Wednesday, 1 November 2017

ఘృశ్నేశ్వరస్వామి









ఘృశ్నేశ్వర స్వామి జ్యోతిర్లింగం
భక్తులు తాకే జ్యోతిర్లింగం


అత్యంత సుందరంగా తీర్చిదిద్దిన శిల్పాలకు నెలవైన ఎల్లోరా గుహలకు సమీపంలో ఘృశ్నేశ్వర స్వామి జ్యోతిర్లింగం విరాజిల్లుతోంది. మహారాష్ట్రలో కొలువై ఉన్న ఈ జ్యోతిర్లింగం అపూర్వ మహిమలకు పేరుగాంచింది. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో పన్నెండవదిగా వినుతికెక్కింది. ఔరంగబాద్‌ జిల్లా, వేరూల్‌ గ్రామంలో శివాలయ తీర్థం సమీపంలో వెలిసిన ఈ జ్యోతిర్లింగాన్ని దర్శించి తరించడానికి దేశం నలుమూలల నుంచి భక్తులు విచ్చేస్తారు. ఈ క్షేత్రాన్ని దర్శించిన భక్తులది మహాద్భాగ్యమని చెప్పొచ్చు. జ్యోతిర్లింగా ఆఖరిది అయిన ఘృశ్నేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే కానీ జ్యోతిర్లింగ యాత్ర సంపూర్ణం కాదు అని అంటారు.

ఇళాపురే రమ్య విశాల కేస్మిన్‌ సముల్లసం తంచ జగద్వరేణ్యం వందే మహోదార తర స్వభావం ఘుశ్శేశ్వరాఖ్యం శరణ్యం ప్రపద్యే

పురాణగాథ
పూర్వం ఈ ప్రదేశంలో నాగజాతి ఆదివాసీలు నివాసం ఉండేవారు. అందుకే ఈ ప్రాంతాన్ని బాంబీ అనేవారు. ఆదిమతెగ భాషలో బాంబీ అంటే పాముల పుట్ట అని అర్థం. మరాఠీలో దీనిని ‘వరూల్‌’ అంటారు. కాలక్రమేణ అది వేరూల్‌గా మారింది. ఈ ప్రాంతంలో ఏలగంగా నది ప్రవహిస్తుంది. ఏలగంగా నది తీరంగా ఉంది కాబట్టి ఈ ప్రాంతం వేరూల్‌గా ప్రసిద్ధి చెందిందని మరో కథనం.

చరిత్ర
ఈ ప్రాంతంలో ఏల్‌ అనే రాజు ఉండేవాడు. ఆయన రాజధాని ఏలాపూర్‌. అదే వేరూల్‌గా ప్రసిద్ధి చెందిందని చరిత్ర ద్వారా తెలుస్తోంది. ఒకసారిరాజు వేటకు వనానికి వెళ్తాడు. అక్కడ అడవి జంతువులతో పాటు మునుల ఆశ్రమంలో ఉండే జంతువులని కూడా సంహరిస్తాడు. అది చూసిన మునులు రాజు సర్వాంగాలకు పురుగులు పట్టాలని శపిస్తారు. ఆ శాపం వల్ల రాజు వనాల వెంట తిరుగుతూ ఉంటాడు. ఒకనాడు బాగా దాహం వేయడంతో అడవిలోని చాలా చోట్ల తిరుగుతాడు. అయిన కూడా ఎక్కడా నీరు దొరకదు. ఒక చోట మాత్రం ఆవు డెక్కలతో చేసిన నీటికుంటలో కొద్దిగా నీరు కనిపిస్తుంది. రాజు వాటిని కొద్దిగా తాగగానే విచిత్రంగా అతని శరీరానికి పట్టిన పురుగులన్నీ మటుమాయం అవుతాయి. రాజు ఆ సరస్సు ఉన్న ప్రదేశంలో తపస్సును ఆచరించగా బ్రహ్మ ప్రత్యక్షమవుతాడు. ఆ ప్రదేశంలో తీర్థాలను ప్రతిష్టిస్తాడు. దగ్గరలో ఒక సరోవరాన్ని నెలకొల్పుతాడు. బ్రహ్మ నెలకొల్పిన సరోవరమే బ్రహ్మసరోవరం. కాలక్రమేణ అది శివాలయంగా ప్రసిద్ధి గాంచింది.

స్థలపురాణం
పూర్వం దేవగిరి దుర్గంలో సుధర్మడు అనే బ్రాహ్మణుడు తన భార్య సుదేహతో కలిసి ఉండేవాడు. వారు నిత్యం అనేక పూజలు, నైతిక కార్యక్రమాలను నిర్వహించేవాడు. కానీ వారికి సంతానం లేక బాధపడేవారు. ఆ సమయంలో సుదేహ తన చెల్లెలైన ఘుష్మను భర్తకు ఇచ్చి వివాహం చేయాలనుకుంటుంది. వివాహానికి ముందే వారిని చూసి ఈర్ష్య పడనని వాగ్ధానం చేస్తుంది. వివాహం అయిన తరువాతా అక్కాచెల్లెళ్లిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. కాలక్రమేన ఘుష్మకు మగ సంతానం కలిగింది. కొంతకాలానికి ఘుష్మ కుమారుడికి వివాహం జరుగుతుంది. చెల్లెలి సంతానం అభివృద్ధి చెందడం సహించలేని సుదేహ.. ఘుష్మ కుమారున్ని చంపి కోనేటిలో పడేస్తోంది. శివ భక్తురాలైన ఘుష్మ ‘ ఇదంతా పరమేశ్వరుని లీల’ అనుకుంటూ ముక్కంటిని స్తుతిస్తుంది. అప్పుడక్కడ ప్రత్యక్షమైన పరమేశ్వరుడు జరిగిన విషయాన్ని ఘుష్మకు వివరిస్తాడు. పరమ శివుడు సుదేహని సంహరించడానికి ఉపక్రమించగా వద్దని ఘుష్మ ప్రాధేయపడుతుంది. దాంతో పరమేశ్వరుడు సుదేహకు పాపపరిహారం కల్పిస్తాడు. అప్పుడు ఘుష్మ స్వామిని తన పేరు మీద అక్కడ కొలువుతీరమని వేడుకుంటుంది. అంతట ఆ స్వామి అక్కడ స్వయంభువు కొలువయ్యాడు. ఘుశమేశుడిగా వెలసిన పరమేశ్వరుడు ఇక్కడ నిత్యం పూజలు అందుకుంటున్నాడు. ఆ ఘుశమేశుడే కాలక్రమంలో ఘృశ్నేశ్వరుడిగా ప్రసిద్ధి చెందాడని స్థల పురాణం.

ఆలయ విశిష్టత
పూర్వం రాజులు నిర్మించిన ఆలయం శిథిలావస్థకు చేరుతున్న స్థితిలో వేరూల్‌ గ్రామ పెద్ద, పరమ శివ భక్తుడైన భోస్లేకు ఘృశ్నేశ్వరుని మహిమ వలన పాముపుట్టలో ఒక పెద్ద నిధి లభిస్తుంది. ఆ సంపదతో అతను ఆలయానికి జీర్ణోద్ధరణ పనులు చేయిస్తాడు. అంతేకాక శిఖర సింగనపూర్‌లో ఒక చెరువును తవ్వించాడని ప్రతీతి. ఆ తరువాత భోస్లే వంశంలో సాక్షాత్తు ఆ భోలానాథుడే జన్మించి వంశప్రతిష్ఠను పెంచాడని కథనం. తరువాతి కాలంలో ఆలయానికి అహల్యాదేవి హోల్కార్‌ జీర్ణోద్ధరణ పనులు చేయించిందని ప్రశస్తి.

240 అడుగుల ఎత్తు, 185 అడుగుల వెడల్పు ఉన్న ఈ ఆలయం నేటికి ధృఢంగా, సుందరంగా నిలిచి ఉంది. మందిరానికి సగం ఎత్తులో ఫలకంపై దశావతారాల విగ్రహాలు చెక్కబడి దర్శనమిస్తాయి. ఇతర దేవతా విగ్రహాలూ భక్తి భావం రేకిత్తిస్తాయి.

24 రాళ్ల స్తంభాలపై ప్రధాన ఆలయ సభా మండపాన్ని నిర్మించారు. నందీశ్వరుడు ఏకశిల విగ్రహంగా దర్శనిమిస్తాడు. ఇక్కడ స్వామి వారు 17 అడుగుల ఎత్తు, 17 అడుగుల వెడల్పుతో పూర్వాభిముఖంగా దర్శనమిస్తారు. భక్తులే స్వయంగా అభిషేకాలు నిర్వహించవచ్చు. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఇది ఒక్కటే భక్తులు తాకే జ్యోతిర్లింగం. గర్భగుడిలోనికి పురుషులు పై వస్త్రాన్ని విడిచి వెళ్లాలి.

ఎలా చేరుకోవాలి
ఔరంగాబాద్‌ నుంచి ఈ క్షేత్రం ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
* దిల్లీ, ముంబయిల నుంచి ఔరంగాబాద్‌కు విమానాలను నడుపుతున్నారు.
* రైలు మార్గం ద్వారా అయితే ఔరంగాబాద్‌ నుంచి ఇక్కడికి నేరుగా చేరుకోవచ్చు.
* రోడ్డు మార్గం ద్వారా అయితే ప్రైవేట్‌, సొంత వాహనాల్లో ఔరంగాబాద్‌ నుంచి చేరుకోవచ్చు.
* వేరూల్‌ గ్రామం నుంచి ఔరంగాబాద్‌కు బస్సులు నడుస్తుంటాయి.



