స్వరూపం కనుల ముందు కదలాడుతుంది. దేవతల గురువైన బృహస్పతి అంటే గురువు, వాయుదేవుడు కలిసి పరశురాముడి సాయంతో సముద్రగర్భంలోకి చేరకుండా కాపాడిన శ్రీకృష్ణుని విగ్రహాన్ని ప్రతిష్ఠించిన దివ్యస్థలి ఇది. అంతకుముందు వరకు రుద్రతీర్థం అనే పేరుతో విలసిల్లిన ఈ క్షేత్రానికి వారి పేరు మీదుగానే గురువాయూరు అనే పేరొచ్చింది.

ఆలయంలోకి అడుగుపెట్టగానే ఒక చేత శంఖం మరో చేత చక్రం మరో రెండు చేతులలోనూ గదాపద్మాలను, మెడలో తులసి మాలను ధరించిన స్వామి విగ్రహం చూడటానికి రెండు కన్నులూ చాలవేమో అన్నంత నయన మనోహరంగా ఉంటుంది. మీ మనసులోని భావాలన్నీ నాకు తెలుసు, మీరు కోరకుండానే నేనే తీరుస్తానుగా మీ కోర్కెలను అన్నట్లు చిరునవ్వులు చిందిస్తూ ఉన్న ఆ సుందర స్వరూపాన్ని చూడగానే పాపాలన్నీ ప్రక్షాళన అవుతాయి.

అన్నట్లు ఐదువేల సంవత్సరాల చరిత్ర గల ఈ విగ్రహం తక్కిన అన్ని విగ్రహాలలాగా రాతితో లేదా పంచలోహాలతో తయారైనది కాదు. పాతాళాంజనమనే విశిష్టమైన వనమూలికలతో రూపొందించినది. ఇక్కడ పరిణయమాడితే జీవితమంతా పరిమళభరితమే అనే విశ్వాసంతో భక్తులు ఎంతో వ్యయప్రయాసలకోర్చి మరీ ఈ ఆలయ ప్రాంగణంలో పెళ్లి చేసుకోవడానికి ఉవ్విళ్లూరతారు. నామకరణాలు, అన్నప్రాశనలు, అక్షరాభ్యాసాలు, ఉపనయనాల వంటి శుభకార్యాలన్నీ ఇక్కడ నిత్యం జరుగుతూనే ఉంటాయి.

ఆపదలు, గండాలు, దీర్ఘవ్యాధులు తొలగాలని స్వామికి మొక్కుకుని, ఆయా ఆపదలన్నీ హారతి కర్పూరంలా కరిగిపోగానే తమ బరువుకు సరిపడా బంగారం, వెండి, రూపాయి కాసులు, ఆకుకూరలు, కూరగాయలు, వెన్న, పటికబెల్లం... ఇలా ఒకటేమిటి, తమ స్తోమతకు తగ్గట్టుగా తులాభారం తూగుతూ కనిపిస్తారు. కొందరు భక్తులు స్వామివారికి అమూల్యమైన ఆభరణాలనూ సమర్పిస్తుంటారు. ఆయా ఆభరణాలను భద్రపరచేందుకు ఒక ప్రత్యేకమైన గది ఉంది. ఆ గదిని అనునిత్యం అంటిపెట్టుకుని పంచనాగులనే పేరుగల ఐదుసర్పాలు సంరక్షిస్తుంటాయి.

సంగీత, నృత్య కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఆలయానికి చేరువలో రుద్రతీర్థమనే పేరుగల పెద్ద కోనేరు ఉంది. స్వామికి ఈ కోనేటి నీటితోనే నిత్యం అభిషేకం చేస్తారు అర్చకులు. ఏకాదశి, రోహిణీ నక్షత్ర వేడుకలు ఇక్కడ విశేషంగా జరుగుతుంటాయి. ఏనుగులకు ఈ ఆలయంలో ఎంతో ప్రత్యేకత, గౌరవాభిమానాలూ దక్కుతాయి. ఏనుగు పందేలు కూడా జరుగుతాయి. అవి అల్లాటప్పాగా కాదు.. ఎంతో భక్తిశ్రద్ధలతో, ఉల్లాసోత్సాహాలతో నిర్వహిస్తారు. ఇది చాలా మహిమాన్విత క్షేత్రం కాబట్టి ఆలయంలో మడీ తడీ శుచీ శుభ్రతలకు ప్రాముఖ్యతనిస్తారు.

చుట్టుపక్కల చూడ దగ్గ స్థలాలు:
మమ్మియూర్‌ మహాదేవ క్షేత్రం, ఎలిఫెంట్‌ క్యాంప్‌ శాంక్చువరీ, పున్నతూర్‌ కొట్ట, పార్థసారథి ఆలయం, వెంకటాచలపతి ఆలయం, చోవళూర్‌ శివాలయం, పళయూర్‌ చర్చ్, గురువాయూర్‌ దేవస్థాన దారుశిల్ప కళాసంస్థ, నవముకుందాలయం, చాముండేశ్వరి ఆలయం, హరికన్యక ఆలయం, నారాయణంకులాంగర ఆలయం మొదలైనవి.
– డి.వి.ఆర్‌. భాస్కర్‌

కురుక్షేత్రం - భరతజాతికి ధర్మక్షేత్రం

కురుక్షేత్రం అనే పేరు వినగానే మహాభారత యుద్ధం కనులముందు కదలాడుతుంది. భీష్మద్రోణ కృపాచార్యులూ, కురు పాండవులూ సల్పిన ఘోరయుద్ధ దృశ్యాలు బొమ్మకడతాయి.
అటువంటిది మనం నేరుగా కురుక్షేత్రానికి వెళ్లి, అలనాడు అక్కడ జరిగిన యుద్ధం తాలూకు ఆనవాళ్లను చూస్తే?
శ్రీ కృష్ణుడి పాదధూళితో పవిత్రమైన ఆ నేలపై నడయాడుతూ, ఆ కట్టడాలను చూస్తూ ఒళ్లు గగుర్పొడిచే ఆ సన్నివేశాలను గుర్తుకు తెచ్చుకున్న తర్వాత దగ్గరలోనే గల బ్రహ్మసరోవరంలో స్నానం చేసి వస్తే?
ఓహ్‌! ఊహించడానికే ఎంతో అద్భుతంగా ఉంది కదా!
ఆ అద్భుతమైన అనుభూతిని సొంతం చేసుకోవాలంటే మనం హరియాణా రాష్ట్రానికి వెళ్ల వలసిందే!

స్థలపురాణం:
కురుక్షేత్రానికే ధర్మక్షేత్రమని పేరు. కేవలం ఇక్కడ మహాభారత యుద్ధం జరగడం వల్లే ఈ ప్రదేశం ప్రసిద్ధ పర్యాటక స్థలమో, పుణ్యస్థలమో కాలేదు. వామన పురాణం ప్రకారం కురువంశానికి మూలపురుషుడైన కురు అనే రాజు సరస్వతీ నది ఒడ్డున గల సుందర, ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చుని అష్టాంగమార్గాల ద్వారా భగవంతుని మెప్పించాడు. ఆ రాజు తపస్సుకు, భక్తి శ్రద్ధలకు మెచ్చిన భగవంతుడు అతనికి రెండువరాలనిచ్చాడు. అవేమంటే... అతని పేరుమీదుగా ఆ స్థలానికి కురుక్షేత్రం అనే పేరు వస్తుందని, పరమ పవిత్రమైన ఆ ప్రదేశంలో మరణించిన వారికి స్వర్గార్హత లభిస్తుందనీ... అందుకే ఈ ప్రదేశానికి కురుక్షేత్రమనే పేరు వచ్చింది.

తెల్లవారి పాలనలో ఇదంతా మరుగున పడిపోయింది. స్వాతంత్య్రం సంపాదించిన తర్వాత పురావస్తు శాఖ వారు చేసిన పరిశోధనలలో ఈ విషయాలన్నీ బయట పడ్డాయి. అందుకే కురుక్షేత్రమనే పేరును తిరిగి పెట్టారు. యుద్ధారంభానికి ముందే గురువులు, సహాధ్యాయులు, మిత్రులు, బంధువులు, రక్తసంబంధీకులను చూసిన అర్జునుడు వీరిని చంపడానికా నేను యుద్ధం చేయడం... అని నిర్వేదం చెందడంతో శ్రీకృష్ణుడు యుద్ధం ఎందుకు చేయాలో, యుద్ధాన్ని ఎలా చూడాలో వివరిస్తూ చేసిన బోధే భగవద్గీత. ఆ బోధ ఇక్కడే జరిగింది. కొన్ని తరాలకు.. కాదు కాదు.. కొన్ని యుగాలపాటు మానవ వికాసానికి తరగని నిధిని అందించింది. అందుకోసమైనా కురుక్షేత్రాన్ని సందర్శించి తీరాలి. తరతరాలుగా ప్రాచీన చారిత్రక, పౌరాణిక, హిందూ సాంస్కృతిక వైభవాలను కలిగి ఉన్న యాత్ర కురుక్షేత్రం.

ప్రతి ఒక్క భారతీయుడూ తన జీవితకాలంలో తప్పక సందర్శించలసిన తీర్థస్థలి. గంగాసరస్వతీ నదులు పునీతం చేసిన నేల ఇది. 360 పుణ్యక్షేత్రాలున్న పరమ పవిత్రమైన మహాభారత సంగ్రామ స్థలి ఇది. యుద్ధమంటే మామూలు యుద్ధమా అది... పద్ధెనిమిది అక్షౌహిణుల సైన్యం తాలూకు రక్తంతో తడిసిన రుధిర భూమి. 1947కు ముందు ఈ ప్రాంతాన్ని స్థానేశ్వరం అని పిలిచేవారు. ఇక్కడ కొలువైన స్థానేశ్వరుడనే మహాశివుడి ఆలయం పేరుమీదుగా ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది. ఆ తర్వాత మాత్రమే భారతప్రభుత్వం దీనికి కురుక్షేత్రం అనే పేరును నిర్ణయించింది. కురుక్షేత్రంలోనే అమిన్‌ అనే ప్రాంతం ఉంది. ఇక్కడే అభిమన్యుడు పద్మవ్యూహాన్ని ఛేదించినట్లు చెబుతారు.

