భారతదేశంలోని అత్యంత పురాతన నగరాల్లో ఒకటైన చారిత్రక నగరం ఉత్తర మహా రాష్ట్రలోని కొల్హాపూర్. ఇక్కడ ఉన్న మహాలక్ష్మి దేవాలయం బాగా ప్రసిద్ధి చెందినది. ఈ పట్టణం కొల్హాపూర్ చెప్పులకు కూడా ప్రసిద్ధి.
చూడవలసిన ప్రదేశాలు...
కొల్హాపూర్లో ముఖ్యంగా చూడవలసినవి మహాలక్ష్మి దేవాలయం, మహారాజ భవనం. మహాలక్ష్మి దేవాలయం "హేమాడ్ పంతి" నిర్మాణశైలిలో కట్టబడినది. ఇది చాలా విశాలమైన ప్రాంగణంలో చుట్టూ ఎత్తైన ప్రహారీ గోడతో ఉంటుంది. ప్రాంగణం మధ్యలో ఉన్న అమ్మవారి ఆలయం ఒక అద్భుత కళాసృష్టి అని చెప్పవచ్చు. ఆలయమంతా మనోహరమైన శిల్పాలతో నిండి ఉంటుంది. పశ్చిమాభిముఖంగా ఉండే గర్భగుడి ముందుగా సుమారు వందడుగుల పొడవు గల విశాలమైన మండపం ఉంటుంది. గర్భగుడి చుట్టూ సన్నని ప్రదక్షిణ మార్గం వుంది.
కొల్హాపూర్ మహాలక్ష్మి...
గర్భగుడిలో సుమారు ఆరడుగుల చదరంగా ఉన్న ఎత్తైన వేదిక మీద రెండడుగుల పీఠం, దానిమీద మహాలక్ష్మి విగ్రహం కూర్చొని ఉన్న భంగిమలో ఉంటుంది. మూడడుగుల ఎత్తున్న మూర్తి చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది. మహారాష్ట్రీయులకు కొల్హాపూర్ మహాలక్ష్మి అత్యంత పవిత్ర యాత్రాస్థలం. వీరు అమ్మవారిని "అంబాబాయి" అని పిలుస్తారు. ఇక్కడ జరిగే ప్రధాన ఉత్సవం నవరాత్రి ఉత్సవం.
ముఖ్యంగా ఆశ్వయుజ శుద్ధ పంచమి నాడు విశేషంగా గొప్ప ఉత్సవం జరుగుతుంది. ఆ రోజున అమ్మవారి ఉత్సవమూర్తిని నగరానికి తూర్పుగా 5 కి.మీ. దూరంలో ఉన్న తెంబ్లాయి అమ్మవారి ఆలయం దగ్గరికి ఊరేగింపుగా తీసుకొని వెళ్తారు.
ఇదిగాక చైత్ర పూర్ణిమ రోజున జరిగే ఉత్సవంలో అమ్మవారిని నగరమంతా ఊరేగిస్తారు.
గుడి ప్రాంగణంలో ఉన్న అనేక ఆలయాలలో విఠోబా ఆలయం కూడా చాలా పురాతనమైనది.
ఇక మహారాజ భవనం సుమారు రెండు వందల గదులతో మూడు అంతస్థులతో చక్కగా విశాలమైన మైదానం మధ్యలో ఉంటుంది. ఆనాటి రాజుల ఆయుధాలు, రాజరికపు సామగ్రి మొదలైనవి ఇందులో పొందుపరిచారు.
కొల్హాపూర్ సంస్థానం...
కొల్హాపూర్ బ్రిటిష్ కాలంలో బొంబాయి ప్రెసిడెన్సీలో ఒక ప్రముఖ సంస్థానం. ఆ కాలంలో నాలుగు ముఖ్యమైన సంస్థానాలలో ఒకటి; మిగిలిన మూడు బరోడా, గ్వాలియర్ మరియు ఇండోర్. దీని పాలకులైన బోంస్లే రాజ్యం 19 గన్ సెల్యూట్కు అర్హులు. కొల్హాపూర్ను పరిపాలించిన రాజులు, తంజావూరు, సతారాలను పాలించిన భోంసాలే వంశాల వలె మరాఠా భోంసాలే రాజవంశం నుండి ఉద్భవించారని చెప్పుకుంటారు. మరాఠా సామ్రాజ్య వారసత్వ విషయమై తలెత్తిన వివాదాల వలన సతారా మరియు కొల్హాపూర్ రాజ్యాలు 1707లో ఏర్పడ్డాయి. మరాఠా సామ్రాజ్యానికి వారసుడైన షాహూ శంభాజీని మొగలులు తొమ్మిదేళ్ళ వయసులో పట్టి బంధించి ఖైదులో ఉంచారు. షాహూ శంభాజీ తండ్రి, మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించిన ఛత్రపతి శివాజీ పెద్దకొడుకు శంభాజీ. శంభాజీ మరణం తర్వాత శివాజీ చిన్నకొడుకు రాజారాం ఛత్రపతి అయ్యాడు. 1700లో అనారోగ్యం వలన రాజారాం మరణించగా ఆయన భార్య మహారాణి తారాబాయి తన కొడుకు రెండవ శంభాజీని మహారాజుగా ప్రకటించి, తాను ప్రతినిధిగా పాలించింది. 1707లో మెగలులు కొన్ని షరతులతో షాహూను విడుదల చేశారు. విడుదలైన షాహూ తన వంశానుగతమైన రాజ్యాన్ని తిరిగి పొందే ప్రయత్నం చేశాడు. ఖేడ్ వద్ద జరిగిన యుద్ధంలో షాహూ, తారాబాయి ఓడించి సతారాపై తన అధికారాన్ని స్థాపించాడు. ఓడిపోయిన రాణి తన కొడుకుతో కలిసి కొల్హాపూరులో స్థిరపడింది. 1710 కల్లా రెండు వేర్వేరు రాజ్యాలుగా పరిణమించాయి. దీన్ని 1731లో కుదుర్చుకున్న వార్నా సంధి ధృవీకరించింది.
No comments:
Post a Comment