Tuesday, 31 October 2017

ఉడుపి భూలోక వైకుంఠం

ఉడుపి భూలోక వైకుంఠం


సరిగ్గా బ్రాహ్మీముహూర్తం రాగానే శంఖనాదాలు, దుందుభులు, నగారాలతో ప్రతిధ్వనిస్తుంది ఉడుపి మఠం. ఆలయ పూజారులతో సహా మఠంలో పని చేసేవారందరూ ఆ దివ్యనాదాలతో మేల్కొని, తమ దైనందిన చర్యలు ప్రారంభిస్తారు. కర్ణాటకలోని పేరెన్నికగన్న పుణ్యక్షేత్రాల్లో ప్రసిద్ధి పొందినది ఉడుపి. ధనిక-పేద; అగ్ర-నిమ్న కులాలనే భేదభావాలు మనుషులకే తప్ప, పరమాత్ముడికి లేవనేందుకు సాక్షాత్తూ ఆ కృష్ణభగవానుడే నిదర్శనం చూపించిన పుణ్యస్థలి ఉడుపి.

కర్ణాటక రాష్ట్రంలోని దక్షిణ కన్నడ జిల్లాకు పశ్చిమంగా, మంగుళూరుకు 60 కి.మీ దూరంలో ఉంది. ఉడుపి పుణ్యక్షేత్రం. నిత్యం ఉత్సవాలతో, లక్షలాది మంది యాత్రికులతో కళకళలాడుతూ ఉంటుంది ఈ పవిత్ర యాత్రాస్థలం. ‘ఉడుప’(చంద్రుడు)’ అనే పదాన్ని అనుసరించి ఈ క్షేత్రానికి ఉడుపి అనే పేరు వచ్చింది. పేరుకు తగ్గట్టే ఈ పవిత్ర క్షేత్రం స్వచ్ఛంగా, వెన్నెలలో ప్రకాశించే చంద్రుడిలా అద్వితీయమైన, అగోచరమైన దివ్యచైతన్యంతో అక్కడక్కడ పెద్ద పెద్ద మామిడి, పనస తోటలు, సువిశాలమైన పొలాలగుండా ప్రయాణించే యాత్రికులకు కొబ్బరి, పోక చెట్లు తమ తలలూపుతూ స్వాగతం పలుకుతాయి.

విశిష్టాద్వైత మత స్థాపకులు మధ్వాచార్యుల పవిత్ర హస్తాల మీదుగా స్థాపితమైన మఠం ఉడుపి. కనకదాసు అనే పరమభక్తుడిని నిమ్న కులస్థుడనే కారణంతో పూజారులు కృష్ణ దర్శనానికి నిరాకరించగా స్వయంగా తానే తన ప్రియభక్తునికి ప్రత్యక్ష దర్శనమిచ్చిన కరుణామూర్తి ఉడుపి చిన్నికృష్ణుడు. ఉడుపి పూర్వపు పేరు శివళ్ళీ. ఇది పరశురామక్షేత్రాలలో ప్రథమస్థానం కలిగి ఉంది. ప్రతి సంవత్సరం, లక్షలాది భక్తులు కృష్ణుని దర్శనం చేసుకోవటానికి ఉడుపిని సందర్శిస్తారు. స్వామి దర్శనం నవరంధ్రాలున్న కిటికీ ద్వారా చేసుకోవలసి ఉండటం ఈ దేవాలయ ప్రత్యేకత. ఉడుపి రథవీధిలో శ్రీ కృష్ణమందిరం ఉంది. ఉత్తర ద్వారం గుండా గుడిలోకి ప్రవేశించినప్పుడు కుడివైపు దేవాలయ కార్యాలయం, ఇంకొద్దిగా ముందుకు వెళ్ళితే మధ్వ సరోవరం కనిపిస్తుంది. ప్రధాన ఆలయానికి ద్వారం ఎడమవైపు ఉంటుంది. కొద్దిగా ముందుకు వెళితే చెన్నకేశవ ద్వారం వస్తుంది. దీని ద్వారా గర్భగుడిలో ప్రవేశం పీఠాధిపతులకు తప్పితే అన్యులకు ఉండదు. చెన్నకేశవ స్వామి ద్వారం నుండి ముందు వెళ్ళితే ప్రదక్షిణం చేసిన తరువాత శ్రీకృష్ణ దర్శనం వెండితో తాపడం పెట్టిన నవరంధ్రాల గవాక్షం గుండా చేసుకోవచ్చు. గర్భగుడికి కుడివైపు ముఖ్యప్రాణ దేవత (హనుమంతుడు), వామభాగాన గరుడ దేవర ఉన్నారు. స్వామి దర్శనం చేసుకొని ముందుకు వెళ్ళి దక్షిణ మార్గం వైపు వెళితే, ఎడమభాగాన మధ్వాచ్యారులు మంటపం కనిపిస్తుంది. ఉడుపి శ్రీకృష్ణ మఠానికి అనుసంధానంగా అష్టమఠాలు కృష్ణ మఠాలు ఉన్నాయి. ఈ ఎనిమిది మఠాలు ఉడుపి రథవీధిలో, శ్రీ కృష్ణ దేవాలయానికి చుట్టూ ఉంటాయి. అవి: పుత్తగె, పేజావర, పలిమారు, అదమారు, సోదె, శీరూరు, కాణియూరు, కృష్ణాపుర.

మధ్వాచార్యులవారు ఒకసారి సముద్రంలో తుఫానులో చిక్కుకున్న ఓడను, అందులోని ప్రయాణికులను తన తపశ్శక్తితో రక్షించాడు. అప్పుడు ఓడలోని నావికుడు ఆయనకు గోపీచందనం మూటను కానుకగా సమర్పించాడు. మధ్వాచార్యులు ఆ మూటను విప్పి చూడగా, ఆ చందనపు కణికల మధ్య చిన్నికృష్ణుడి విగ్రహం కనిపించింది. అది శ్రీకృష్ణుడి లీలగా భావించిన మధ్వాచార్యులవారు ఆ కృష్ణుడి విగ్రహాన్ని ఉడుపిలో ప్రతిష్ఠించారు. అదే మనం చూస్తున్న విగ్రహం. కనకదాసుకు కృష్ణపరమాత్మ పశ్చిమాభిముఖుడై దర్శనమిచ్చిన చోటనే ఒక మంటపం కట్టించారు. ఆ మంటపానికే కనకదాసు మంటపమని పేరు. ఉడుపిలో జరిపే పండుగలు, పర్వదినాలు: మకర. సంక్రాంతి, మధ్వ నవమి, హనుమాన్‌ జయంతి, శ్రీ కృష్ణ జన్మాష్టమి, నవరాత్రి మహోత్సవం, మధ్వ జయంతి (విజయ దశమి), నరక చతుర్దశి, దీపావళి, గీతాజయంతి వంటి పండుగలను పర్యాయ మఠంలో అంగరంగవైభవంగా జరుపుతారు.

దగ్గరలో ఉన్న మరికొన్ని ముఖ్య ప్రదేశాలు: 

కొల్లూరు ముకాంబికా దేవాలయం, మరవంతె బీచ్, మల్పే రేవు, కాపు దీపస్తంభం (కాపు లైటు హౌసు), కార్కళలోని గోమటేశ్వరుడు, వేణూరులోని గోమటేశ్వరుడు, అత్తూరులో సెయింట్‌ లారెన్స్‌ ఇగర్జి, సెయింట్‌ మేరీస్‌ ద్వీపం, మూడబిదరెలో సావిరకంబద బసది మణిపాల్, బైందూరు కోసళ్ళి జలపాతం, జామియా మసీదు, 200 సంవత్సరాల జామియా మసీదులో సరికొత్తగా 18,000 మంది ప్రార్థనలు చేసే విధంగా ప్రార్థనాశాలలున్నాయి. ఇక్కడ 3000 మంది భక్తులు బసచేయవచ్చు.