కురుక్షేత్రంలోని దర్శనీయ స్థలాల్లో ముఖ్యమైనది బ్రహ్మసరోవరం. ఈ సరస్సులో స్నానం చేస్తే సమస్తపాపాలు పోతాయని పురాణోక్తి. ఇక్కడ కుంభమేళా సమయంలోనూ , గ్రహణ సమయాల్లోనూ యాత్రీకుల రద్ధీ అధికంగా కనిపిస్తుంది. స్థానిక ‘ సన్నిహిత, వనగంగ’ సరస్సులను కూడా అక్కడి ప్రజలు పరమ పవిత్రంగా భావిస్తారు. ఇక్కడి ‘.జ్యోతిసార’ అనే ప్రదేశంలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి గీతోపదేశం చేసినట్టు చెబుతారు. ఇక్కడ ఉండే ఒక పెద్ద మర్రిచెట్టు పర్యాటకులను బాగా ఆకర్షిస్తుంది. బ్రహ్మదేవుడు సృష్టిని ఇక్కడినుంచే ఆరంభించాడని ప్రతీతి. అందుకే ఇక్కడికి చేరువలోని సరోవరానికి బ్రహ్మసరోవరమని పేరు.

ఎలా వెళ్లాలంటే...?
ఢిల్లీ నుంచి సుమారు 160 కిలోమీటర్లు, చండీగఢ్‌ నుంచి 80 కిలోమీటర్లు ఉన్న ఈ యాత్రాస్థలికి అన్ని రకాల వాహన సౌకర్యాలూ ఉన్నాయి. ఢిల్లీ సెంట్రల్‌ బస్‌ టర్మినల్‌ నుంచి చండీగఢ్‌కు వెళ్లే బస్సుల్లో మనం ఇక్కడికి చేరుకోవచ్చు.

– DVR. భాస్కర్‌

ఫిన్లాండ్‌

ఫిన్లాండ్‌ 100/100


అక్కడ ఏ పిల్లాడూ బడికెళ్లనని మారాం చేయడు. ఏ చిన్నారీ భుజాన పుస్తకాల సంచీతో ఆపసోపాలు పడుతూ కనిపించదు. యూనిఫాంలూ, హోం వర్కులూ, వార్షిక పరీక్షలూ, మార్కులూ, ర్యాంకుల బూచీలూ, రోజంతా సాగే స్కూళ్లూ, స్టడీ అవర్లూ, ట్యూషన్లూ... ఒక్కమాటలో చెప్పాలంటే విద్యార్థులకు కష్టం కలిగించే ఏ చిన్న విధానాన్నీ అనుసరించని ఏకైక దేశం ఫిన్లాండ్‌. అయితేనేం, ప్రపంచంలోని అత్యద్భుతమైన విద్యావ్యవస్థల్లో ఆ దేశానిది నిలకడగా తొలిస్థానమే. అక్కడ ప్రతి విద్యార్థీ తరగతిలో టాపరే! పిల్లల్ని స్కూలుకి పంపించేముందు తల్లిదండ్రులూ, పాఠాలు మొదలుపెట్టే ముందు టీచర్లూ... ఫిన్లాండ్‌ వాసులు అనుసరిస్తోన్న పద్ధతుల్ని ఓసారి స్మరించుకోవడం మహా ఉత్తమం.

పదిలోపు వంద ర్యాంకులు, వందలోపు వెయ్యి ర్యాంకులు, వెయ్యిలోపు పదివేల ర్యాంకులు... మే, జూన్‌ నెలల్లో ఏ టీవీ ఛానల్‌ పెట్టినా అదే పనిగా ఈ అంకెల దండోరా చెవుల్ని హోరెత్తిస్తుంది. ఏ పత్రిక తిరగేసినా స్కూళ్లూ, కాలేజీల ప్రకటనలతో నిండుంటాయి. మంచి మార్కులొచ్చిన పిల్లలే పోటీ ప్రపంచానికి మనుషుల్లా కనిపిస్తారు. టాప్‌ ర్యాంకు వచ్చిన వాళ్లనే సమాజం నెత్తిన పెట్టుకుంటుంది. సచిన్‌లా బ్యాటింగ్‌ చేసే శక్తి ఉన్నా, రెహమాన్‌లా పియానో వాయించేంత టాలెంట్‌ సొంతమైనా, తరగతిలో మార్కులు రాకపోతే మాత్రం ఆ పిల్లాడు ఎందుకూ పనికిరాని మొద్దావతారమే! అందుకే మనదేశంలో చాలామంది చిన్నారులు ఆ అంకెల వేటలో పడి అందమైన బాల్యాన్ని కోల్పోతున్నారు. ఓ పది మార్కులు తగ్గితేనే మహా పాపం చేసినట్టు ప్రాణాలు తీసుకుంటున్న వాళ్లూ ఉన్నారు. తల్లిదండ్రుల ఆరాటం, విద్యా సంస్థల ఒత్తిడీ కలగలిసి ఇక్కడ విద్యార్థుల పరిస్థితిని దయనీయంగా మార్చేస్తున్నాయి. ఉత్తమ విద్యావ్యవస్థల జాబితాలో నానాటికీ మన స్థానం దిగజారుతూ వస్తోంది.

సామ దాన భేద దండోపాయాలు ప్రయోగించినా మనలాంటి ఎన్నో దేశాలు సాధించలేని ఫలితాలను ప్రపంచంలో అత్యుత్తమ విద్యావ్యవస్థ కలిగిన దేశంగా పేరున్న ఫిన్లాండ్‌, ఆడుతూపాడుతూ అందుకుంటోంది. ఐరోపాలోని ఓ చిన్న దేశమైన ‘ఫిన్లాండ్‌’ విద్యార్థులపైన ఏ మాత్రం ఒత్తిడి పెట్టకుండానే వాళ్లను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దొచ్చని నిరూపిస్తోంది. పరీక్షలు, ర్యాంకుల ప్రస్తావన లేకుండానే వాళ్లను ఇంజినీర్లూ, డాక్టర్లూ, ఇతర వృత్తి నిపుణులుగా తయారు చేస్తోంది. అన్ని విషయాల్లో అభివృద్ధి చెందిన అమెరికా, ఇంగ్లండ్‌ లాంటి దేశాలకు కూడా, పిల్లల్ని చదివించే విషయంలో ఫిన్లాండ్‌ కొత్త పాఠాలు నేర్పిస్తోంది. ఏటా తన బోధనా పద్ధతుల్ని మార్చుకుంటూ, కొత్త ప్రమాణాల్ని అందుకుంటూ గత నలభై ఐదేళ్లలో అక్కడి విద్యావ్యవస్థ ఆకాశమే హద్దుగా దూసుకెళ్తొంది. మూడేళ్లకోసారి అంతర్జాతీయంగా విద్యార్థుల సామర్థ్యాన్ని పరీక్షించే ‘ప్రోగ్రామ్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ స్టూడెంట్‌ ఎసెస్‌మెంట్‌’(పిసా) లెక్కల్లో అమెరికా, జపాన్‌, చైనా లాంటి దిగ్గజాలను దాటి ఆ చిట్టి దేశానికి చెందిన పిల్లలు వరసగా తొలి స్థానాన్ని సాధిస్తున్నారు. ప్రతి విద్యార్థీ కలలుగనే తరగతి గదులూ, ప్రతి పాఠశాలా అనుసరించాల్సిన విధానాలూ, అందరు తల్లిదండ్రులూ పాటించాల్సిన నియమాలూ ఫిన్లాండ్‌ సొంతం.

ఏడేళ్లకు స్కూలు...
మన దేశంలో పిల్లలకు రెండేళ్లు దాటగానే తల్లిదండ్రులు స్కూళ్ల వేట మొదలుపెడతారు. బడిలో కాలు పెట్టకముందే అఆలూ, అంకెలూ బట్టీ కొట్టిస్తారు. కానీ ఫిన్లాండ్‌లో పిల్లలు స్కూల్లో అడుగుపెట్టాలంటే కనీసం ఏడేళ్లు నిండాల్సిందే. అప్పటివరకూ వాళ్లు పలకా బలపం, పుస్తకాలూ పెన్సిళ్లూ పట్టుకోరు. అలాగని నేర్చుకునే వయసునీ వృథా చేసుకోరు. డే కేర్‌ సెంటర్లలో ఉంటూ తమ మెదడుని పదును పెట్టుకునే పనిలో పడతారు. సాధారణంగా తొలి ఆరేళ్లలోనే పిల్లల మెదడు కణాలు 90శాతం విచ్చుకుంటాయి. దేన్నైనా త్వరగా గ్రహించే శక్తి పెరుగుతూ వస్తుంది. అన్ని దేశాల్లో ఆరేళ్లలోపు వయసులోనే పిల్లలకు లెక్కలు, సైన్స్‌ లాంటి అంశాలకు సంబంధించిన ప్రాథమిక విషయాలు బోధిస్తారు. ఫిన్లాండ్‌లో మాత్రం తొలి ఆరేళ్లలో పాఠాలకు బదులుగా, పిల్లల్లో నేర్చుకునే సామర్థ్యాన్ని పెంపొందించే ప్రయత్నం చేస్తారు. అందరితో కలిసి ఆడుకోవడం, పద్ధతిగా తినడం, నిద్రపోవడం, ఒకరికొకరు సహాయ పడటం, శుభ్రత పాటించడం, భావవ్యక్తీకరణ నైపుణ్యం, జాలీ, దయా, సామాజిక స్పృహ... ఇలాంటి అన్ని జీవన నైపుణ్యాలను అలవరచుకునేలా ప్రోత్సహిస్తారు. బడికి ఎప్పుడైనా వెళ్లొచ్చు, కానీ మంచి పౌరుడిగా ఎదగడానికి పునాది మాత్రం పసి వయసులోనే పడాలన్నది ఫిన్లాండ్‌ వాసుల నమ్మకం. అందుకే తొలి ఆరేళ్లను దానికోసమే కేటాయిస్తారు. ‘నేర్చుకోవాల్సిన వయసు వచ్చినప్పుడు పిల్లలు అన్నీ నేర్చుకుంటారు. తొందరపెట్టి వాళ్లలో ఒత్తిడి పెంచాల్సిన పనిలేద’ంటారు అక్కడి ఉపాధ్యాయులు.

చదువంతా ఉచితం
ఉన్నత విద్యావంతులే మంచి పౌరులుగా మారతారు. అలాంటి ప్రజలున్న దేశమే గొప్పదిగా ఎదుగుతుందన్నది ఫిన్లాండ్‌ నమ్మిన సిద్ధాంతం. అందుకే ఆ దేశంలో పుట్టిన ప్రతి చిన్నారి చదువు బాధ్యతనూ ప్రభుత్వమే భుజాన వేసుకుంది. ఎనిమిది నెలల వయసులో డే కేర్‌ సెంటర్‌లో కాలుపెట్టినప్పట్నుంచీ పాతికేళ్ల తరవాత యూనివర్సిటీ నుంచి PHD పట్టా అందుకునేంత వరకూ రూపాయి ఖర్చు లేకుండా ప్రతి ఒక్కరికీ ఉచిత విద్యను అందిస్తోంది. ప్రైవేటు పాఠశాలలూ, ప్రైవేటు యూనివర్సిటీల ప్రస్తావనే అక్కడ కనిపించదు. చిన్న కార్మికుడి నుంచి దేశాధినేత వరకూ అందరూ ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుకొని బయటకు రావాల్సిందే. పుట్టుకతో ఎంత సంపన్నులైనా చదువు విషయంలో మాత్రం అక్కడి పిల్లలంతా సమానమే. చిన్న పల్లెటూరు నుంచి దేశ రాజధాని వరకూ అన్ని స్కూళ్లలో ఒకే తరహా శిక్షణ పిల్లలకు అందుతుంది.