పాజక: ఉడిపి నుండి 12 కి.మీ దూరంలో ఉంది. ఇక్కడ మాధవాచార్యుడు ద్వైతసిద్ధాంత ప్రసంగం చేశాడు.
కొల్లూరు: ఉడిపి నుండి 74 కి.మీ దూరంలో ఉంది. మూకాంబికాదేవి నివాసిత ప్రదేశమని భక్తుల విశ్వాసం.
కర్కల: ఉడిపి నుండి 37 కి.మీ దూరంలో ఉంది. ఇక్కడ జైన బసదీలు (ఆలయాలు), గోమటేశ్వర శిల్పం (బృహద్రూపం ) ప్రత్యేక ఆకర్షణ.
అనెగుడ్డె: ఉడిపి నుండి 30 కి.మీ.లు. ఇక్కడ ప్రముఖ గణేశాలయం ఉంది.
ఆత్తుర్‌ చర్చి: ఉడిపి నుండి 25 కి.మీ.లు. ఇక్కడ ఏటా నిర్వహించే సంతకు కులమతభేద రహితంగా ప్రజలు వస్తారు.
బర్కూర్‌: ఉడిపి నుండి 15కి.మీల దూరం. జైన బసదీలు ఉన్న బర్కూరు తులునాడు రాజులకు రాజధాని.
సాలిగ్రామ: ఉడిపి నుండి 27కి.మీల దూరం. ఇక్కడా గురునరసింహస్వామి ఆలయం ఉంది.
పరంపల్లి: ఇక్కడ ఎనిమిది వందల ఏళ్ల నాటి పురాతనమైన విష్ణుమూర్తి ఆలయం ఉంది.
పెర్నకిల: ఇక్కడ ఒక పురాతన గణేశుని ఆలయం ఉంది.
పెర్దోర్‌: ఉడిపి నుండి 22 కి.మీ దూరంలో ఉంది.
అగుంబే – షిమోగా రాష్టీయ్ర రహదారి సమీపంలో అనంతపద్మనాభస్వామి ఆలయం ఉంది.
హరియాద్క: ఉడిపి నుండి 16 కి.మీలు. పురాతనమైన వీరభద్రాలయం ఉంది.
శంకరనారాయణ: ఉడిపి నుండి 40 కి.మీలు. శకరనారాయణాలయం ఒక సరోవరం మధ్యన ఉండడం విశేష ఆకర్షణ.
మారనకట్టె: ఉడిపి నుండి 45 కి.మీలు. ఈప్రాంతం ప్రకృతి ఆరాధకులకు స్వర్గభూమివంటిది.
మందర్హి: ఉడిపి నుండి 20 కి.మీలు. ఇక్కడ అమ్మనవారు (దుర్గాపరమేశ్వరి) ఆలయం ఉంది. ఇక్కడ ప్రసాదంగా ఇచ్చే ‘దోశ‘ సంతానప్రాప్తి కలిగిస్తుందని ప్రజలు విశ్వాసం.
ముదుహోలె కర్కడ: ఇక్కడ పురాతన దుర్గాపరమేశ్వరి ఆలయం ఉంది.
సోమేశ్వర వన్యప్రాణి అభయారణ్యం: ఇది ఉడిపి నుండి 40 కి.మీలు. ఇక్కడ అరుదైన జంతువులు, పక్షులు, ఔషధ మొక్కలు ఉన్నాయి.
మూకాంబికా వన్యప్రాణి అభయారణ్యం: ఇది ఉడిపి నుండి 50 కి.మీలు. కుందపూర్‌– కొల్లూర్‌ రోడ్డు పక్కన విస్తరించి ఉంది.
కుర్ధు తీర్ధ జలపాతాలు: ఉడిపి నుండి 42 కి.మీలు. పశ్చిమ కనుమలలోని దట్టమైన అరణ్యాల మధ్య, 300 అడుగులున్న ఒక అందమైన జలపాతం. ఋషుల తపస్సుతో ఈ మడుగు ఎంతో పవిత్రతను, ప్రాధాన్యతను సంతరించుకుంది.
మంగ తీర్ధ: కుర్ధు తీర్ధకు ఎగువన మంగ తీర్ధ ఉంది. ఇది దట్టమైన అరణ్యాల మధ్య నిటారుగా ఉన్న పర్వతాలలో ఉంది కనుక ఇక్కడకు కోతులు తప్ప మానవమాత్రులు చేరలేరు కనుక దీనిని కోతుల తీర్థం అని కూడా అంటారు.
బర్కన జలపాతం: ఉడిపి నుండి 54 కి.మీ దూరంలో ఉంది. ఇది పశ్చిమ కనుమలలో ఉడిపి, చికమగళూరు, శివమొగ్గ కూడలి ప్రాంతంలో ఉంది; బెల్కల్‌ తీర్థ జలపాతం, అరసిన గుండి, కుద్లు తీర్థ, కొసల్లి జలపాతం, సౌపర్ణిక, స్వర్ణ, చక్ర, సీత, వర్హి, కుబ్జ నదులున్నాయి. ఈ నదులలో అందమైన నదీ ద్వీపాలు ఉన్నాయి. వీటిని కుర్దూలు అంటారు. వీటిలో కొన్ని ద్వీపాలలో జనావాసాలు ఉన్నాయి.

విశేషాల ఉడిపి
శ్రీ కృష్ణుని రథానికి బ్రహ్మరథమని పేరు. ఇది బంగారంతో రూపొందింది.
శ్రీ కృష్ణుని ఉత్సవ విగ్రహాన్ని రత్నఖచితమైన సింహాసనంపై ఉంచుతారు.
అలనాడు శ్రీ కృష్ణుడు కనకదాసుకు దర్శనమిచ్చిన గవాక్షం(కిటికీ)లో నుంచే ఈ నాటికీ భక్తులు స్వామిని దర్శనం చేసుకుంటున్నారు.

ఎలా వెళ్లాలి?
దేశంలోని అన్ని ప్రధాన నగరాలనుంచి మంగుళూరుకు రైళ్లు, బస్సులు ఉన్నాయి. అక్కడి నుంచి యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉడుపికి బస్సులు, ప్రైవేటు వాహనాలలో చేరుకోవచ్చు. హైదరాబాద్‌ నుంచి ఉడుపికి నేరుగా బస్సులున్నాయి. హైదరాబాద్‌ డెక్కన్‌ నుంచి వాస్కోడిగామా ఎక్స్‌ప్రెస్‌ ఉంది.
– డి.వి.ఆర్‌.భాస్కర్‌

ద్వారక - మునిగి తేలిన నగరం

ద్వారక
మునిగి తేలిన నగరం


ద్వారకనగరాన్ని శ్రీ కృష్ణుడు పరిపాలించాడని పురాణాల్లో చదువుకున్నాం కదా... ఆయన తన అవతారాన్ని చాలించి వైకుంఠం చేరిన తరువాత ఈ పవిత్ర నగరం సముద్రపు జలాలలో మునిగిపోయింది. మహాభారత యుద్ధం జరిగిన 36 సంవత్సరాల అనంతరం ఈ నగరం సముద్రంలో కలిసి పోయింది. విష్ణు పురాణం ద్వారకానగర మునక గురించి ప్రస్తావించింది. యాదవ ప్రముఖులు గాంధారి శాపప్రభావాన, మునుల శాపప్రభావాన తమలో తాము కలహించికొని నిశ్శేషంగా మరణిస్తారు. ఆ తరువాత శ్రీ కృష్ణుని ఆదేశం మీద అర్జునుడు యాదవకుల సంరక్షణార్థం ఇక్కడకు వచ్చి శ్రీకృష్ణ బలరాములకు అంత్యక్రియలు నిర్వహించి ద్వారాకాపుర వాసులను ద్వారక నుండి దాటించిన మరు నిమిషం ద్వారక సముద్రంలో మునిగిపోయింది. ద్వారకానగరం మునిగిపోవడంతో ద్వాపరయుగం అంతమై కలియుగం ప్రారంభమైంది.

పదహారో శతాబ్దంలో ఈ అలయ నిర్మాణం జరిగినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. శ్రీకృష్ణుని ముదిమనుమడు వజ్రనాభుడు ఈ ఆలయానికొక రూపునిచ్చాడని చెబుతారు. ప్రస్తుతం మనకు కనిపించే అయిదంతస్తుల దివ్య ఆలయ శిఖరం మీద సూర్యచంద్రుల చిహ్నాలతో విలసిల్లే పతాకం కనిపిస్తుంది. ఈ ఆలయంలోకి స్వర్గ, మోక్షద్వారాలనే రెండు ద్వారాల గుండా ప్రవేశించవచ్చు. గర్భగుడిలో నాలుగు భుజాలతో విలసిల్లే త్రివిక్రమ(వామన) మూర్తి ఉన్నారు. ఆలయ సమీపంలో బలరాముడికి, కృష్ణుడికీ కుమారుడు, మనుమడూ అయిన ప్రద్యుమ్న అనిరుద్ధులకూ, శివకేశవులకూ ప్రత్యేకమైన పూజాస్థానాలున్నాయి. ఈ ఆలయంలో దేవకి, జాంబవతి, సత్యభామల విగ్రహాలు కూడా ఉన్నాయి. రుక్మిణీదేవికి మాత్రం ఈ ఆలయానికి దూరంగా ప్రత్యేకమైన ఆలయం ఉంది. ఆమె శ్రీకృష్ణుని అష్టమహిషుల్లో ప్రధానమైనది కాబట్టి ఈ ఆలయానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. గోమతీ నది సముద్రంలో కలిసే చోటున ద్వారకాధీశుని ఆలయం ఉంది.

ఈ క్షేత్రానికి సమీపానే గోమతీ నది సముద్రంలో సంగమిస్తుంది. అక్కడ నుండి బస్సుమార్గంలో బేట్‌ ద్వారక చేరాలి. ఇది శ్రీ కృష్ణుని నివాస స్థలం. ఇక్కడ స్వామి శంఖ చక్రధారియై ఉపస్థితమై ఉన్నాడు. దీనికి ఐదు కి.మీ. దూరంలో శంఖతీర్థం ఉంది. ఇక్కడ పెరుమాళ్ళ వక్షస్థలాన శ్రీదేవి ఉపస్థితమై ఉంది. రుక్మిణీదేవి ఉత్సవ తాయార్‌. ఇక్కడ అనేక సన్నిధులు ఉన్నాయి. ఇక్కడ నిత్యం తిరుమంజనం జరుగుతుంది. పసిపిల్లాడిలా–రాజులా–వైదికోత్తమునిలా అలంకారాలు జరుగుతుంటాయి. ద్వారక నుండి ఓఖా పోవుమార్గంలో ఐదు కి.మీ.ల దూరాన రుక్మిణీదేవి సన్నిధి ఉంది. ఇదే రుక్మిణీ కల్యాణం జరిగిన ప్రదేశం. ద్వారకాపురిలో వసుదేవ, దేవకి, బలరామ, రేవతి, సుభద్ర, రుక్మిణీదేవి, జాంబవతీదేవి, సత్యభామాదేవి ఆలయాలు కూడా ఉన్నాయి. బేట్‌ ద్వారక ఆలయానికి వెళ్ళే మార్గంలో రుక్మిణీదేవికి ప్రత్యేక ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని బోటులో ప్రయాణించి చేరుకోవాలి.

పవిత్ర నగరం
ద్వార్‌ అనే పదానికి సంస్కృత భాషలో వాకిలి, ద్వారం లాంటి అర్థాలు ఉన్నాయి. ద్వార్‌ అనే పదం ఆధారంగా ఈ నగరానికి ఈ పేరు వచ్చింది. అనేక ద్వారాలు ఉన్న నగరం కనుక ద్వారక అయింది. హిందువులు అతి పవిత్రంగా భావించే చార్‌ ధామ్‌ (నాలుగు ధామాలు) లలో ద్వారకాపురి ఒకటి. మిగిలిన మూడు పవిత్రనగరాలు బద్రీనాథ్, పూరి, రామేశ్వరం. ద్వారకాధీశుని ఆలయాన్ని జగత్‌మందిరం అని పిలుస్తారు. ఈ ఆలయ ప్రధాన దైవం శ్రీకృష్ణుడు. ద్వారకాపురి సమీపంలో జ్యోతిర్లింగాలలో ఒకటైన నాగేశ్వరలింగం ఉంది. ద్వారకలో శంకరాచార్యుడు ద్వారకా పీఠం స్థాపించబడింది. ఆది శంకరాచార్యులవారు నెలకొల్పిన నాలుగు మఠాలలో ఇది ఒకటి. మిగిలినవి శృంగేరి, పూరి, జ్యోతిర్మఠం. ద్వారకా పీఠాన్ని కాళికా పీఠంగా కూడా అంటారు.

శ్రీద్వారకనాథ్‌ మహాత్యం
ఆదిశంకరులు ద్వారకాధీశుడిని దర్శించి ద్వారకాపీఠాన్ని ప్రతిష్ఠించాడు. ఇక్కడ కృష్ణుడు క్షత్రియ రాకుమార వివాహ అలంకరణలో దర్శనం ఇస్తాడు. 108 దివ్యదేశాలలో ఈ క్షేత్రం ఒకటి. ద్వారకానా«థుడికి అనేక సేవలు, దర్శనాలు ఉంటాయి. దర్శనలకు తగినట్లు వస్త్రధారణలో మార్పులుంటాయి.

ద్వారకాసామ్రాజ్యం
మహాభారతం, హరివంశం, స్కాంద పురాణం, భాగవత పురాణం, విష్ణుపురాణాలలో ద్వారకాపురి ప్రస్తావన ఉంది. ప్రస్తుత ద్వారకాపురి సమీపంలో శ్రీ కృష్ణ నిర్మితమైన ద్వారాపురి ఉండేదని. పురాణేతిహాసాలలో వర్ణించబడిన విధంగా అది సముద్రగర్భంలో కలసిపోయిందని విశ్వసిస్తున్నారు. శ్రీ కృష్ణుడు యుద్ధాల వలన జరిగే అనర్థాల నుండి ద్వారకావాసులను రక్షించే నిమిత్తం ద్వారకానగర నిర్మాణం చేసి యాదవులను ఇక్కడకు తరలించి సురక్షితంగా పాలించాడని పురాణ కథనాలు వర్ణిస్తున్నాయి.  ద్వారకా నగరాన్ని శ్రీ కృష్ణుడి ఆజ్ఞానుసారం విశ్వకర్మ నిర్మించాడని ప్రతీతి. సౌరాష్ట్ర పడమటి సముద్రతీరంలో ఈ భూమి నగర నిర్మాణార్థ్ధం ఎంచుకోవడమైంది. ఈ నగరం ప్రణాళిక చేయబడి తరువాత నిర్మించబడింది. గోమతీనదీ తీరంలో ప్రణాళికాబద్ధంగా నిర్మించబడిన నగరం ద్వారక. ఈ నగరానికే ద్వారామతి, ద్వారావతి కుశస్థలి అని పేర్లున్నాయి. ఇది నిర్వహణా సౌలభ్యం కోసం ఆరు విభాగాలుగా విభజించి నిర్మించబడింది. నివాస ప్రదేశాలు, వ్యాపార ప్రదేశాలు, వెడల్పైన రాజమార్గాలు, వాణిజ్యకూడళ్లు, సంతలు, రాజభవనాలు, అనేక ప్రజోపయోగ ప్రదేశాలతో నిర్మితమైనది. రాజ్యసభా మంటపం పేరు సుధర్మ సభ. రాజు ప్రజలతో సమావేశం జరిపే ప్రదేశం ఇదే. ఈ నగరం సుందర సముద్రతీరాలకు ప్రసిద్ధం.

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషన్‌ టెక్నాలజీకి చెందిన ఒక బృందం చేసిన పరిశోధనలలో సముద్రగర్భంలోని ద్వారాపురి కనుగొనబడింది. ఆరు మాసాల పరిశోధనానంతరం 2000 డిసెంబరు మాసంలో కనుగొన్నారు. ఈ పరిశోధనానంతరం అదే విద్యాసంస్థ 2001లో జరిపిన పరిశోధనలో సముద్రజలాల్లో మునిగి ఉన్న కళాఖండాలను స్వాధీనపరచుకున్నారు. అలా లభించిన కళాఖండాలలోని భాగాలు యు. కె లోని ఆక్స్‌ఫర్డ్, జర్మనీ లోని హానోవర్‌ అలాగే పలు భారతీయ విద్యాసంస్థలకు కాలనిర్ణయ పరిశోధనా నిమిత్తం పంపారు.

బేట్‌ ద్వారక
బేట్‌ ద్వారక ప్రధాన దైవమైన శ్రీ కృష్ణుని ఆలయాలు ఇక్కడ ఉన్నాయి. పురాతన హిందూ సంప్రదాయానికి బేట్‌ ద్వారక ప్రసిద్ధి చెందింది. ఇక్కడ సముద్రతీర ప్రదేశాలు పురాతన వస్తువులకు ప్రసిద్ధి చెందినవి. ఇక్కడ లభించే మట్టి పాత్రల అవశేషాలు క్రీస్తు శకంలో సముద్రతీర దేశాలతో జరిగిన వ్యాపార, వాణిజ్యాలకు తార్కాణం. ఈ పుష్కలమైన రేవుపట్టణం మతప్రధానమయిన కేంద్రం. శ్రీ కృష్ణుడు అవతారం చాలించి వైకుంఠానికి వెళ్ళిన తరువాత సముద్రగర్భంలో కలసి పోయిందనే విశ్వాసానికి బలం చేకూరుతోంది. నిర్మాణశాస్త్ర నిపుణుల బృందాల పరిశోధనా ఫలితంగా అనేక పురాతన కళాఖండాలు సముద్రగర్భం నుండి వెలికి వచ్చాయి. ఇక్కడ అధిక సంఖ్యలో లభించిన రాతి లంగర్లు పురాతనకాలంలో ఉన్న రేవుపట్టణాలలో బేట్‌ ద్వారక చాలా ప్రముఖమైనదని సూచిస్తున్నాయి. బేట్‌ ద్వారక పరిసరాలు నౌకలు సురక్షితంగా నిలవడానికి అవకాశం కల్పిస్తూ ఈ నగరాన్ని సముద్రతరంగాల నుండి రక్షించిందని తెలియజేస్తున్నాయి.

ఎలా వెళ్లాలి?
హైదరాబాద్‌ నుంచి అహ్మదాబాద్‌కు విమానంలో వెళ్లి, అక్కడి నుంచి ద్వారకకు రోడ్డు మార్గాన వెళ్లవచ్చు.
సికింద్రాబాద్, అహ్మదాబాద్‌ ఓఖా ఎక్స్‌ప్రెస్‌లో ద్వారకకు సుమారు 39 గంటల ప్రయాణం. ద్వారక రైల్వేస్టేషన్‌ నుంచి పదినిమిషాలలో ద్వారకాధీశుని ఆలయానికి చేరుకోవచ్చు.

గోపరాజు పూర్ణిమాస్వాతి

Friday, 13 October 2017

సంతాన ప్రదాయిని కోట సత్తెమ్మ


సంతాన ప్రదాయిని కోట సత్తెమ్మ

పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో ఉంది కోట సత్తెమ్మ అమ్మవారి దేవస్థానం. అమ్మవారు భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్నారు. కోరిన కొర్కెలు తీర్చే చల్లని తల్లిగా ప్రసిద్ధి చెందింది సత్తెమ్మ. శ్రీ కోట సత్తెమ్మ అమ్మవారి దేవస్థానానికి పురాతన చరిత్ర ఉంది. అమ్మవారి విగ్రహం 11వ శతాబ్దంలోని తూర్పు చాళుక్యుల కాలానికి చెందినదని పరిశోధనలు చెబుతున్నాయి. అప్పట్లో నిడదవోలును నిరవధ్యపురంగా పిలిచేవారు. నిరవధ్యపురాన్ని పాలించిన వీరభద్రుని కోటలోని అమ్మవారు శక్తిస్వరూపిణిగా పూజలందుకున్నారు. కాలక్రమేణా కోట శిథిలమైంది. అమ్మవారి విగ్రహం కనుమరుగైంది. అలా అదృశ్యమైన అమ్మవారు 1934లో తిమ్మరాజుపాలెం గ్రామానికి చెందిన దేవులపల్లి రామసుబ్బరాయ శాస్త్రి పొలంలో, పొలం దున్నుతున్నప్పుడు బయటపడింది. భూమి యజమాని కలను అనుసరించి కోటసత్తెమ్మ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆనాటి నుంచి  నేటి వరకు అమ్మ... భక్తుల కోరికలు తీర్చే కొంగుబంగారంగా, వరాలిచ్చే చల్లని తల్లిగా పేరుగాంచుతోంది. ఈ ఆలయానికి ఉభయగోదావరి, శ్రీకాకుళం, విశాఖపట్టణం, విజయనగరం, గుంటూరు, కృష్ణ, జిల్లాల భక్తులు అధికంగా విచ్చేస్తుంటారు. ఆలయంలో ఏటా దసరా ఉత్సవాలతోపాటు అమ్మవారి తిరునాళ్ళను వైభవంగా నిర్వహిస్తున్నారు.