ఆరేళ్లదాకా ఆడుతూపాడుతూ...
స్వెటర్లూ, ఉయ్యాలా, ఉగ్గు గిన్నె... పసిపిల్లల తల్లిదండ్రులకు ఎవరైనా ఇలాంటి చిరు కానుకలిస్తారు. ఫిన్లాండ్‌లో మాత్రం బిడ్డ పుట్టాక ఆస్పత్రి నుంచి వెళ్లేప్పుడు వైద్యులు మూడు పుస్తకాలను తల్లిదండ్రుల చేతిలో పెడతారు. పిల్లల్ని బాగా చదివిస్తూనే, తల్లిదండ్రులూ పుస్తకాల్ని చదివే అలవాటు కొనసాగించాలని సూచిస్తూ ఆ సంప్రదాయాన్ని అనుసరిస్తున్నారు. పిల్లలు ఆరోగ్యంగా ఎదగాలంటే తొలి రోజుల్లో తల్లి సంరక్షణ చాలా కీలకం. అందుకే అన్ని సంస్థలూ తప్పనిసరిగా ఎనిమిది నెలల ప్రసూతి సెలవుల్ని మహిళలకు అందిస్తాయి. ఆ తరవాత కూడా ఉద్యోగానికి వెళ్లని తల్లులు ఆదాయం గురించి బెంగపడకుండా మూడేళ్లపాటు ‘డే కేర్‌ ఎలొవెన్స్‌’ పేరుతో ప్రభుత్వం కొంత డబ్బుని చెల్లిస్తుంది. కానీ ఆ అవకాశాన్ని ఉపయోగించుకునే తల్లుల సంఖ్య అక్కడ ఐదు శాతంలోపే. దానికి కారణం ప్రభుత్వ పరిధిలో ఉచితంగా పనిచేసే ‘డే కేర్‌’ కేంద్రాలే. ఎనిమిది నెలల వయసు నుంచి ఆరేళ్లు వచ్చే వరకూ పిల్లలంతా ఆ ప్రభుత్వ సంరక్షణ కేంద్రాల్లో హాయిగా పెరగొచ్చు. అక్కడ ప్రతి పన్నెండు మంది పిల్లలకూ ఓ టీచర్‌, ఇద్దరు నర్సుల చొప్పున అందుబాటులో ఉంటారు. చిన్నారుల ఆలనాపాలనతో పాటు వాళ్లలో జీవన నైపుణ్యాలు పెంచే బాధ్యతనూ వాళ్లే తీసుకుంటారు. దాదాపు ఐదేళ్ల పాటు ఒకే ఉపాధ్యాయుడి దగ్గర పన్నెండు మంది పిల్లలు పెరుగుతారు. తల్లిదండ్రుల తరవాత పిల్లలకు అంతటి అనుబంధం టీచర్లతోనే అల్లుకుంటుంది. దాంతో వాళ్ల స్వభావాన్నీ, సామర్థ్యాన్నీ అర్థం చేసుకుని, వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే అవకాశం ఉపాధ్యాయులకు దొరుకుతుంది. ఆ ఐదేళ్లూ తరగతి గది పాఠాలు పిల్లల దగ్గరకి రావు. పక్షులూ, జంతువులూ, చెట్లూ, మనుషులూ, ఆహారం... ఇలా చుట్టూ కనిపించే అంశాల గురించే పిల్లలకు నేర్పిస్తారు. సంరక్షణ కేంద్రంలో శిక్షణ పూర్తయ్యాక కూడా ఏ స్కూల్లో చేర్పించాలా అని తల్లులు తలలు పట్టుకోవాల్సిన పనిలేదు. పల్లె నుంచి పట్నం దాకా ప్రతి స్కూలుకీ, ప్రభుత్వం నుంచి ఒకే స్థాయిలో నిధులు అందుతాయి. ఒకే తరహా విద్యార్హతలూ, సామర్థ్యమున్న ఉపాధ్యాయులుంటారు. అన్ని పాఠశాలల్లో ఒకేలాంటి సౌకర్యాలూ అందుబాటులో ఉంటాయి. అంటే... అక్కడన్నీ మంచి స్కూళ్లే!

రోజూ ఒంటిపూట బడులే...
ఏడేళ్ల వయసు నుంచీ పదహారేళ్ల వరకూ, అంటే ఒకటి నుంచి తొమ్మిదో గ్రేడ్‌ దాకా ప్రతి ఒక్కరూ కచ్చితంగా చదువుకొని తీరాలన్నది ఫిన్లాండ్‌లో తూచా తప్పకుండా అమలయ్యే నిబంధన. అందుకే ప్రస్తుత తరంలో అక్కడ నిరక్షరాస్యులు ఒక్కరంటే ఒక్కరూ కనిపించరు. పేరుకే అది నిర్బంధ విద్య. ఆచరణలో మాత్రం అక్కడి తరగతి గదులు పిల్లల పాలిట స్వర్గధామాలే. ఒంటిమీద రంగురంగుల దుస్తులుంటేనే పిల్లలకు ఉత్సాహం. అందుకే అక్కడ స్కూళ్లలో ఏకరూప దుస్తుల(యూనిఫాం) విధానాన్ని ఎప్పుడో పక్కనపెట్టారు. చదువూ, పుస్తకాలూ పిల్లలకెప్పుడూ భారం కాకూడదని ‘హోం వర్క్‌’ సంస్కృతినీ దూరం చేశారు. ఆరో తరగతి దాకా పిల్లలు ఇంటి దగ్గర పుస్తకం తెరవాల్సిన పనిలేదు. ఆపై తరగతుల వాళ్లకు ఇచ్చే హోంవర్క్‌ని పూర్తిచేయడానికి అరగంటకు మించి సమయం పట్టకూడదన్నది మరో నిబంధన. పిల్లల నిద్రకు ఫిన్లాండ్‌ చాలా ప్రాధాన్యమిస్తుంది. అందుకే పాఠశాలల గేట్లు తొమ్మిది తరవాతే తెరుచుకుని, మధ్యాహ్నం రెండున్నరకల్లా మూతబడతాయి. అంటే హైస్కూల్‌ పూర్తయ్యేదాకా అక్కడ పిల్లలకు నిత్యం ఒంటిపూట బడులే. రోజుకి ఎట్టి పరిస్థితుల్లోనూ నాలుగు పీరియడ్లకు మించి జరగవు. ప్రతి పీరియడ్‌కీ మధ్యలో కనీసం పదిహేను నిమిషాల విరామం ఉంటుంది. ఆ సమయంలో ఠంచనుగా పిల్లలకు చిరుతిళ్లు అందుతాయి. రోజుకో గంట ఆటల విరామమూ తప్పనిసరి. పిల్లల భోజనం గురించీ తల్లిదండ్రులు బెంగపడాల్సిన పనిలేదు. చదువు పూర్తయ్యేదాకా చక్కని పోషకాహారాన్ని- పిల్లలకు ఇష్టమైన రుచుల్లో ప్రతి రోజూ ప్రభుత్వమే పూర్తి ఉచితంగా అందిస్తుంది.

ర్యాంకులకు చెల్లు!
‘అందరూ సమానంగా చదవాలీ, అందరూ టాపర్లు కావాలీ’ అన్నది ఫిన్లాండ్‌ విద్యాశాఖ లక్ష్యం. అందుకే విద్యార్థుల మధ్య హెచ్చుతగ్గులను ఎత్తి చూపే పరీక్షలూ, మార్కుల సంస్కృతికి ఆ దేశం పూర్తిగా దూరమైంది. అన్ని దేశాల్లోలా త్రైమాసిక, వార్షిక పరీక్షలంటూ పిల్లలకు వేధింపులుండవు. ఒక్కో తరగతిలో 15-20కి మించి విద్యార్థులు ఉండటానికి వీల్లేదు. కనీసం నాలుగు తరగతుల వరకూ ఒకే ఉపాధ్యాయుల బృందం పిల్లలకు పాఠాలు చెబుతుంది. అంటే వరసగా నాలుగేళ్ల పాటు పిల్లల సామర్థ్యం, తెలివితేటలూ, సబ్జెక్టులపైన పట్టూ లాంటి అన్ని అంశాల గురించీ టీచర్లకు అవగాహన కలుగుతుంది. దాంతో పిల్లల్లోని లోపాలను సరిచేస్తూ, ఏటికేడూ వాళ్లని మెరుగుపరచడానికి కావల్సినంత సమయమూ టీచర్లకు దొరుకుతుంది. ఒకట్రెండు పరీక్షలతో కాకుండా ఎప్పటికప్పుడు రకరకాల అంశాల్లో విద్యార్థులు చూపే ప్రతిభ ఆధారంగా వాళ్ల సామర్థ్యాన్ని టీచర్లు అంచనా వేస్తారు. ఏడాది చివర్లో మ్యాథ్స్‌, సైన్స్‌ సబ్జెక్టుల్లో పరీక్షలు పెట్టినా, వాటిలో మార్కుల్ని మాత్రం బయట పెట్టరు. అంటే... పరీక్షలు రాసేది విద్యార్థులైనా, వాటి ద్వారా తామెంత బాగా చెబుతున్నదీ, తాము చెబుతున్న విషయాల్ని పిల్లలు ఏమేరకు అర్థం చేసుకుంటున్నారన్నదీ టీచర్లు అంచనా వేసుకుంటారు. ఆ జవాబు పత్రాల ఆధారంగా మరుసటి ఏడాది తమ శిక్షణ తీరులో మార్పులు చేసుకుంటారు. మొత్తంగా ఒక్కో తరగతి మారే కొద్దీ విద్యార్థుల విజ్ఞానంతో పాటు వ్యక్తిత్వాన్నీ పెంపొందించడమే లక్ష్యంగా ఫిన్లాండ్‌ విద్యా విధానం సాగుతుంది.