శంఖచక్రగద అభయ హస్త యజ్ఞోపవీతధారిణిగా ఏకశిలా స్వయంభూ విగ్రహంతో త్రిశక్తి స్వరూపిణిగా వెలసిన అమ్మవారిని సందర్శించటానికి రెండుకళ్లూ చాలవేమోననిపిస్తుంది. ఈ ఆలయానికి  క్షేత్రపాలకుడు పంచముఖ ఆంజనేయస్వామి. 


అమ్మవారి దర్శనం కోసం ఏటా సుమారు 5 నుంచి 6 లక్షల మంది భక్తులు వస్తుంటారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తుల సౌకర్యార్థం ఇక్కడ 65 గదులు ఉన్నాయి. ఆలయానికి ప్రతి ఆది, మంగళవారాలలో భక్తులు విశేషంగా తరలివచ్చి తమ మెక్కుబడులు తీర్చుకుంటారు. చుట్టుపక్కల గ్రామాలలో ప్రతి కుటుంబంలోనూ కోటసత్యనారాయణ, కోటసత్తెమ్మ అనే పేర్లు తప్పనిసరిగా పెట్టుకుంటారు. ఏటా శ్రావణమాసంలో చివరి శుక్రవారం నాడు సుమారు 1000 మంది ముతైదువలతో ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతాలను వైభవంగా నిర్వహిస్తారు. ఈ వ్రతాలకు నిడదవోలు పట్టణంతో పాటు వివిధ గ్రామాల నుండి మహిళలు తరలిరావడంతో సందడి నెలకొంటుంది. దేవస్థానం ఆధ్వర్యంలో మహిళలకు ఉచితంగా పసుపు, కుంకుమ, గాజులు, తమలపాకులు, లడ్డూ ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు. ఆలయానికి వచ్చిన భక్తులకు రోజుకి సుమారు 100 మందికి శాశ్వత అన్నదాన ట్రస్టు ద్వారా అన్నదాన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. అమ్మవారి దేవస్థానం ముందు భాగంలో దాతల సహకారంతో తొమ్మిది అంతస్తుల రాజగోపురం నిర్మాణ పనులు సాగుతున్నాయి.

సంతాన వృక్షానికి పెరుగుతున్న  భక్తుల తాకిడి
శ్రీ కోటసత్తెమ్మ అమ్మవారి దేవస్థానంలో గర్భాలయానికి నైరుతి వైపున ఉన్న సంతాన వృక్షానికి రోజు రోజుకు భక్తుల తాకిడి పెరుగుతోంది. సంతానం లేని దంపతులు ఈ వృక్షానికి ఊయల కట్టడం సంప్రదాయం. సంతానం లేని దంపతులు ఈ వృక్షం దగ్గరకు చేరుకుని ఎర్రటి వస్త్రం, పూర్తిగా పండిన రెండు అరటిపండ్లను అమ్మవారికి సమర్పిస్తారు. అనంతరం ఒక అరటి పండును, ఎర్రటి వస్త్రాన్ని తీసుకుని దంపతులు సంతాన వృక్షానికి ఊయల కట్టి, ఆ ఊయలలో పండును ఉంచి, ‘అమ్మా... పండు కడుతున్నాను పండంటి బిడ్డను ప్రసాదించు తల్లీ’ అని వేడుకుంటారు. బిడ్డ పుట్టిన తరువాత అమ్మవారి సన్నిధి తీసుకువచ్చి పేరు పెట్టుకోవడంతోపాటు బిడ్డ ఎత్తు తులాభారంతో మొక్కుబడి తీర్చుకుంటారు. తులాభారానికి నగదు (నాణేల రూపంలో) లేదా పటిక బెల్లం తూకం సమర్పించుకుంటారు.

ఆలయానికి వచ్చే మార్గం...
అమ్మవారి ఆలయం నిడదవోలు రైల్వేస్టేషన్‌కి (బస్‌ స్టాండ్, గణపతి సెంటర్‌ల మీదుగా) 3 కిలోమీటర్ల దూరాన ఉంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నుండి 26 కిలోమీటర్లు, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నుండి 25 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఆలయానికి చేరుకోవచ్చు.

Wednesday, 27 September 2017

పంచముఖేశ్వరాలయం









పరమాద్భుతం పంచముఖేశ్వరాలయం



పవిత్రమైన కావేరీ పుష్కరాలు మొదలవుతున్నాయి త్వరలో. పుష్కర స్నానంతో పాటు అక్కడే ఉన్న పుణ్యక్షేత్రాలను కూడా సందర్శించడం అధిక పుణ్యప్రదం, ఫలప్రదం. కావేరీ నది ప్రవహించే కర్ణాటక, కేరళ, తమిళనాడులలో కావేరీ పుష్కరఘాట్‌లకు చేరువలో ఉన్న పుణ్యక్షేత్రాలలో కర్ణాటకలోని తలకాడ్‌ వైద్యేశ్వర స్వామి వారి ఆలయం సుప్రసిద్ధమైనది. ఎందుకంటే ఇక్కడ శివుని పంచముఖాలూ, పంచనామాలతో, పంచ ఆవరణలలో పంచలింగాలుగా కొలువుదీరి, భక్తులను అబ్బురపరుస్తూ, అనుగ్రహిస్తుంటాయి. అవే వైద్యేశ్వర, అర్కేశ్వర, వాసుకేశ్వర, సైకతేశ్వర, మల్లికార్జున లింగాలు. అలాగే ఇక్కడ పాతాళేశ్వర, మరాళేశ్వర ఆలయాలు కూడా ఉన్నాయి. ప్రతి ఆలయ దర్శనానికి ముందూ కావేరీ నదిలో స్నానం చేసి, ఆ తర్వాతనే స్వామివారిని దర్శించుకోవడం ఇక్కడి ఆచారం. అయిదు ఆలయాలూ 30 కిలోమీటర్ల పరిధిలోనే ఉన్నాయి కాబట్టి, మార్గాయాసం కూడా ఉండదు. ఒకవేళ ఏమైనా బడలిక కలిగినా, నదీస్నానంతో ఒళ్లు తేలికపడుతుంది కూడా.

ఈ పంచముఖలింగాలనూ దర్శించుకున్నాక అక్కడకు చేరువలోనే ఉన్న కీర్తినారాయణస్వామి వారి ఆలయానికి వెళ్లి, స్వామి వారిని సందర్శించుకోవాలి. అలా చేస్తేనే యాత్రాఫలం దక్కుతుందని అంటారు.

బెంగళూరుకు దగ్గరలోని తలకాడులోగల పంచముఖేశ్వర స్వామి ఆలయం పేరుకు ఒకటే కానీ, ఐదు ఆలయాలున్నాయి. అయిదూ శివాలయాలే. తలకాడు చాలా చిన్న గ్రామం. అయినప్పటికీ పంచముఖ ఆలయాల కారణంగా ప్రసిద్ధికెక్కింది. ప్రతి సోమవారమూ ఇక్కడ ఇసక వేస్తే రాలనంత మంది భక్తజన సందోహం స్వామివారిని అర్చిస్తూ... శివనామస్మరణ చేస్తుంటారు. ప్రత్యేకించి పౌర్ణమినాడు, మరీ విశేషంగా చెప్పాలంటే శ్రావణ పున్నమి, కార్తీక పున్నములలో ఇక్కడికి వచ్చే భక్తజన కోటితో ఊరంతా నిండిపోతుంది.

నిజానికి అసలీ గ్రామమంతా ఆలయాలతో నిండి ఉండేదట. అయితే, విదేశీయుల దండయాత్రలలో ఆలయాలన్నీ ఇసుక మేటవేసినట్లయిపోయాయి. అందుకే ఇక్కడ ఎండ మాడ్చేస్తున్నా, కాళ్లు కాలిపోతున్నా, పాదరక్షలతో నడవడం అపచారంగా భావిస్తుంటారు భక్తులు. వైద్యనాథేశ్వర స్వామి వారిని సందర్శించడం, అభిషేకం చేసుకోవడం వల్ల దీర్ఘరోగాలు, మొండివ్యాధులు తొలగిపోయి, ఆరోగ్యవంతులవుతారన్న నమ్మకంతో ఎక్కడెక్కడినుంచో భక్తులు ఇక్కడికి విచ్చేస్తుంటారు. తమ నమ్మకం వమ్ముకానట్లుగా ఆరోగ్యభాగ్యంతో వెళుతుంటారు. ఇతర సందర్శనీయ స్థలాలు భక్తులు పవిత్రమైన పుష్కరస్నానం చేయడంతోపాటు ఆ చుట్టుపక్కలనున్న ఆలయాలను, చారిత్రక, ప్రకృతి రమణీయ ప్రదేశాలను సందర్శించడం వల్ల ఆ దివ్యానుభూతులను మళ్లీ పుష్కరాలొచ్చే వరకూ మదిలో పదిలంగా మూటగట్టుకోవచ్చు.

మైసూరులోని చెన్నకేశవ స్వామి ఆలయం:
12వ శతాబ్దంలో హొయసాల రాజుల కాలానికి చెందిన ఈ ఆలయ నిర్మాణం, శిల్పచాతుర్యం అపురూపం, అనితర సాధ్యం. మూడవ నరసింహ వర్మ నిర్మించిన ఈ ఆలయం కావేరీ పుష్కరస్నానం చేసే భక్తులకు అవశ్య సందర్శనీయం.

భగందేశ్వర ఆలయం: 
కర్ణాటకలోని భగమండలంలోగల ఈ ఆలయం భగంద మహర్షి పేరు మీదుగా నెలకొన్నది. భగమండలంలోగల త్రివేణీ సంగమంలో స్నానం చేయడం అత్యంత పుణ్యప్రదమని భక్తుల విశ్వాసం.

విశ్వేశ్వరాలయం, కర్ణాటక:
8వ శతాబ్దంలో రాష్ట్రకూటుల కాలంలో చాళుక్యల శిల్పకళారీతిలో నిర్మించిన ఈ ఆలయం అత్యంత పురాతనమైనది. కావేరీ పుష్కరఘాట్లలో ఇది అత్యంత తలమానికమైనదిగా పేరు పొందింది.

అదే విధంగా ఇక్కడకు దగ్గరలోని సోమనాథపురలోని వేణుగోపాలస్వామి ఆలయం, చెన్నకేవస్వామి ఆలయాలు రెండూ తప్పక చూడదగ్గ ప్రాచీన ఆలయాలు. శిల్పసంపద కలబోసుకున్న పురాతన కట్టడాలు.

– డి.వి.ఆర్‌. భాస్కర్‌



Tuesday, 12 September 2017

మహేంద్రగిరి


మహేంద్రగిరి.. ఎంత బాగుందో..!


‘ప్రకృతిలో మమేకమై కొండాకోనల్లో పర్యటించాలన్నా, మేఘాలమీద నడుస్తున్నట్లో గాల్లో తేలుతున్నట్లో ఉన్న అనుభూతిని సొంతం చేసుకోవాలన్నా, సాహసయాత్రలు చేయాలనుకున్నా... మహేంద్రగిరి ఎక్కాల్సిందే’ అంటున్నారు ఇటీవలే అక్కడికెళ్లొచ్చిన శ్రీకాకుళవాసి గేదెల భరత్‌కుమార్‌.

ఒడిశాలోనే రెండో అత్యంత ఎత్తైన శిఖరమైన మహేంద్రగిరి పర్వతాన్ని మిత్రులమంతా కలిసి అధిరోహించాలనుకున్నాం. ఒడిశాలోని కొరాపుట్‌ జిల్లాలోని డియోమలి పర్వతం తర్వాత ఆ రాష్ట్రంలో రెండో అత్యంత ఎత్తైన పర్వతం మహేంద్రగిరే. సముద్రమట్టానికి 4925 అడుగుల ఎత్తులో తూర్పుకనుమల్లో ఉన్న ఆ పర్వతాన్ని ఎక్కేందుకు మేము ఒడిశాలోని గజపతి జిల్లా కేంద్రమైన పర్లాఖెమొండికి చేరుకున్నాం. అక్కడినుంచి మూడు బైకులమీద 66 కి.మీ దూరంలోని మహేంద్రగిరి ప్రాంతానికి బయలుదేరాం. ఏడోమైలు, లంజిపొదొరో, జిరంగో, కొయ్‌పూర్‌, మడవ తదితర గ్రామాలు దాటి ముందుకు సాగాం. వంకరలు తిరిగిన ప్రమాదకరమైన ఘాట్‌రోడ్డు అది. నేల నుంచి నింగి వరకూ పచ్చదనం పరుచుకుందా అనిపించేంతగా అబ్బురపరిచే ఎత్తైన కొండలూ, దారిపొడవునా కనిపించే సెలయేర్లూ, కొండలమీద నుంచి ఉరికే జలపాతాల సోయగాల్ని చూస్తూ 44 కి.మీ మేర సాగిన మా బైకు ప్రయాణం సాహసభరితంగా అనిపించింది.

మడవ గ్రామం దాటాక బుర్ఖత్‌ సమీపంలోని ఓ సాధువు ఆశ్రమం దగ్గర మా బైకులను నిలిపి కాలినడకన బయలుదేరాం. మూడు వైపులా ఎత్తైన కొండల్నీ కనుచూపుమేరలోని కొండలన్నింటినీ మింగేసిన మేఘాలను చూసి మంత్రముగ్ధులయ్యాం. అప్పటికే అక్కడ చిరుజల్లులు కురుస్తున్నాయి. ఆ వర్షంలో తడుస్తూనే నిటారుగా ఉన్న ఆ కొండల్ని ఎక్కుతూ ముందుకెళ్లాం. కొంతసేపటికి వర్షం తగ్గుముఖం పట్టింది. మహేంద్రగిరి శిఖరాన్ని చేరుకునే క్రమంలో చిన్న చిన్న కొండలెన్నో ఎక్కాం. ఎత్తుకు చేరుతున్న కొద్దీ మేఘాల నడుమ నడుస్తున్నట్లూ ఆకాశాన్ని అందుకున్నట్లూ గాలిలో తేలుతున్నట్లూ అనుభూతి చెందాం.

సూర్యాస్తమయ సమయానికి మేం మహేంద్రగిరిపైకి చేరుకున్నాం. పచ్చదనంతో నిండిన కొండలను ముద్దాడే నీలాకాశంలో కనువిందు చేసే సూర్యాస్తమయ దృశ్యాల్ని కమ్ముకొస్తున్న చిరుచీకట్లు మెల్లమెల్లగా మింగేయసాగాయి. ఆ అందాల్ని చూస్తూనే ముందుకు సాగాం. చిక్కని చీకటి అడవంతా పరచుకుంది. సుదూరంలోని పలు గ్రామాలూ, పట్టణాల్లో రాత్రి పూట వెలిగి ఉన్న వీధి దీపాలు మిణుగురు పురుగుల గుంపులా కనిపించాయి. ఆ చీకటివెలుగుల దోబూచులాటలో అలా నడుస్తూనే ఉన్నాం. దారిపొడవునా పక్షులూ కీచురాళ్ల చిరుశబ్దాలు వీనులవిందు చేశాయి. అలా మధ్యాహ్నం మూడు గంటలకు మొదలైన మా నడక, రాత్రి తొమ్మిది గంటలవరకూ సాగి, ఎట్టకేలకు అక్కడున్న బాబా కుటీరానికి చేరుకున్నాం. మా బృందంలో సభ్యుడైన కోరాడ కృష్ణప్రసాద్‌కు ఆ ప్రాంతం చిరపరిచితం కావడం, గతంలో ఆయన అక్కడికి పలుమార్లు వెళ్లి ఉండటంతో చీకటిపడినా నడకమార్గంలో మేం ఎక్కడా దారి తప్పలేదు.

ఈ దట్టమైన అరణ్యంలో పర్వతశిఖరంపైన చిన్న కుటీరాన్ని ఏర్పాటుచేసుకుని గత పదిహేనేళ్లుగా ప్రఫుల్లబాబా ఒక్కరే నివాసం ఉంటున్నారు. ఓ యాగశాలను ఏర్పాటు చేసుకుని పదిహేనేళ్లుగా నిత్య హోమం నిర్వహిస్తున్నారు. ఆ చుట్టుపక్కల ఆదివాసీలే ఆయనకు అవసరమైన నిత్యావసరాలను అప్పుడప్పుడూ కింది నుంచి పైకి చేరవేస్తుంటారు.

ఆయన యాగశాల ఎదురుగా ఉన్న మట్టికుటీరంలో ఆ రాత్రికి పడుకున్నాం. అప్పటికే అక్కడ కుండపోతగా వర్షం కురుస్తోంది. మరోవైపు చలిగాలి మమ్మల్ని వణికించేస్తోంది. మాతో పాటు దుప్పట్లు తీసుకుని వెళ్లినా అక్కడి చలి నుంచి అవి ఎంతమాత్రమూ కాపాడలేకపోయాయి. దీంతో బాబా తన దగ్గరున్న రగ్గులు కప్పుకోమని ఇచ్చారు. వాటిని కప్పుకొని చలినుంచి రక్షణ పొందాం.

ఆధ్యాత్మిక కేంద్రం!
ఏడాది పొడవునా మానవ సంచారమే కనిపించని ఈ ప్రాంతం, మహాశివరాత్రి ముందు రోజు మాత్రం భక్తులతో నిండిపోతుంది. ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌, పశ్చిమబంగా తదితర రాష్ట్రాల నుంచి వేలాది భక్తులు కాలినడకన తరలివచ్చి, శివలింగాలను దర్శించుకుంటారు. ముందురోజు రాత్రికే కొండపైకి చేరుకుని అక్కడే చెట్లూ, పొదల మాటున బస చేస్తారు. చలికాలం కావడంతో ఆ సమయంలో ఎటువైపు చూసినా నెగళ్లే కనిపిస్తుంటాయి. ఇటీవల కాలంలో కార్తీక మాసంలోనూ ఈ ప్రాంతాన్ని సందర్శించే భక్తుల సంఖ్య పెరిగింది. ఈ పర్వతంపైనే పరశురాముడు తపస్సు చేశాడనీ చెబుతారు. అందుకు ప్రతీకగా రెండు దశాబ్దాల కిందట ఈ పర్వత శిఖరంపైన పరశురాముడి విగ్రహాన్నీ ఏర్పాటుచేశారు. ధ్యానం, యోగాభ్యాసానికి అనుకూలప్రదేశం కావడంతో వాటి సాధన కోసం వస్తున్న వారి సంఖ్య ఇటీవల పెరిగింది. అలా వచ్చేవారిలో చాలామందికి బాబా మట్టికుటీరమే శరణ్యం. కానీ అది చాలా చిన్నది. అయినా వచ్చేవాళ్లు వంటసామగ్రి వెంట తెచ్చుకుని అక్కడే వండుకుని నిద్రిస్తుంటారు.