ఒకే ఒక్క పరీక్ష!
పదహారేళ్లు వచ్చే వరకూ పరీక్షలే తెలీకుండా పెరిగిన విద్యార్థులు, తొమ్మిదో గ్రేడ్‌ చివర్లో తమ జీవితంలో తొలి ‘పెద్ద పరీక్ష’ రాస్తారు. పైచదువులకు వెళ్లాలంటే అది పాసై తీరాల్సిందే. అపరిమితమైన పాఠాలూ, పిల్లలకు భవిష్యత్తులో ఏమాత్రం ఉపయోగపడని అంశాలూ ఫిన్లాండ్‌ విద్యావ్యవస్థలో కనిపించవు. పైతరగతుల్లో, రోజువారీ వృత్తుల్లో ఉపయోగపడే లెక్కలూ, సైన్స్‌కి సంబంధించిన అంశాలను పరిమితంగానే వారికి నేర్పిస్తారు. పరీక్షలు కూడా విద్యార్థులు బుర్రలు బద్దలుకొట్టుకునేంత కఠినంగా కాకుండా, ఆయా అంశాల్లో వారి ప్రాథమిక జ్ఞానాన్ని పరీక్షించేవిగానే ఉంటాయి. అందుకే పరీక్షల్లో తప్పే విద్యార్థులు దాదాపుగా ఉండరు. తొమ్మిదో గ్రేడ్‌ తరవాత చదువు కొనసాగించాలా వద్దా అన్నది పిల్లల ఇష్టం. ఉన్నత డిగ్రీలు చదవాలనుకునేవాళ్లు ‘అప్పర్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌’ కాలేజీల బాట పడతారు. చదువుపైన ఆసక్తి లేని వాళ్లు వొకేషనల్‌ కోర్సుల్లో శిక్షణ తీసుకొని జీవితాల్లో స్థిరపడతారు. రెండిట్లో ఏ దారి ఎంచుకున్నా, ఆ ఫీజుల భారమంతా ప్రభుత్వానిదే. మొత్తంగా చదువు పూర్తయ్యేవరకూ పిల్లల ఖర్చులూ, పాఠశాలలో విద్యా ప్రమాణాల గురించి ఆలోచించాల్సిన అవసరం తల్లిదండ్రులకు ఉండదు. పోటీ, ఒత్తిడిలో పడిపోయి బాల్యాన్ని కోల్పోవాల్సిన అగత్యం పిల్లలకూ ఉండదు.

టీచరే సూపర్‌స్టార్‌!
‘బతకలేక బడిపంతులు’ అన్న నానుడిని ఫిన్లాండ్‌లో ‘బతకాలంటే బడిపంతులే’ అని మార్చుకోవాల్సిందే! ఆ దేశంలో అత్యంత గౌరవ ప్రదమైన వృత్తుల్లో వైద్యుల తరవాతి స్థానం ఉపాధ్యాయుడిదే. జీతాల విషయంలోనూ అదే వరస. టాలెంట్‌ ఉన్న టీచర్లను ఆ దేశం నెత్తిన పెట్టుకుంటుంది. తమ ఎదుగుదలకు ముఖ్య కారణం మంచి ఉపాధ్యాయులే అని బల్లగుద్ది మరీ చెబుతుంది. అందుకే ఫిన్లాండ్‌లో బోధన ఓ ‘స్టార్‌ ఉద్యోగం’. కుర్రాళ్లంతా టీచర్‌గా మారడానికి ఉవ్విళ్లూరతారు. యూనివర్సిటీలో చదువుకునే రోజుల్నుంచే దానికోసం కసరత్తు మొదలుపెడతారు. కానీ ఆ ఉద్యోగం పొందడం అంత సులువైన పనికాదు. ఓ ఆర్నెల్లు పుస్తకాలు తిరగేసి, పరీక్ష రాసి టీచర్‌గా మారిపోదాం అంటే కుదరదు. ఎలిమెంటరీ స్కూల్‌ టీచర్‌గా చేరాలంటే కనీసం మాస్టర్‌ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. సెకండరీ స్కూల్‌ టీచర్లకైతే పీహెచ్‌డీ తప్పనిసరి. ఏటా టీచర్‌ పోస్టులకు వచ్చే దరఖాస్తుల్లో కేవలం పదిశాతమే తుది పరిశీలనకు ఎంపికవుతాయి. వాటిని జల్లెడపడితే ఎక్కువ శాతం మంది వివిధ యూనివర్సిటీల టాపర్లే కనిపిస్తారు. ఉద్యోగ ప్రవేశ పరీక్ష ద్వారా వాళ్లలోంచి ఇంకొందర్ని ఎంపికచేస్తారు. ఆ తరవాతి దశ ఇంటర్వ్యూల్లో అభ్యర్థుల వ్యక్తిత్వం, విజ్ఞానం, భావ వ్యక్తీకరణ నైపుణ్యాలను అంచనా వేస్తారు. కేవలం జీతం కోసం కాకుండా బోధనపైన ప్రేమతో ఆ వృత్తిలో అడుగుపెట్టేవాళ్లనే చివరికి ఎంపికచేస్తారు. రెండు మూడు నెలల పాటు సాగే ఆ ప్రక్రియ మన సివిల్‌ సర్వీసు అభ్యర్థుల ఎంపికకు ఏమాత్రం తీసిపోదు. ఎంపికైన టీచర్లకు ఏడాది పాటు పిల్లలకు బోధించే విధానాలపైన శిక్షణ ఉంటుంది. అన్ని కఠినమైన దశల్ని దాటొస్తారు కాబట్టే టీచర్లంటే అక్కడి వాళ్లకి అంత గౌరవం. పిల్లలకు శిక్షణ ఇవ్వడం తప్ప శిక్షించే సంస్కృతి స్కూళ్లలో కనిపించదు. ఆ గురువులపైన అంత నమ్మకం ఉండబట్టే అక్కడ ‘పేరెంట్‌-టీచర్‌’ సమావేశాలకూ చోటు లేదు. ‘లెస్‌ ఈజ్‌ మోర్‌’ అన్నది ఫిన్లాండ్‌ ప్రజల జీవన సూత్రం. అందుకే పసిమెదళ్లపైన గుది బండలా మారే మార్కులూ, ర్యాంకులూ, గ్రేడ్ల విధానాలూ, టాపర్లూ-మొద్దులూ అన్న తారతమ్యాలూ, పేదా-గొప్పా తేడాలూ, మంచి స్కూళ్లూ-చెడ్డ స్కూళ్లూ అన్న భేదాలూ, పల్లెలూ-పట్టణాలూ అన్న వ్యత్యాసాలూ అక్కడి వ్యవస్థలో లేవు. పిల్లలంతా ఒక్కటే, వాళ్లకు అందాల్సిన విద్యా ఒక్కటే అన్న సిద్ధాంతాన్ని మనసావాచాకర్మణా అనుసరిస్తున్నారు. పాఠ్య పుస్తకాన్ని చేతిలో పెట్టడానికి ముందే పిల్లల వ్యక్తిత్వాన్ని నిర్మించే పాఠాలకు పునాది వేస్తున్నారు. మంచి విద్యార్థులనూ, పౌరులనూ దేశానికి అందించడానికి పిల్లల దృష్టిలో చెడ్డ తల్లిదండ్రులుగా, ఉపాధ్యాయులుగా మిగలాల్సిన అవసరం లేదని నిరూపిస్తున్నారు.

మనకీ కొత్త విద్యాసంవత్సరం మొదలైంది. కోటి ఆశలతో లక్షలాది పిల్లలు బడిబాట పడుతున్నారు. వాళ్ల చదువులు కూడా ఫిన్లాండ్‌ విద్యార్థుల చదువులంత హాయిగా సాగాలంటే, మన ఆలోచనలూ అక్కడి తల్లిదండ్రులూ ఉపాధ్యాయుల ఆలోచనలంత ఉన్నతంగా మారాలి. మన ప్రభుత్వాలూ అక్కడి విధానాల్లో కొన్నింటినైనా ఆచరణలోకి తేవాలి. పిల్లల నుంచి ఆశించడం మానేసి, వాళ్లని అర్థం చేసుకోవడం మొదలుపెడితే చాలు, ఉత్తమ ఫలితాలు వాటంతట అవే వస్తాయనడానికి ఫిన్లాండ్‌ విజయాలే సాక్ష్యం. ఆ దేశంలో పరీక్షల విధానం లేకపోవచ్చు. కానీ విద్యార్థుల భవిష్యత్తుని తీర్చిదిద్దడమన్నది ఏ దేశానికైనా పెద్ద పరీక్షే. అందులో ఫిన్లాండ్‌కి మరో ఆలోచన లేకుండా వందకి వంద మార్కులూ వేయాల్సిందే..!


అక్షరాస్యతలో నంబర్‌ 1
గతేడాది కనెక్టికట్‌ విశ్వవిద్యాలయం నిర్వహించిన సర్వే ప్రకారం, ప్రపంచంలో అత్యధిక అక్షరాస్యత కలిగిన దేశాల్లో తొలిస్థానం ఫిన్లాండ్‌ది (100శాతం). చదువుతో పాటు చదువుకున్న వాళ్ల వ్యవహారశైలినీ పరిగణనలోకి తీసుకొని నిర్వహించిన నాగరిక దేశాల సర్వేలోనూ దానికి తొలి స్థానం దక్కింది.
* తరగతిలోని విద్యార్థుల మధ్య ప్రతిభ విషయంలో అతి తక్కువ వ్యత్యాసం ఉన్న దేశం ఫిన్లాండే. తెలివైన విద్యార్థులకంటే, త్వరగా పాఠాలను అర్థం చేసుకోలేని పిల్లల దగ్గరే టీచర్లు ఎక్కువ సమయం గడపడం, సగటున పదిహేను మంది పిల్లలకు ఒక టీచర్‌ ఉండటం దానికి కారణం. ప్రతిభ ఆధారంగా పిల్లల్ని వేర్వేరు సెక్షన్లలో కూర్చోబెట్టే పద్ధతే వాళ్లకు తెలీదు.
* ప్రపంచ వ్యాప్తంగా అతి తక్కువ బోధనా గంటలూ, స్కూళ్లకు ఎక్కువ సెలవులూ ఉన్న దేశం ఫిన్లాండే. అక్కడ స్కూళ్లు గరిష్టంగా 180రోజులు మాత్రమే పనిచేస్తాయి. భారత్‌లో దాదాపు 240 రోజులపాటు తెరిచుంటాయి. అక్కడ సగటున ఒక ఉపాధ్యాయుడు ఏడాదికి 600గంటల పాటు పాఠాలు చెబుతాడు. అదే మన దేశంలో ఆ సంఖ్య దాదాపు 1700 గంటలు. అంటే ఫిన్లాండ్‌ కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ.
* భవిష్యత్తులో విద్యార్థుల వృత్తిగత జీవితంలో పెద్దగా ఉపయోగపడని జాగ్రఫీ, హిస్టరీ లాంటి కొన్ని సబ్జెక్టులను ఈ ఏడాది నుంచి ఫిన్లాండ్‌ హైస్కూళ్లలో తొలగించాలని నిర్ణయించారు. వాటి స్థానంలో ప్రస్తుత తరంలో జోరు మీదున్న రెస్టరెంట్లూ, జిమ్‌లూ, స్టార్టప్‌ల లాంటి సమకాలీన అంశాల గురించి బోధిస్తారు.
* ఫిన్లాండ్‌లో స్కూల్‌ సిలబస్‌ను తయారు చేసే బాధ్యత పూర్తిగా టీచర్లదే. వివిధ ఉపాధ్యాయ సంఘాలన్నీ కలిసి విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త పాఠ్యాంశాలను చేరుస్తూ, పాతవాటిని తొలగిస్తూ ఉంటాయి.
* ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో పిల్లల పుస్తకాల్ని ప్రచురించే దేశం ఫిన్లాండే. ప్రతి సిటీ బస్సులో, రైల్లో ఓ పుస్తకాల స్టాండ్‌ కనిపిస్తుంది. విదేశీ కార్యక్రమాలని అనువదించకుండానే అక్కడి టీవీల్లో ప్రసారం చేస్తూ, వాటి కింద సబ్‌టైటిళ్లు వేస్తారు. టీవీ చూస్తూనే పిల్లలు స్థానిక భాషను చదవడం నేర్చుకునేందుకే ఆ పద్ధతి.
* పదకొండేళ్లు వచ్చాకే ఫిన్లాండ్‌ పిల్లలకు ఇంగ్లిష్‌ పాఠాలు మొదలవుతాయి. అప్పటిదాకా బోధనంతా ఫిన్నిష్‌, స్వీడిష్‌ భాషల్లో సాగుతుంది. అక్కడ ఒక్కో విద్యార్థి సగటున నాలుగు భాషలు మాట్లాడగలడు.
* పోటీ పరీక్షలూ, కాలేజీలకు ప్రవేశ పరీక్షలూ, విద్యాసంస్థల్లో రిజర్వేషన్లూ లేని దేశం ఫిన్లాండ్‌. హైస్కూల్‌ దశలోనే విద్యార్థులు తమ భవిష్యత్తుని నిర్ణయించుకుని దానికి తగ్గ కోర్సులే చేస్తారు. ఆ విద్యార్థుల సంఖ్యకు సరిపడా వృత్తి విద్యా సీట్లను ప్రభుత్వం అందుబాటులోకి తెస్తుంది.
అదే తేడా!
‘ఆర్గనైజేషన్‌ ఫర్‌ ఎకనమిక్‌ కో-ఆపరేషన్‌ డెవలప్‌మెంట్‌’ అనే సంస్థ మూడేళ్లకోసారి ప్రపంచస్థాయిలో లెక్కలూ, సైన్స్‌లాంటి వివిధ అంశాల్లో విద్యార్థుల సామర్థ్యాన్ని పరీక్షించడానికి ఓ పరీక్ష నిర్వహిస్తుంది. నాలుగేళ్ల క్రితం ఆ పోటీలో పాల్గొన్న భారత్‌కు చివరి నుంచి రెండో స్థానం దక్కింది. దాంతో తరవాతి పరీక్షలో భారత్‌ పాల్గొనలేదు. అదే పోటీలో ఫిన్లాండ్‌ ఎన్నో ఏళ్లుగా నిలకడగా తొలి స్థానాన్ని సాధిస్తోంది. అక్కడి తలసరి ఆదాయంలో ఏడు శాతాన్ని చదువుపైన ఖర్చు చేస్తుంటే, భారత్‌లో 3.3శాతాన్నే ఖర్చుచేస్తున్నారు. అక్కడ హైస్కూల్‌ టీచర్ల సగటు నెలసరి ఆదాయం రెండున్నర లక్షలు. ఇక్కడది రూ.31వేలు. అక్కడ నెలరోజుల్లో చెప్పే పాఠాల్ని, ఇక్కడ వారంలోనే ముగిస్తున్నారు. ఇలా ఎన్నో అంశాల్లో భారత్‌లాంటి అనేక దేశాలతో ఫిన్లాండ్‌కి ఉన్న స్పష్టమైన తేడాలే, ఆ దేశ విద్యా వ్యవస్థని తిరుగులేని స్థానంలో నిలబెట్టాయి.
నలభై ఐదేళ్ల క్రితం...
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో తీవ్రంగా నష్టపోయిన దేశాల్లో ఫిన్లాండ్‌ ఒకటి. 1970 వరకూ అక్కడి విద్యావ్యవస్థ నాసిరకంగా ఉండేది. సహజ వనరుల లభ్యతా తక్కువే. అలాంటి పరిస్థితుల్లో దేశం ముందుకెళ్లాలన్నా, ఇతర దేశాలతో సమానంగా ఎదగాలన్నా చదువుకున్న పౌరులే కీలకమని నాటి ప్రభుత్వ పెద్దలు నమ్మారు. డబ్బున్న వాళ్లంతా పిల్లల్ని మంచి స్కూళ్లకు పంపిస్తున్నారనీ, సామాన్యులు నాణ్యమైన విద్యకు దూరమవుతున్నారనీ అర్థం చేసుకున్నారు. దాంతో ఎనభయ్యో దశకం తొలినాళ్లలో ప్రక్షాళన మొదలుపెట్టారు. దేశ విద్యా వ్యవస్థనంతా ప్రభుత్వం తన అధీనంలోకే తీసుకొని, ప్రైవేటు విద్యాసంస్థల్ని రద్దు చేసింది. ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా అందరికీ సమానమైన విద్యను ఉచితంగా అందించడం మొదలుపెట్టింది. అలా గత నలభై ఐదేళ్లుగా విద్యా ప్రమాణాల్లో ఎన్నో మైలురాళ్లను దాటి, విద్యార్థుల సామర్థ్యం విషయంలో అగ్రరాజ్యాలనూ వెనక్కునెట్టి దూసుకెళ్తొంది. ప్రభుత్వం, తల్లిదండ్రులూ, ఉపాధ్యాయుల మధ్య సమన్వయం, ఒకరిపైన ఒకరికి సంపూర్ణ నమ్మకం ద్వారా సాధ్యమైన విజయమిది.

మాథెరాన్‌





నిశ్శబ్దానికి చిరునామా మాథెరాన్‌!

‘పచ్చని వాతావరణంలో నిశ్శబ్ద సంగీతాన్ని వింటూ కొండగాలి చల్లదనాన్ని ఆస్వాదిస్తూ రణగొణధ్వనులకి దూరంగా ఓ నాలుగు రోజులు హాయిగా గడిపి రావాలనుకునేవాళ్లకి మాథెరాన్‌ చూడచక్కని విడిది’ అంటూ ఆ ప్రాంతంలోని సుందర ప్రకృతి గురించి చెప్పుకొస్తున్నారు నవీ ముంబైకి చెందిన చిల్లరిగే పద్మ.




మాథెరాన్‌. నవీ ముంబైకి చాలా దగ్గర. కాంక్రీట్‌ అరణ్యం నుంచీ పరుగులెత్తే హడావుడి జీవితం నుంచీ ఓ రెండుమూడు రోజులు తప్పించుకోవాలని మాథెరాన్‌కు బయలుదేరాం. మహారాష్ట్రలోని రాయగఢ్‌ జిల్లాలో కర్జత్‌ తాలూకాలో ఉందీ ప్రాంతం. మనదేశంలోని అత్యంత చిన్న కొండప్రాంత విడిది ఇదే. పర్యావరణ ప్రియమైన పర్యటక ప్రదేశం. ఎందుకంటే పశ్చిమ కనుమల పర్వతశ్రేణుల్లో ఉన్న ఈ ప్రాంతానికి ఎలాంటి మోటారు వాహనాల్నీ అనుమతించరు. అందుకే మిగిలిన హిల్‌స్టేషన్లకన్నా ఎంతో భిన్నమైనది మాథెరాన్‌. సముద్రమట్టం నుంచి 2,625 అడుగుల ఎత్తు కొండమీద ఉన్న మాథెరాన్‌కు వెళ్లాలంటే ముందుగా కొండకింద ఉన్న నేరల్‌ అనే వూరుకి వెళ్లాలి. అక్కడనుంచి కొండమీద ఉన్న దస్తూరినాకాకి వెళ్లి; ఆపై నడక, గుర్రపు స్వారీ లేదా రిక్షాల ద్వారా మాథెరాన్‌కు చేరుకోవచ్చు.



అదిగో... మాథెరాన్‌!
ఉదయాన్నే అల్పాహారం చేసి కారులో బయలుదేరాం. ముంబై-పుణె రహదారిమీద ఉన్న సీబీడీ బేలాపూర్‌ అనే పట్టణంనుంచి నేరల్‌ జంక్షన్‌కి చేరడానికి 90 నిమిషాలు పట్టింది. ఈ నేరల్‌ జంక్షన్‌కి ముంబై, పుణెల నుంచి రోడ్డు, రైలు మార్గాలున్నాయి. అయితే పుణె నుంచి కాస్త దూరం ఎక్కువ. ట్యాక్సీల్లో కూడా వెళ్లొచ్చు. మనమే డ్రైవ్‌ చేసుకుని వెళితే దస్తూరినాకాలో ఉన్న కారు పార్కింగ్‌ దగ్గర వరకూ వెళ్లొచ్చు. రుసుము కట్టి మళ్లీ మనం తిరిగి వచ్చేవరకూ కారుని అక్కడ పార్క్‌ చేసుకోవచ్చు. ఈ పాయింటు వరకూ మోటారు వాహనాలను అనుమతిస్తారు. ఒక్క అంబులెన్సు తప్ప, మరి వేటినీ ఆ ప్రాంతం దాటి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరు. మేం మా కారుని నేరల్‌ జంక్షన్‌ దగ్గరే పార్కు చేసి షేర్‌ ట్యాక్సీలో దస్తూరినాకా వరకూ వెళ్లాం. స్థానిక ట్యాక్సీ యూనియన్‌ నడిపించే వాటికే అక్కడ అనుమతి. ప్రైవేటు ట్యాక్సీలను అనుమతించరు. స్థానికులకు జీవనోపాధి కల్పించేందుకే ఆ ఏర్పాటు. మాథెరాన్‌ మున్సిపల్‌ కౌన్సిల్‌ పర్యటకుల నుంచి ప్రవేశ రుసుము పెద్దవాళ్లకు 25, పిల్లలకు 10 రూపాయల చొప్పున వసూలు చేస్తోంది. నిర్వహణ ఖర్చులకీ మాథెరాన్‌ అభివృద్ధికీ ఈ నిధిని ఉపయోగిస్తారు.