పాండవుల ఆలయాలు
మర్నాడు ఉదయం నిద్రలేవగానే బయటకు వచ్చి చూస్తే మంచుపొరలు చీల్చుకుంటూ వెలుగులు చిమ్మే సూర్యోదయం అనిర్వచనీయ అనుభూతిని మిగిల్చింది. సమీపంలోని బంగాళాఖాతం తీరమూ, గ్రామాలూ, పట్టణాలు అన్నీ కలిసి ప్రకృతి కాన్వస్‌పైన చిత్రకారుడు వేసిన చిత్రాలను తలపించాయి.మేం బస చేసిన ఆశ్రమానికి సమీపంలోనే పాండవుల ఆలయాలు ఉన్నాయి. వనవాసం సమయంలో పాండవులు కొంతకాలం ఇక్కడ జీవించారనీ, అప్పుడు ఈ ఆలయాలను నిర్మించారనీ చెబుతారు. కుంతి, ధర్మరాజు, భీముడి ఆలయాలు మాత్రమే కనిపిస్తాయి. మిగిలినవి శిథిలమయ్యాయట. ఈ ఆలయాలన్నింటిలోనూ శివలింగాలే ఉన్నాయి. 30 అడుగుల ఎత్తులో ఉన్న కుంతీ ఆలయాన్ని అత్యంత అరుదైన రాతికట్టుతో నిర్మించారు. దీని వాస్తునిర్మాణం ఓడ్ర శిల్పాన్ని పోలి ఉంది. ఆలయం భూమి లోపలికి దిగినట్లు కనిపిస్తుంది. మెట్లు దిగి లోపలికి వెళ్లాం. ఆలయం ముఖద్వారం పశ్చిమదిశలో ఉంది. ఆలయం వెలుపలి భాగంలో తూర్పున కుమారస్వామి, ఉత్తరాన పార్వతీదేవి, దక్షిణాన విఘ్నేశ్వరుని విగ్రహాలు ఉన్నాయి. ఈ ఆలయం ఎదురుగా రెండు పురాతన బావులున్నాయి. ఎత్తైన కొండమీద వాటిని ఎలా తవ్వారన్న ఆలోచన ఆశ్చర్యానికి గురిచేసింది.






కుంతీ మందిరం నుంచి ఉత్తరదిశలో ఉన్న కొండపైన ధర్మరాజు ఆలయం ఉంది. ఈ పర్వతంపైన ఉన్న ఆలయాలన్నింటిలోకి ఇదే పెద్దది. దీనికి పశ్చిమదిశలో ముఖద్వారం ఉంటుంది. భక్తులు దీన్ని యుధిష్ఠర ఆలయంగా పిలుస్తారు. ఈ ఆలయ నిర్మాణం కళింగ నిర్మాణ శైలిలోని త్రిరథ ఆకారాన్ని పోలి ఉందని చరిత్రకారుల అభిప్రాయం. ఆలయం పక్కనుంచి పారే సెలయేటి సవ్వడి మమ్మల్ని చాలాసేపు అక్కడి నుంచి కదలనివ్వలేదు. ధర్మరాజు ఆలయం ఎదురుగా ఉన్న మరో కొండ శిఖరంపైన భీముడి ఆలయాన్ని కేవలం అయిదు భారీ రాళ్లతో నిర్మించారు. ఆ ఆలయం లోపలికి వెళ్లడానికి చిన్న సందు మాత్రమే ఉంటుంది. మహేంద్రగిరి పర్వతంపైన ఉన్న అన్ని ఆలయాల్లో ఇదే పురాతనమైనది. క్రీ.శ.ఆరో శతాబ్దానికి ముందే ఈ ఆలయాలు వెలుగులోకి వచ్చాయనేది చరిత్రకారుల అభిప్రాయం. ఈ పర్వతం కొసన ఉన్న ఓ కొండపైన జగన్నాథస్వామి ఆలయం ఉంది. దీన్ని దారుబ్రహ్మ ఆలయంగా పిలుస్తారు. చుట్టూ చెట్లూ వాటి మధ్య రాళ్లూరప్పలతో కూడిన అత్యంత క్లిష్టమైన మార్గంలో ఆ ఆలయానికి చేరుకున్నాం.





మహేంద్రతనయ నది జన్మస్థలం
స్నానపానాదులు ముగించుకుని మహేంద్ర తనయగా పిలిచే నది పుట్టిన ప్రదేశం చూడ్డానికి వెళ్లాం. ఒడిశాలోని గజపతి, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాల్లోని వేల ఎకరాలకు తాగు, సాగునీరును అందించే మహేంద్రతనయ ఈ పర్వతంలోనే పుట్టింది. అయితే అది ఎక్కడన్నది కచ్చితంగా చెప్పలేం. దాని ఆనవాళ్లుగా అనేక ప్రవాహాలు చూపిస్తారు. ఎందుకంటే మహేంద్రగిరి పర్వతంపైన ఏడాదిపొడవునా వర్షం కురుస్తూనే ఉంటుంది. ఈ వర్షపు నీరు ఆ కొండపైన అనేక సెలయేర్లుగా, జలపాతాలుగా పారి కిందికి వచ్చేసరికి నది రూపును సంతరించుకుని, రెండు పాయలుగా విడిపోతుంది. ఒక పాయ శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం వైపు సాగి, 70 కి.మీ మేర ప్రవహించి గొట్టా బ్యారేజీ వద్ద వంశధార నదిలో కలిస్తే, మరో పాయ మందసవైపుగా సాగి 40 కి.మీ.మేర ప్రవహించి బారువవద్ద సముద్రంలో కలుస్తుంది.

జీవవైవిధ్యానికి కేంద్రం
మహేంద్రగిరి జీవవైవిధ్యానికీ కేంద్రమే. నెమళ్లు, ఎగిరే ఉడుతలు, రాక్షస తొండలు, ఏనుగులు, మచ్చల జింకలు, మైనాలు వంటి అనేక రకాల అరుదైన జీవజాలానికి ఇది నివాస కేంద్రం. దాదాపు 1200 రకాల జాతులకు చెందిన మొక్కలు ఈ పర్వతంపైన ఉన్నాయని ఒడిశా జీవవైవిధ్య మండలి నిర్వహించిన అధ్యయనంలో తేలింది. ఒడిశా రాష్ట్రంలోని వివిధ పుష్పజాతులకు చెందిన మొక్కల్లో 35 శాతం మొక్కలకు మహేంద్రగిరి ఆవాస కేంద్రమని గుర్తించారు. దాదాపు 300కు పైగా ఔషధ గుణాలు కలిగిన మొక్కలు ఇక్కడ లభిస్తాయి. అతి త్వరగా అంతరించిపోతున్న, అత్యంత అరుదైన ఔషధ గుణాలు కలిగిన మొక్కలు ఇప్పటికీ ఈ పర్వతంపైన లభిస్తున్నాయి.

అక్కడ పూటపూటకీ ఆకాశంలో రంగులు మారిపోసాగాయి. తొలిసంధ్యలో పక్కన ఏముందో కనిపించనంతగా దట్టంగా కమ్మేసిన మంచూ, అంతలోనే చురుక్కుమనిపించే సూర్యోదయం, ఉన్నట్టుండి భోరున కురిసే వర్షమూ సాయంసంధ్యా సమయానికి ఆహ్లాదాన్ని పంచే శీతగాలులూ రాత్రికి ఎముకలు కొరికేసే చలీ... ఇలా ఒక్క రోజులోనే అనుభవంలోకి వచ్చిన అక్కడి వాతావరణానికి అచ్చెరువొందుతూనే పర్వతం మొత్తాన్నీ చుట్టి ఆ సాయంత్రం తిరుగు ప్రయాణమయ్యాం.

ఎలా వెళ్లాలి?
మహేంద్రగిరిని పర్యటించాలనుకునేవాళ్లకి అక్కడ బస చేయడానికి తగిన సదుపాయాలు లేవు. కాబట్టి ఒడిశాలోని గజపతి జిల్లా కేంద్రమైన పర్లాఖెమొండికి చేరుకుంటే అక్కడ బస చేయడానికి లాడ్జీలు అందుబాటులో ఉంటాయి. విశాఖపట్నం విమానాశ్రయం నుంచి 200 కి.మీ దూరంలో, భువనేశ్వర్‌ నుంచి 285 కి.మీ దూరంలోనూ పర్లాఖెమొండి ఉంది. ఒడిశాలోని బ్రహ్మపురం రైల్వేస్టేషన్‌ నుంచి 120 కి.మీ., శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే స్టేషన్‌ నుంచి 40 కి.మీ దూరం ప్రయాణించీ పర్లాఖెమొండి చేరుకోవచ్చు. పర్లాఖెమొండి నుంచి మహేంద్రగిరికి వెళ్లాలంటే ప్రైవేటు వాహనాల్లో వెళ్లొచ్చు. లేదా కొయిన్‌పూర్‌ వరకూ ప్రైవేటు బస్సుల్లో ప్రయాణించొచ్చు. వ్యక్తిగత వాహనాల్లో వెళితే బుర్ఖత్‌ వరకూ చేరుకోవచ్చు. అక్కడ వాహనాలను నిలిపేసి కాలినడకన ఎక్కాల్సిందే. కొయినపూర్‌లో అటవీశాఖ అతిథిగృహం ఉంది. అక్కడ నలుగురు బస చేసేందుకు వీలుంటుంది. అక్కడ కూడా వాహనాలను నిలిపి కాలినడకన పర్వతాన్ని ఎక్కొచ్చు.







మహేంద్రజాలం చూడాల్సిందే!