ఇదివరకు నేరల్‌ రైల్వే స్టేషన్‌ నుంచి మాథెరాన్‌ అమన్‌ లాడ్జి వరకూ నేరోగేజ్‌ ఉండేది. దీని మీద టాయ్‌ ట్రెయిన్‌ నడుస్తుంటుంది. కానీ గత ఏడాది రెండుసార్లు పట్టాలు తప్పడంవల్ల ప్రజల భద్రతకోసం ఈ రైలు సర్వీసుల్ని ప్రస్తుతం రద్దు చేశారు. తిరిగి ఇంకా మొదలుపెట్టలేదు. ఈ ప్రత్యేక టాయ్‌ రైలుని పూల్‌ రాణి అని పిలుస్తారు.



వర్షాకాలంలో ఈ ప్రాంతం పూలతో అద్భుతంగా ఉంటుంది. మరాఠీలో మాథె అంటే నుదురు. రాన్‌ అంటే అడవి. మాథెరాన్‌ అంటే ‘నుదురులాంటి అడవి’ అని అర్థం. మన శరీరంలో నుదురు భాగం ఎత్తుగా ఉంటుంది కదా, అందుకే ఎత్తుగా ఉన్న అడవి అనే ఉద్దేశంలో దీనికాపేరు వచ్చిందని చెబుతారు.

కోతుల లోకం!
అక్కడ సామాన్లు మోయడానికి కూలీలు దొరుకుతారు. రిక్షాలూ గుర్రాలు కూడా అందుబాటులో ఉన్నాయి. చిన్న గేట్‌ దాటి ముందుకు వెళ్లగానే ఎర్ర మట్టి దారి కనిపించింది. ఎలాంటి కాలుష్యం సోకని స్వచ్ఛమైన కొండగాలి... అయితే రైలు పట్టాలమీదుగా నడుచుకుంటూ వెళితే గంటలోనే వెళ్లచ్చు అని చెప్పడంతో ఆ దారినే నడక మొదలెట్టాం. లెక్కలేనన్ని కోతులు పర్యటకుల్ని వెంబడిస్తుంటాయి. మన చేతిలో తినే వస్తువులుంటే వెంటనే లాగేస్తాయ్‌. స్నేహితుల సలహామేరకు చేతిలో ఏమీ ఉంచుకోకుండా నీళ్ల సీసాతో నడక మొదలెట్టాం. పక్షుల కూతలు, కోతుల కిచకిచలు, గాలిలో తేలి వచ్చే పర్యటకుల సంభాషణల శబ్దం తప్ప మరెలాంటి ధ్వనీ వినిపించదు. ఆ నిశ్శబ్ద ప్రకృతిలో చల్లని చెట్ల నీడ ఒడిలో మా నడక సాగింది.

ఎలా తెలిసింది?
థానే కలెక్టర్‌ హ్యూగ్‌ పోయెజ్జ్‌ మాలెట్‌ 1850లో ఈ ప్రాంతాన్ని కనుగొన్నాడట. దీన్ని హిల్‌ స్టేషన్‌గా అభివృద్ధి చేయడానికి నాటి ముంబై గవర్నర్‌ లార్డ్‌ ఎలిఫిన్‌ స్టోన్‌ పునాది వేశారట. రెండు అడుగుల నేరో గేజ్‌ మార్గాన్ని నిర్మించారు. 1907 నుంచి ఆ కొండ రైలు మార్గం సామాన్యులకు అందుబాటులోకి వచ్చింది. దాంతో రాకపోకలు మొదలయ్యాయి. అయితే కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ మాథెరాన్‌ని ఎకో సెన్సిటివ్‌ ప్రాంతంగా ప్రకటించింది. చుట్టూ చూసుకుంటూ కోతుల బారినుంచి తప్పించుకుంటూ రైలుపట్టాల మీద నడవడం మరపురాని అనుభూతి. కొండ మీద నుంచి నెరల్‌ పట్టణాన్నీ కర్జత్‌ పట్టణాన్నీ చూశాం. ఆగి ఆగి ఫొటోలు తీసుకుంటూ గంటన్నర తరవాత మాథెరాన్‌ మార్కెట్‌ చేరుకున్నాం. అప్పటికి ఒంటిగంట కావస్తోంది. మేం ముందుగా బుక్‌ చేసుకున్న హోటల్‌ మార్కెట్‌ నుంచి మరో పదిహేను నిమిషాల దూరంలో ఉంది. ఆ మధ్యలో ఓ ప్రభుత్వ ఆసుపత్రి, స్కూలు, రైల్వే స్టేషన్‌ ఉన్నాయి. మార్కెట్‌లో ఎక్కడ చూసినా చిక్కీ అమ్మే దుకాణాలే. ఇక్కడ వాళ్లకి మరాఠీ, హిందీ, ఇంగ్లిష్‌ మాట్లాడటం వచ్చు.

గుర్రాల కోసమే...
మాథెరాన్‌ను సందర్శించడానికి సీజన్‌తో సంబంధం లేదు. ఎప్పుడైనా రావచ్చు. ప్రకృతిని ఆసాంతం ఆస్వాదించాలంటే మాత్రం వర్షాకాలమే సరైనది. అక్కడి వాళ్లకి పర్యటకమే ప్రధాన ఆదాయం. కింద నుంచి వచ్చిన సవారీలన్నీ మార్కెట్‌ వరకే. అక్కడి నుంచి మరొకటి మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఆ దారిలో వస్తుంటే పార్సీ వాళ్ల బంగళాలు కనిపించాయి. బ్రిటిష్‌ వాళ్లు మాథెరాన్‌ని హిల్‌ స్టేషన్‌గా మార్చడం వల్ల అక్కడి నిర్మాణాలన్నీ బ్రిటన్‌ వాస్తు శైలిని ప్రతిబింబిస్తున్నాయి. వూరంతా ఎర్రటి దుమ్ము... గుర్రాల పాదాలు తారు రోడ్డు వేడికి తట్టుకోలేవు. వాటికీ మట్టి రోడ్డు మంచిది. అందుకే మాథెరాన్‌లో అన్నీ మట్టి రోడ్లే. పాండే రోడ్డులో ఉన్న మా రిసార్ట్‌కి వెళ్లి, కొద్దిసేపు సేదతీరి, మాథెరాన్‌ అందాలు చూడ్డానికి బయలుదేరాం.

ముందుగా మా రిసార్ట్‌కి దగ్గరగా ఉన్న రాంబాగ్‌ పాయింట్‌ దగ్గరకు వెళ్దామని బయలుదేరాం. దారిలో 1860లో క్యాథలిక్కులు నిర్మించిన అతి పురాతనమైన చర్చి ఉంది. అక్కడ ఆగి, లోపలికి వెళితే ఎంతో ప్రశాంతంగా అనిపించింది. అక్కడ నుండి రాంబాగ్‌కి వెళ్లాం. మెయిన్‌ మార్కెట్‌ నుంచి సుమారు రెండు కి.మీ. ఉండొచ్చు. మా రిసార్ట్‌కి చాలా దగ్గర. దారంతా చిన్న చిన్న రాళ్లతో మెట్ల మెట్లుగా ఉంటుంది. గుర్రాలు అప్పుడప్పుడూ కనిపిస్తుంటాయి. వీధి దీపాలు చాలా తక్కువ. అక్కడ నుంచి సూర్యోదయ, సూర్యాస్తమయాలు ఎంతో అందంగా కనిపిస్తాయి. అయితే తెల్లవారుజామునే లేచి అక్కడకు ఆ దారిలో వెళ్లాలంటే చేతిలో టార్చిలైటు ఉంటే మంచిది. ముందే చూసి రావడంవల్ల మర్నాడు ఆరు గంటలకల్లా చేతిలో టార్చిలైటు ఉంచుకుని, రాళ్లనీ గుర్రాలనీ తప్పించుకుంటూ రాంబాగ్‌ పాయింట్‌కి చేరుకున్నాం. చిక్కని ఆ నిశ్శబ్దాన్ని కదిలిస్తూ మధ్యమధ్యలో సూర్యోదయం చూడాలని వచ్చిన యాత్రికుల గుసగుసలు... అప్పుడు జరిగిందో ప్రకృతి అద్భుతం...



కొండల వెనక నుంచి ముందు నెమ్మదిగానూ ఆపై గబగబా పైకి వచ్చాడు భానుడు. ఆ దృశ్యం అద్భుతం... అమోఘం... ఎంతసేపు చూసినా తనివి తీరదు. ‘ఆకాశం నుదుట పెట్టుకున్న ఎర్రటి బొట్టులా ఉన్నాడు సూరీడు’ అన్న ముత్యాలముగ్గులోని రావుగోపాలరావు డైలాగులు గుర్తుకురాక మానవు. అలా అక్కడ చాలాసేపు సూర్యుణ్ణి చూస్తూనే ఉండిపోయాం.

తిరిగి రిసార్ట్‌కి వచ్చే దారిలో- 1916లో కట్టించిన అంటువ్యాధుల వార్డు శిథిలావస్థలో ఉంది. ఆ రోజుల్లో వ్యాధిసోకిన వాళ్లని అలా దూరంగా ఉంచేవారన్నమాట. అల్పాహారం చేశాక మాథెరాన్‌ చూడ్డానికి బయలుదేరాం. ముందుగా ఆ చుట్టుపక్కల పరిసరాలకి నీటిని అందించే చార్లెట్‌ సరస్సు దగ్గరకు వెళ్లాం. చిన్నదైనా పారదర్శకంగా ఉన్న ఆ కొలనులో చేపలు పట్టడం, బట్టలు ఉతకడం లాంటివి అస్సలు అనుమతించరట. అక్కడ ఓ చిన్న ఆనకట్ట కట్టడంవల్ల వర్షాకాలంలో పై నుంచి వచ్చే చిన్న జలపాతం ద్వారా ఈ కొలనులో ఎప్పుడూ నీళ్లు నిల్వ ఉంటాయి.