తూర్పుకనుమల్లో అందాలు నెలకొన్న కొండలు మహేంద్రగిరులు. ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో పర్వత శ్రేణులపై ప్రకృతి ఎప్పుడూ పరవశిస్తూ ఉంటుంది. చెట్లు, చేమలతో పచ్చలపేరులా మెరిసిపోతున్న మహేంద్రగిరుల్లో.. అక్కడక్కడా వజ్రాలు పొదిగినట్టుగా అపురూప ఆలయాలు దర్శనమిస్తాయి. ముత్యాలు కుమ్మరించినట్టుగా నీటి చెలమలు కనిపిస్తాయి. ఈ గిరులకు ఏడాదంతా పర్యాటకుల తాకిడి ఉంటుంది. ముఖ్యంగా శివరాత్రి సందర్భంగా వేల మంది భక్తులు తరలి వస్తారు. ఇక్కడి పాండవుల ఆలయాలను సందర్శిస్తారు. ఆ చుట్టుపక్కల వాళ్లు ప్రతిష్ఠించిన మహాలింగాలను భక్తితో పూజిస్తారు.

శ్రీకాకుళం జిల్లా మందస మండలం సింగుపురం సమీపంలో ఉంటాయి మహేంద్రగిరులు. సముద్ర మట్టానికి ఐదువేల అడుగుల ఎత్తులో ఉన్నాయివి. అరుదైన వృక్షసంపద వీటి సొంతం. వనవాసకాలంలో పాండవులు మహేంద్రగిరులపై కొంతకాలం గడిపారని చెబుతారు. ఆ సమయంలో ఒక్కొక్కరూ ఒక్కో మందిరాన్ని నిర్మించుకొన్నారని స్థానిక కథనం. అందుకు తగ్గట్టుగా ఇప్పుడు అక్కడ పాండవుల పేరిట ఆలయాలు కనిపిస్తాయి. ధర్మరాజు, కుంతీదేవి ఆలయాలు ఒక ప్రదేశంలో ఉండగా.. భీమసేనుడి ఆలయం ఎత్తయిన శిఖరంపై కనిపిస్తుంది. అక్కడికి కొంత దూరంలో అర్జునుడు, నకుల, సహాదేవుల ఆలయాలు ఉన్నాయి. వీటి పరిసర ప్రాంతాల్లో పాండవులు ప్రతిష్టించారని భావించే లింగాలు కనిపిస్తాయి.

కాలప్రవాహంలో ఆలయాలన్నీ శిథిలావస్థకు చేరుకున్నాయి. అయినా.. వాటి ప్రాశస్త్యం మాత్రం తగ్గలేదు. ఏటా శివరాత్రి సందర్భంగా మహేంద్రగిరులపై జరిగే ఉత్సవాలకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ నుంచి కూడా భక్తులు వస్తుంటారు. పిల్లలు, పెద్దలు వ్యయప్రయాసలకోర్చి సాహసయాత్రకు పూనుకుంటారు. శివరాత్రికి ఒకరోజు ముందుగానే భక్తులంతా గిరులపైకి చేరుకుంటారు. పూజాసామగ్రి, మంచినీళ్లు, ఆహారం, పళ్లు అన్నీ వెంట తెచ్చుకుంటారు. శివరాత్రి ఉపవాస దీక్షలో ఉంటారు. భజనలతో రాత్రంతా జాగరణ చేస్తారు. మర్నాడు భోజనాలు చేసుకొని తిరుగు ప్రయాణం అవుతారు. శివరాత్రి సందర్భంగా జనంతో కిటకిటలాడే మహేంద్రగిరులు ఆ తర్వాత బోసిపోతాయి. సాహస యాత్రికులు మాత్రం తరచూ ఇక్కడికి వస్తుంటారు.

ఇలా వెళ్లాలి..

  • మహేంద్రగిరుల యాత్రకు సాహసంతో పాటు ఓపిక కూడా ఉండాలి. ముందుగా శ్రీకాకుళం, ఇచ్ఛాపురం నుంచి బస్సుల్లో మందస మండలం సింగుపురం చేరుకోవాలి.
  • మహేంద్రగిరులకు సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్‌ పలాస. ఇక్కడి నుంచి మందస మీదుగా సింగుపురం చేరుకోవచ్చు. బస్సులు, ఆటోలు అందుబాటులో ఉంటాయి.
  • సింగుపురం నుంచి వాహనాల్లో.. చొంపాపురం మీదుగా ఆంధ్రా-ఒడిశా సరిహద్దు గ్రామమైన రాజబసకు వెళ్లాలి. ఆపై కాలినడక మొదలవుతుంది. దాదాపు 28 కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. చల్లని గాలులు, ప్రకృతి సౌందర్యం, గలగల పారే సెలయేళ్లు.. యాత్రికులకు అలసట తెలియనివ్వవు.
కాశీబుగ్గ-మందస

Saturday, 2 September 2017

మదరాంతేశ్వర స్వామి

రోజు రోజుకూ పెరిగే గణపయ్య

విఘ్నాలకు అధిపతి వినాయకుడు. పార్వతీ తనయుడైన గణపతిని పూజించిన అనంతరమే అన్ని కార్యాలను ప్రారంభిస్తాం. మూషిక వాహనుడైన విఘ్నేశ్వరునికి దేశంలో ఆలయాలు అనేకం ఉన్నాయి. తొలి పండగను వినాయక చవితిగా జరుపుకొంటాం. జగన్మాత కుమారుడైన స్వామికి ఉన్న విశిష్ట ఆలయాల్లో కేరళలోని కాసర్‌గోడ్‌ జిల్లాలోని మధూరు ఒకటి. మధురవాహిని నదీ తీరంలో, ప్రకృతి రమణీయత మధ్య కొలువుదీరిన విఘ్నరాజును దర్శించుకునేందుకు భక్తులు వస్తుండటంతో మధూరు నిత్యం దైవ నామస్మరణతో ఆధ్యాత్మిక వాతావరణంతో నిండివుంటుంది.




ఉద్భవమూర్తి..
మధూరులోని ఆలయంలో ప్రధాన దైవం పరమేశ్వరుడు. ఈ క్షేత్రంలో మదరాంతేశ్వర స్వామిగా పూజలందుకుంటున్నారు. స్థలపురాణం ప్రకారం ఒక మహిళ స్వామివారి విగ్రహాన్ని కనుగొంది. అందుకనే స్వామివారిని ఉద్భవమూర్తిగా పేర్కొంటారు. తొలిసారిగా మహిళా భక్తురాలికి స్వామివారు దర్శనమిచ్చారు. అందుకనే ఆమె పేరుపై మధూరు ఆలయంగా ప్రసిద్ధి చెందింది. స్వామి గర్భగుడి వెలుపల దక్షిణ భాగం గోడపై వినాయకుడి విగ్రహం ఉంటుంది. రోజురోజుకూ స్వామివారు పెరుగుతుండటం విశేషం. అందుకనే బొడ్డ గణేశా అని పిలుస్తుంటారు. ప్రధాన దైవం ఈశ్వరుడు అయినా గణనాథునికి విశేషపూజలు నిర్వహించడం క్షేత్ర ప్రాముఖ్యతను వెల్లడిస్తుంది.


టిప్పుసుల్తాన్‌ వెనుదిరిగాడు..
ఒక కథనం ప్రకారం టిప్పుసుల్తాన్‌ ఆధ్వర్యంలోని సేనలు మలబార్‌పై దండెత్తాయి. ఈ క్రమంలోనే ఆలయంపైకి సేనలు వచ్చాయి. ఆలయ ప్రాంగణంలోని బావిలోని నీటిని టిప్పుసుల్తాన్‌ తాగిన తరువాత మనస్సు మారి దాడిని విరమించుకొని వెనక్కు మళ్లినట్టు తెలుస్తోంది.ఆలయాన్ని ఏనుగు ఆకారంలో నిర్మించారు. మూడు అంతస్తులుగా ఉండే ఆలయం సందర్శకులకు దివ్యానుభూతిని కలిగిస్తుంది.


ప్రసాదంగా అప్పం..
ఆలయంలో కేరళ సంప్రదాయ వంటకమైన అప్పాన్ని ప్రసాదంగా ఇస్తారు. మహాగణపతికి ఉదయాస్తమానసేవ నిర్వహిస్తారు. సహస్ర అప్ప పూజలో భాగంగా వెయ్యి అప్పాలతో పూజలు జరిపిస్తారు. మరో ముఖ్యమైన సేవ మూడప్పమ్‌. ఇందులోనూ అప్పాలతో పూజ జరిపించడం విశేషం. వినాయక చవితికి భారీ స్థాయిలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు.


ఎలా చేరుకోవాలి...

  • కాసర్‌గోడ్‌ నుంచి ఆలయం 7 కి.మీ. దూరంలో ఉంది.
  • కాసర్‌గోడ్‌ రైల్వేస్టేషన్‌ నుంచి మధూర్‌కు వివిధ వాహనాల ద్వారా చేరుకునే సౌలభ్యముంది.
  • మంగళూరు విమానాశ్రయం ఇక్కడ నుంచి 70 కి.మీ. దూరంలో ఉంది. విమానాశ్రయం నుంచి ఆలయానికి ప్రైవేటు ట్యాక్సీల ద్వారా చేరుకోవచ్చు.

బృహదీశ్వరాలయం B

అణువణువూ అద్భుతం బృహదీశ్వరాలయం ‘‘గుడులూ గోపురాలకు పేరొందిన తమిళనాడు రాష్ట్రాన్ని సందర్శించాలనుకునే వాళ్లకు ముందుగా గుర్తొచ్చేది తంజావూరు...