దీనికి కుడివైపున అతి పురాతనమైన పిసర్నాధ్‌ మందిర్‌ ఉంది. గుడి ప్రాంగణంలో భారీ గంట ఉంది. ఇక్కడ శివుడు స్వయంభువుడు. పిసర్నాథ్‌ను స్థానికులు గ్రామదేవతగా కొలుస్తారు. ‘L’ ఆకారంలోని లింగాకృతిలో ఉండటమే ఇక్కడి శివుడి ప్రత్యేకత. పూర్తిగా సింధూరంతో ఉంటుంది శివలింగం. ఇక్కడి కొచ్చే పర్యటకులు సూర్యాస్తమయం లోపలే దర్శనం చేసుకుంటే మంచిదిగా భావిస్తారు. దట్టమైన అడవి మధ్యలో ఉండటంవల్ల చీకటి పడితే జంతువులు తిరుగుతుంటాయట. ఆ పరమేశ్వరుడిని దర్శనం చేసుకున్నాక లార్డ్‌ పాయింట్‌ దగ్గరకు వెళ్లాం. అక్కడకు వెళ్లేసరికి నడిచిన అలసట అంతా ఎగిరిపోయింది. ఆ ప్రాంతాన్ని మాటల్లో వర్ణించలేం. చూసి తీరాల్సిందే. అక్కడి నుంచి దూరంగా కనిపించే ఓ కొండను చూస్తే దేవతా ఆకారంలో చెక్కినట్లు అనిపిస్తుంది. కానీ ప్రకృతి సహజంగా ఏర్పడిన వింత కొండ అది. ఆ పాయింట్‌ నుంచే బైనాక్యులర్స్‌ లేదా గైడ్‌ దగ్గరున్న టెలీస్కోప్‌ ద్వారా దూరంగా ఉన్న ప్రబలగఢ్‌ కోటను చూడొచ్చు. అది మరాఠాల శౌర్యానికీ వీరత్వానికీ ప్రతీక. మొఘల్‌ చక్రవర్తుల్ని ఓడించి శివాజీ గెలుచుకున్న కోట అది. ప్రస్తుతం శిథిలావస్థలో ఉంది. దూరంగా కనిపించే శివాజీ నిచ్చెననీ చూశాం. అప్పట్లో శివాజీ వేటకోసం మాథెరాన్‌ కొండలు ఎక్కేవాడట. ఆయన ఎక్కేదారినే శివాజీ నిచ్చెన అని పిలుస్తారు. ఈ శివాజీ నిచ్చెన ఎక్కే ముంబై గవర్నర్‌ ఈ కొండ మీదకి వచ్చి ఇక్కడి అందాలను చూసి ముగ్ధులయ్యారని చెబుతారు. ఇప్పటికీ గిరిజనులు ఆ దారిలోనే మాథెరాన్‌ అడవుల్లోకి వెళతారు. సాహసభరితమైన ట్రెక్కింగ్‌ మార్గంగా ఈ శివాజీ నిచ్చెన పేరొందింది.

ఒంటరి చెట్టు!
తరవాత ఎకో పాయింట్‌ చూడ్డానికి వెళ్లాం. అక్కడి నుంచి మనం పిలిస్తే అది ప్రతిధ్వనిస్తుంది. వర్షాకాలంలో వెళితే అక్కడి జలపాతాల అందాలను చూస్తూ వాటి జావళీల్నీ వినొచ్చు. తరవాత వన్‌ట్రీ పాయింట్‌ దగ్గరకు వెళ్లాం. ఓ నేరేడుచెట్టు అక్కడ దశాబ్దాలుగా ఒంటరిగా ఉంటోంది. వర్షాకాలంలో చిన్నచిన్న మొక్కలు మొలిచినా చెట్టు మాత్రం ఇదొక్కటే ఉండడంతో దీనికా పేరు. ఆ రోజంతా తిరగడంతో బాగా అలసిపోయాం. దారిలో లిటిల్‌ చౌక్‌ పాయింట్‌, ఖండాలా పాయింట్‌ చూసి, ఇక కాళ్లు మొరాయించడంతో రిసార్ట్‌లోకి వచ్చి పడ్డాం. మర్నాడు ఉదయాన్నే రూము ఖాళీ చేసి అక్కడ దొరికే చిక్కీలనీ చాక్లెట్‌ ఫడ్జెస్‌నీ కొనుక్కుని తిరుగు ప్రయాణమయ్యాం. లోనావాలా చిక్కీల మాదిరిగానే మాథెరాన్‌ చిక్కీలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. తిరుగు ప్రయాణంలో రిక్షా ఎక్కాం. దీన్ని ముందు ఒకరూ వెనక ఇద్దరూ పట్టుకుని నడిపిస్తారు. అలా దస్తూరినాకా వరకూ వచ్చి, నేరల్‌ చేరుకుని అక్కడి నుంచి మా కారులో ముంబై దారిపట్టాం.




పేరూరు. ఓ అందమైన సాంస్కృతిక గ్రామం




పేరూరు... ఓ సాంస్కృతిక గ్రామం!
ప్రపంచం రోజురోజుకీ మారిపోతుంది. చేతిలోని సెల్‌ఫోను నుంచి నివసించే పల్లె వరకూ అన్నీ క్షణాల్లో మారిపోతున్నాయి. నిన్న ఉన్నట్లుగా నేడు, నేడు ఉన్నట్లు రేపూ ఉంటుందని చెప్పలేం. కానీ ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమలోని ఓ వూరు మాత్రం అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ అలాగే ఉంటుంది. దాని పేరే పేరూరు. ఓ అందమైన సాంస్కృతిక గ్రామం!

చుట్టూ పచ్చని కొబ్బరితోటలూ వాటి మధ్య పారే పిల్ల కాలువలూ ఆ మధ్యలో కుదురుగా కట్టిన పాతకాలంనాటి పెంకుటిళ్లూ ఎర్ర కంకర రోడ్లూ కాస్త దూరంలోనే గోదావరి పాయలూ ఇంకాస్త ముందుకు వెళితే సాగర జలాలూ ఇలాంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో కనువిందు చేస్తుంటుంది తూర్పుగోదావరి జిల్లాలోని పేరూరు. క్రీ.శ. 11వ శతాబ్దం నుంచీ తన స్వరూపాన్ని కాస్త కూడా మార్చుకోకుండా పూర్వం ఎలా ఉందో ఇప్పటికీ అలాగే కనిపిస్తుంది. దీనికి కారణం ఆ వూరికి ఉన్న చరిత్రే అని చెబుతారు స్థానికులు.

చాళుక్యరాజైన రాజేంద్రచోళుడు, తన కుమార్తె అమ్మంగిదేవిని రాజమహేంద్రవర పాలకుడు రాజరాజనరేంద్రుడికి వివాహం చేసి, అత్తింటికి పంపే సమయంలో చీరసారెలతోబాటు 18 కుటుంబాలకు చెందిన వేదపండితులనూ పంపించాడట. అలా వచ్చినవాళ్లలో కొందరు ఆత్రేయపురం దగ్గర ఉన్న ర్యాలీ దగ్గర స్థిరపడితే, మరికొందరు అంబాజీపేట మండలానికి వెళ్లగా, ఇంకొందరు పేరూరుని ఆవాసంగా చేసుకున్నారట. తమిళనాడులోని పెరియా(పెద్ద)వూరు నుంచి వచ్చినవాళ్లు స్థిరపడినదే పేరూరు అనీ, అందుకే ఇక్కడి బ్రాహ్మల్ని పేరూరు ద్రావిడులు అంటారనీ చెబుతుంటారు.

మహామహులెందరో..!
నాటి పేరూరు- విశ్వేశ్వరుని, గున్నాపంతుల, పేరమ్మ, బుచ్చమ్మ, బండివారి... అని ఐదు అగ్రహారాలుగా ఉండేది. కాలక్రమంలో మిగిలినవి అమలాపురంలో కలిసిపోగా విశ్వేశ్వరుని, బండివారి అగ్రహారాలు మాత్రమే ప్రస్తుత పేరూరులో ఉన్నాయి. విశ్వేశ్వరుని అగ్రహారం మెరక, పల్లపు వీధులతో ప్రధాన గ్రామంలో ఉంది. ఇక్కడ 365 కుటుంబాలు నివసిస్తున్నాయి. వందలాదిమంది నిత్యాగ్నిహోత్రులు, నిత్యానుష్టానపరులు, వేదపండితులు, ఘనాపాఠీలు, శాస్త్రపండితులు... ఇక్కడ ఇప్పటికీ నివసిస్తున్నారు.

పంచ ప్రణాళిక!
ప్రకృతికి ఆటంకం కలగకుండా జీవించాలన్నదే ఆ వూరివారి ఆశయం. అందుకే నాటి అగ్రహారంలో మెరక, పల్లపు వీధులకు రెండు ప్రధాన రహదారుల్నీ; వాటిని విభజిస్తూ చిన్నపాటి అడ్డు దారుల్నీ నిర్మించారు. ఇళ్లన్నీ ఉత్తర-దక్షిణ దిక్కుల్లోనూ; రోడ్లు తూర్పు-పడమర దిక్కుల్లో నిర్మించడంతో గాలీవెలుతురూ చక్కగా ఉంటాయి. రోడ్డుకిరువైపులా ఐదేసి చొప్పున పంచకమనే పద్ధతిలో ఇళ్లు నిర్మించి ఉంటాయి. ప్రస్తుతం ఆ వూళ్లొ ఇంటికి ఒకరు చొప్పున అమెరికాలోనే ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అయినప్పటికీ వాళ్లెవరూ తమ ఇళ్లను మార్చి ఆధునికంగా కట్టించాలనుకోలేదు. వాటిని యథాతథంగా ఉంచేందుకే డబ్బును వెచ్చించడం వారి ప్రత్యేకత.

అలాగే భూగర్భజలాల పరిరక్షణ, తద్వారా ఉష్ణతాపం తగ్గుతుందన్న కారణంతోనే వూళ్లొ ఇంతకాలం తారు, సిమెంటు రోడ్లు వేసుకోలేదు(ఈమధ్యే కనీస సౌకర్యాల కల్పన పేరుతో ప్రభుత్వం గ్రామంలోని ప్రధాన రహదారుల్లో సిమెంటు రోడ్లు వేయడం ప్రారంభించింది). తాగడానికి పంచాయితీ నీటిని వాడుకున్నా ఇతర అవసరాలకు నేటికీ నాటి గిలక బావులనే వాడతారు. ప్రతిఇంటిలో ఈశాన్యం దిక్కున ఉన్న బావి దగ్గర ఇంకుడు గుంతను తవ్వారు. వాడిన నీరు మొక్కలకు వెళ్లేలా ఏర్పాట్లు చేసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్లను కొట్టకూడదన్న నియమం పెట్టుకున్నారు.

గ్రామంలో దేవాలయాలకూ లోటు లేదు. వాటిల్లో నిత్యం ఏదో ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. దత్త, పుష్పగిరి, శృంగేరి, కంచి, హరిహర, విరూపాక్ష పీఠాలకు చెందిన ఆయా తరాల పీఠాధిపతులూ ఈ గ్రామంలోని దేవాలయాలను సందర్శించారు. ఈ వూరి విశిష్టతను గుర్తించిన ఎన్టీ రామారావు కూడా అనేకసార్లు ఆ ఆలయాలను సందర్శించారు. ఆ విషయం డైరీలో రాసుకోవడంతో అది చదివిన బాలకృష్ణ కూడా ఆ గ్రామానికి రెండుసార్లు వెళ్లారట.

‘అందుకే కౌశిక గోదావరీ పాయ తీరాన ఉన్న మా వూరంటే మాకెంతో ఇష్టం. ఈ వూళ్లొ జన్మించడం పూర్వ జన్మ సుకృతం. ఇక్కడ మరణిస్తే, తదుపరి కార్యక్రమాలకోసం కాశీ కెళ్లాల్సిన అవసరం కూడా లేద’ని స్థానికులైన పేరి విశ్వనాథశర్మ ఎంతో గర్వంగా చెబుతారు.

సమాజంలో ఆధునిక పోకడలు ఎన్ని వచ్చినా వారసత్వంగా వస్తోన్న ఇళ్లని కాపాడుకుంటూ తరాలనాటి తమ సంస్కృతిని కొనసాగిస్తోన్న పేరూరు... చెప్పుకోదగ్గ వూరే కదూ!

- విజయ్‌, న్యూస్‌టుడే, అమలాపురం

Friday, 9 June 2017

శ్రీ అనంత పద్మనాభస్వామి





శేషశయనా.. అనంతపద్మనాభ

శ్రీ మహావిష్ణువు 108 దివ్యదేశాల్లో అత్యంత ముఖ్యమైన క్షేత్రం తిరువనంతపురంలోని శ్రీ అనంతపద్మనాభ స్వామి ఆలయం. పాలకడలిలో శేషపాన్పుపై పవళించిన ఆ చిద్విలాసమూర్తి మహారూపాన్ని ఇక్కడ వీక్షించవచ్చు. పద్మాన్ని నాభి యందు కలిగిన వాడు కాబట్టే ఆ పురుషోత్తముడిని పద్మనాభుడిగా పిలుస్తాం. శ్రీఅనంత పద్మనాభస్వామి ఆలయంలో వెలువడిన సంపద యావత్‌ ప్రపంచదృష్టిని ఆకర్షించింది. లక్షల కోట్లు విలువచేసే సంపదతో స్వామివారు ప్రపంచంలోనే అత్యంత ఐశ్వర్యమూర్తిగా అవతరించారు. అనంతమంటే అంతు లేనిదని అర్థం. అంత సంపదను వందలసంవత్సరాలుగా ఆలయంలో నిక్షిప్తం చేసుకున్న ఆ స్వామి నిజంగా అనంతుడే. లోకంలో సంభవించే విపత్తులను అడ్డుకునేందుకు ఆ పరంధాముడు పలు అవతారాలు ఎత్తి శిష్టరక్షణ, దుష్టశిక్షణ చేశాడు. ఆర్తితో పిలిస్తే భక్తులను ఆదుకుంటారు. అనంతమైన ఆ పరమాత్ముడు స్వయంగా వెలసిన క్షేత్రమే శ్రీఅనంత పద్మనాభక్షేత్రం.

స్వామిని పూజించిన బలరాముడుఈ ఆలయ ప్రస్తావన పలు పురాణాల్లో, ఇతిహాసాల్లో వుంది. బలరాముడు ఆలయాన్ని సందర్శించి పూజలు చేసినట్టు శ్రీమద్‌ భాగవతం తెలుపుతోంది. స్వామివారి మహత్యాన్ని పేర్కొంటూ 12 మంది ఆళ్వారుల్లో ఒకరైన నమ్మళ్వారు అనేక రచనలు చేశారు. కలియగం ప్రారంభమైన రోజున ఈ ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది. అయితే ఈ ఆలయ చరిత్రపై కచ్చితమైన సమాచారం లేదు. వేల సంవత్సరాల నుంచి ఆలయం నిత్యపూజలు అందుకున్నట్టు ఆలయానికి చెందిన రికార్దులు వెల్లడిస్తున్నాయి.

అనంతశయన మహత్యఅనంతపద్మనాభుడు ఎలా ప్రత్యక్షమయ్యాడు అన్న దానిపై అనంతశయన మహత్య గ్రంథం వివరాలను తెలుపుతోంది. కొన్ని వేల సంవత్సరాల క్రితం దివాకరముని అనే విష్ణు భక్తుడు వుండేవాడు. నిత్యం విష్ణునామ సంకీర్తనతో ఆయన నిమగ్నమయివుండేవాడు. ఒకరోజు భగవానుడు ఆయనకు బాలుని రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ముద్దులొలికే ఆ పిల్లవాడిని చూసిన దివాకరుడు తన నివాసంలో వుండాలని కోరాడు. అయితే ఆ పిల్లవాడు సాక్షాత్తు పరమాత్ముడే అన్న అంశాన్ని ముని గుర్తించలేకపోయారు. దీనిపై స్పందించిన చిన్నారి తాను చేసే పనులకు ఎలాంటి అడ్డుచెప్పకూడదని ఒకవేళ చెబితే వెళ్లిపోతానని నిబంధన పెడుతాడు. కొన్నిరోజులకు పిల్లవాడు చేసే అల్లరి ఎక్కువయింది. ఒకనాడు ముని తపోదీక్షలో వుండగా సాలగ్రామాలను తీసుకువచ్చిన స్వామి అతని నోటిలో వేస్తాడు. దీంతో మునికి తపోభంగమైంది. పిల్లవాడిపై పట్టరాని కోపం ప్రదర్శిస్తాడు. పిల్లవాడు వెంటనే అదృశ్యమవుతూ తనను తిరిగి చూడాలంటే అనంతన్‌కాడు దగ్గరకు రమ్మని చెబుతాడు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే తన నివాసంలో బాలుడిగా వున్న అంశాన్ని దివాకరముని గుర్తిస్తాడు. వెంటనే స్వామిని అన్వేషిస్తూ సముద్రతీరప్రాంతానికి చేరుకుంటాడు. అక్కడ వున్న భారీ వృక్షం నేలపై పడి శ్రీమహావిష్ణువుగా రూపాంతరం చెందింది. స్వామివారు భారీ రూపంగా దర్శనమిచ్చారు. అనంతుని దర్శనంతో అమితానందం చెందిన దివాకరముని అంతటి పెద్ద రూపాన్ని వీక్షించలేనని ప్రార్థించడంతో యోగదండం కంటే మూడింతలు పెద్దగా మారిపోయారు. స్వామిని కనులారా వీక్షించిన ముని స్వామికి ఒక టెంకాయలో మామిడికాయను వుంచి ప్రసాదంగా ఇస్తారు. ఇప్పటికీ ఈ పూజా విధానం ఆలయంలో కొనసాగుతుండటం విశేషం. ఈ క్షేత్రానికి సంబంధించి మరో కథ కూడా ప్రాచుర్యంలో వుంది. నంబూద్రి సన్యాసి వివమంగళ స్వామియార్‌ అనే విష్ణుభక్తుడికి కూడా అనంతుడు ఇలానే దర్శనమిచ్చినట్టు తెలుస్తోంది.

రాజులైనప్పటికీ స్వామికి దాసులేతిరువనంతపురం ట్రావెన్‌కోర్‌ రాజులు ఏలుబడిలో వుండేది. తిరువనంతపురం పేరు కూడా అనంత పద్మనాభుడి మీదుగా రావడం విశేషం. ట్రావెన్‌కోర్‌ రాజులు స్వామివారికి భక్తులు. తమను తాము ఏనాడు పాలకులుగా వారు ప్రకటించలేదు. పద్మనాభుడికి దాసుడిగా ప్రకటించుకొని అనంతునిపై వున్న అచంచలమైన భక్తిని చాటుకున్నారు. తొలినాళ్లలో ఆలయాన్ని విస్తరించేందుకు రాజా మార్తాండవర్మ ఇతోధికంగా కృషి చేశారు. ఆయన హయాంలోనే మూరజపం, భద్రదీపం అనే పూజా కార్యక్రమాలను ప్రవేశపెట్టారు. అనంతరం వారి వంశంలో వచ్చిన పాలకులు కూడా స్వామివారి దాసులుగా వుండి అనంతమైన సంపదను పరిరక్షించారు.

మూలవిరాట్టును మూడు ద్వారాల్లో నుంచి దర్శించాలిస్వామివారి మూలవిరాట్టును ఒక ద్వారం నుంచి మనం వీక్షించలేం. పెద్ద విగ్రహం కావడంతో తలను, చేతిని, పాదాలను వేర్వేరు ద్వారాల నుంచి వీక్షించాలి. రాజా మార్తాండవర్మ పాలనా సమయంలో వేల సాలగ్రామాలతో స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఆ రోజుల్లో 4వేల శిల్పకారులు, 6వేలమంది కార్మికులు, నూరు ఏనుగులు ఆరునెలల పాటు శ్రమించి ఆలయంలోని పలు కళాకృతులను ఏర్పాటుచేసినట్టు తెలుస్తోంది.

అనంతమైన సంపదకు రక్షకులుకొంతకాలం క్రితం ఆలయంలోని నేలమాళిగల్లో లభించిన అనంతమైన సంపదకు ట్రావెన్‌కోర్‌ పాలకులు సంరక్షకులుగా వుంటున్నారు. వెల కట్టలేని నిధుల రాశిని స్వామివారికి అర్పించి తరతరాలుగా వాటిని సంరక్షిస్తున్నారు. ఇప్పటికీ ఒక గదిని ఇంకా తెరవలేదు. నాగబంధనం వేసివుండటంతో తెరవడం సాధ్యం కాదని పండితులు పేర్కొంటున్నారు. ఈ గదిలో ఎంత సంపద వుంటుందో ఆ అనంతునికే తెలిసిన రహస్యం.

ఆలయ ప్రాంగణంఅనంతుని ఆలయప్రాంగణంలో అనేక మందిరాలు వున్నాయి. మహాశివునికి ఒక మందిరం వుండటం శివ, కేశవ బంధాన్ని చెబుతుంది. గణపతి మందిరం, యోగ నరసింహస్వామి గుడి, ఆంజనేయస్వామి ఆలయం, ఒట్టకల్‌ మండపం, అభిశ్రావణమండపం, కులశేఖర మండపం, శ్రీ బలిప్పుర (ప్రదక్షిణ మార్గం, తిరువంబడి కృష్ణస్వామి మందిరం... తదితర వాటిని వీక్షించవచ్చు. ఆలయంలోని కుడ్యకళ ఆకట్టుకుంటుంది.

ఎలా చేరుకోవాలి* కేరళ రాజధాని తిరువనంతపురం. ఈ నగరానికి దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి రవాణాసౌకర్యాలున్నాయి.
* తిరువనంతపురం రైల్వేస్టేషన్‌లో దిగి ఆలయాన్ని చేరుకోవచ్చు.
* తిరునంతపురం విమానాశ్రయంలో దిగి ప్రైవేటు వాహనాల ద్వారా ఆలయం సందర్శించుకునే సౌకర్యముంది.





బృహదీశ్వరాలయం B

అణువణువూ అద్భుతం బృహదీశ్వరాలయం ‘‘గుడులూ గోపురాలకు పేరొందిన తమిళనాడు రాష్ట్రాన్ని సందర్శించాలనుకునే వాళ్లకు ముందుగా గుర్తొచ్చేది తంజావూరు...